భండారు పర్వతాలరావు bhandaru parvatalarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భండారు పర్వతాలరావు bhandaru parvatalarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఆగస్టు 2016, ఆదివారం

మరపురాని మనిషి మా పెద్దన్నయ్య పర్వతాలరావు


 మా పెద్దన్నయ్యకీర్తిశేషులు  భండారు పర్వతాలరావు చాలా సంవత్సరాలక్రితం ఒక వ్యాసం రాసారు. డబ్బు కావాలాదరిద్రం పోవాలా అనేది దాని శీర్షిక.
“ఒకానొక గర్భ దరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.
ఆయనప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.
దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.
దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు  పడతాయి.
దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదుడబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని తెలుసుకుంటాడు.


మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు పుట్టపర్తిలో వుండగా అనేక రచనలు చేస్తూ పోయారు. వాటిల్లో ఒకటి దశావతారాలు. వారి చిన్నమ్మాయి వాణి వెల్దుర్తి, రాతప్రతిని చిన్ని పొత్తంగా తయారు చేసి, కుటుంబ సభ్యులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచి పెట్టింది. విషయంలో వయస్సులో చిన్నదయినా తను పడ్డ శ్రమదమాదులు ప్రసంశనీయం. మళ్ళీ మనమధ్యకు నాన్న వచ్చారంటూ  చిరంజీవి వాణి తన ముందు మాటగా నుడివిన మాటలు:
చిన్నప్పుడు తాతయ్య తద్దినానికి కంభంపాడు వెళ్ళినప్పుడు నాన్న వరండాలో కూర్చుని మాట్లాడుతుంటే వూళ్ళో ఎంతో మంది వినడానికి వచ్చేవారు. నాన్న ఎవరి అభిరుచికి తగ్గట్టు అంశం వారితో ముచ్చటి పెడుతుంటే వినేవాళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోయి వింటూ వుండేవాళ్ళు. నాన్న మాట్లాడే మాటల్లో రెండు విషయాలు చోటు చేసుకునేవి కావు. అవే: ఆత్మస్తుతి, పరనింద.
ఆదర్శాల నయాగరాల కన్నా, ఆచరణల హిమబిందువు మిన్న అని నమ్మిన మరువలేని, మరపురాని వ్యక్తి నాన్న. నాన్న దశావతారాలు పుస్తకంతో మళ్ళీ మన మధ్యకు వచ్చాడు.
చిన్ని పొత్తానికి ముఖచిత్ర అలంకరణ చేసింది రాంపా 
అయిదుగురు ముఖ్యమంత్రులకు  పీఆర్ ఓ గా పనిచేసి, ఉమ్మడి రాష్ట్రంలో  పౌరసంబంధాల శాఖ డైరెక్టర్  గా,  ఫిలిం  డెవలప్  మెంట్  కార్పొరేషన్  మేనేజింగ్  డైరెక్టర్  గా  పనిచేసిన మా పెద్దన్నయ్యకు  అనేకరంగాల వారితో  సన్నిహిత  పరిచయం వుండేది. చాలామంది ఆయనకు తెలుసు, ఆయనకూ చాలామంది తెలుసు. కానీ,  ఆయన ఈ లోకంలో లేరన్న సంగతి వారిలో చాలామందికి తెలవదు. ఇప్పటికీ  నేను సచివాలయానికి వెడితే లిఫ్ట్  బాయ్  నుంచి  పెద్ద అధికారుల వరకు అడుగుతుంటారు, మీ  అన్నగారు ఎలావున్నారని? అంత నిశ్శబ్దంగా ఆయన దాటిపోయారు. ఆయన లేరన్న  భావం  మా ఇంట్లో ఎవ్వరికీ లేదు కాబట్టి నిజం చెప్పలేకా, అబద్ధం ఆడలేకా  ఒక నవ్వు నవ్వి  తప్పుకుంటూ వుంటాను. 
“ఎన్నడయినా చూసారా 
ఆయన మొహంలో చిరునవ్వు చెరగడం 
ఎప్పుడయినా గమనించారా 
అన్ని బాధలుఅందరి వ్యధలు
గుండెల్లో దాచుకోవడం 
బాధ్యతలన్నీ మోసీ మోసీ 
చిన్ని గుండె అలసిపోయింది
అంతులేని దూరాలకు  
అన్నయ్యని తీసుకుపోయింది
అనాయాస మరణం 
దేవుడిచ్చే అభయం  
నిజమయిన భక్తుడు కనుకే 
అన్నయ్యకు దక్కిందా వరం                       

( మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు పుట్టపర్తిలో 2006 ఆగస్టు 21 నాడు  ఆకస్మికంగా మరణించినప్పుడు  రాసిన అశ్రుగీతిక  - భండారు శ్రీనివాసరావు)    

      




30, జులై 2014, బుధవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9                   
ఆ తరువాత ముఖ్యమంత్రులయిన శ్రీయుతులు అంజయ్య, భవనం వెంకట్రాం, విజయభాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు - తమ పేషీల్లో వ్యక్తిగత సిబ్బందిని తమకు ఇష్టం వున్నవారితో మార్పులు చేసుకున్నప్పటికీ పీ ఆర్ వొ గా మాత్రం, చెన్నా(రెడ్డి) నుంచి అన్నా(ఎన్టీయార్) వరకు మా అన్నయ్య పర్వతాలరావుగారే కొనసాగారు. ముఖ్యమంత్రులు, ఆఖరికి పాలించే పార్టీలు మారినా పీ ఆర్ వొ గా ఆయన కొనసాగడం అనేది ఇప్పటికీ ఒక రికార్డు.


తన అనుభవాలను ఏర్చి కూర్చి 'చెన్నా టు అన్నా' అనే గ్రంధాన్ని రాయాలనే తలంపు వున్నట్టు ఆయన అనేకసార్లు అనుకున్నారు. మా అన్నయ్య అని చెప్పడం కాదు కాని, పర్వతాలరావు గారు మంచి ధారణ కలిగిన వ్యక్తి. ఆంధ్ర ఆంగ్ల భాషల్లో మంచి ప్రవీణుడు. చక్కని రాయసకాడు. గేయం రాసినా, వ్యాసం రాసినా సుబోధకంగా వుండేది. ప్రసంగ వ్యాసాలు  రాయడంలో దిట్ట. 'ఈ చీకటి గొందులలో, లేఖినీలాస్యం,చెప్పు తెగింది' అనే గేయ సంపుటాలు, ప్రకాశం గాధాశతి, జై భీమ్ కధలు, పరమాచార్య పావన గాధలు, Charaka - Redactor, par excellence, Veena, Mrudangam, Leather Puppets, Dwakra Crafts అనే రచనలు చేశారు.
పర్వతాలరావు గారు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర  అయిదేళ్లపాటు పనిచేసి, సమాచారశాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి,  పదవీ విరమణ చేశారు. మొదటి ఉద్యోగం నుంచి చివరి ఉద్యోగం వరకు ప్రభుత్వ వాహనం, డ్రైవర్ సదుపాయాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలపాటు అనుభవించి  రిటైర్ అయిన తరువాత హాయిగా సిటీ బస్సులు, ఆటోల్లో తిరగడం చూసి మాకే చిత్రమనిపించేది. రిటైర్ అయిన కొద్ది మాసాలకే నారసింహతత్వం అధ్యయనం నిమిత్తం దక్షిణ, ఉత్తర భారతంలోని అనేక నరసింహ దేవాలయాలను దర్శించి పరిశోధన చేసి 'నమో! నారసింహాయ!' అనే పేరుతొ ఆరు సంపుటాలను వెలువరించారు. చాప మీద కూర్చుని, తొడమీద కాగితాల బొత్తి పెట్టుకుని వేల పేజీలు వెనక్కి తిరిగి చూసుకోకుండా, ఎవరి సాయం తీసుకోకుండా ఆయన రాసిన తీరు అమోఘం. అలా ఆధ్యాత్మిక రచనా వ్యాసంగంలో తుచ్చ రాజకీయ రచనల వాసన ఆయనకు రుచించినట్టు లేదు. అందుకే కాబోలు 'చెన్నా టు అన్నా' వెలుగు చూడలేదు.

జీవిత చరమాంకంలో పుట్టపర్తిలో మా వొదినె సరోజినీదేవి  గారితో కలిసి ఓ చిన్నగదిలో వుంటూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, 2006 ఆగస్టు 21 వ తేదీన, తను ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా  ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు.  మనిషి అనేవాడు మనీషిగా యెలా జీవించవచ్చో నిజం చేసి చూపాడు కాబట్టే ఆ సర్వేశ్వరుడు ఆయనకు అలాటి ఆనాయాస మరణం అనే వరాన్ని అనుగ్రహించాడు.         

21, ఆగస్టు 2013, బుధవారం

అనాయాస మరణం - దేవుడిచ్చే వరం

   





కీర్తిశేషులు శ్రీ భండారు పర్వతాలరావు గారు 




న్నడయినా చూసారా 
ఆయన మొహంలో చిరునవ్వు చెరగడం 
ఎప్పుడయినా గమనించారా 
అన్ని బాధలు, అందరి వ్యధలు
గుండెల్లో దాచుకోవడం 
భాద్యతలన్నీ మోసీ మోసీ 
ఆ చిన్ని గుండె అలసిపోయింది
అంతులేని దూరాలకు  
అన్నయ్యని తీసుకుపోయింది
అనాయాస మరణం 
దేవుడిచ్చే అభయం  
నిజమయిన భక్తుడు కనుకే 
అన్నయ్యకు దక్కిందా వరం


                             

( మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు పుట్టపర్తిలో 2006 ఆగస్టు 21 నాడు  ఆకస్మికంగా మరణించినప్పుడు  రాసిన అశ్రుగీతిక  - భండారు శ్రీనివాసరావు)    

25, డిసెంబర్ 2012, మంగళవారం

లయ సుమాలు



లయ సుమాలు



దీపము వలసిందెప్పుడు
తిమిరమునందే
విజ్ఞాని ముందు నిలచిన
అజ్ఞాని నోరు బందే

కలలు పొర్లు కనులు నడుపు
కాలు ముళ్లమీదే
తలలు మార్చువాని సలహా
మంచికెపుడు కాదే

ఇత్తడి బంగారమనే
వానిదె ఈ లోకం
పుత్తడి పూర్ణల బ్రతుకె  
రిత్త కడుపు శోకం

-కీర్తిశేషులు భండారు పర్వతాలరావు (ఫిబ్రవరి,1956)

19, డిసెంబర్ 2012, బుధవారం

ప్రాతఃస్మరణీయుడు పర్వతాలరావు గారు


ప్రాతఃస్మరణీయుడు పర్వతాలరావు గారు

చనిపోయి ఆరేళ్ళు దాటిపోతున్నా  ‘మీ అన్నగారెలా వున్నారు? కులాసాయే కదా!’ అంటూ ఆయన మిత్రులు కొందరు ఫేస్ బుక్ లో అడుగుతున్నారంటే నిజంగా ఆయన చిరంజీవే. మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు దాదాపు యాభయ్  అరవై ఏళ్ళ క్రితం రచించిన కొన్ని గేయాలు ఇంకా యెంత తాజాగా, ఇప్పటికీ వర్తించేలా యెలా వున్నాయో తెలపడం కోసం ఈ ప్రయత్నం – భండారు శ్రీనివాసరావు



కీర్తిశేషులు భండారు పర్వతాలరావు 


చేయకు

వృధాలోచనలతో నింపి
యెదలో వ్యధ పండించకు
కాంచ చంద్రు నమవస నిశి
కళ్ళూరకే చికిలించకు

పుట్టని రేపును చూడగ
పట్టుదలతో శ్రమియించకు
తెగిన వీణ తీగెలపై
బ్రతుకు పాట మ్రోయించకు

కీర్తి కొరకు కక్కుర్తితో
కలమునమ్మ తలపెట్టకు
కండలపై బ్రతుకు పేద
వాండ్ల తలను చెయిబెట్టకు
         
 (తెలుగు స్వతంత్ర – జనవరి 4,1958)