22, నవంబర్ 2021, సోమవారం

'పుస్తకవర’ ప్రసాదరెడ్డి గారు - భండారు శ్రీనివాసరావు

 ‘మీరు పుస్తకాలు గురించీ రచయితలు గురించీ పోస్టులు పెడుతుంటారు. వాటిని పబ్లిష్ చేసే ప్రచురణ కర్తలు గురించి వివరాలు ఎందుకు ఇవ్వరు” అంటారు నా మితృలు.

ప్రతి పబ్లిషింగ్ హౌస్ కి ఓ ఎడిటోరియల్ బోర్డు వుంటుంది. వాళ్ళు తమ వద్దకు వచ్చిన పుస్తకాల మంచి చెడులు చూసి ఎంపిక చేసుకుంటారు. తప్పులేదు. కానీ అప్పుడప్పుడు ఈ సాంఘిక మాధ్యమాల్లో రచయిత్రులు, రచయితలు చక్కటి తమ రచనలతో అలరిస్తుంటారు. వాటికి నేను అభిమానిని కూడా. కానీ ఆస్వాదించడం తప్ప నా చేతిలో ఏమీ లేదు. ఆ సంపాదక వర్గ సభ్యులు కాస్త ఇటు కన్నేస్తే ఆ పబ్లిషర్స్ గర్వించదగిన రచయితలు, రచయిత్రులు ఇక్కడ కూడా వారికి కానవస్తారు. కానీ అంత తీరిక ఉండకపోవచ్చు. తీరిక చేసుకుని ఈ రచనలను కూడా పరిశీలిస్తే చక్కటి రచయిత్రులను, రచయితలను పరిచయం చేసిన ఖ్యాతి వారికి దక్కుతుంది.
ఈ నేపధ్యం అంతా ఎందుకంటే.
ఈ మధ్య నా చేతికి ఓ పుస్తకం వచ్చింది. పుస్తక ప్రియులు రేడియోలో నా సీనియర్ సహచరులు అయిన ఆర్వీవీ కృష్ణారావు గారు ఈ పుస్తకాన్ని స్వయంగా మా ఇంటికి తీసుకువచ్చి నా చేతిలో పెట్టి వెళ్ళారు.
దాని పేరు ‘అమ్మకి జేజే! నాన్నకి జేజే! గురువుకి జేజే!’
శాంతా – వసంతా ట్రస్ట్ వారు దీనిని ప్రచురించారు. మరి మొదటి సారి ప్రచురణ కర్తల ప్రస్తావన ఎందుకు అనే సందేహం రావచ్చు. అందుకే ఈ పోస్టు.

పుస్తకాన్ని తిరగేశాను. మొదటి పుటలోనే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి జేజేలు’ అని వుంది. దాన్ని రాసింది శాంతా – వసంతా ట్రస్ట్ వరప్రసాద రెడ్డి గారు. అందులో ఓ పేరా వుంది. అదే దీనికి ప్రేరణ.

“’అమ్మకి జేజే! నాన్నకి జేజే! గురువుకి జేజే!’ సంకలనం రాజాచంద్ర ఫౌండేషన్ ద్వారా రూపుదిద్దుకుని చాలామందిని విశేషంగా అలరించింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒకానొక ప్రవచనంలో ప్రత్యేకంగా ఈ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ అందరు చదవతగ్గ పుస్తకమని చెప్పడంతో, ఆ ప్రవచనం విన్న ఎంతోమందికి ఈ పుస్తకం చదవాలనే ఆకాంక్ష కలిగింది. మహానుభావుల వాక్ శుద్ధికి అంత ప్రభావం వుంటుంది. వారి ప్రవచనం విన్న ఎంతోమంది ఈ పుస్తకం కోసం అభ్యర్ధించారు. ఆ మేరకు ఈ సంకలనానికి మరి కొందరి ప్రముఖుల ‘జేజేలు’ జోడించి మీకు సమర్పిస్తున్నాము.”

స్వచ్చందంగా ఇంతటి సత్కార్యానికి పూనుకున్న శాంతా – వసంతా ట్రస్ట్ వారిని పేర్కొనకుండా ఎలా ఉంటాము. అలాగే ‘పుస్తక’ వరప్రసాద రెడ్డి గారి మంచి మనసుకు సలాం చెప్పకుండా ఎలా ఉంటాము?

నాలుగు వందల పుటలకు పైగా వున్న ఈ పుస్తకంలో ముళ్ళపూడి వెంకట రమణ నుంచి విశ్వనాధ సత్యనారాయణ వరకు, నారా చంద్రబాబు నాయుడు నుంచి రజనీ సుబ్రహ్మణ్యం (త్రిపురనేని గోపీచంద్ గారి అమ్మాయి)వరకు, పుట్టపర్తి నాగ పద్మిని (పుట్టపర్తి నారాయణాచార్యులు వారి పుత్రిక) నుంచి ఆర్, శాంత సుందరి ( కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి) వరకు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ నుంచి గద్దర్ వరకు, ఇలా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, హెచ్.జే. దొర, భానుమతి రామకృష్ణ, చిరంజీవి, బాపు, బి. నరసింగ రావు, రావు బాల సరస్వతి, ఎస్వీ రామారావు, వరప్రసాద రెడ్డి, నండూరి రామమోహన రావు, కాళీపట్నం రామారావు, తిరుమల రామచంద్ర, నోరి నరసింహ శాస్త్రి, వేలూరు శివరామ శాస్త్రి, ఆరుద్ర, ఎన్. సదాసివ, జి. కృష్ణ, శ్రీ రమణ, దేవరకొండ బాలగంగాధర తిలక్, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, పురాణం గారి గురించి వారి అబ్బాయి శ్రీనివాస శాస్త్రి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మాడభూషి శ్రీధర్, ఎందరో మహానుభావులు (అక్షరాలా డెబ్బయి రెండు మంది) తమ అమ్మల గురించి, తమ తండ్రుల గురించి, తమ గురువుల గురించి సభక్తి పూర్వకంగా రాసిన అనుభవాల జ్ఞాపకాలు వున్నాయి.
వీటికి వెల కట్టగలమా!
కట్టలేమని తెలుసు కనుకే వరప్రసాదరెడ్డి గారు ఈ సంకలనం అమూల్యం అని చెప్పేశారు.
ట్రస్టులు చేయాల్సిన మంచి పని చేసిన శాంతా- వసంతా ట్రస్ట్ వారికి అభినందనలు.
-భండారు శ్రీనివాసరావు




కామెంట్‌లు లేవు: