22, నవంబర్ 2021, సోమవారం

మృత్యువుతో సహజీవనం

 

మృత్యువుతో సహజీవనం చేస్తున్న విషయం మనిషికి మరణించే వరకు తెలియదు”

జీవితంలో కధలు ఇలాంటి నిజాలే చెబుతాయి.

మాకు తెలిసిన ఒకావిడ అమెరికాలో ఉన్న పిల్లల్ని చూడడానికి వెళ్ళారు. ఆ దేశానికి పలు పర్యాయాలు ఒంటరిగా వెళ్లి వచ్చిన అనుభవం కూడా వుంది. ఈసారి తిరిగి వస్తూ దుబాయ్ లో దిగి షాపింగ్ చేశారు. అక్కడినుంచే హైదరాబాదులో వున్న తన కుమార్తెకు ఫోను చేసి ఏమి కావాలో కనుక్కుని మరీ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశారు. దుబాయ్ లో విమానం ఎక్కిన తర్వాత కూడా మరోసారి ఫోన్ చేసి హైదరాబాదు ఎప్పుడు చేరేది వివరాలు చెప్పారు.

హైదరాబాదులో ఉంటున్న ఆవిడ కుమార్తె తన భర్తతో కలిసి శంషాబాదు వెళ్ళారు, తల్లిని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకు రావడానికి.

అనుకున్న సమయానికే విమానం లాండ్ అయింది. ప్రయాణీకులందరూ ఒక్కొక్కరుగా ట్రాలీలు తోసుకుంటూ బయటకు వస్తున్నారు. ఆఖరి ప్రయాణీకుడు కూడా వచ్చారు కానీ తల్లి జాడ లేదు. వేచివున్న కుటుంబ సభ్యుల్లో ఆందోళన  పెరుగుతోంది. ఇంతలో అనౌన్స్ మెంటు.

పలానా ప్రయాణీకురాలి తరపువాళ్ళు ఎవరైనా వచ్చివుంటే దయచేసి వచ్చి ఆవిడ బాడీ కలక్టు చేసుకోండి’

వినగానే వాళ్ళ గుండె జారిపోయింది. ఏదో లగేజీ లాగా బాడీ తీసుకుపోవడం ఏమిటి. ఆ మనిషి  ఫోన్లో మాట్లాడి కొన్ని గంటలు కూడా కాలేదు. ఇలా ఎలా జరిగింది?

అసలు జరిగిందేమిటంటే....

దుబాయ్ లో విమానం ఎక్కిన కొద్ది సేపటి తర్వాత ఆవిడ వాష్ రూమ్ కు వెళ్ళింది. యెంత సేపైనా బయటకి రాకపోవడంతో తోటి ప్రయాణీకులు విమాన సిబ్బందికి చెప్పారు. వారు గట్టి ప్రయత్నం చేసి తలుపు తెరిచి చూస్తే అక్కడ నిర్జీవంగా పడి వుంది. మాసివ్ హార్ట్ అటాక్ మరణానికి కారణం అని నిర్ధారించారు.

అందుకే అంటారు మృత్యువుకు బహు రూపాలు. ఎవరిని ఏ రూపంలో, ఎప్పుడు దగ్గరికి తీసుకుంటుందో ఎవరికీ తెలియదు.

ఈ సంఘటన జరిగి నేటికి మూడేళ్లు. ఎన్నేళ్ళు గడిచినా గుర్తుండిపోయే విషాదం.

22-11-2021

కామెంట్‌లు లేవు: