30, నవంబర్ 2021, మంగళవారం

పుణ్యం ఊరికే పోదు

 

జ్ఞాపకాల గొందుల్లో

మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అడపాదడపా కొంత పైకం మా వదినెగారి చేతికి ఇచ్చి మా అమ్మగారికి ఇమ్మనేవారు. మా కుటుంబంలో అటు ఏడుతరాలకు, ఇటు ఏడు తరాలకు వయసులో మా అమ్మే పెద్ద. చుట్టపక్కాలు, చిన్న వాళ్ళు ఇంటికి వచ్చి చూసి వెడుతూ కాళ్ళకు దణ్ణం పెట్టినప్పుడు వాళ్ళచేతిలో పదోపరకో డబ్బులు పెట్టడానికి ఈ ఏర్పాటు.

మా అన్నయ్యగారి ఆఖరి అమ్మాయి వాణి పెళ్ళిలో కన్యాదానం చేసే మహత్తర అవకాశాన్ని, నాకు ఆడపిల్లలు లేనందువల్ల, మా పెద్దన్నయ్య కల్పించారు. ఆ సందర్భంలోనే  మా అమ్మగారి సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయిదు రూపాయల కొత్తనోట్లను తెప్పించి వాటిని కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ, చిన్నలకు, పెద్దలకూ మా అమ్మగారి చేతుల మీదుగా ఇప్పించాడు.

మా అమ్మ గారి చివరి రోజులవరకు మా అన్నగారే ఆమెను కంటికి రెప్పలా కనిపెట్టుకు చూసుకున్నారు. చనిపోయినప్పుడు ఆమె ఉత్తర క్రియలు కాశీలో జరిపించాడు.

ఉమ్మడి రాష్ట్రంలో అయిదుగురు ముఖ్యమంత్రులకు సీపీఆర్వోగా, సమాచార శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా అనేక ఉన్నత ఉద్యోగాలు చేసి, సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన లేకుండా చివరికి పుట్టపర్తిలో మా వదిన గారెతో కలిసి ఓ చిన్న గదిలో జీవితం గడుపుతూ, నరసింహస్వామి తత్వాన్ని గురించి అనేక సంపుటాలతో కూడిన బృహత్ గ్రంధాన్ని రచించి, ఆధ్యాత్మిక వాతావరణంలో చివరి రోజులు గడిపాడు.      

ఈ పుణ్యం ఊరికే పోలేదు.

అనాయాసమరణం రూపంలో మా అన్నగారికి దక్కింది.

 




 

కామెంట్‌లు లేవు: