8, నవంబర్ 2021, సోమవారం

వసూలు చేసే పన్నులు ఖజానాకు చేరుతున్నాయా ! – భండారు శ్రీనివాసరావు

 

నాలుగేళ్ల క్రితం అనుకుంటా ఓరోజు, ఊబెర్ అద్దె వాహనంలో ప్రయాణించాను. అతడికి బిల్లు చెల్లించాను. తరువాత ఊబెర్ కంపెనీ నుంచి నాకు వచ్చిన మెయిల్ లో ఇలా వుంది:
Before Taxes 112.26
Service tax (4.2%) 4.71
Swachh Bharat Cess (0.15%) 0.17
Krishi Kalyan Cess (0.15%) 0.17
COLLECTED ₹ 117.31

అంటే ఏమిటన్నమాట. సర్వీసు టాక్స్ 4.2 శాతం , నాలుగు రూపాయల డెబ్బయి ఒక్క పైసలు, స్వచ్చ భారత్ సెస్సు 0.15 శాతం పదిహేడు పైసలు, క్రిషి కళ్యాణ్ సెస్సు 0.15 శాతం మరో పదిహేడు పైసలు చెల్లించినట్టు రసీదులో వుంది. నా దగ్గరనుంచి వసూలుచేసిన ఈ సొమ్ము క్షేమంగా సర్కారు ఖజానాకు చేరుతుందని ఆశించడం సగటు పౌరుడిగా నా ఆకాంక్ష. ఇలా ప్రతి రోజూ, ప్రతి పౌరుడు తాను పెడుతున్న ప్రతి ఖర్చులో సర్కారుకు చెల్లించే పన్ను, సెస్సు వివరాలు ఎప్పటికప్పుడు ఇలా తెలియచేస్తూ సర్కారు ఖజానాలో మనకో ఖాతా తెరిచి అందులో నమోదు చేస్తుంటే కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. ఎందుకంటే ఈదేశంలో ప్రతి ఒక్కరూ అనుమానం ముందు పుట్టి తరువాత వాళ్ళు పుడతారు. ఇంతకీ ఈ సొమ్ము( అక్షరాలా అయిదు రూపాయల అయిదు పైసలు) ఖజానాలో జమ అయినట్టేనా!
ఈ అనుమానాన్ని ఓ కేంద్ర ప్రభుత్వ పన్నుల అధికారి వద్ద వ్యక్తం చేశాను.
‘మనం దుకాణానికి వెళ్లి ఏదో వస్తువు కొని బ్యాంకు కార్డు మీద చెల్లింపు చేస్తాం. వెంటనే అంత మొత్తం మన బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయినట్టు మన ఫోనుకు మెసేజ్ వస్తుంది. హోటల్ కు పోయి తిన్నదానికి బిల్లు కడతాము. మనం కట్టిన పన్ను వివరాలు ఆ బిల్లులో వుంటాయి. కానీ ఆ పన్ను సరాసరి ప్రభుత్వ ఖజానాకు చేరిందా లేదా, అసలు చేరుతుందా లేదా అనే అనుమానం పీకుతూనే వుంటుంది. హోటల్ కు మనం పన్నుల రూపేణా చెల్లించిన డబ్బు హోటల్ బ్యాంకు ఖాతా నుంచి ఎకాఎకి ఖజానాకు చేర్చే వెసులుబాటు సాంకేతికంగా కల్పిస్తే బాగుంటుంది కదా! అలాగే మనం చెల్లించిన పన్నులు ప్రభుత్వ ఖజానాకు జమ అయినట్టు ఓ మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తే ఇలాంటి సందేహాలు రావు కదా! ‘
అంతా విని ఆయన ఇలా జవాబు ఇచ్చాడు.
‘మీరు చెప్పేది నిజమే. కానీ దేశంలో ప్రతి రోజు ప్రతి క్షణం నిమిషం, లక్షల కోట్ల విలువైన లావాదేవీలు కోట్లలో జరుగుతుంటాయి. అంత భారాన్ని నిభాయించగల భారీ సర్వర్లు ఏర్పాటు చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వున్నాయి’ .
ఇక నా దగ్గర ప్రశ్నలు లేవు.
అనుమానం మాత్రం అలానే వుండిపోయింది.

కామెంట్‌లు లేవు: