8, ఆగస్టు 2021, ఆదివారం

అమరావతి ఓ జ్ఞాపకం

ఓ పాత జ్ఞాపకం. ఈ కొద్ది సెకన్ల వీడియో ఓ మిత్రుడి కానుక. చిత్రంలో వున్నది నేనే. మూడేళ్ళ క్రితం తిరుపతి వెళ్లి వచ్చిన కొత్తల్లో చేసిన ఈ ఇంటర్వ్యూ లో చంద్రబాబు నాయుడు గారి అమరావతి స్వప్నం గురించి నా అభిప్రాయం. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ దొరకని సువర్ణావకాశం ఒక్క చంద్రబాబు నాయుడి గారికే దక్కింది. కానీ ఏం మిగిలింది?
నిర్ణయానికి రాకముందు ఆలోచనలు చేయాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచనలు కూడదు.
ఒకడు ఇల్లు కట్టుకుందామని అనుకున్నాడు. బుద్ధి తక్కువై ఎవర్నో సలహా అడిగాడు.
‘మంచి సున్నం గానుగ ఆడించి దాంతో కట్టుకో, ఇల్లు చల్లగా వుంటుందన్నా’డు ఆ సలహాలరాయుడు. అది విని మనవాడు సున్నం గానుగా ఏర్పాటుచేసుకుని పని మొదలు పెట్టబోయే సమయానికి దారిన పోయే దానయ్య అటుగా వచ్చి, ‘సున్నం పని ఎప్పుడో సున్నా అయిపొయింది, ఎంచక్కా ఇటుకలతో ఇల్లు కట్టుకో’ అని ఓ ఉచిత సలహా పారేసి తన దారిన చక్కా పోయాడు.
మనవాడు, సున్నం గానుగ పక్కన బెట్టి ఇటుకలు పోగేసాడు. మరో దానయ్య వచ్చి ‘ఇటుకల ఇళ్లు బీసీ కాలం నాటివి, చక్కగా కాంక్రీటు దిమ్మెలు వేసి కట్టుకో నాలుగు కాలాల పాటు మన్నుతుంది’ అని చెప్పాడు.
మన వాడు ఇటుకలు ఆటక ఎక్కించి కాంక్రీటు వేటలో పడ్డాడు. చివరికి ఇల్లు కట్టాలన్న కోరిక అమరావతి కలగానే మిగిలి పోయింది.
ఇంటర్వూ చేసింది స్నేహ టీవీ లో నిర్మల్ (Nirmal Akkaraju)

5 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఎవరి అభిప్రాయం వారిది అనుకోండి గానీ మీ లాంటి అనుభవజ్ఞులు కూడా ఇలా విమర్శించడం అనూహ్యం.

విభజన మూలాన కట్టుబట్టలతో నిలిచిన ఆంధ్రులకు కొత్త రాజధాని అంటే ఓం నమః శివాయ అనుకుంటూ చాలా విషయాలు చూసుకోవాలి గదా? రాజధాని ఎక్కడ పెట్టాలో ముందు ఒక ఎంపిక జరగాలి కదా? ఆ పైన ఆ ఊళ్ళో భూసేకరణ చెయ్యాలి కదా? దానికి అవసరమైన విధివిధానాలు, రాతకోతలు, చట్టాలు రూపొందించాలి కదా? ఇవన్నీ చాలా టైము పట్టే పనే కదా? తరువాత కదా డిజైన్లు ? ఏ ఊళ్ళో కట్టాలో, ఆ ఊళ్ళో భూమి లక్షణాలు వగైరా ఏమిటో తేలకుండా డిజైన్లు ఎలా గీయిస్తారు, ఎలా ఖాయం చేస్తారు?

ఈ లోగానే చట్టంలో ఇచ్చిన పదేళ్ళ వ్యవధిని కూడా లెక్క చెయ్యకుండా మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటూ పొగ బెట్టారు కదా? నిన్నటి వరకు కలిసి పని చేసిన వారే … రోజూ కలిసి క్యాంటీన్ లో టీ త్రాగిన సహోద్యోగులే … ఇవాళ ఆఫీసుల్లోకి ప్రవేశించకుండా అడ్డాలు కట్టేసి, దాడులు చెయ్యడం మొదలెట్టారు కదా IAS లను కూడా వదలకుండా? మరి తన ఉద్యోగుల భద్రత గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి కదా? దాని కోసం అనుకోకుండా ఆఫీసులను ఆంధ్రాకు మార్చెయ్యాల్సి వచ్చింది కదా? ఉద్యోగులు వచ్చి వెళ్ళడానికని ప్రత్యేకంగా రైలు కూడా వేయించాడా? ఈ అనుకోని తలనెప్పులన్నీ దాటడానికి సమయం పడుతుంది కదా? 2014 లో తను అధికారం లోకి వచ్చీ రాగానే నిర్మాణం ఎందుకు మొదలవలేదు, రెండేళ్ళై పోయింది, మూడేళ్ళై పోయింది అంటే ఎలా?

నా దృష్టిలో చంద్రబాబు గారు చేసిన ఒక తప్పు / లేదా వారి అంచనా తప్పినది ఏమిటంటే .. రెండవ సారి కూడా తనే ఎన్నికలు గెలుస్తాననీ, దాంతో మొత్తం పదేళ్ళ టైము ఉంటుందనీ భావించారేమో మరి? అది రివర్స్ అవడంతో ఈ నాడు చంద్రబాబు గారు దోషిలా నిందలకు గురవుతున్నాడు. వారికి రెండో అవకాశం కూడా ఇచ్చుంటే ఆ continuity ఉండేది, తను తలపెట్టిన పనిని దిగ్విజయంగా పూర్తి చెయ్యగలిగి ఉండేవారేమో? ప్చ్, ఏం చేస్తాం, చరిత్ర మరో రకమైన మలుపు తిరిగింది.

అజ్ఞాత చెప్పారు...

తలొక రాయి విసరటం సులువే.
తలొక చేయి కలపటం కష్టం.
-శ్యామ్‌

అజ్ఞాత చెప్పారు...

రాజధాని గుంటూరు లోనే ఉంటుంది అని ప్రతీ ఒక్కరు నమ్మారు ఎందుకంటే కృష్ణ గుంటూరు జిల్లాలు కమ్మోళ్లవి కాబట్టి .
రాజధాని ఎక్కడ ఉండాలో చంద్రబాబు ఒక కమిటీ వేయడం కూడా జనం హాస్యాస్పదం గానే చూసారు . అందరు అనుకున్నట్టు , అక్కడే వచ్చింది . జనం మరీ ఏడుస్తున్నారు అని , గుంటూరు కి ఒక 20 కిలోమీటర్లు దూరం జరిపారు . రాష్ట్రానికి మధ్యలో ఉందని , రామోజీ , రాధాకృష్ణ , చంద్రబాబు ఎంత మొత్తుకున్నా ఎవరు నమ్మలేదు .

సోషల్ మీడియా లో , కమ్మోళ్ళు అందరు ఇది మా రాజధాని , ఇక్కడ ఎవరికీ ప్రవేశం లేదు అన్నట్టు మాట్లాడటం కూడా జనానికి మండింది. సోషల్ మీడియా లో టీడీపీ కి వ్యతిరేఖ ప్రచారం ఎక్కువ అయింది .

ఇంకొక ముఖ్యమైన విషయం, విపరీతమైన అవినీతి . అధికారం చాల సంవత్సరాల తరువాత రావడం తో , కింద నాయకులూ ఒక రేంజ్ లో జనాలని పీడించేసారు . జనాలకి అవినీతి అలవాటే కానీ వీళ్ళు రేట్లు మరీ దారుణంగా పెంచేశారు . నా అనుభవం లో , లక్ష రూపాయలు లంచం ఇస్తే అయ్యే పని, 3 లక్షలు చెప్పారు .( జగన్ ఈ విషయం లో దయ గా ఉన్నాడు ,లక్ష లోనే అయిపొయింది నా పని). ఇసుక బంగారం అయిపొయింది . మా ఫ్రెండ్స్ అనుభవం కూడా అదే . నాకు తెలిసిన చోటా నాయకుడు , 20 కోట్లు సంపాదించాడు . ఇప్పటికి చంద్రబాబు , నేను ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదు అంటుంటే ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు .
రాజధాని కట్టడం , ఒక పెద్ద ప్రహసనంగా , ఎదో కామెడీ సినిమా చూస్తున్నట్టు అయిపొయింది జనాలకి . ఆ గ్రాఫిక్స్ చూస్తుంటే జనం కడుపుబ్బా నవ్వారు ,ఒక్కడు కూడా నమ్మలేదు . రాజమౌళి ఎందుకో ??? , సింగపూర్ ఎందుకో ??. ఏ దేశం వెళితే ఆ దేశం లా మా రాజధానిని చేసేస్తా అని చెప్పడం.... పెద్ద జోక్ . కమ్మోల్లె మొత్తం స్థలాలు ఆక్రమించేశారు అని పెద్ద నమ్మకం . నిజమేమో కూడా .

చంద్రబాబు మీద ఒక సాఫ్ట్ కార్నెర్ ఉండే జనాలకి కూడా ( వీళ్ళు చంద్రబాబు ని వ్యక్తిగతంగా అభిమానిస్తారు )ఈ ధోరణి కి విసుగొచ్చింది .


ఇంకా ఉన్నాయి , నాకు మాత్రం ఇవే ఎక్కువగా అనిపించాయి .

అజ్ఞాత చెప్పారు...

ఎవరో అజ్ఞాత గారు గొప్పగా వ్రాసారు. ఫలాని అని చెప్పనక్కరలేని ఒక పార్టీ కరపత్రంలాగా ఉంది వారి ఉవాచ. బ్రహ్మాండం.
ఎంతో గొప్పగా పాలిస్తున్నామనీ మరొక ముఫై -కాదు కాదు - నలభై ఏళ్ళదాకా మా జగనన్న పాలనే తప్పదనీ‌ హంగామా చేస్తున్నారు కాని ఇప్పుడు పరిస్థితి ఏమిటీ? రెండున్నర ఏళ్ళు గడిచేసరికి, దినసరి ఖర్చులకు కూడా గతిలేసి స్థితికి వచ్చింది కదా! ఇంక అప్పు అణాకూడా పుట్టటం అసాధ్యం. ఇంక జిల్లాలను ప్రక్కరాష్ట్రాలకు లీజుకు ఇచ్చి ఆడబ్బులతో‌ పబ్బం‌ గడుపుకోవాలేమో. ప్రస్తుతం పరిశ్రమలు తరలిపోతున్నాయి - వీళ్ళు తరిమేస్తుంటే. ఇంక ప్రజలూ తరలిపోయే రోజు దగ్గరలోనే ఉందని అనిపిస్తోంది. ఇదేనా రాజన్నరాజ్యం? దీనిక్కూడా మాచేతకాని తసం కాదూ చంద్రబాబునే‌ తిట్టుకుంటూ‌ కూర్చుంటాం అంటారా - కానివ్వండి, ఇప్పుడు మీరుచేస్తున్నదీ చేయగలిగినదీ అదొక్కటే - పాలన అంటే ఏమిటో కూడా మీకు తెలియదని శతాధికపర్యాయాలు కోర్టులచేత గట్టిగట్టి మొట్టికాయలు తిన్నా మీకు తెలియకపోయినా - దేశప్రజలకు తెలిసిపోయింది.

అజ్ఞాత చెప్పారు...

పై అజ్ఞాత గారికి, మీరు నా కామెంట్ నే ఉదహరించారనుకుంటాను , నేను కాదు మీరు ఒక ఫక్తు రాజకీయ పార్టీ /కుల అభిమాని లా మాట్లాడుతున్నారు . చంద్రబాబు పాలన ఎలా ఏడ్చిందో చెప్తే, దాని అర్ధం నేను జగన్ అభిమానిని అని కాదు , రెడ్డి ని అంతకంటే కాదు .

రాష్ట్రం విడిపోయిన తరువాత , జనం ఎంత నమ్మకమ్ ఉంటె చంద్రబాబు చేతిలో రాష్ట్రాన్ని పెడతారు . టీడీపీ పెద్ద డబ్బులు కూడా వెదజల్లలేదు , ఎందుకంటే అప్పటికే పది సంవత్సరాల నుండి అధికారం లేక ఆరిపోయి ఉన్నారు . కానీ ఏమైంది ? పార్టీ కి గుడ్డి గా సేవచేసే అభిమానులు ఎలానూ సమర్థిస్తారు , కానీ సైలెంట్ గా ఉండే అభిమానులు పరిస్థితి ?? ఇంత మంది చెప్పుకుంటున్న విషయాలు చంద్రబాబు వరకు వెళ్లడం లేదు అంటే, ఆయన ప్రజలకి చాలా దూరం వెళ్లిపోయారు అని అర్ధం .

ఇప్పుడు అధికారం లో ఉన్నవాళ్లు సొంత డిస్టిల్లరీ కంపెనీ లు పెట్టి , తను తయారు చేసే మందు మాత్రమే అమ్ముతూ ఎంత సంపాదిస్తున్నారో ఊహకు కూడా అందదు జనాలకి . ఇదంతా వేరే టాపిక్ .