30, ఏప్రిల్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (153) – భండారు శ్రీనివాసరావు

 లాక్ డౌన్

అందరం మరచిపోయాం! అవును. అందరం పూర్తిగా మరచిపోయాం.

జీవిత కధ అంటేనే అంతవరకూ అనుభవించిన కష్ట సుఖాల కలబోత. అలాంటిది మనమే కాదు, మన పూర్వీకులు సయితం కనీవినీ ఎరుగని కష్టకాలాన్ని మనం అందరం కలిసే అనుభవించాము. అది కూడా దశాబ్దాల నాటి విషయం  కాదు. నాలుగయిదేళ్ళు కూడా కాలేదు. అప్పుడే మరచిపోయాం.

ఈ సువిశాల విశ్వంలో ప్రకృతి వైపరీత్యాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఒక ప్రాంతంలో వరదలు సంభవిస్తే దానివల్ల ఏర్పడే కష్ట నష్టాలు అక్కడి ప్రజలే అనుభవిస్తారు. బయటి ప్రాంతాల వాళ్లకు నేరుగా వచ్చిపడే బాధలు వుండవు. భూకంపాలు, తుపానులు, పిడుగు పాట్లు,  అంటువ్యాధుల వ్యాప్తి, అనావృష్టి, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు ఇలా ఏది తీసుకున్నా వాటి ప్రభావం స్థానికంగానే వుంటుంది. అలాంటిది అప్పటివరకు పేరూ వూరూ లేని, మామూలు కంటికి కనపడని ఒక చిన్న నలుసులాంటి క్రిమి యావత్ ప్రపంచాన్ని ఒకేమారు గడగడా  వణికించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసింది.   

కేరళలోని మూడు పట్టణాల్లో మొట్టమొదట  2020 మార్చిలో  ఈ కోవిడ్ వ్యాధిని గుర్తించారు. చైనా వెళ్లి వుహాన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్ధులు స్వదేశానికి వస్తూ వెంటబెట్టుకు  వచ్చిన వ్యాధి,  అతిత్వరలో భయంకర పరిణామాలకు మూలకారకం అవుతుందని అప్పట్లో వారికి తెలియదు. నిజం చెప్పాలి అంటే, ప్రపంచంలోనే  అసలు ఎవ్వరికీ తెలియదు.

తదాదిగా,  ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలు సినిమా రీలులా గిర్రున తిరిగాయి. 2020 మార్చి ఇరవై మూడో తేదీన దేశంలో తొలిసారి కేరళలో లాక్ డౌన్ విధించారు. అప్పటిదాకా ఈ పదాన్ని వేరే అర్ధంలో, అర్ధం చేసుకోవడానికి అలవాటు పడిన వారికి లాక్ డౌన్ అమలు తీరు  అంటే ఏమిటో తెలిసి వచ్చి నివ్వెరపోయారు. ఆ తర్వాత రెండు రోజులకే,  విధిలేని పరిస్థితుల్లో  యావత్ భారతదేశంలో ఇరవై ఒక్క రోజులపాటు  లాక్ డౌన్ విధించారు. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వంటి వాతావరణం కమ్ముకోవడం అదే మొదటిసారి కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయినా ప్రభుత్వ ఆదేశాలను పాటించారు. గత్యంతరం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

ఎందుకంటేఈ కోవిడ్ (దీనికే కరోనా అనే మరో ముద్దు పేరు) వ్యాధి లక్షణాలు  ఏమిటో తెలియదు. ఎలా వ్యాపిస్తుందో తెలవదు. అప్పటికి తెలిసిందల్లా ఈ వ్యాధి బారిన పడితే మరణం తధ్యమని. దీనికి మందు లేదని.  నోటి నుంచిశ్వాస నుంచి వెలువడే గాలి ద్వారా మాత్రమే కాదు,  అసలు మనుషులు ఒకరినొకరు తాకినా అంటుకుంటుందని ఇలా రకరకాల పుకార్లు షికారు చేశాయి. కలరా వంటి ఇతరేతర వ్యాధులు ప్రబలినప్పుడు ఆ వ్యాధి పీడితులకు బాసటగా వారి బంధుమిత్రులు వుంటారు. చికిత్సచేయడానికి ప్రభుత్వప్రైవేటు ఆసుపత్రులు అనేకం అందుబాటులో  వుంటాయి. ఇవ్వడానికి వాక్సిన్లువాడడానికి  మందులు వుంటాయి. కానీ కరోనా విషయం పూర్తిగా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా సోకినట్టు అనుమానం ఉన్న రోగిని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండాకుటుంబ సభ్యులను కూడా ముట్టుకోనివ్వకుండా వారిని   ఐసొలేషన్ గదుల్లో ఉంచాల్సిన పరిస్థితి. ఇళ్ళల్లో ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడం సామాన్యులకు అలవి కాని పని. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిట. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య ఖర్చు అసామాన్యులకు కూడా అందని మానిపండు. దీనికి తోడు ఆక్సిజన్ కొరత. చుట్టూ గాలిలో ఎంత ఆక్సిజన్ వున్నా రోగికి అందించాలి అంటే అప్పటికప్పుడు ఆక్సిజన్ అందించడం సాధ్యం కాదు.  ఇదంతా ఆషామాషీ వ్యవహారం కాదు. రోగిని ముట్టుకోకుండా పరీక్షలు చేయాలి. ప్రాణాలను పణంగా పెట్టి కనిపెట్టి చూసే వైద్యులు, వైద్య సిబ్బంది కావాలి.   మొదటి రెండు దశల్లో వ్యాధిని  గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణ హానికి ఆస్కారం వుండదు. కానీ మూడో దశకు చేరుకుంటే ఇక ఆ రోగిని కాపాడడం కష్టం అన్నారు నిపుణులు. రోగి  చనిపోయిన తర్వాత కూడా సొంత కుటుంబ సభ్యులు తమ ఆత్మీయుడి శరీరాన్ని తాకలేని పరిస్థితి. సాంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితి. ఈ స్థితి పగవాడికి కూడా రాకూడదు అని మౌనంగా రోదించిన కుటుంబాలు ఎన్నో! ఎన్నెన్నో!!

మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోగం శరీరంలో ప్రవేశించిన రెండు వారాల వరకు ఆ విషయం గుర్తించడం సాధ్యం కాదు. విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి దేశంలో ప్రవేశించిందని వార్తలు. విదేశాల్లో బయలు దేరినప్పుడు వ్యాధి సోకినా ఆ విషయం వారికి తెలియదు. స్వదేశం చేరిన తర్వాత అలాంటివాళ్ళు ఎంతో మందిని కలిసి వుంటారు. అలాంటివారినందరినీ ఇప్పుడు వెతికి పట్టుకుని పరీక్షలు చేయాల్సిన బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ భుజస్కంధాలపై పడింది. ఇది సాధారణ విషయం కాదు. సముద్రపు ఒడ్డున ఇసుకలో పడిపోయిన సూదిని వెతకడం వంటిది. అయినా ప్రభుత్వం వెనుకాడ లేదు.

 

కోవిడ్ మొదటి ఉత్పాతాన్ని సరిగా అర్ధం చేసుకోలేని ప్రజలు దీన్ని సరదాగా తీసుకోకపోయినా సీరియస్ గా తీసుకోలేదు.  ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. ఈ వ్యాధిని ఎలా నిర్మూలించడం అనే కన్నా, విస్తరించకుండా దీన్ని  ఎలా అరికట్టడం ఎలా అనేది ప్రాధాన్యతా అంశంగా మారిపోయింది. వారికి ముందుగా కనపడిన మార్గం  లాక్ డౌన్. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా,  కదలకుండా కొన్ని రోజుల పాటు ఒకేచోట వుండిపోయేలా చెయ్యడం. నాగరిక ప్రపంచ చరిత్ర ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజలు కాలు బయట పెట్టకుండా, మూడు విడతలుగా,  కొన్ని వారాల పాటు ఇళ్లకు అతుక్కుని వుండిపోయారు.  రైళ్లు, కార్లు, బస్సులు, ఆటోలు, టాక్సీలు, విమానాల రాకపోకలు పూర్తిగా  నిలిచిపోయాయి. ప్లబ్బులు,  క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు,  మాల్స్, సినిమా హాల్స్ మూతపడ్డాయి. పోలీసులు విధించే కర్ఫ్యూ సమయాల్లో కూడా బయట తిరిగేవాళ్ళు కొందరు కనిపించేవారు కానీ లాక్ డౌన్ అమల్లో వున్న కాలంలో రాత్రీ పగలూ తేడా లేకుండా ఎల్లెడలా నిర్మానుష్యం. అప్పుడప్పుడూ తిరిగే అంబులెన్సుల సైరన్ చప్పుళ్ళు మినహా సర్వత్రా నిశ్శబ్దం. లాక్ డౌన్  నియమం ఉల్లంఘిస్తే జైలు శిక్ష అన్నారు కానీ, జనం స్వచ్చందంగానే లాక్ డౌన్ పాటించారనే చెప్పాలి.

ఆ రోజులు ఇప్పుడు తలచుకుంటే, అప్పుడు అలా ఎలా  వుండగలిగామని మనకే ఆశ్చర్యం వేస్తుంది. మనిషిలో అంతర్లీనంగా వుండే చావు భయం అలా చేయించి వుండాలి.  కరోనా భయం అనేది  వున్నవారు లేనివారు అనే తేడా లేకుండా సమస్త సమాజాలను ఒకే తీరున వణికించింది. జీవితం అశాశ్వతం అనే నిర్వేదంలోకి మానవ జాతి ఏకకాలంలో వెళ్ళిన ఏకైక సందర్భం అది.

మొత్తం మీద కరోనా వ్యాధికి వాక్సిన్ కనుక్కున్నారు. అదీ మన దేశంలోనే,  హైదరాబాదు, పుణే నగరాలలోనే. వాక్సిన్ రాకతో ప్రజల్లో గుండె ధైర్యం పెరిగింది.

కానీ ఏం లాభం? ఏడాది, రెండేళ్లు  తిరక్క మునుపే, జనం వెనుకటి గుణమేల మాను అన్న రీతిలో పాత జీవితాల్లోకి జారిపోయారు. కరోనా అంటే ఏమిటి? స్విగ్గీలో దొరుకుతుందా అంటున్నారు.

తోకటపా:

కరోనా మన్ కి బాత్

 కరోనా రాకచూసి మిగిలిన వ్యాధులన్నీ సర్దుకు కూర్చున్నాయి.

ఏమిటలా వున్నావు’ ధైర్యం చేసి అడిగింది కలరా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.

ఎలా ఉండనునిన్న మొన్నటిదాకా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించానని విర్రవీగాను’

ఇప్పుడు మాత్రం ఏమైందినీ నామ స్మరణ చేయకుండా భూలోకవాసులకు క్షణం గడవలేదు కదా!’ అన్నది హెచ్.ఐ.వి.

నేనూ అలాగే అనుకున్నాను. ఈ సృష్టి ప్రారంభం అయిన తర్వాత యావత్ ప్రపంచ ప్రజల నోళ్ళలో నా పేరు ఎన్ని కోట్లమారు మారుమోగుతున్నదో చూసి నేనూ పులకరించిపోయాను. వాళ్ళు నా పేరు వింటేనే ఎంతగా భయపడుతున్నారో కళ్ళారా చూసి పొంగిపోయాను. కానీ అది భయం కాదనీవాళ్ళు నాతో పరాచికాలు ఆడుతున్నారనీ ఇపుడిప్పుడే గ్రహింపుకు వచ్చి సిగ్గుపడుతున్నాను’

అదేమిటే అలా అంటున్నావు. నువ్వు కదా మా అందర్నీ చూస్తుండగానే మించిపోయావు. నీ పేరు వింటేనే వణికిపోయేలా మానవుల్ని మార్చగలిగావు అని మేమిక్కడ అసూయతో రగిలిపోతుంటే ఏమిటిది ఇలా నీ ఈ మాటలతో మమ్మల్నిలా మళ్ళీ సంతోషపెడుతున్నావు’ అంది ఎబోలా.

అలానా! నేను రంగ ప్రవేశం చేసిన తర్వాత మీకెవ్వరికీ సరైన పనిపాటలు లేకుండాపోయాయి కదా! ఆ ఖాళీ టైములో మీరు కాస్త పత్రికలు చదివితేకొంచెం టీవీలు చూస్తే విషయం బోధపడేది’

పత్రికలూటీవీలు అంటూ మమ్మల్ని భయపెట్టకు. మేము ఇంతమందిమి కలిసి చేయలేని అపకారాన్ని అవి ఒంటిచేత్తో మానవాళికి చేస్తున్నాయి. అసలేం జరిగిందో నువ్వే చెప్పువింటాం’ అంది కేన్సర్.

మనుషులకు చావు భయాన్ని మించిన భయం వుండదు అనే ధీమాతో నేను భూలోకంలో అడుగుపెట్టాను. మొదట్లో నా అభిప్రాయం నిజమే అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు మళ్ళీ తమ మునపటి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చావు ముంగిట్లో వుందని తెలిసి కూడా చిన్నారులపై లైంగిక దాడులు చేస్తూనే వున్నారు. చనిపోతే కట్టుకుపోయేది ఏమీ ఉండదని తెలిసికూడా ఆన్ లైన్ మోసాలతో ఇతరులని దోచుకుంటూనే వున్నారు. కరోనా బారిన పడితే రేపు మనది కాదు అనే భయం ఎటు పోయిందో తెలవదు ఎప్పుడో  వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎలాగాప్రత్యర్ధిని ఓడించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. దొంగతనాలుదోపిడీలు జరుగుతూనే వున్నాయి. భూఆక్రమణలు మునుపటి కంటే ఎక్కువయ్యాయి. డబ్బు పోగేసుకోవడం ముమ్మరమయింది. మరణభయంతో జనంలో అత్యాశ లేకుండా పోతుంది అనుకుంటే ఆ కక్కుర్తి మరీ ఎక్కువయింది. తింటున్నారుతాగుతున్నారుక్వారంటైన్లలో చిందులేస్తున్నారు. వైద్యం చేయడానికి లక్షలు గుంజుతున్నారు. చనిపోతే శవాన్ని అప్పగించడానికి డబ్బులు లాగుతున్నారు. నిజం చెప్పాలంటే నా రాకకు ముందుకంటే కూడా ఇప్పుడు ప్రపంచం మరీ పాడయిపోయింది.

ఇన్నిరోజుల అనుభవంతో చెబుతున్నా వినండి. కరోనా అంటే భయం కంటే డబ్బు అంటే మమకారమే వాళ్లకు ఎక్కువ అని తేలిపోయింది’

 

 

కింది ఫోటో:

ప్రభుత్వ ఆధ్వర్యంలో కరోనా వాక్సిన్ మొదటి డోసు వేయించుకుంటున్న సందర్భం.



 

(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: