ప్రజా ప్రతినిధులలో కూడా పుణ్య పురుషులు వుంటారు. అందర్నీ ఒకే గాటన కట్టాల్సిన అవసరం లేదు.
ఇప్పటి సంగతి నాకు తెలియదు. వున్నారేమో! కానీ నేను
విలేకరిగా పనిచేసే రోజుల్లో కొంతమంది ఇలాంటి వారు తటస్థపడ్డారు. ప్రస్తుతానికి ఓ
అయిదుగురు గురించి చెప్పుకుందాం.
బత్తిన సుబ్బారావు గోదావరి జిల్లానుంచి శాసన సభకు
కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పేద దళిత కుటుంబం
నుంచి మంత్రి స్థాయికి ఎదిగినా ఆయన ఆర్ధిక పరిస్తితిలో ఏ మార్పూ లేదు. ఆయన తల్లిగారు కూలీపని చేసుకుని జీవనం
గడిపేవారు. రాజ్యసభ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బు
తీసుకుంటారని ప్రచారం సాగే రోజుల్లో, అనారోగ్యానికి గురై, నిమ్స్
ఆసుపత్రిలో వుండి కూడా వీల్ చైర్ మీద వెళ్లి పైసా తీసుకోకుండా ఓటు వేసి వచ్చారు.
చివరకు ఎంతటి గర్భదారిద్య్రంలో కూరుకు పోయారంటే చనిపోయినప్పుడు దహనం
చేయడానికి డబ్బులు లేని దౌర్భాగ్య స్తితి.
ఈ విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభ్యులు శ్రీ వేమా, మరికొందరు
గోదావరి జిల్లాల సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే నాటి ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు స్పందించి ప్రభుత్వం తరపున కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.
అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన చప్పిడి వెంగయ్య.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అభ్యర్ధిగా 1994 లో ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారు. చాలా సింపుల్ గా వుండేవారు.
‘ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం వుండడం లేదు, కనీసం ఈ సారయినా నా పేరు సరిగా రాయండయ్యా’ అని
అసెంబ్లీ కవరేజ్ కి వెళ్ళే పాత్రికేయులతో అనేవారు సరదాగా. ఆయన పేరు చప్పిడి వెంగయ్య
అయితే, వెంగయ్య అయివుండదు, అది వెంకయ్య
అయివుంటుందని హైదరాబాదు రిపోర్టర్లు తామే
తీర్మానించుకుని, చప్పిడి వెంకయ్య అని రాసేవారు.
వెంగయ్య గారి ఎన్నికల
ప్రచారాన్ని కవర్ చేయడానికి హైదరాబాదు నుంచి ఒక ఆంగ్ల దినపత్రిక తరపున సుశీల్
కుమార్ అనే విలేకరి ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. వెంగయ్య గారి ఇల్లు చూసి
ఆశ్చర్యపోయారు. రెండే గదులు. టీవీ కాదు కదా, కనీసం
రేడియో కూడా లేదు. కాలినడకనే ప్రచారం. అయినా గెలిచారు. కాదు ప్రజలు గెలిపించారు.
సుశీల్ ఆ రోజుల్లో చప్పిడి వెంగయ్య గురించి తన పత్రికలో
రాసిన వార్త చాలా సంచలనాన్ని సృష్టించింది.
‘మరోసారి ఎన్నికల్లో పార్టీ ఫండ్ స్వయంగా అందచేయడానికి ఒక
మంత్రిగారు వెళ్ళారు. కానీ ఆయన పైసా కూడా తీసుకోలేదు. చిత్రం! ఆ ఎన్నికల్లో
ఓడిపోయారు’
నేను హైదరాబాదులో రేడియో విలేకరిగా చేరిన
కొత్తల్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం ఏర్పడింది. అధికార భాషా సంఘం
అధ్యక్షుడిగా, మద్యపాన వ్యతిరేకోద్యమ నేతగా ఆయన పలు పర్యాయాలు
రేడియో స్టేషన్ కు వచ్చేవారు. నీరు కావి రంగు ఖద్దరు దుస్తులు, ముతక ధోవతి, ముడతలు పడ్డ
అంగీ. భుజం మీదుగా వేలాడుతూ ఒక గుడ్డ సంచి. దూరం నుంచే చూసి
చెప్పొచ్చు ఆ వచ్చేది వావిలాల వారని. ఇక ఆ చేతి సంచిలో వుండేవి నాలుగయిదు వేపపుల్లలు, మరో జత
ఉతికిన దుస్తులు, నాలుగయిదు పుస్తకాలు, నోటుబుక్కు. 1955 నుంచి 1967 వరకు ఆయన ఇండిపెండెంటుగా
గెలుస్తూ వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గంలోని అన్ని
గ్రామాలను ఆయన కాలినడకనే తిరిగేవారు. యెంత దూరమైనా కాలి నడకే. వూరు దాటి సుదూర
ప్రాంతాలు వెళ్ళాల్సివస్తే ఆర్టీసీ బస్సు లేదా సెకండు క్లాసు రైలు.
ఒకసారి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్నప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళారు.
గెస్టు హౌస్ లో దిగిన వావిలాల వారిని మర్యాద పూర్వకంగా కలుసుకునే నిమిత్తం జిల్లా
కలెక్టర్ వెళ్లి గదిలో చూస్తే ఆయన లేరు. బయటకు వచ్చి వాకబు
చేస్తే ఆ సమయానికి వావిలాల వారు గెస్టు
హౌస్ దగ్గర కృష్ణా నదిలో స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ కానవచ్చారు. ‘అదేమిట’ని
కలెక్టర్ ఆశ్చర్యంతో అడిగితే, ‘వున్నవి రెండే జతలు, ఏరోజుకారోజే
ఉతుక్కోవడం తనకు అలవాట’ ని చెప్పారు.
శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ చాలా
సౌమ్యులు. రేడియో విలేకరిగా
ఆయనతో నాకు పరిచయం వుంది. గతంలో
వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా నిరాడంబరంగా వుండడం
నాకు తెలుసు.
గతంలో ఓసారి మా
రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు (రిటైర్డ్ సీజీఎం, స్టేట్ బ్యాంక్, అప్పుడు శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్ చైర్మన్) మా వదినెతో
కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో
అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే ఇవ్వాల్సిందని టీసీని
అడిగారు. రాజమండ్రిలో మంత్రి సుభాష్ చంద్రబోస్ కోసం రిజర్వ్ అయ్యాయి, లాభం లేదు
అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదా, ఈ సెకండ్
ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.
రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు
భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని
అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టం, ఆవిడ, మా ఆవిడ
కింద బెర్తుల్లో పడుకుంటారు, మనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా
అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.
“మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే.
కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”
మర్నాడు ఉదయం సికిందరాబాదులో రైలు దిగిన
తర్వాత మంత్రిగారి పియ్యే ఈ మాట చెప్పి మా అన్నగారి అనుమానం తీర్చారు.
రాజకీయుల్లో మంచివారి కోవలోకి వచ్చే వారిలో తన 89 వ ఏట మరణించిన భాట్టం శ్రీరామ మూర్తి గారు మరొకరు.
దాదాపు ఇరవై ఏళ్ళు చట్టసభ సభ్యుడిగా, ఎనిమిదేళ్ళు మంత్రిగా, ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా వున్నారు. కౌలాలంపూర్ లో నిర్వహించిన ప్రపంచ
సభలకు నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు కారణాంతరాలవల్ల వెళ్ళలేక
పోవడంతో సాంస్కృతిక శాఖ మంత్రిగా వున్న శ్రీ భాట్టం ఆ సభల్లో కీలక ప్రసంగాలు చేసి
సభికులను తన అసాధారణ వక్తృత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పీవీ మంత్రివర్గంలో వున్న
ఈ ఇద్దరు మంత్రుల్ని 'జంట కవులు' అని పిలిచేవాళ్ళు. తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి అయినప్పుడు వీరి శాఖల్ని
మార్చి ఒకరిది మరొకరికి కట్టబెట్టారు. 'జలగం
గారు మాకు కుండ మార్పిడి చేశారు' అనేవారు శ్రీరామమూర్తిగారు హాస్యోక్తిగా.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి
వ్యక్తిత్వం నచ్చిన నాటి టీడీపీ అధ్యక్షుడు శ్రీ ఎన్టీ రామారావు, ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో
టీడీపీ టిక్కెట్టు మీద శ్రీ శ్రీరామమూర్తి, విశాఖ
నియోజకవర్గం నుంచి తొలిసారి లోకసభకు ఎన్నికయి
పార్లమెంటులో తన స్వరం వినిపించారు.
రాజకీయ జీవితంలో డబ్బుకు దూరంగా, ప్రజలకు దగ్గరగా గడిపిన చరిత్ర శ్రీ శ్రీరామమూర్తిది. రాజకీయ శత్రువులు
సయితం ఆయన నిజాయితీని శంకించలేని స్తితి. హోదాలు
కోరుకోలేదు. ఆస్తులు కూడబెట్టలేదు. విశాఖపట్నంలో ఏ చిన్న ఇంట్లో వున్నారో, జీవిత చరమాంకం వరకు అదే ఇంట్లో గడిపారు. మంత్రిగా వున్నప్పుడు అత్యంత నిరాడంబరంగా కుమారుడు విద్యాసాగర్ పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి శుభలేఖలు కూడా అచ్చు వేయించలేదు. తన
కుటుంబసభ్యులను తీసుకుని ఒక ప్రైవేటు వాహనంలో పెళ్ళికి వెళ్ళి వచ్చారు. డాబూ
దర్పాలూ లేవు, వందిమాగధులూ లేరు. అదీ భాట్టం
శ్రీరామమూర్తి గారు పాటించిన జీవన విధానం.
తాను నమ్మింది ఆచరించి చూపడం అన్నది
శ్రీరామ మూర్తి గారు తన పెళ్ళిలో కూడా ప్రదర్శించి చూపారు. ఆయనది కులాంతర వివాహం.
మద్దూరి అన్నపూర్ణయ్య గారి పౌరోహిత్యంలో శ్రీమతి సత్యవతితో జరిగిన ఆ
పెండ్లితంతుకయిన ఖర్చు కేవలం పదిహేను రూపాయలు.
ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా పనిచేసిన
తరువాత మరోసారి శ్రీ రామారావు విశాఖ నుంచి రెండో మారు పోటీ చేయాలని శ్రీ శ్రీరామమూర్తిని కోరారు.
కానీ ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న శ్రీ భాట్టం, రామారావుగారి కోరికను సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచీ ఆయన
క్రియాశీలక రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక వ్యవహారాలకు దగ్గరగా వుంటూ వచ్చారు. ఏళ్ళు మీద పడి, కాళ్ళూ
చేతులూ సరిగా ఆడని వాళ్లు కూడా పదవులకోసం వెంపర్లాడుతున్న ఈ రోజుల్లో భాట్టం వంటి
వారిని ఊహించుకోవడం కూడా కష్టం. అంతేకాదు, అయన తన
కుటుంబ సభ్యులనెవ్వరినీ రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. తన టిక్కెట్టు తన భార్యకు
ఇమ్మని కూడా దేబిరించలేదు.
భాట్టం శ్రీరామ మూర్తి గారు మిత్రుల
కోరికపై తన ఆత్మ కధ రాశారు. అన్ని విషయాలు చాలా నిక్కచ్చిగా రాసుకున్నారు.
చివర్లో తనకు తానే 'తుది పలుకులు' కూడా రాసుకున్నారు.
'కోహం (నేనెవర్ని) అంటూ పుట్టావు. సోహం (నేనే నువ్వు అంటే భగవంతుడు) అంటూ ఆ ఎరుకతో మరణించు. పుట్టిన చోటు చేరడానికి ఏడుపెందుకు?'
శ్రీ భాట్టం శ్రీరామమూర్తికి ఒకనాటి
రాజకీయ సహచరుడు, ముఖ్యమైన స్నేహితుడు కీర్తిశేషులు
మండలి వెంకట కృష్ణారావు. అయన కుమారుడు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ఈ గ్రంధానికి 'ముందు మాట' రాశారు. మహాకవి, సంస్కృత పండితుడు భవభూతి సూక్తిని శ్రీ
బుద్ధ ప్రసాద్ అందులో ఉటంకించారు.
'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'. విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం
పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.'
ఆ కొద్దిమందిలో ఒకరు శ్రీ భాట్టం
శ్రీరామ మూర్తి.
మరో ఉదంతం చెప్పుకుందాం.
ఓ మంత్రిగారు ఆఫీసులో రివ్యూ మీటింగులో
వుండగా ఇంటర్ కం మోగింది.
అవతల పియ్యే.
‘సార్! ఇంటి నుంచి ఫోన్, మేడం గారు
లైన్లో వున్నారు’
మంత్రిగారు విసుగ్గా ఫోన్ తీసుకున్నారు. మరింత విసుగ్గా
అన్నారు.
‘ఎన్ని సార్లు చెప్పాను, ఆఫీసులో
మీటింగులో వున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. ఇంతకీ ఏమిటంత అర్జంటు పని’
‘........’
‘కారు పంపించాలా! ఎందుకు ఈ మీటింగు కాగానే నేనే ఇంటికి
వస్తున్నాను. ఈ అరగంటలో కొంపలేం మునగవ్. డ్రైవర్ అటూ ఇటూ రెండు సార్లు తిరగడం
దండగ. నేను వచ్చాక వెడుదువ్ కాని’
ఆరోజు మంత్రి ఛాంబర్లో దివాలా తీసిన ప్రూడెన్షియల్
సహకార పట్టణ బ్యాంకు గురించిన మీటింగ్ జరుగుతోంది. సీనియర్
ఐఏఎస్ అధికారులు అందులో పాల్గొంటున్నారు.
నిజానికి మంత్రులు ఇంటి పనులకోసం అధికారిక వాహనాలను
వాడుకోవడం అనేది సామాన్యంగా జరిగే విషయమే. అలాటి వాటిని చాలా సాధారణ విషయంగా తీసుకోవడానికి
జనం అలవాటుపడ్డారు. ప్రతి మంత్రికీ ఆయన శాఖ కిందికి వచ్చే కార్పొరేషన్
వాళ్ళే వాహనాలు ఒకటో రెండో అదనంగా సమకూర్చడం అనేది బహిరంగ రహస్యమే. మరి ఇదేమిటి ఈ
మంత్రిగారు భార్య కారు కావాలంటే ఇలా విసుక్కుంటున్నారు?
ఆయన అంతే! ఆయన మంత్రే కాని అందరివంటి వాడు కాదు. ఆయన
పేరే చిక్కాల రామచంద్రరావు. అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు
నిర్వహించారు. మంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన సొంత అంబాసిడర్ కారునే వాడేవారు.
ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ వాడుకునేవారు.
సింపుల్ గా వుండడం ఆయనకు ఇష్టం. మంత్రిగా వున్నప్పుడు ఈ
ఇష్టాన్ని మహబాగా తీర్చుకున్నారు.
కింది ఫోటోలు : (ఎంత ప్రయత్నం చేసినా చప్పిడి వెంగయ్య గారిది దొరకలేదు)
చిక్కాల రామచంద్ర రావు
(ఇంకావుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి