1, జూన్ 2021, మంగళవారం

ఎస్వీ ప్రసాద్ గారి సంస్మరణలో – భండారు శ్రీనివాసరావు

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో శ్రీ ఎస్వీ ప్రసాద్ ఏకబిగిన దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేశారు.
ఆ తర్వాత జరిగిన అంటే 2004 ఎన్నికల తర్వాత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు ముఖ్యంగా ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన అధికారులకి స్థానచలనం జరగడం ఆనవాయితీ.
ఎస్వీ ప్రసాద్ నిబద్దత, నిజాయితీల మీద వై.ఎస్.ఆర్. కి ఉన్న నమ్మకం చేత, ఆయన్ని పిలిచి ఆయన కోరుకున్న పోస్టు ఇవ్వాలని సంకల్పించారు. కానీ ప్రసాద్ గారు మాత్రం ముఖ్యమైన, కీలకమైన పోస్టులు కోరుకోలేదు. చాలా ఏళ్ళుగా విశ్రాంతి ఎరగకుండా పనిచేయడం వల్ల కావచ్చు, పనిభారం కొంత తేలికగా వుండే అప్రధాన పోస్టుని ఏరికోరి వేయించుకున్నారు. అదేమిటంటే – Environment Protection Training and Research Institute (EPTRI). అది హైదరాబాదులోనే వుంది కాని అలాంటి సంస్థ ఒకటి వుందని చాలా మందికి తెలియదు. అక్కడ డైరెక్టర్ గా ఆరు నెలలు కూడా పనిచేశారో లేదో తెలియదు, వై.ఎస్. ఆయన్ని అతి కీలకమైన పోస్టుకి ఎంపిక చేశారు. ఎస్వీ ప్రసాద్ గారెని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
ఇదేమిటి అని సొంత పార్టీ వాళ్ళు అడిగితె అది అంతే అని వై.ఎస్. జవాబు. తనకు అడ్మినిస్ట్రేషన్ కొత్త అయినా, రాజకీయాల్లో సుదీర్ఘ కాలం వుండడం చేత ఐ.ఏ.ఎస్. అధికారుల పనితీరు తనకు కరతలామలకం అని చెప్పేవారు. ఎవరో ఒకరిద్దరు తప్ప సాధారణంగా చాలా మంది ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లు Loyal to their duty అనేది ఆయన అభిప్రాయం. దీన్నే కొందరు Loyal to CM అని అన్వయించి చెబుతారు.
ఆయన సీఎం పేషీలో వుండడం వల్ల ఐ.ఏ.ఎస్. అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయంతో చక్కటి సమన్వయం ఉండేదని, ప్రభుత్వ నిర్ణయాలు సత్వరంగా అమలు జరగాలంటే ఇలాంటి సమన్వయాన్ని అధికారులు కోరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు అభిప్రాయ పడ్డారు.
అనేకమంది, అదీ పరస్పర విరుద్ధమైన పార్టీల ముఖ్యమంత్రుల వద్ద సన్నిహితంగా పనిచేసే అవకాశం ఎస్వీ ప్రసాద్ గారెకి లభించింది. కత్తి మీది సాము లాంటి వ్యవహారాలను ముఖ్యమంత్రికి మాట రాకుండా, తను మాట పడకుండా చక్కబెట్టే చాణక్యం ఉంటేనే కాని ఇది సాధ్యపడదు.
కరోనా కారణంగా, అంత మంచి అధికారికి నూరేళ్లు నిండడం విషాదం.

(01-06-2021)

కింది ఫోటో:
1973 లో ఐ.ఏ.ఎస్. సహచరులతో ఢిల్లీలో దిగిన ఫోటో. కుడి వైపు చివర శ్రీ ఎస్వీ ప్రసాద్
May be an image of one or more people and people standing

కామెంట్‌లు లేవు: