4, జూన్ 2021, శుక్రవారం

నా మొదటి స్కూటరు – భండారు శ్రీనివాసరావు

 కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను హైదరాబాదు వచ్చి అప్పటి బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని భాస్కరులు (పత్రికా రచయితలు) ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవదానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర)వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు. ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఆయన వెంటనే స్పందించి అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం.

రెండు రోజుల తరువాత కోటీ లోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను. బాంకు అధికారి స్కూటరు లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు. ఆ రోజుల్లోనే, గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఎక్స్ ప్రెస్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. మా వైభోగం ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు.
1987లో మాస్కో వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు జరిగిన ‘హెల్మెట్ ధరించని జర్నలిస్ట్ అరెస్ట్’ అనే సంచలన ఉదంతానికి కారణమైన ‘నేను’, ఆరోజు వెడుతున్నది ఈ గిర్నార్ స్కూటర్ మీదనే.
ఆ కధ అనేక మలుపులు తిరిగి సుఖాంతం అయింది కానీ ఆనాటి నుంచి స్కూటర్ ఎక్కలేదు.




ఇక హెల్మెట్ ఉపాఖ్యానం ఏమిటంటే:
హెల్మెట్ నిబంధన పాటించనందుకు నన్ను ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పట్టుకుని హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ లో పెట్టారు. ఈ సంగతి తెలిసి వివిధ పత్రికల్లో పనిచేసే విలేకరులు, సీనియర్లు స్టేషన్ బయట ధర్నా చేశారు. మర్నాడు అసెంబ్లీ ఈ కారణంగా వాయిదా పడింది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ సంఘటన పై దర్యాపుకు రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్ గా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ పోలీసు అధికారిని బదిలీ చేశారు ఈ క్రమంలో..
చిత్రంగా మరో మలుపు తిరిగింది. రాయలసీమకు చెందిన ఆ న్యాయమూర్తికి గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ లో కార్యాలయం ఏర్పాటు చేశారు. అక్కడ కలుసుకోవాలని నాకు వర్తమానం పంపారు.
తీరా వెడితే ఆ రిటైర్డ్ జడ్జి గారి అమ్మాయి రేడియోలో నా జీవన స్రవంతి కార్యక్రమానికి అభిమాని. నన్ను చూస్తాను అంటే ఆయన వెంటబెట్టుకుని వచ్చారు. హెల్మెట్ లేదని నన్ను పట్టుకున్న ఇన్స్పెక్టర్ కూడా వచ్చారు. ఆయన మా ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగికి చుట్టం. అతడ్ని తీసుకుని మా ఇంటికి వచ్చి తన ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా చూడమని కోరాడు. ఆ విషయం నేను అప్పుడే మరచిపోయాను కాబట్టి మీకు అపకారం చేసే ఉద్దేశ్యం నాకు లేదని అతడికి భరోసా ఇచ్చాను.
తర్వాత అదే మాట జడ్జి గారెతో చెప్పాను. త్వరలోనే నేను మాస్కో పోతున్నాను కాబట్టి, ఎవరూ నా కారణంగా బాధ పడడం ఇష్టం లేదని అన్నాను. జరిగింది దురదృష్టకర సంఘటన కాబట్టి మరచిపోవడమే దీనికి పరిష్కారం అని కూడా చెప్పాను.
ఆయన నా మాట మన్నించారు. ఆవిధంగానే కేసు మూసేశారు.
తర్వాత చాలా కాలానికి (అప్పుడు నేను ఇండియాలో లేను) అసెంబ్లీకి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది.
కధకు ఆవిధంగా శుభం కార్డు పడింది.

కామెంట్‌లు లేవు: