అగ్రరాజ్యపు పాము పగ
కొన్ని వింటున్నప్పుడు, మరి కొన్ని చూస్తున్నప్పుడు గతంలో జరిగిన ఇంకెన్నో సంగతులు గుర్తుకు రావడం సహజం.
ఆల్ ఖయిదా అగ్రనేత ఆల్ జవహరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, ఆఫ్ఘనిస్థాన్ లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని అమెరికా మట్టుబెట్టింది.
ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ పదకొండో తేదీన (9/11) నాటి ఆల్ ఖయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవహరి మరణం ఓ ముగింపు అని అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
9/11 గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్ ని వధించి పగ తీర్చుకుంది. అప్పుడు లాడెన్ కు కుడి భుజంగా వ్యవహరించిన జవహరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఆల్ జవహరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికి మరోమారు చాటి చెప్పింది.
ఒసామా బిన్ లాడెన్ – బరాక్ హుస్సేన్ ఒబామా
వీరిద్దరి మధ్యా నామసారూప్యత మాత్రమే కాదు, భావ సారూప్యత కూడా వుంది.
‘మతం కోసం ఎలాటి మారణహోమానికయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ది.
‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అలనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాది.
అయితే, ఆలోచన ఒక్కటే అయినా ఆచరణలో కొద్ది తేడా వుంది.
‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా పరవాలేదు అనే థియరీ’ ఒబామాది.
‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికిరాదనే భావజాలం’ ఒసామాది.
ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాలకోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు, అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని, తనకు తానుగా అమెరికా పెంచుకుంటూ వచ్చిన అహంభావాన్ని బిన్ లాడెన్ తనదయిన శైలిలో దెబ్బ తీసినప్పుడుకానీ, ‘పాము-పాలు’ కధ లోని అంతరార్ధం అమెరికాకు అవగతం కాలేదు. తనదాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా, 2001, సెప్టెంబర్ 11 దుర్ఘటన తరవాత గాని ఉగ్రవాదం వల్ల పొంచివున్న ముప్పు ఎలావుంటున్నన్నది ఆ అగ్ర దేశానికి అర్ధం కాలేదు.
ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు.
చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో, తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్ ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా అగ్రరాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదం అవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హై టెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలను జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్ లో కూర్చుని, పధకం అమలవుతున్న తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలనుబట్టి, అన్ని దేశాలలోని టీవీ వీక్షకులు లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్ధం చేసుకోగలిగారు.
బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది, 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖయిదా విసిరిన పంజా దెబ్బకు అమెరికా గడగడ లాడిన తరువాతనే జరగడం గమనార్హం. తమ పోరు ఉగ్రవాదం మీదనే కాని ఒక మతం మీద కాదన్న పద్ధతిలో అమెరికన్ ఓటర్లు తీర్పు ఇచ్చినట్టు అప్పట్లో పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. అధ్యక్ష ఎన్నికకు ముందూ, ఆ తరువాతా ‘నేను క్రైస్తవుడినే’ అని బరాక్ హుస్సేన్ ఒబామా బహిరంగంగా ప్రకటించుకున్నప్పటికీ, ముస్లింగా ధ్వనించే తన పేరును మాత్రం మార్చుకోలేదు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత చేసిన తొలి విదేశీ పర్యటనలో మసీదులోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో వివాదాస్పదమయింది కూడా. అయినా ఒబామా విశ్వ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఇక, అమెరికన్ల ప్రతీకారేచ్ఛకు బలయిన ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్ లో కడునిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదరపోషణార్ధం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టాడు. అక్కడినుంచి అతడు పట్టింది బంగారమయింది. సౌదీ రాజ్య కుటుంబీకులతో ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధాలు అతడి స్తితి గతుల్ని పూర్తిగా మార్చివేశాయి. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తాడు.
సౌదీ అరేబియాలో దాదాపు ఎనభయ్ శాతం రహదారులను మహమ్మద్ కంపెనీయే నిర్మించింది. అతడికి అనేకమంది భార్యలు. పదో భార్య సిరియన్ దేశీయురాలు. ఆమెకు జన్మించినవాడే ఒసామా బిన్ లాడెన్. మహమ్మద్ సంతానం 52 మందిలో ఒసామా 17వ వాడు. ఆరడుగులు ఎత్తు. అయినా మనిషి బక్క పలచన. సంపన్న కుటుంబంలో పుట్టి విలాసాలకు అలవాటుపడాల్సిన ఒసామా మనసు మతం వైపు మళ్ళింది. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా తన భూభాగంలో అమెరికా మిలిటరీ స్తావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం అనుమతించడాన్ని ఒసామా జీర్ణించుకోలేక పోయాడు. ఆ సందర్భంలో అతడు చేసిన విమర్శలను ప్రభుత్వం తప్పుపట్టింది. ఒసామా పౌర సత్వాన్ని, పాస్ పోర్ట్ ను రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం ఒసామాను తమ నుంచి వెలి వేసింది. దరిమిలా అల్ ఖయిదాకు అనేక దేశాల్లో బలమయిన స్తావరాలు ఏర్పాటుచేసే కృషిని కొనసాగించిన ఒసామా మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద ఉగ్రవాదిగా గుర్తింపు పొందాడు. అల్ ఖయిదా పేరు చెబితే పాశ్చాత్య దేశాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేసాడు.
ధనరాశుల నడుమ జన్మించి, సంపదలతో వచ్చే సుఖాలనన్నిటినీ కాలదన్నుకుని, కొండలు, గుట్టల్లో జీవనాన్ని ఎన్నుకుని, నిరంతర పోరాటాలతో కాలం గడిపిన ఆయన తీరు ఎంతోమందిని ఆయన వైపు నడిపించింది. చేస్తున్నది తప్పా వొప్పా అన్న విచక్షణ నుంచి వారిని దూరం చేసింది.
‘కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.
‘మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం.
మతాన్ని రక్షించడం అంటే పర మతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకుంటున్నా, మత ఛాందసులు పట్టించుకోలేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం.
పవిత్ర యుద్ధం పేరుతొ సంవత్సరాల తరబడి సాగించిన పోరాటంలో ఒసామా బిన్ లాడెన్ చివరకు తన ప్రాణాలనే తర్పణంగా విడవాల్సివచ్చింది. కళ్లుచెదిరే సంపద కలిగిన కలవారి కుటుంబంలో పుట్టి కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొండకోనల్లో దుర్భర జీవితం గడిపిన అనుభవం ఒసామాది. నిరుపేద కుటుంబంలో పుట్టి అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు కాగలిగిన అదృష్టం ఒబామాది. తరాలకు పూర్వం మత మూలాలు ఒక్కటే అయినా, వేర్వేరు మతాలకు ప్రతినిధులుగా వీరిద్దరూ పోరుబాటలో పయనించిన తీరు విధి వైపరీత్యానికి పరాకాష్ట.
ఒసామా తర్వాత ఆల్ ఖాయిదా పగ్గాలు చేపట్టిన ఆల్ జవహారీ కూడా తన నాయకుడు లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం.
ఉగ్రదాడిలో దాదాపు ఊడు వేలమంది అమెరికన్ పౌరుల మరణానికి కారణమైన వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగై పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.
2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని దానితో డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.
అత్తా పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, 1968 సెప్టెంబర్ లోనే పుట్టిన అత్తాకు బహుశా తెలిసుండదు.
అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.
కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.
అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.
1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విదిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు కావడం గమనార్హం.
(ఇంకా వుంది)
1 కామెంట్:
"మతాన్ని రక్షించడం అంటే పర మతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకుంటున్నా, మత ఛాందసులు పట్టించుకోలేదు."
Well said but who will listen? People will be pawns in the hands of vested interests and it will never change.
కామెంట్ను పోస్ట్ చేయండి