8, మే 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (160) – భండారు శ్రీనివాసరావు

 హమే తుమ్సే ప్యార్ కిత్ నా......

“ఇంకా ఏమన్నా మనసులో వుంటే చెప్పండి. భగవంతుడు దయ వల్ల మాకు ఏ లోటు లేదు” అన్నారు శ్రీ వాస్తవ్ గారు మా ఆవిడా నేనూ అడగడానికి మొహమాటపడుతూ మొహాలు చూసుకుంటూ వుంటే.

“ఏం లేదండీ! పెళ్లి వీలైనంత సింపుల్ గా జరపాలని మా వారి కోరిక. లాంఛనాలు ఏవీ వద్దు.  మాది గుళ్ళో పెళ్లి. అంచేత పిల్లల పెళ్ళిళ్ళకు ఆర్భాటాలు ఎందుకు అని ఆయన ఆలోచన. మీకీ విషయం చెప్పమని నాతో చెప్పారు’ అంది మా ఆవిడ.

‘ఆ ఒక్కటీ తప్ప అన్నట్టు ఆయన మొహం చూడగానే అర్ధం అయింది.

‘నాకు ఒక్కతే అమ్మాయి, ఒక్కడే అబ్బాయి. వీలైనంత ఘనంగా చేయాలని కోరిక. పోనీ ఒక పని చేద్దాం. ముహూర్తాలు చూసుకుని ఇక్కడే, హైదరాబాదులో  ఒక మంచి కళ్యాణ మంటపంలో పెళ్లి చేద్దాం. కావాలంటే నేను రిసెప్షన్ రాంచీలో పెట్టుకుంటాను. మంచి మంటపం చూద్దాం పదండి’ అన్నారాయన.

మా అత్తామామలకు కూడా మా ఆవిడ ఒక్కతే అమ్మాయి. పైగా మగపిల్లలు కూడా లేరు. పాతికేళ్ళ క్రితం నేను మా మామగారితో చేసిన మాటల యుద్ధం గుర్తుకు వచ్చింది. పెళ్లి వద్దు, పెళ్ళాం కావాలి అంటూ నేను పెళ్ళిళ్ళ మీద చేసిన పోరాటం జ్ఞాపకం వచ్చింది. దానివల్ల సాధించింది ఏమిటే అందరి కళ్ళల్లో కన్నీళ్లు తప్ప.  అంచేత, ఆయన మాటలకు నేను ఏమీ జవాబు చెప్పకుండా క్లుప్తంగా సరే అన్నాను.   

ఆ రోజుల్లో ఇన్నిరకాల  పెళ్లి మంటపాలు, పెళ్లి రిసార్టులు  లేవు. శ్రీధర్ ఫంక్షన్ ప్యాలెస్ లో చేస్తే గొప్ప అనుకునే రోజులు. అలా అయిదారు ఫంక్షన్ హాల్స్ చూశాము. ఆయనకు ఏదీ నచ్చినట్టు లేదు. తిరిగి వస్తూ సత్యసాయి కళ్యాణ మంటపం (నిగమాగమం) లోకి వెళ్ళాము. ఆ హాలూ అదీ చూడగానే ఆయనకు తెగ నచ్చేసింది. ఎంతగా నచ్చింది అంటే,  అందులో ఖాళీ వున్న రోజునే ముహూర్తం పెట్టుకుందాం అనేంతగా.

శ్రీ వాస్తవ్ గారిది ప్రతిదీ ఒక స్థాయిలో వుండాలి అనే మనస్తత్వం. చాలా ఏళ్ళు జర్మనీలో వుండివచ్చారు. సూటూ బూటూ టై లేకుండా ఆయన్ని చూసినవారు తక్కువ. ఐ డోంట్ వాంట్ నెంబర్ వన్. ఐ వాంట్ ఏ వన్ అనే వారు.

1999 నవంబరు 29 అర్ధరాత్రి సందీప్ పెళ్లి. సత్యసాయి కళ్యాణ మండపంలో. ఆ రోజుల్లో హైదరాబాదులో ఆ మండపం కాసింత ఖరీదు వ్యవహారమైనా, శ్రీ వాస్తవ్ దాన్ని ముచ్చటపడి ఎంపిక చేసుకున్నారు.  పెళ్ళికి ఒక రోజు ముందే శ్రీ వాస్తవ్ గారు, ఆయన భార్య ఇందూ శ్రీ వాస్తవ్ వారి సమీప బంధువులు చాలామంది  రాంచీ నుంచి తరలి వచ్చారు. కొందరికి హోటళ్ళలో బస ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యులైన ఆడపెళ్ళివారికి మా మేనకోడలు విజయ భర్త జీవీఆర్ రవిగారు, శ్రీనగర్ కాలనీలో, నిగమాగమానికి నడక దూరంలో కొద్ది రోజుల క్రితమే  కొనుక్కుని, గృహప్రవేశం కూడా చేయని కొత్త ఫ్లాటును విడిదిగా ఇచ్చారు.

ఈ పెళ్ళికోసం , మా ఆవిడకు ఆప్త మిత్రురాలు,  మా పొరుగింటి అరుణ, ఆవిడ భర్త  శేఖర రెడ్డి దంపతులు ( ఇప్పుడు నేషనల్ స్టార్ గా వెలిగిపోతున్న పుష్ప ఫేం, అల్లు అర్జున్  వీరి అల్లుడే) మూడు రోజులపాటు తమ ఖరీదైన కారును డ్రైవర్ తో సహా  మా అధీనంలో ఉంచారు. మా తరపున అయ్యే ఖర్చులకోసం ఆఫీసులో పీ ఎఫ్ లోన్  లోన్ తీసుకున్నాను. ఆ రోజుల్లో ఆఫీసులో నా హవా అలా వుండేది. కరెంటు బిల్లు కట్టడం కోసం పీ ఎఫ్ లోన్ కు అప్లయి  చేసినా కూడా మారుమాట్లాడకుండా శాంక్షన్ చేసేవాళ్ళు.

అమీర్ పేటలోని శైలి అపార్ట్ మెంటు నుంచి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వరకు పెళ్లి బారాత్ సాగింది. అదీ మాకు కొత్తే. ఇలాంటి పోకడలకు అలవాటుపడిన ప్రాణాలు కావు.  సందీప్ స్నేహితులు పవన్, సుధీర్, సుధాకర్, రాజశేఖర్, కృష్ణ, శేషిరెడ్డి, కోటిరెడ్డి, మా చిన్న వాడు సంతోష్  దారిపొడుగునా నృత్యాలు చేస్తూ మంచి ఉత్సాహం కలిగించారు. శ్రీ వాస్తవ్ గారి కోరిక మేరకు సికిందరాబాదు నుంచి మిలిటరీ బ్యాండు ఏర్పాటు చేశాను. చేతిలో డబ్బులు వుండేవి కాదు కానీ, బాగా డబ్బులు వున్నవాళ్ళు కూడా చేయలేని పనులు సునాయాసంగా నోటిమాటతో  చేయగలిగిన రోజులవి.

ఆ రోజు ఉదయం కళ్యాణ మండపంలోనే ఉపనయనం. ఆ ఏసీ హాల్లో హోమం చేయడానికి నిబంధనలు అడ్డం వచ్చి, బయట కారిడార్లోనే ఆ కార్యక్రమం పూర్తిచేసాము. అదే ఇబ్బంది పెళ్ళికి కూడా ఎదురయింది. (ఇప్పుడు ఆ నిబంధనలను సడలించినట్టున్నారు)  సాంప్రదాయ బద్ధంగా కన్యాదానం చేయాలనుకున్న శ్రీవాస్తవ్ దంపతులు లోపల రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకుని బయట ఆవరణలో అప్పటికప్పుడు షామియానాలు వేయించి, కుర్చీలు తెప్పించి మరో పెళ్లి ఖర్చు మీద వేసుకున్నారు.

బెజవాడ నుంచి ఈ పెళ్ళికి వచ్చిన మా హనుమంతరావు బావ గారు  పెళ్లి జరిగే వేదికకు దగ్గరలో కుర్చీ వేయించుకుని,  ఇటు దక్షిణాది పద్దతిలో, అటు ఉత్తరాది విధానంలో ఏకకాలంలో తెల్లవారుఝాము దాకా కొనసాగిన వివాహ క్రతువును ఆ సాంతం శ్రద్ధగా చూసారు. రాంచీ నుంచి వచ్చిన మహిళా పురోహితురాలు తాను చదువుతున్న ప్రతి మంత్రానికి అర్ధ తాత్పర్యాలను వివరించి చెప్పడం హనుమంతరావు బావగారిని ఆకర్షించింది. పెళ్లిని ఒక తంతులాగా ముగించడం కాకుండా ఆ క్రతువును నిష్టతో నిర్వహించడం చూసి ఆయన ఆ మహిళా పురోహితురాలిని మెచ్చుకున్నారు కూడా.

నా హిందీ అంతంత మాత్రం. హిందీ సినిమాలకు వెళ్ళినప్పుడు హాల్లో అందరూ పాప్ కార్న్ తింటుంటే నేను మాత్రం మా ఆవిడ మెదడు కొరుక్కుని తింటుండేవాడిని, ఆ హీరో ఏమన్నాడు? ఆ హీరోయిన్ ఎందుకలా ఏడుస్తోంది? అని అడ్డమైన ప్రశ్నలు వేస్తూ.

ఇప్పుడు హఠాత్తుగా ఈ హిందీ ప్రస్తావన దేనికంటే...

అంతకుముందు రోజు అంటే నవంబరు 28 న రవి గారి అపార్ట్ మెంటు ‘డోఎన్’ లో మెహందీ కార్యక్రమం. అప్పటిదాకా ఇలాంటి తంతులు ఎరగని వాళ్ళం కనుక మెహందీలో చిన్నాపెద్దా అందరూ సరదాగా పాటలు పాడడం చూసి ఎంతో సంబరపడ్డాము.

అదిగో అప్పుడు పెళ్లి కుమారుడు సందీప్ గోడనానుకుని నిలబడి, క్రీగంట పెళ్లి కుమార్తె భావనను చూస్తూ పాడిన పాటే ఇది. “హమే తుమ్సే ప్యార్ కిత్ నా......”

అర్ధం నాకంతగా బోధపడలేదు కాని, రాంచీ నుంచి వచ్చిన పెళ్లి వారందరూ తెగ మెచ్చుకున్నారు. ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మర్నాడు కాక ఆ మర్నాడు (డిసెంబరు ఒకటిన ) బేగంపేటలోని ఎయిర్ పోర్టు దగ్గరలోని ఒక హోటల్లో జరిగిన మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి కుమారుడు రాజేష్, ప్రియల పెళ్ళికి కూడా హాజరయి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళడం భండారు కుటుంబానికి ఒక మరపురాని తీయటి జ్ఞాపకం.

 

పైన పేర్కొన్న ఆ హిందీ పాటకి గూగులమ్మ లింకు:

https://www.youtube.com/watch?v=iJllh7l-D3g

 

కింది ఫోటోలు  



పెళ్ళికి హాజరై నూతన దంపతులను అభినందించి, ఆశీర్వదించిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు


ఇప్పుడు అంతటి వ్యవధానం ఉండకపోవచ్చు కానీ, ఇరవై ఆరేళ్ల క్రితం జరిగిన ఈ పెళ్ళికోసం రాంచీ నుంచి వచ్చిన ఆడపెళ్లివారితో తీరికగా  ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.


ఒకప్పుడు మా పొరుగింటి ఆవిడ, ఇప్పుడు హీరో అల్లు అర్జున్ అత్తగారు, మా ఆవిడ ప్రాణ స్నేహితురాలు అరుణ గారితో  మా ఆవిడ నిర్మల


నిబంధనల మేరకు అప్పటికప్పుడు సత్యసాయి నిగమాగమం ఆరుబయట  పెళ్లి మంటపం వేయించి,  అందులో కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్న శ్రీ వాస్తవ్ దంపతులు 







(ఇంకావుంది)

 

కామెంట్‌లు లేవు: