ప్రపంచం చేసిన ప్రపంచయుద్ధం
రెండో
ప్రపంచయుద్ధం ముగియడానికి కేవలం ఇరవై ఆరు రోజుల ముందు నేను ఈ భూమి మీద పడ్డాను. ఆ యుద్ధం
గురించి కళ్ళారా చూసిన వాళ్ళు కానీ,
చెవులారా విన్న వాళ్ళు కానీ ఇప్పుడు వుండి వుంటే వారి సంఖ్య చాలా తక్కువగా
వుంటుంది.
ఇది
ఇప్పుడు ఎందుకంటే వర్తమాన తరం యుద్ధం కాని మరో ప్రపంచయుద్ధాన్ని కనులారా
వీక్షించింది. ఆ యుద్ధపు తాలూకు అనుభవాలు ఈ తరంవారి మనసులో ఇంకా పచ్చిగానే
వున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం ముగిసి మూడు నాలుగేళ్లే అయింది. ఇది ఒక దేశం మరో
దేశంపై సాగించిన యుద్ధం కాదు. ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై ఒక మహమ్మారిపై జరిపిన
సంగ్రామం. ఈ యుద్ధంలో వాడిన ఆయుధాలు బాంబులు, తుపాకులు కాదు. అకుంఠిత దీక్షతో, నిర్విరామంగా ప్రాణాలకు తెగించి అచిరకాలంలోనే కనుగొన్న
కొన్ని వాక్సిన్లు,కనీవినీ ఎరుగని సంక్షోభ కాలంలో యావత్ మానవాళి
ప్రదర్శించిన ఐక్యత. రేపు అనేది వుంటుందా వుండదా అని కంటి మీద కునుకు లేకుండా
గడిపిన జనాలకు ఒక్క రేపేమిటి, యుద్ద్ధం ముగిసి మూడేళ్లు గడిచాయి.
ఆ
సంక్లిష్ట సమయంలో సాంఘిక మాధ్యమాలలో కానవచ్చిన ఒక పోస్టు నాకు బాగా జ్ఞాపకం వుంది.
‘అతడు
తన తెలివితేటలతో ఎంత సంపాదించాడు అంటే ఆ డబ్బుతో మొత్తం నగరాన్నే కొనగలనని
మిత్రులతో చెప్పేవాడు. చివరకు కరోనా బారిన పడి, ఆక్సిజన్ కొనుక్కోలేక చనిపోయాడు’
అదేమిటో
చిత్రం. కరోనా రక్కసి కోరలకు చిక్కి రోజుల
వ్యవధిలో చనిపోయిన వారు వున్నారు. ఆసుపత్రులలో రోజుల తరబడి క్వారంటైన్ లో
బిక్కుబిక్కుమంటూ గడిపి బతికి బయట పడిన వారూ వున్నారు. ఖరీదైన హాస్పిటల్స్ లో చేరి విగత జీవులు అయిన వారున్నారు. చేరడానికి
జనం సంకోచించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతిలేక చేరి, బతికి బట్టకట్టిన వారున్నారు.
కీడులో మేలులా, కరోనా కొంత మంచి కూడా చేసింది.
మునుపు సర్కారు దవాఖానా అంటే జనంలో చిన్న చూపు. కరోనా బాధితులను ప్రైవేటు/
కార్పొరేటు ఆసుపత్రులు చేస్తున్న లూటీ గురించి తెలుసుకున్న ప్రజల దృష్టి ప్రభుత్వ
హాస్పిటల్స్ మీద పడింది. ఈ విషయంలో విశేష సేవ చేసిన ఆసుపత్రులలో హైదరాబాదులోని గాంధి ఆస్పత్రి ఒకటి.
నా కాలేజ్ మేట్ ఒకరు ఫోను చేశాడు. ఉమ్మడి రాష్ట్ర
సచివాలయంలో చాలా పెద్ద పదవిలోనే, అడిషినల్ సెక్రెటరి హోదాలో రిటైర్ అయ్యాడు. కానీ
వస్తుతః నిదానస్తుడు, నిగర్వి, పదవిని
అడ్డం పెట్టుకుని అడ్డదారులు తొక్కని వాడు. పైగా ఆధ్యాత్మిక భావాలు, దైవ
భక్తీ, పాపభీతి.
ఇలాంటి వాడికి కరోనా కష్టం వచ్చి పడింది. రెండో అబ్బాయి రామచంద్రన్
(ఇతడు ఒకప్పటి మద్రాసులో పుట్టాడు, దానితో స్కూలు రిజిస్టరులో పేరు అలా
పడింది)కు కరోనా పాజిటివ్ అనగానే మనవాడి
గుండె జారిపోయింది. దానికి ప్రధాన కారణం కరోనా అయితే రెండో కారణం కొడుకు
పుట్టుకతోనే బధిరుడు. ఇలాంటి వాడు ఆసుపత్రిలో ఒంటరిగా ఎలా ఉండగలుగుతారు అనేది నా
స్నేహితుడి బెంగ. గాంధి ఆసుపత్రిలో చేర్చి నాకు ఫోను చేశాడు. కానీ నేనూ అతడి
పడవలోనే ప్రయాణిస్తున్నాను. రిటైర్ అయి దశాబ్దాలు గడిచాయి. చేయగలిగింది ఒక్కటే
మంత్రి కేటీఆర్
గారికి,
గాంధీ ఆసుపత్రిలో
కోవిడ్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి గారికి వాట్సప్ లో అభ్యర్ధనలు
పంపాను. పర్వాలేదు అన్నట్టుగా ఇద్దరి నుంచి తిరుగు సందేశం వచ్చింది.
పేషెంటుకు వినికిడి సమస్య వుంది కాబట్టి ప్రత్యేక గది కన్నా క్యూబికల్స్ లో వుంటే
మంచిది అని డాక్టరు ప్రభాకరరెడ్డి గారు అన్నారు. అదే మంచిదయింది. ఆసుపత్రిలొ
వున్నన్ని రోజులు రోగిని కనిపెట్టి చూసుకున్నారు. ప్రతిరోజూ పరిశుభ్రమైన, పౌష్టిక
ఆహారం అందించేవారు. సిబ్బంది సైతం చాలా సేవాభావంతో పనిచేసేవారని ఆ అబ్బాయి
ఫోనులో చెబుతుంటే, ఇంకా
నయం వేరే కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్పించక పోవడం మంచిదయిందని తండ్రి
సంతోషపడ్డాడు.
మొత్తం మీద నెగెటివ్ అనిపించుకుని అతడు
డిశ్చార్జ్ అయ్యాడు. ప్రభుత్వ ఆసుపత్రులపై తనకు మంచి అభిప్రాయం లేదనీ, కానీ
ఇప్పుడా దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయిందనీ ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో
చెప్పాడు.
అదే ఆసుపత్రిలో నా మేనత్త మనుమడు మురళి చేరాడు. అతడి దురదృష్టం కరోనా అతడిని
కబళించింది. అలాగే నా ముద్దుల మేనల్లుడు కొలనరావు. కరోనా బారిన పడకూడదని వాడు
తీసుకోని జాగ్రత్తలు లేవు. అయినా అది వాడిని వదిలిపెట్టలేదు. బతికించుకోవడానికి చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు.
మా మొత్తం కుటుంబాన్ని కలచివేసిన మరణాలు ఇవి.
కొన్ని
కుటుంబాలు మొత్తం కరోనా చేతికి చిక్కుకున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో ఆసుపత్రిలో.
అక్కడ చోటు దొరకని వాళ్ళు ఇళ్ళల్లో ఒంటరిగా. హాస్పిటల్ లో వాళ్ళు ఇళ్లకు రాలేరు.
ఇళ్ళల్లో వాళ్ళు అక్కడికి పోలేరు. ఎక్కడివాళ్లు అక్కడే ఒంటరిగా భయంతో బాధతో.
మాట్లాడడానికి తోడు వుండరు. హాస్పిటల్ వార్డుల్లో వారికి మొబైల్స్ వుండవు. ఎవరు
ఎలా వున్నారో కనుక్కునే వీలు లేదు. జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని భయంకరమైన వాతావరణం. ఆసుపత్రిలో చనిపోతే అటునుంచి అటే మునిసిపాలిటీ
ఏర్పాటు చేసిన వాహనంలో కాటికి తరలించేవాళ్లు. అంత్యక్రియలకు నలుగురినే
అనుమతించేవారు. అది కూడా పీపీయీ కిట్లు
ధరించి వస్తేనే. శాస్త్రీయంగా అంత్యక్రియలు జరిపించే వీలే లేదు.
మురళి
చనిపోయినప్పుడు వాడి కుమారుడు తేజ
శ్రీనివాస్ తండ్రి మరణానికి చింతిస్తూ ఇలా రాశాడు. అప్పటి పరిస్థితికి ఇది అడ్డం
పడుతుంది.
“పరిగెడుతున్నాం,
ఇంట్లో
వున్ననలుగురం చేతిలో చెయ్యేసి పరిగెడుతున్నాం..
అదేమీ
పందెమూ కాదు
మాకేమి
లక్ష్యమూ లేదు
కానీ
పరిగెడుతున్నాం, పరిగెడుతూనే వున్నాం.
ఇంతలో
కంటికి కనపడని ఏదో తాడు
మా
నలుగురి కాళ్ళకి తట్టుకుంది.
మేం
ముగ్గురం పడి లేచాం,
కానీ
నాన్నే బోర్లాపడి దొర్లుతున్నాడు..
కాళ్లల్లో
శక్తి లేదేమో, మాలా లేవలేకపోయాడు!
తిప్పలు
పడ్డాడు,
శాయశక్తుల
ప్రయత్నించాడు,
అతని
ప్రాణం పెట్టి ప్రయత్నించాడు,
కుదర్లేదు!
ఒక్కసారిగా
కూలపడిపోయాడు..
నా
చేతిలోనే కాలిపోయాడు..!
"మళ్ళి
వెనక్కి రావాలంటూ" ఒట్టు వేయించుకొని,
అంబులెన్స్
ఎక్కించిందే నాన్న తాలూకు ఆఖరి జ్ఞాపకం!
“పండగకో, పరామర్శకో తిరిగి రాడానికి,
నాన్న
అత్తగారింటికి వెళ్లలేదే,
అదేదో
నిండు శూన్యానికి వెళ్ళాడు!
అమ్మ
పలకరింపుకి కూడా అందని
దూరానికి
చేరాడు!”
కింది
ఫోటోలు:
కోవిడ్
టీకా వేయించుకుంటున్న నా మేనల్లుడు కొలనరావు, మరో మేనల్లుడు పర్చా మురళి
(ఇంకా
వుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి