దేవుడికి ఇచ్చిన మాట
అసాధ్యం అనుకున్న కరోనా కోరల నుంచి తనని తాను కాపాడుకున్న మా రెండో వాడు సంతోష్, నిరుడు 2024 ఫిబ్రవరి నాలుగో తేదీన నా నెత్తిన ఒక బండ వేసి, మూడంటే మూడు రోజుల్లో దాటిపోయాడు.
ఆసుపత్రిలో చేర్చినప్పుడు 'నాన్నకు తెలియనివ్వకు, అనవసరంగా కంగారు పడతాడు' అని భార్యకు చెప్పాడట. మరునాడు విషమించడంతో చెప్పక తప్పలేదు. ఆ సాయంత్రం వెళ్లి చూశాను. ముక్కుకు, నోటికి అన్నీ బంధనాలు. కళ్ళు నా వైపే చూస్తున్నాయి. నేను ఏమీ అడగలేను, వాడు ఏమీ చెప్పలేడు. డాక్టర్లు రేపటికల్లా పరిస్థితి బాగుంటుంది అన్నారు షరామామూలుగా.
ఆ ధైర్యంతో ఇంటికి చేరాను. మర్నాడు ఉదయమే ఫోను, 'అందరూ వచ్చేసేయండి’ అని. అందరం ఎందుకు? అందులోనే వుంది. అర్ధం చేసుకోవాలి అంతే!
అప్పుడే మనసు శంకించింది. అలాంటి సమయంలోనే నాలాంటి వాళ్లకి దేవుడు గుర్తొస్తాడు. వచ్చాడు.
మనసులోనే అనుకున్నాను. చెట్టంత కొడుకు, ఈ వయసులో నాకు కొండంత అండగా వున్నాడు. వాడు కోలుకుని ఇంటికి క్షేమంగా ఇంటికి వస్తే, నీ కొండకి వచ్చి తలనీలాలు ఇస్తాను అని. దేవుడికి నా మాట సరిగా వినబడినట్టు లేదు. వెళ్ళే సరికి చుట్టపక్కాలు, సంతోష్ స్నేహితులు అందరూ అక్కడే వున్నారు. అంటే చిట్టచివర్లో తెలిసింది నాకే అన్నమాట. నా గుండె తట్టుకుంటుందో లేదో అని మా వాళ్ళ భయం. కానీ నా గుండె రాతితో చేసింది అని వాళ్లకు తెలియదు.
అయిదేళ్ళ క్రితమే ఇదే ఆసుపత్రిలో మా ఆవిడని అంబులెన్స్ లో నా కళ్ళ ముందే అలా లోపలకు తీసుకు వెళ్ళారు. ఓపీ లోనే చెప్పేశారు, బ్రాట్ డెడ్ అని. కాకపొతే ఆ మాట చెప్పడానికి గంట వ్యవధానం తీసుకున్నారు. చావు కబురు నిదానంగా చెప్పాలని అనుకున్నారేమో.
నేను ఐ సి యు లోకి వెళ్ళేసరికే మొహానికి, వంటికి పెట్టిన పరికరాలు, మాస్కులు, ట్యూబులు తొలగిస్తున్నారు. వాడేమో ఒళ్ళు ఎరుగని విధంగా నిద్రపోతున్నట్టు పడివున్నాడు, మంచం మీద. నలభయ్ ఏడేళ్ల జీవితానికి తెర పడిపోయింది. నిషా బలవంతాన కళ్ళ నీళ్ళు ఆపుకుంటూ, ఏవో కాగితాల మీద సంతకాలు పెడుతోంది. నా బాధ ఆ అమ్మాయి వైపు తిరిగింది. పోయిన కొడుకు పోయాడు. రెండేళ్ల పిల్లతో ఆమె జీవితం ఎలా గడవాలి? ఆ క్షోభ ముందు నాదెంత! నలుసంత.
కొండకు పోకుండానే, తలకొరివి పెట్టిన తండ్రిగా వాడి కర్మకాండలకోసం వారం రోజుల్లోనే శిరోముండనం చేయించుకోవాల్సివచ్చింది. మనం ఒకటి తలిస్తే, దైవం వేరేగా తలుస్తాడు అంటారు కదా!
హూణ మాసికం
ప్రేత సంబంధ కర్మలు అయినా, యాగ సంబంధ క్రతువులు అయినా నమ్మకం ప్రధానం అనేది నా నమ్మకం. నా తల కొరివి పెట్టాల్సిన వాడికి నేనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి నాకు ప్రాప్తించినప్పుడు, నా మనసు నా మనసులో లేదు. ఏదో కలలో జరుగుతున్న విధంగా అన్నీ సశాస్త్రీయంగా జరిగిపోయాయి, నా అన్నగారు భండారు రామచంద్ర రావు గారి పర్యవేక్షణలో.
ఆనాడు శ్రాద్ధకర్మలకు నేతృత్వం వహించింది వసిష్టుల వారు శ్రీ సి.హెచ్. యు.ఎస్. ప్రసాద శర్మ గారు. వాటిల్లో భాగంగా నా చేత అనేక దానాలు చేయించారు. మరణించిన మనిషి తాలూకు జీవి సంవత్సరం పాటు వేలాది మైళ్ళు ప్రయాణిస్తుందని, ఆ ప్రయాణంలో జీవుడు అనేక రకాల ఈతి బాధలకు గురవుతాడని, ఎర్రటి ఎండల్లో, వానల్లో, దుర్గమ, కంటక మార్గాల్లో ఆ ప్రయాణం సాగుతుందని, ఉపశమనంగా ఉండడానికి గొడుగు, పాదరక్షలు, వంట దినుసులు, కాయగూరలు, వంట పాత్రలు, నీళ్ళ పాత్ర, చెంబు వగైరాలు దానాలుగా ఇప్పించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ముఖ్యంగా 45 వరోజున ( త్రిపక్షం), 171 వ రోజున జీవుడు మరింత శ్రమకు గురవుతాడు. అంచేత ఈ రోజుల్లో కూడా తప్పనిసరిగా మాసికాలు పెట్టాలి.
జీవించి వున్న వారికి ఒక మాసం మరణించినవారికి ఒక రోజుతో సమానం కనుక నెలకోసారి మాసికం పెట్టి పిండ ప్రదానం చేస్తే, వారికి ప్రతిరోజూ భోజనం పెట్టినట్టు అవుతుందని ఓ నమ్మకం. ఇలా పన్నెండు నెలలు గడిచిన తర్వాత ఏడాది చివర్లో పెట్టే హూణ మాసికం, సాంవత్సరీకం, ఆబ్దీకంతో ఈ కర్మకాండ పూర్తవుతుంది. జీవుడి పాప పుణ్యాల ప్రాతిపదికన పునర్జన్మ, లేదా స్వర్గ, నరక లోక ప్రాప్తి నిర్ధారణ అవుతుంది.
ఈ విషయాలు అన్నీ శర్మగారు సవిస్తరంగా నాకు అప్పుడే తెలిపారు.
కానీ అప్పుడు నా గుండె, మనసు, శరీరం అన్నీ ఘనీభవించి వున్నాయి.
ముందే చెప్పినట్టు అంతా నమ్మకం.
చనిపోయింది స్వయంగా నా కుమారుడు. నా ఇహలోక ప్రయాణం సజావుగా సాగడానికి వాడు బతికి వున్నప్పుడు ఎన్నో ఎన్నో చేశాడు. పై లోక ప్రయాణంలో వాడికి ఇబ్బందులు రావు అని చెబుతున్నప్పుడు నమ్మకంగా పాటించక తప్పదు. అదే చేశాను.
వాతావరణంలో మార్పు కోసం ఓ రెండు నెలలు మా పెద్దవాడు వుంటున్న అమెరికా వెళ్లాను. అమెరికా కొత్తకాదు. అక్కడకి అనేక సార్లు వెళ్లాను. అప్పుడు నా భార్య తోడుగా వుండేది. ఈ సారి అమెరికా ప్రయాణం, మొదటి రోజే నా రెండో కుమారుడు సంతోష్ మాసికంతో మొదలయింది.
నాకు తోడుగా వచ్చిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి కుమారుడు లాల్ బహదూర్, కోడలు, మేనకోడలు దీపతో కలిసి, 2024 జులై 28 ఆదివారం ఉదయం వాషింగ్టన్ డి సి విమానాశ్రయం చేరుకున్నాను. మొత్తం ప్రయాణంలో వాళ్ళు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. చిన్న లగేజ్ కూడా ముట్టుకోనివ్వ లేదు. అదృష్టం నా మొబైల్ ను మాత్రం నా చేత్తో పట్టుకోనిచ్చారు.
నన్ను సియాటిల్ తీసుకు వెళ్ళడానికి మా పెద్దవాడు వాషింగ్టన్ డి సి కి వచ్చాడు.
ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగానే బిలబిలమంటూ మా రెండో అన్నయ్య, మూడో అన్నయ్య పిల్లలు లోపలకు వచ్చారు. లగేజ్ తో బయటకు రాగానే నాలుగు మత్తేభాలు వంటి పెద్ద మోటారు వాహనాలు సిద్ధంగా పెట్టారు. వెళ్ళింది ముగ్గురం. రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది పది మంది.
వుడ్ స్టాక్ లో వుంటున్న మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గారి కుమారుడు సత్యసాయి, శైలజ దంపతుల ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో సంతోష్ మాసికం ప్రస్తావన వచ్చింది. ఆ వూళ్లోనే మా దగ్గరి బంధువు, నాకు స్కూల్లో క్లాస్ మేట్ వనం వరదా రావు కుమార్తె స్వప్న, అల్లుడు సుగుణాకర రావు దంపతులు చాలా కాలంగా వుంటున్నారు. అక్కడ మన వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆయనే దిక్కు.
ఫోన్ చేసి, తిథి చెబితే ఆయన పంచాంగం చూసి ఆదివారం మధ్యాహ్నం నుంచి మరునాడు సోమవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు వుందని, అంచేత ఈ రోజే పూర్తి చేయడం మంచిదని సలహా చెప్పారు. అదే వూళ్ళో వివిధ గుళ్ళలో పనిచేస్తున్న ఇద్దరు ముగ్గురు పూజారులను సంప్రదించి చివరకు సాయిబాబా గుడి పూజారిని పట్టుకున్నారు. వెంటనే నాలుగు కార్లలో బయలుదేరి దారి మధ్యలో ఒక ఇండియన్ స్టోర్ లో పూజారి గారు చెప్పిన సంభారాల జాబితా ప్రకారం కొనుక్కుని వెళ్లాం. పేరుకు బాబా గుడి కానీ సమస్త దేవతలు అక్కడ కొలువు తీరి ఉన్నారు. పూజారి గారు నెమ్మదస్తులు. ప్రశాంతచిత్తులు. సావధానంగా కార్యక్రమం ఎలాంటి హడావిడీ చేయకుండా చక్కగా పూర్తి చేసారు. దేశం కాని దేశంలో, వచ్చిన మొదటి రోజునే పని పూర్తి అయ్యేలా చూడడం ఆ పై వాడి పనే అనుకున్నాను.
ప్రతి మాసికం నాడు, ద్వితీయ పుత్ర సంతోష్ నామధేయస్య ...ప్రేత.. అనాల్సివచ్చినప్పుడు గొంతు పూడుకు పోతుంది. మనస్సు మెలికలు తిరుగుతుంది.
అక్కడ నుంచి మళ్ళీ అమెరికా పశ్చిమ దిక్కున వున్న సియాటిల్ కు సుదీర్ఘ విమాన ప్రయాణం.
అమెరికా వచ్చి అప్పుడే నెల అవుతుందా. ఎవరో తోసుకువచ్చినట్టు వచ్చింది నా రెండో పిల్లవాడి ఎనిమిదో మాసికం.
ఆ రోజు ఉదయం మా పెద్దవాడు సందీప్ నన్నూ, కోడలు భావన, మనుమరాళ్లు సఖి, సృష్టినీ తీసుకుని బొతెల్ (Bothell) లోని హిందూ టెంపుల్ కి తీసుకువెళ్ళాడు. పూజారి హేమంత్ శర్మ వయసులో చాలా చిన్నవాడు. అమెరికా వచ్చి అయిదు నెలలే అయింది. అంతకు ముందు మారిషస్ హిందూ టెంపుల్ లో నాలుగేళ్లు పనిచేశాడు. ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతం వాడు. గుడికి వెళ్ళే ముందు మిల్ క్రీక్ ప్రాంతంలో వున్న ఆయన ఇంటికి వెళ్ళాము. ఆ కాలనీ చెట్ల గుంపుల నడుమ చాలా పొందికగా వుంది. ఆయన్ను కారులో ఎక్కించుకుని గుడికి వెళ్ళాము. డ్రైవింగ్ లైసెన్స్ రాగానే కారు కొనుక్కుంటానని దారిలో చెప్పారు.
గుడిలో కార్యక్రమాన్ని చాలా నిష్టగా జరిపించారు హేమంత్ శర్మ గారు.
పదకొండేళ్ల క్రితం ఇదే దేవాలయంలో మా అమ్మగారి తద్దినం పెట్టిన విషయం జ్ఞాపకం చేసుకున్నాము.
నెల రోజుల ముందే మా వాడు పూజారితో మాట్లాడి పెట్టడం, కోడలు భావన ఒకరోజు ముందే ఇండియన్ స్టోర్ నుంచి కావాల్సిన సంభారాలు తెచ్చి సిద్ధం చేయడం ఇవన్నీ, దేశం కాని దేశంలో ఇటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరపడానికి సాయపడ్డాయి.
చూస్తుండగానే ఏడాది గడిచిపోయి, హైదరాబాదులో ఏడూడి పూర్తయిన తర్వాత, మా కోడలు నిషా నాతో మెల్లగా అంది.
‘సంతోష్ ఎప్పుడూ అంటుండేవాడు, జీవికను తిరుపతి తీసుకువెళ్లి తలనీలాలు ఇప్పించాలని, చనిపోయిన ఏడాది లోపల ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని ఎవరో చెప్పారు, ఇప్పడు వెళ్ళడానికి వీలుంటుందా’ అని.
వాడి కోరిక ఆఖరి కోరిక అవుతుందని ఆ అమ్మాయికీ తెలియదు. వాడి అంత్యసమయంలో నేనూ దేవుడ్ని ఓ కోరిక కోరాననే సంగతీ తెలియదు. నా మొక్కు గురించి, దేవుడికి ఇచ్చిన మాట గురించి అసలే తెలియదు.
దేవుడ్ని ఎన్నో కోరుకుంటాం. తీరితే పలానా మొక్కు తీరుస్తామని అంటాం. మనం కోరినవన్నీ తీరిస్తే ఇక ఆయనకు పనే వుండదు. ఆయనతో మనకూ పని వుండదు. ఆ సంగతి తెలిసిన వాడు కనుక ఆయన తన లీలలను ఒక్కోసారి కర్కశంగా చూపిస్తుంటాడు. అమ్మకు ఇచ్చిన మాట, దేవుడికి ఇచ్చిన మాట ఒక్కటే కనుక మొక్కు తీర్చడం మన విధి అనుకున్నాను.
కిందటి నెల ఏప్రిల్ లోనే తిరుపతి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. రానూ పోనూ టిక్కెట్లు కొన్నాము. హఠాత్తుగా మా కుటుంబానికి పెద్ద షాక్ . మా ఇంటి వేలుపువంటి మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి భార్య, పెద్ద వదిన సరోజినీ దేవి మరణంతో మా ప్రయాణం వాయిదా పడింది.
నాహం కర్తః హరికర్తః
మనకు దర్శనం ఇవ్వాలని స్వామికి అనిపించాలి కానీ, మనం అనుకుంటే సరిపోదని పీవీ ఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడో చెప్పారు. మా పెద్ద వదిన గారి దశదిన కర్మ పూర్తయిన తర్వాత మళ్ళీ మొన్న, మే పదమూడో తేదీన, మనుమరాలు జీవిక, కోడలు నిషా, అమెరికా నుంచి వచ్చిన మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి కుమారుడు రాజేష్ తో తిరుపతి వెళ్లి, తిరుమలలో స్వామి దర్శనంతోపాటు వరాహ స్వామి దర్శనం, పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని, కలిసి పద్నాలుగో తేదీ రాత్రికి తిరిగి హైదరాబాదు వచ్చాము.
టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు గారి చల్లని మాటతో చక్కని దర్శన భాగ్యం లభించింది. ఎక్కడా ఇబ్బంది పడకుండా శ్రీనివాస నాయుడు గారనే ఉద్యోగి ఉదయం అయిదు గంటల నుంచి, దర్శనం పూర్తయ్యే వరకు మా వెంటనే వున్నారు. గర్భ గుడిలో గడపవద్ద మా నలుగురిని నిలబెట్టి రెండు పర్యాయాలు శఠగోపం పెట్టి హారతి ఇప్పించారు. చైర్మన్ వ్యక్తిగత సహాయకుడు ప్రసన్న గారు, టీవీ 5 ఎడిటర్ విజయ్ నారాయణ్, సాంబశివరావుగార్లు మా తిరుపతి ప్రయాణం విషయంలో మరువలేని సాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు.
కింది ఫోటోలు:
2017 లో ఒకసారి మా ఆవిడ నిర్మలతో తిరుపతి వెళ్లాను. గుండు చేయించుకున్న తర్వాత మా ఆవిడతో అన్నాను, తల బరువు తగ్గిందని. చిన్నగా నవ్వింది. ‘తగ్గాల్సింది తల బరువు కాదు, తల పొగరు’ అనే భావం ఆ నవ్వులో నాకు కనపడింది.
తిరుపతి విమానాశ్రయంలో, 2025 మే పదమూడున తిరుమల టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బీ ఆర్ నాయుడు గారితో, తిరుమలలో తలనీలాలు ఇచ్చిన తర్వాత నా మనుమరాలు జీవికతో, కోడలు నిషాతో. మా అన్నయ్య కుమారుడు రాజేష్, కోడలు నిషాతో
బీ ఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా నియమితులు అయిన సందర్భంలో హైదరాబాదులో మహా న్యూస్ ఎండీ వంశీ గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ కార్యక్రమంలో నేనూ, ప్రముఖ సంపాదకులు కె. రామచంద్ర మూర్తి గారు, తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి గారు.
(ఇంకావుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి