9, మే 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (161) – భండారు శ్రీనివాసరావు

నండూరి రామమోహనరావు గారు పెట్టిన మెత్తటి తొడపాశం

1971- 2025

 

1971 లో ఇండో పాక్ యుద్ధం జరిగినప్పుడు నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. చేసేది సబ్ ఎడిటర్ ఉద్యోగమే అయినా ఆ సమయంలో నేను చేయని పని అంటూ లేదు. అప్పటికి పెళ్లి కాలేదు కాబట్టి రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేయడానికి సిద్ధంగా వుండేవాడిని. పగలు వార్తలు అనువాదం చేయడం, సాయంకాలం, రాత్రి సమయాల్లో,  పీటీఐ, యుఎన్ఐ,  పీఐబి ద్వారా భారత సైన్యం జారీచేసే అధికారిక పత్రికా ప్రకటనల ఆధారంగా సైన్యం కదలికలను తెలిపే మ్యాపులను తయారుచేయడం వగైరా  చేసేవాడిని. ఆ రోజుల్లో ఇప్పటిలా ముద్రణా సౌకర్యాలు లేవు. ఏదైనా ఫోటో ముద్రించాలి అంటే ముందు దాన్ని, ఎక్కడో గాంధీ నగర్ లో వున్న బ్లాక్ మేకింగ్ కు పంపి బ్లాక్ తయారు చేయించి  తీసుకురావాలి. ఆంధ్రప్రభ ఎడిటర్ పండితారాధ్యుల నాగేశ్వర రావు గారి కుమారుడికి ఈ బ్లాక్ మేకింగ్ దుకాణం వుండేదని జ్ఞాపకం.

ముందు సరిహద్దులలో మొదలైన సాయుధ ఘర్షణలు, సంఘర్షణలు పూర్తి యుద్హస్వరూపం తీసుకోవడానికి చాలా వ్యవధానమే పట్టింది. అసలు యుద్ధం పదమూడు రోజులు సాగింది. అధికారికంగా డిసెంబరు మూడో తేదీన మొదలై, పాకీస్తానీ సైన్యాలు లొంగిపోవడంతో డిసెంబరు పదహారో తేదీన ముగిసింది. ఈ యుద్ధ పర్యవసానమే కొత్తగా తూర్పు పాకీస్తాన్ స్థానంలో బంగ్లా దేశ్ అనే కొత్త దేశం అవతరణ.

నా జర్నలిజం తొలి రోజుల్లోఅంటే 1970 ప్రాంతాల్లో  నండూరి రామమోహన రావు గారు నన్ను సాన పట్టారు. ఆయన రూటే సపరేటు. చెప్పాల్సింది సూటిగాసుతిమెత్తగా చెబుతారు. దాంతో ఆ పాఠం జీవితాంతం గుర్తుండి పోతుంది. ఆ పాఠాల్లో ఇదొకటి.

బంగ్లాదేశ్ అవతరణ సమయంలో నాటి బంగ్లా నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ పేరు పలుసార్లు వార్తల్లో చోటు చేసుకునేది.

అప్పటికి ఇంకా తెలుగు పత్రికల్లో పేరుకు ముందు  శ్రీ అనే గౌరవ వాచకం వాడుతుండేవారు. (ఇప్పటి నాయకులు అలాంటి గౌరవానికి తగరని అనుకున్నారేమో, మరేదైనా సాంకేతిక కారణమో   తెలియదు, శ్రీ,  గారు, మిస్టర్ అనే పదాలకు ఇప్పుడు స్వస్తి చెప్పారు)

ఈ నేపధ్యంలో, అదే యుద్ధ సమయంలో  నేను ఒకసారి  వార్తను తర్జూమా చేసే పనిలో ఓ తప్పు తొక్కాను. “శ్రీ షేక్ ముజిబుర్ ” అని రాశాను. ఆ అనువాదం నండూరి వారి దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే ఒక చీటీ పంపారు. ఆ రోజుల్లో నండూరి వారి నుంచి చీటీ వచ్చింది అంటే ఓ మెమోతో సమానం. అందులో ఇలా వుంది

Sheikh itself is honorific.  Do not use sri before it.” - NR

 

మళ్ళీ ఇప్పుడు  2025 లో రెండు దేశాల నడుమ సాయుధ సంఘర్షణలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో  ఇరవై ఆరుమంది అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బలికొనడం వీటికి ప్రధాన కారణం. పాక్ జరిపిన ఈ రెచ్చగొట్టే అమానుష చర్యతో ఉభయ దేశాల సరిహద్దులో  1971 నాటి యుద్ధ వాతావరణం కానవస్తోంది.  

యుద్ధ సమయంలో సమాచార వ్యాప్తి విషయంలో 1971 నాటికి ఇప్పటికీ వున్న పెద్ద ప్లస్ పాయింటు మీడియా/ సోషల్ మీడియా. దురదృష్టం ఏమిటంటే అంతకంటే పెద్ద మైనస్ పాయింట్ ఇవే కావడం! ఒక ఆయుధం చేయలేని మారణహోమం ఒక నిరాధార,  కల్పిత వదంతి చేయగలగడమే  ఇందుకు కారణం.  

1971 యుద్ధం తుది దశలో అంటే డిసెంబరు పద్నాలుగున నేను బయలు దేరి మద్రాసు వెళ్లాను. నా కాబోయే భార్యను తీసుకుని మర్నాడు ఉదయం తిరుమల వెళ్లి, అక్కడ పెళ్లి తంతు ముగించుకుని అదే రోజు రాత్రి రైల్లో బయలుదేరి డిసెంబరు పదహారో తేదీ ఉదయానికి బెజవాడ చేరాను కొత్త కాపురం పెట్టడానికి. అక్కడ తూర్పు పాకీస్తాన్ విమోచన, బంగ్లాదేశ్ అవతరణ.   ఇక్కడ, ఎంతో కాలంగా అంతూపంతూ లేకుండా సాగుతున్న నా ప్రేమ పురాణానికి పెళ్లితో శుభం కార్డు.

బంగ్లా యుద్ధంతో నాకున్న బాదరాయణ సంబంధం ఇది.

 

కొద్ది సంవత్సరాల క్రితం,  భారత స్వాతంత్రోత్సవ అమృత ఘడియల్లో రేడియో శ్రోతలకు 1971 యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికాధికారిని  పరిచయం చేసే మహత్తర అవకాశం నాకు దక్కింది.  ఇంటర్వ్యూ లాంటి ఈ పరిచయ కార్యక్రమంలో  నాకు బాగా పరిచయం వున్న వ్యక్తినే పరిచయం చేశాను. ఆయనే బ్రిగేడియర్ ఎస్, శ్రీరాములు. ఆయన ఎవరో  కాదు, బెజవాడ ఎస్సారార్  కాలేజీలో  నా సహాధ్యాయి.

బ్రిగేడియర్ శ్రీరాములు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో జన్మించారు. విజయవాడ ఎస్సారార్ కాలేజీలో చదివారు. గ్రాడ్యుయేషన్ తరువాత సైన్యంలో అధికారిగా చేరారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన 1971 ఇండో పాక్ యుద్ధంలో భారత సైన్యం తరపున పాల్గొన్నారు. మౌంటెన్ ఆర్టిలరీ బ్రిగేడ్ కు నాయకత్వం వహిస్తూ, 2003లో పదవీ విరమణ చేశారు.

నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులు సంక్షిప్తంగా.

“మా కుటుంబంలోనే కాదు,  మా ఊరి నుంచి కూడా ఎవరూ ఆర్మీ లో చేరాలని ఆలోచించే వారు కాదు. ఐతే 1962 లో చైనా యుద్ధం జరిగే సమయానికి నేను ఉంగుటూరులో స్కూల్లో చదువుకుంటున్నాను. రక్షణనిధి చందా పోగు చేయడం కోసం స్కూలు పిల్లలని వరి పొలాల్లో కోతలకు పంపారు. మేమందరం చాల ఉత్సాహంగా కోతలు కోస్తుంటే ఓ రైతు నన్ను చూసి, 'అంత సరదాగా పని చేస్తున్నావు,  ఆర్మీలో చేరి యుద్ధం చేస్తావా ?' అని సరదాగానే అడిగారు. నా మనసులో ఆ మాట నాటుకు పోయింది. ఆ తరవాత 1965 లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగే సమాయానికి నేను విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ లో చదువుతున్నాను. ఆ సమయంలో రోజూ రేడియోలో యుద్ధం వార్తలు వింటూ ఉండేవాళ్ళం. అప్పుడు నా మనసులో ఆర్మీలో చేరాలనే ఆలోచన మరింత బలపడింది. అదే లక్ష్యంగా పెట్టుకుని డిగ్రీ చదువుతూనే ఆర్మీ సెలెక్షన్స్ కి ప్రిపేర్ అయ్యాను. 'యద్భావం తద్భవతి' అన్నట్లు డిగ్రీ అవగానే ఆర్మీ ఇంటర్వ్యూ కి వెళ్లడం, సెలెక్ట్ అవడం జరిగిపోయాయి. ఆలా లక్ష్యం, శ్రమ, అదృష్టం అన్నీ కలిసొచ్చాయి.

“అమృత మథనం కథ మనందరికీ తెలిసిందే. దేవతలూ రాక్షసులూ మేరు పర్వతాన్ని వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి సుదీర్ఘ కాలం క్షీర సాగర మథనం చేసారు. ఒకదాని తరవాత ఒకటిగా మంచి వస్తువులు, చెడ్డ వస్తువులు ఉద్భవించాయి. హాలాహలాన్ని నిర్మూలించడానికి దేవతలు శివుని సహాయం కూడా తీసుకోవలసి వచ్చింది.

“స్వతంత్ర భారతదేశ చరిత్ర కూడా అమృత మథనం లాగే సాగుతోంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాసుకి మాదిరిగా తాడులాగా పని చేసి, మథనం ఆగకుండా చూస్తూ, మంచి ఫలితాలు వస్తూనే ఉండేలా, చెడ్డ వస్తువులొస్తే వాటిని నిర్మూలించడానికి పనిచేసే ప్రమథగణాల వలె పని చేస్తున్నాయి. ఈ బ్రహ్మయజ్ఞంలో, తాడులో ఒక చిన్న పోగులా నా జీవితం సాగిపోయింది.

“అయితే, ఏ యజ్ఞానికైనా రక్షణ అవసరం. విశ్వామిత్రుడంతటి మహర్షి తన యజ్ఞానికి శ్రీ రాముల వారి సహాయం తీసుకున్నారు. అలాగే స్వతంత్ర భారత అమృత మధన యజ్ఞానికి ఇండియన్ ఆర్మీ ఎల్లకాలం రక్షణ కల్పించింది, కల్పిస్తుంది కూడా.

“విరోధి దేశాలే కాదు, దేశంలోపల కూడా చాలా దేశ విరోధ శక్తులు పని చేస్తున్నాయని అందరికీ తెలుసు. విరోధి దేశాలతో యుధ్ధాలే కాకుండా, అంతర్విరోధ శక్తులతో కూడా సైన్యం ఎన్నోసార్లు తలపడే అవసరాలొచ్చాయి.

“ఆర్మీలో చేరడం ఎలా జరిగిందో మీకు చెప్పాను. చేరిన తరువాత ట్రైనింగ్ లో కొంత వరకు ధైర్యం, స్థైర్యం, యుద్ధ విద్యలు నేర్చుకుంటాం. నా అదృష్టమేమంటే చేరిన కొన్ని నెలలలోనే యుద్ధంలో పని చేసే అవకాశం దొరికింది. పాకిస్తాన్ విమానాలు జారవిడిచే బాంబులు, గన్స్ నుంచి వెలువడే తూటాలు, అన్నీ అనుభవించాను . మొదట్లో కొంచెం భయం వేసిన మాట నిజమే. కానీ త్వరలోనే అలవాటై పోయింది. 'నా పేరు రాసి ఉన్న బులెట్ వచ్చే వరకు నాకేం కాదు' అన్న ధైర్యం ఈ రోజు వరకు నన్ను నిర్భయంగా ఉంచుతోంది.

“సైన్యంలో మాకు సపోర్ట్ ఉండేది కానీ సోల్జర్ ఫామిలీస్ కి, ముఖ్యం గా భర్తలు బోర్డర్ లో ఉన్నప్పుడు ఒంటరి గా ఉండే మహిళలకి ఏ రకమైన సపోర్ట్ ఉండేది కాదు. పైగా మా రోజుల్లో ఇళ్లల్లో టెలీఫోన్స్ లేవు, మొబైల్ ఫోన్ అప్పటికి రాలేదు. ఒక చిన్న అనుభవం చెపుతాను.

1988 లో నేను కాశ్మీర్ లో, భార్యా పిల్లలూ హైద్రాబాద్ లో ఉన్నాం. మా అబ్బాయి కి ఏడేళ్లు, అమ్మాయికి ఐదేళ్లు. ఒక రోజున మా అమ్మాయి లాల్ బజార్ దగ్గర స్కూటర్ కింద పడింది. బాగా దెబ్బలు తగిలాయి. నాకు ఈ ఆక్సిడెంట్ గురించి తెలిపే సౌకర్యం లేదు. ఇన్లాండ్ లెటర్ రాస్తే అది మా యూనిట్ చేరడానికి 20 రోజులు పట్టింది. నేను యూనిట్ నుంచి 200 కి మీ దూరంలో ఒక పర్వతం పైన డ్యూటీలో ఉన్న్నాను. సో, నాకు ఆ ఉత్తరం చేరడానికి ఇంకో 15 రోజులు పట్టింది. ఆ తరవాత లీవ్ దొరకలేదు. పాపని చూడడానికి 4 నెలల వరకు రాలేక పోయాను. ఈ రోజుకి కూడా అది గుర్తొస్తే బాధగా ఉంటుంది కానీ ఏం చేస్తాం?

“ఇలాంటి అనుభవాలు ప్రతి సైనికుడికి తప్పవు. అయితే 32 సంవత్సరాలు సేవ, సాధించిన విజయాలు, చేసిన సేవా కార్యాలు తలుచుకుంటే నాకే కాదు, నా భార్య, పిల్లలు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. సర్వీస్ లో దాదాపు 13 సంవత్సరాలు టెర్రరిస్టులని వేటాడుతూ గడిపాను. రిటైర్ అయిన రోజు గూడా ఒక టెర్రరిస్ట్ నా మీదికి ఫైర్ చేసాడు. ఆ బులెట్ మీద నా పేరు లేదు గనక నేను మీ ముందున్నాను. ఇంత సేవచేసే అవకాశం దొరకటం అదృష్టం కాదా?

“ఇది నా అమృత మంథన యాత్ర. నా ముందు, నా తరవాత భారత సైన్యం సేవ నిరంతరం సాగుతుంది, అమృతం ఉద్భవిస్తూనే ఉంటుంది”

ఆ రోజు బ్రిగేడియర్ శ్రీరాములు చెప్పినట్టే,  భారత  సైన్యం దేశం పట్ల తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే వుంది. ఈ నాడు కూడా మనందరం చూస్తూనే వున్నాం.

అలాంటి వీరులకు సాల్యూట్ చేయడం, వారు చేస్తున్న త్యాగాలకు కృతజ్ఞులుగా వుండడం ఒక్కటే మనం చేయగలిగింది.



1971 యుద్ధ విరమణ, బంగ్లాదేశ్ అవతరణకు సంబంధించిన ఒప్పంద పత్రంపై ఇండియన్ లెఫ్ట్ నెంట్ జనరల్ జగ్ జిత్ సింగ్ అరోరా, పాకీస్తాన్ ఆర్మీ తరపున ఏ.ఏ.కే. నియాజీ సంతకాలు చేశారు.


ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రంలో బ్రిగేడియర్ ఎస్. శ్రీరాములు, నేను

ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరి రామమోహన రావు గారు నాకు మెత్తగా పెట్టిన తొడపాశం







 

(ఇంకా వుంది) 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఇప్పటి ఇండియా స్థితి మిమ్మల్ని నేటి విషయాలపై రాయడానికి లాగేసింది కాబట్టి
ఇప్పటి దేశపు సమకాలీన వాతావరణం‌పై టపా వ్రాయండి