10, జనవరి 2022, సోమవారం

పాత సచివాలయం ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

 1975 లో నేను ఆకాశవాణి విలేకరిగా చేరినప్పుడు ముఖ్యమంత్రి వెంగళరావు గారు. ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిని కూడా వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఈనాటి ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే ఓ సగటు అధికారి పేషీలో  ఇంకా ఎక్కువమంది సిబ్బంది పనిచేస్తున్నారు అనేది నిజం.

ముఖ్యమంత్రి వెంగళరావురావు గారి దగ్గర పనిచేసిన వారిలో రావు సాహెబ్ కృష్ణ స్వామి గారు ఒక్కరే ఐఏఎస్ అధికారి. మిగిలిన వారందరూ ఓమోస్తరు సాధారణ  ఉద్యోగులే. ప్రకాశరావు గారు వ్యక్తిగత కార్యదర్శి. మరో ఇద్దరు పీఎలు వుండేవారు. డీఎస్పీ స్థాయి కలిగిన పోలీసు అధికారి సీతాపతి గారు సీఎం ప్రధాన భద్రతాధికారి. ఒకళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు బాడీ గార్డులు. లోకయ్య అనే నాలుగో తరగతి ఉద్యోగి ముఖ్యమంత్రికి వ్యక్తిగత సహాయకుడు. ప్రతేకంగా పీఆర్ఓ అంటూ ఎవరూ వుండేవారు కాదు. సమాచారశాఖలో పనిచేసే ఓ స్థాయి అధికారి పీ ఆర్ వొ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తూ వుండేవారు.

నాన్ ఏసీ అంబాసిడర్ కారు సీ ఎం అధికారిక వాహనం. ముందో పైలట్, వెనకో ఎస్కార్ట్ వాహనం. అంతే! సీ ఎం కాన్వాయ్.

సచివాలయంలో ఆయన కార్యాలయం కూడా చాలా చిన్నదిగా వుండేది. ఓ గదిలో ముఖ్యమంత్రి. పక్క గదిలో ఆయన సిబ్బంది. ముఖ్యమంత్రి కుర్చీతో  సహా ఓ పది పేము కుర్చీలు వుండేవి. తనను కలుసుకోవడానికి వచ్చేవారితోనే కాదు, చివరకు విలేకరులతో కూడా ఫైళ్ళు చూస్తూనే మాట్లాడుతుండేవారు. సమయపాలనకు బాగా విలువ ఇచ్చేవారు. చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పేసి, 'మంచిది వెళ్ళి రండి' అనేవారు.

ఇప్పుడు కూలగొట్టిన పాత సచివాలయం లోని ఓ పాత భవనం మొదటి అంతస్తులో సీఎం పేషీ వుండేది. ఆ భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. పక్కనే ఆల్విన్ కంపెనీ తయారుచేసిన విశాలమైన లిఫ్ట్ వుండేది. మొదటి అంతస్తు చేరుకోవడానికి వున్న చెక్క మెట్ల వరుస, ఎర్ర తివాచీ కూడా రాజభవనాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో తయారైనదే.

 

ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు. ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ తెలిసినట్టు లేదు' అని వాపోయాడు.

కింది ఫోటో: శిధిల సచివాలయం. ఒకప్పుడు ముఖ్యమంత్రి ఛాంబర్ ఈ భవనంలోనే వుండేది. ఇప్పుడు లేదు. కొత్త సచివాలయం నిర్మాణంలో వుంది.



కామెంట్‌లు లేవు: