13, జనవరి 2022, గురువారం

శారదక్కయ్య – భండారు శ్రీనివాసరావు

 అమ్మలగన్నయమ్మ ‘మా అమ్మ’ అనుకుంటే, మా అమ్మకు రెండో బిడ్డ, మా రెండో అక్కయ్య కొలిపాక శారదక్కయ్య. ‘మంచి అమ్మకు’ మారుపేరు.

మా అమ్మ భండారు వెంకట్రావమ్మ గారు, 1993 లో తన 84 ఏట మరణించినప్పుడు మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఒక సంస్మరణ సంచిక ప్రచురించాడు. మా అమ్మకన్న సంతానం మాత్రమే కాకుండా పిల్లల పిల్లలు కూడా అమ్ముమ్మ గురించిన అనుభవాలను, అనుభూతులను అందులో పంచుకున్నారు. మా శారదక్కయ్య అమ్మను గురించి రాసిందిలా:

పట్టుమని పన్నెండేళ్ళు అయినా నిండకుండానే నా పెళ్లి అయింది. మా పెద్దమ్మాయి శాంత పుట్టిన ఏడాదికే మా వారు (కొలిపాక రామచంద్ర రావు గారు) దేశ దాస్య విమోచనం కోసం జైలుకు వెళ్ళారు. మా పెద్ద బావ అయితరాజు రాం రావు గారు మా వారితో పాటే జైలుకు వెళ్ళడంతో, నన్నూ మా పెద్దక్క రాధనూ మా అప్ప (నాన్న) మా వూరు కంభంపాడు తీసుకు వెళ్ళారు. మా బావగారు, మా వారు జైల్లో వున్న పద్నాలుగు నెలలు మేమిద్దరం మా పుట్టింట్లోనే ఉండిపోయాము. ఆ రోజుల్లో ఇలా గ్యాసు పొయ్యిలు లేవుకదా! మా అమ్మ శనగకట్టె మంట పెట్టి మా అందరికీ వండి పెట్టేది.

మా అప్ప ఊళ్ళోని దుకాణదారుతో చెప్పాడు “ మా పిల్లలు ఏదీ లేక ఇక్కడికి రాలేదు. అల్లుళ్ళు దేశం కోసం జైలుకు వెళ్ళారు. వాళ్లకి అవసరమైనవి ఏవి అడిగినా కాదనకుండా ఇవ్వు”

మా అమ్మకు పుట్టింటి వాళ్ళు ఒక గేదెను అరణంగా ఇచ్చారట. దాన్ని గురించిన కబుర్లు గమ్మత్తుగా చెప్పేది. తాను కోడలిగా ఏనాడు గడప దాటి వెళ్లకపోయినా, తన పేరు మాత్రం ఆ గేదె పుణ్యమా అని నలుగురికీ తెలిసిందట. అది వూళ్ళో అందరిండ్లలో జొరబడి నానా బీభత్సం చేసేదట. ‘వెంకట్రావమ్మ గారి గేదె ఇలా చేసింది, అలా చేసింది’అని వూళ్ళో జనం చెప్పుకునే వారట.

ఆ రోజుల్లో ఏ కబుర్లు వెంటనే తెలిసేవి కాదు. మా వాళ్ళు జైలు నుంచి విడుదల అయినట్టు ముందు ఎవరు కబురు తెస్తే వాళ్ళ కాళ్ళకు దణ్ణం పెట్టుకోవాలని నేనూ మా పెద్దక్కా అనుకునేవాళ్ళం.

చివరికి శంభాయి ఆ శుభవార్త మోసుకువచ్చాడు.

మేమిద్దరం ముందు అనుకున్నట్టే, మా ఇంట్లో పనివాడు అయిన శంభాయికి పాదాభివందనం చేశాము”

పెద్ద చదువులు లేకపోయినా చిన్నప్పటి సంగతులను అంత చక్కగా రాసిన మా శారదక్కయ్యకు అన్ని డిగ్రీలు వున్నట్టే లెక్క.

శారదక్కయ్య గురించిన  ఓ జ్ఞాపకం

అరవై ఏళ్ళ కిందటి మాటే.

అప్పుడప్పుడే స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు, గ్లాసులు  మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. మా ఇంట్లో అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. మా రెండో అక్కయ్య శారదక్కయ్య ఓసారి పండక్కి వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, మూడో అన్నయ్య వెంకటేశ్వర రావుకూ ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు మా నాన్నగారి మూడు నెలల జీతం అన్నమాట. ఇహ అప్పుడు చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.

మా అక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్ ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు లగేజి సమస్య కారణంగా ఆ కంచంతో నా రుణానుబంధం తెగిపోయింది.

తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది. డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్ప, ఇప్పుడు ఈ విడికంచాల గోల లేదు.



ఈరోజు ఆమె జయంతి సందర్భంగా నమోవాకాలు.

(13-01-2022)

 

 

కామెంట్‌లు లేవు: