20, మే 2014, మంగళవారం

పనిచెయ్యని 'బూచి' మంత్రం


స్వాతంత్య్రానంతరం భారత దేశరాజకీయలు ఒక కొత్త మలుపు తిరగబోతున్నాయి. గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందని ఒక రాజకీయనాయకుడు, దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జన్మించిన ఓ వృద్ధ యువకుడు మొదటిసారి ప్రధాని పదవిని చేపట్టబోతున్నాడు. అంతేకాదు భారత దేశం వంటి ఓ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశానికి బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి అధికార పగ్గాలను అందుకోబోతున్నాడు. రాజకీయాలను ఓ పక్కనబెట్టి చూస్తే నిజంగా ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పాలి.


దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ అనేది యెంత ప్రభావశీలి అయినప్పటికీ కొందరి దృష్టిలో అది ఇప్పటికీ ఎప్పటికీ మతోన్మాద పార్టీ. పార్టీ ఒక్కటే కాదు ఇప్పుడు దానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోదీ సంగతి చెప్పనక్కరలేదు. ఆయన పేరు వింటేనే కొందరికి కంపరం. మోదీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తేనే సహించలేక కొందరు నాయకులు ఎన్డీయే కూటమి నుంచే తప్పుకున్న సందర్భాలు వున్నాయి. కర్నాటకు చెందిన ఓ ప్రసిద్ధ రచయిత మోదీ ప్రధాని అయితే తాను భారత దేశం విడిచి పెట్టి వెళ్ళిపోతానని శపధం పూనాడంటే ఆయనంటే కొన్ని వర్గాలలో వైమనస్యం  ఏ స్థాయిలో వున్నదీ అర్ధం చేసుకోవచ్చు. పదేళ్ళ పాలన తరువాత ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తాటి ప్రమాణంలో వుందని తెలిసిన తరువాత కూడా ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వానికి తామే నాయకత్వం వహిస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి చెందిన కొందరు నాయకులు ధీమాతో కూడిన ప్రకటనలు చేయడానికి కారణం కూడా కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ ని ఒక అంటరాని పార్టీగా పరిగణించే తత్వానికి అలవాటుపడివుండడమే. బీజేపీని ఒక బూచిగా చూపించి తమ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పెంచుకున్న ఆశలపై ప్రజలు నీళ్ళు చల్లారు. అది కూడా ఏదో మామూలుగా కాదు, చీత్కరించినట్టు పెద్దపెట్టున తిరస్కరించారు. నూటపాతికేళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన, దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన రికార్డు ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీని అతి తక్కువ స్థానాలకు పరిమితం చేసి 'మా దృష్టిలో ఇదీ మీ స్థానం' అని తేటతెల్లం చేశారు. ఇంతటి ఘన  విజయాన్ని మూటగట్టుకోగలిగిన స్థోమత వస్తుతః మోదీకి వున్నప్పటికీ, నిజం చెప్పాలంటే ఇందులో కాంగ్రెస్ నిర్వాకం కూడా చాలా వుంది. స్వయంకృతాపరాధాలకు ఆ పార్టీ చెల్లించిన మూల్యంగా చెప్పుకోవచ్చు.
పెద్ద బాధ్యత భుజానికి ఎత్తుకుని మోదీ ఇంత పెద్ద పదవిని స్వీకరించబోతున్నారు. ఆయన తమ బతుకుల్ని మారుస్తాడనే ఆశతో జనం ఆయనకు ఈ పగ్గాలు అప్పగించారు. ఎవరిమీదా ఆధారపడకుండా, నిష్క్రియాపరత్వానికి ఇతరులపై నిందమోపి తప్పుకునే వీలులేకుండా తిరుగులేని సంఖ్యాబలంతో అధికారాన్ని దఖలు పరిచారు. ఇక బంతి మోదీ కోర్టులో వుంది. ఇన్నాళ్ళు చెబుతూ వచ్చిన మాటలు నీటి మీది రాతలు కావు, రాతి మీది గీతల్లా చెక్కుచెదరవని నిరూపించుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయన భుజస్కందాలపైనే వుంది.
దేశాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతారో, తానే ఓ మలుపు తిరిగి తానులో ముక్కనని నిరూపించుకుంటారో కాలమే తేలుస్తుంది. (20-05-2010)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

After Emergency in India Morarji Desai became PM and everybody was agog about him and his style etc. He fizzled out in 3 years. Biggest worry now is whether Modi can stand the test of time and deliver what he promised. Can one man make difference? Time will tell.