17, ఏప్రిల్ 2021, శనివారం

నిష్టుర నిజాలు - భండారు శ్రీనివాసరావు

 

"అంటే ఏమిటన్న మాట"

మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగేసి కప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాడు ఏకాంబరం.

"ఎన్నో విషయాలు తెలుసు అనుకున్నవాళ్ళకు కూడా కొన్ని విషయాలు అర్ధం కావని. ఈ మధ్య అలాటివి రెండు నా దృష్టికి వచ్చాయి" వక్కపొడి నములుతూ సంభాషణ పొడిగించాడు. 

నిజానికి ఏకాంబరంతో సంభాషించడం కుదరని పని. మన మాటలు కూడా అతడే మాట్లాడుతూ మాటలు కొనసాగిస్తాడు. ఒకరకంగా ఏకాంబరంతో వున్న సులువు కూడా అదే. వింటున్నట్టు ఓ చెవి పారేసి మన మానాన మనం రాసుకుంటూ, చదువుకుంటూ ఎంచక్కా అతడితో ముచ్చట్ల కార్యక్రమం కొనసాగించవచ్చు. 

"హైకోర్టు ఆగ్రహం"

మళ్ళీ ఏకాంబరమే మొదలెట్టాడు.

"ఇదొక అర్ధం కాని మీడియా భాష. కోర్టుకు ఆగ్రహానుగ్రహలతో నిమిత్తం వుండకూడదు. ఏదయినా కేసు విచారించేటప్పుడు ఇటువంటి భావోద్రేకాలకి న్యాయమూర్తులు లోనుకాకూడదు. నిజంగా జడ్జీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో లేదో ఎవ్వరికీ తెలవదు. టీవీ స్క్రోలింగుల్లో మాత్రం ఈ పదం తరచూ దర్శనం ఇస్తుంటుంది. నాకు అర్ధం కాని విషయాల్లో ఇదొకటి" అన్నాడు ఏకాంబరం. 

"మరి రెండో సంగతి" అని ఎవరూ అడక్కుండానే ఆయనే అందుకున్నాడు.

"అలసటా, ఆయాసం లేకుండా హాయిగా బంధు మిత్ర సపరివార సమేతంగా తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొచ్చిన ప్రముఖులు, మహాద్వారం దగ్గర్లో మీడియాతో మాట్లాడే మాటలు అస్సలు అర్ధం కావు. 'దేశం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలందరికీ మంచి జరగాలనీ అ బ్రహ్మాండనాయకుడ్ని ప్రార్ధించి వచ్చినట్టు ఎలాటి భేషజం లేకుండా బ్రహ్మాండమైన అబద్ధాలు ఆశువుగా చెప్పేస్తారు. ఈ మాటలు నమ్మడానికి జనం ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నారా?"

"అందరు భక్తుల్లాగే వాళ్ళూ తిరుపతి వస్తారు. ఎలాటి లాయలాస లేకుండా దేవుడి దర్శనం తేలిగ్గా చేసుకుంటారు. కావాల్సిన కోరికలు ఎవరూ లేకుండా చూసి కోరుకుంటారు. బయటకు రాగానే మాత్రం అదేదో 'సబ్బు వాడండి' అని సినిమాతారలు ప్రకటనలకు ఫోజు ఇచ్చినట్టుగా, గుడి బయట మహాద్వారం దగ్గరే  వాళ్లకు ఈ పబ్లిసిటీ ఇవ్వడం ఎందుకు చెప్పండి. ఏడుకొండలవాడికి వీళ్ళ మెచ్చుకోళ్ళు అవసరమా? టీవీలవాళ్లు ఈ పద్ధతికి స్వస్తి చెబితే బాగుంటుంది"

 

"చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపించినట్టు ఏకాంబరం గారు చెప్పేవి పోచికోలు కబుర్లే అయినా, అప్పుడప్పుడూ ఇలాటి మంచి మాటలు కొన్ని చెబుతుంటారు. అందుకే పొద్దున్నే వచ్చి విసిగించినా, విసుక్కోకుండా కాఫీ ఇచ్చేది" అన్నది మా ఆవిడ ఏకాంబరం వెళ్ళిపోయిన తరువాత తాపీగా. 

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఏకాంబరం అన్న వ్యక్తి నిజమైన వ్యక్తి అయినా కాకపోయినా పైన చెప్పిన మాటలు మాత్రం అక్షరసత్యాలు 👌.

తిరుమలలో విఐపీలను టీవీ వాళ్ళు కవర్ చేసే ఆ దృశ్యాలను చూస్తుంటే నాకు కూడా కంపరం పుడుతుంది.

అలాగే మీడియా భాష కూడా. కోర్టుకు ఆగ్రహం ఏమిటండీ? ఆగ్రహం వచ్చినా పబ్లిక్ గా చూపిస్తారా? ఏదో తామే బ్రహ్మాండమైన రిపోర్టింగ్ చేస్తున్నామనే భ్రమ?

అటువంటిదే కొత్తగా ఎంపికైన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిల ప్రమాణ స్వీకారం గురించి చెప్పేటప్పుడు నేడే “పట్టాభిషేకం” అని వ్రాయటం. మంత్రివర్గాన్ని “కొలువు దీరటం”అనటం - ఏమిటీ రాచరికపు పదాలు? తామేదో “వెరైటీ”గా చెప్పాలనే దురదతో ఆనాటి పదాలను తవ్వి తీసి, ప్రాణం పోసి, ఓహో గొప్పగా చెప్పాం అనుకుని తమకు తామే మురిసిపోతారేమో? రాచరికాలు పోయాయి, ప్రజాస్వామ్యంలో (??) బతుకుతున్నాం అనే కనీస స్పృహ అయినా ఉందా? బహుశః బ్రిటిష్ పాలనలో ఒక వైస్రాయ్ మారి కొత్త వైస్రాయ్ వచ్చి పదవీస్వీకారం చేస్తున్న సందర్భంలో కూడా ఆనాటి పత్రికలు ఇటువంటి పదజాలాన్ని వాడి ఉండలేదేమో అని నాకనిపిస్తుంది. మిడిమిడి జ్ఞానపు ఆలోచనలు, అవగాహన లేని వ్రాతలు, సోకాల్డ్ “సెలెబ్రిటీ” పూజలు.

ఇటువంటి మీడియా హైప్ మూలానేనేమో ఇవాళ కార్పెరేటర్ కూడా తన వార్డుకు తను రాజుని అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారని వింటూంటాం.

సమాజాన్ని భ్రష్టు పట్టించటంలో మీడియా పాత్ర కూడా తక్కువేం కాదేమో? ఏమైనప్పటికీ దారి తప్పిన దేశం.