26, ఏప్రిల్ 2021, సోమవారం

రావణుడిని చంపింది రాముడు కాదు

 

ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తూ లంకేశ్వరుడైన రావణబ్రహ్మ పట్టమహిషి, పంచ మహాపతివ్రతల్లో ఒకరైన మండోదరి. (సీత, అనసూయ, సావిత్రి, మండోదరి, ద్రౌపది)

రామ రావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడి చేతిలో తన భర్త నిహతుడు అయినాడన్న సమాచారం తెలుసుకుని మండోదరి పెద్దపెట్టున రోదిస్తూ యుద్ధరంగం చేరుకుంటుంది. రావణుడి భౌతిక కాయం చెంత నిలబడి ఏడుస్తూ ఇలా అంటుంది.

“నాధా! నువ్వు మహా వీరుడివి. పది తలలు, ఇరవై చేతులు. యముడినే ఓడించావు. నీ పేరు వింటేనే ముల్లోకాలు గడగడలాడేవి. చివరికి ఒక మానవుడి చేతిలో చనిపోయావు.

“నిన్ను చంపింది రాముడని లోకం అనుకుంటుంది. కానీ నీ భార్యని కాబట్టి దేనిచేత చనిపోయావో నాకు తెలుసు. భర్తకు వుండే కొన్ని ప్రగాఢమైన బలహీనతలు భార్యకు మాత్రమే తెలుస్తాయి.

“ఇంద్రియాలను అదిమిపెట్టి తపస్సు చేసి వరాలు పొందావు. ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. నీ మీద పగ తీర్చుకున్నది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. (నీకున్న పరస్త్రీ వ్యామోహమే)
“ఎక్కడో అరణ్యంలో భర్తతో వనవాసం చేస్తున్న సీతమ్మ మీద నీకు ఎందుకు కోరిక పుట్టిందో తెలుసా! ఆ కామం జనించింది ఆమెను నువ్వు అనుభవించడానికి కాదు, నువ్వు మరణించడానికి. సర్వనాశనం కావడానికి.

“రాజ్యం పోయింది. కొడుకులు పోయారు. ఆఖరికి నువ్వు కూడా పోయావు. నన్ను విధవరాలిని చేశావు. పది రోజుల్లో లంక సర్వనాశనం కావడానికి నువ్వే కారణం. పెద్దల మాట వినక ఈ దుస్థితి తెచ్చుకున్నావు”

మండోదరి కడుపులో బాధ తగ్గేదాకా రాముడు ఏమీ మాట్లాడలేదు.
రావణ బ్రహ్మ పార్ధివ దేహానికి సముచిత రీతిలో అంత్యక్రియలు జరపాల్సిందని విభీషణుడిని అడుగుతాడు. అతడు సంక్షేపిస్తుంటే రాముడు అంటాడు.

“మరణంతో వైరం పోవాలి. ఏ శరీరంతో అయితే ఒక వ్యక్తి ఇన్ని ఆగడాలు చేసాడో ఆ ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టగానే వైరం కూడా వెళ్ళిపోయింది. అందుకని ఇక వైరం పెట్టుకోకూడదు. నీకు అంగీకారం లేకపోతే చెప్పు, ఆ పుణ్యకార్యం నేను చేస్తాను. స్నేహితుడి అన్నగారు నా అన్నగారే”

ఇంతటి ఉత్తముడు కనుకనే రాముడు పురుషోత్తముడు అయ్యాడు.
(26-04-2021)

కామెంట్‌లు లేవు: