నిష్టుర నిజాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిష్టుర నిజాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఏప్రిల్ 2021, శనివారం

నిష్టుర నిజాలు - భండారు శ్రీనివాసరావు

 

"అంటే ఏమిటన్న మాట"

మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగేసి కప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాడు ఏకాంబరం.

"ఎన్నో విషయాలు తెలుసు అనుకున్నవాళ్ళకు కూడా కొన్ని విషయాలు అర్ధం కావని. ఈ మధ్య అలాటివి రెండు నా దృష్టికి వచ్చాయి" వక్కపొడి నములుతూ సంభాషణ పొడిగించాడు. 

నిజానికి ఏకాంబరంతో సంభాషించడం కుదరని పని. మన మాటలు కూడా అతడే మాట్లాడుతూ మాటలు కొనసాగిస్తాడు. ఒకరకంగా ఏకాంబరంతో వున్న సులువు కూడా అదే. వింటున్నట్టు ఓ చెవి పారేసి మన మానాన మనం రాసుకుంటూ, చదువుకుంటూ ఎంచక్కా అతడితో ముచ్చట్ల కార్యక్రమం కొనసాగించవచ్చు. 

"హైకోర్టు ఆగ్రహం"

మళ్ళీ ఏకాంబరమే మొదలెట్టాడు.

"ఇదొక అర్ధం కాని మీడియా భాష. కోర్టుకు ఆగ్రహానుగ్రహలతో నిమిత్తం వుండకూడదు. ఏదయినా కేసు విచారించేటప్పుడు ఇటువంటి భావోద్రేకాలకి న్యాయమూర్తులు లోనుకాకూడదు. నిజంగా జడ్జీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో లేదో ఎవ్వరికీ తెలవదు. టీవీ స్క్రోలింగుల్లో మాత్రం ఈ పదం తరచూ దర్శనం ఇస్తుంటుంది. నాకు అర్ధం కాని విషయాల్లో ఇదొకటి" అన్నాడు ఏకాంబరం. 

"మరి రెండో సంగతి" అని ఎవరూ అడక్కుండానే ఆయనే అందుకున్నాడు.

"అలసటా, ఆయాసం లేకుండా హాయిగా బంధు మిత్ర సపరివార సమేతంగా తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొచ్చిన ప్రముఖులు, మహాద్వారం దగ్గర్లో మీడియాతో మాట్లాడే మాటలు అస్సలు అర్ధం కావు. 'దేశం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలందరికీ మంచి జరగాలనీ అ బ్రహ్మాండనాయకుడ్ని ప్రార్ధించి వచ్చినట్టు ఎలాటి భేషజం లేకుండా బ్రహ్మాండమైన అబద్ధాలు ఆశువుగా చెప్పేస్తారు. ఈ మాటలు నమ్మడానికి జనం ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నారా?"

"అందరు భక్తుల్లాగే వాళ్ళూ తిరుపతి వస్తారు. ఎలాటి లాయలాస లేకుండా దేవుడి దర్శనం తేలిగ్గా చేసుకుంటారు. కావాల్సిన కోరికలు ఎవరూ లేకుండా చూసి కోరుకుంటారు. బయటకు రాగానే మాత్రం అదేదో 'సబ్బు వాడండి' అని సినిమాతారలు ప్రకటనలకు ఫోజు ఇచ్చినట్టుగా, గుడి బయట మహాద్వారం దగ్గరే  వాళ్లకు ఈ పబ్లిసిటీ ఇవ్వడం ఎందుకు చెప్పండి. ఏడుకొండలవాడికి వీళ్ళ మెచ్చుకోళ్ళు అవసరమా? టీవీలవాళ్లు ఈ పద్ధతికి స్వస్తి చెబితే బాగుంటుంది"

 

"చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపించినట్టు ఏకాంబరం గారు చెప్పేవి పోచికోలు కబుర్లే అయినా, అప్పుడప్పుడూ ఇలాటి మంచి మాటలు కొన్ని చెబుతుంటారు. అందుకే పొద్దున్నే వచ్చి విసిగించినా, విసుక్కోకుండా కాఫీ ఇచ్చేది" అన్నది మా ఆవిడ ఏకాంబరం వెళ్ళిపోయిన తరువాత తాపీగా.