14, డిసెంబర్ 2016, బుధవారం

నిజంగా అపురూపం


అపురూప దృశ్యాలు అనుదినం అనుభవంలోకి రావు. అవి చాలా అరుదుగా తటస్థ పడతాయి కాబట్టే అపురూపం.
నిన్న సాయంత్రం అటువంటి అనుభూతి అనుభవంలోకి వచ్చింది.
ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్  అధికారులు. ఒకానొక కాలంలో ఈ దేశాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని పాలించిన, ఒక రకంగా శాసించిన అధికారులు వాళ్ళు. నా జర్నలిష్టు జీవితంలో అనేక పర్యాయాలు వారిని కలుసుకోగల ఆవకాశం లభించింది. గంటలపాటు వెయిట్ చేసినా పని ఒత్తిడిని బట్టి కలవడానికి వీలులేని బిజీ వ్యక్తులు ఈరోజు విశ్రాంత అధికారులుగా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ హైదరాబాదులో నిన్న జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయి పాత సంగతులు నెమరు వేసుకున్నారు. డెబ్బయి ఏళ్ళ నుంచి 102 సంవత్సరాల వరకు  వివిధ వయస్సుల్లో వున్న వీరిలో చాలామంది అత్యంత ఉన్నత ఉద్యోగాలు నిర్వహించారు. కార్యదర్శులుగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా, పోలీసు డైరెక్టర్ జనరల్స్ గా పనిచేసిన వీరిలో అనేకులు నా పూర్వాశ్రమంలో వృత్తిరీత్యా పరిచయస్తులే కనుక పలకరింపులకు, పాత ముచ్చట్లకు ఆ వేదిక ఒక విడిదిగా మారింది.
ఇక సందర్భం.
ఐసీఎస్ అధికారి, ఎందరో ఐఏఎస్ అధికారులకు గురు సమానులు అయిన సీఎస్ రామచంద్రన్ శతజయంతి. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గా పదవీ విరమణ చేసిన గాయత్రీ రామచంద్రన్ తండ్రి గారు. వారు కుటుంబ స్నేహితులు కాబట్టి ఆ పరిచయంతో అందిన ఆహ్వానంతో వెళ్ళిన బయటి వారిలో అంటే ఐఏఎస్ కానివారిలో డాక్టర్ ఏపీ రంగారావు, మా అన్నయ్య రామచంద్ర రావు, డాక్టర్ బాలాజీ, జ్వాలా, నేనూ ఉన్నాము. సి ఎస్ రామచంద్రన్ గురించి ప్రచురించిన గ్రంధాన్ని 102 ఏళ్ళ వృద్ధ ఐసీఎస్ అధికారి శ్రీ వీ.కే.రావు గారు ఆవిష్కరించారు. వారు గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, డాక్టర్ నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతిగా ఉన్నకాలంలో వారికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. చేతి కర్ర సాయంతో నడిచి వచ్చిన ఆ శతాధిక వృద్ధ మూర్తి వేదిక ఎక్కి పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించడం నిజంగా ఒక అపురూప దృశ్యం.   

         


కామెంట్‌లు లేవు: