6, ఆగస్టు 2016, శనివారం

ప్రమాదో ధీమతామపి (చెన్నారెడ్డి)


ఇందిరాగాంధీ హయాములో ఏ రాష్ట్రంలో అయినా స్తానికంగా నాయకుడయినా బలపడుతున్నాడని అనుమానం వచ్చినా సరే, కాంగ్రెస్ అధిష్టానం వూరుకునేది కాదు. వెంటనే అతడి మీద నిర్దాక్షిణ్యంగా వేటు వేసేది. ఒక్కోసారి చర్య ఆత్మహత్యాసదృశమైనా సరే ఎంతమాత్రం ఉపేక్షించేది కాదు. చెన్నారెడ్డి వంటి బలమయిన నాయకులు కూడా అధిష్టానానికి అణగిమణగి వున్నట్టు వుండేవారు కాని ఒక్కోసారి అసహనం బయటకు వస్తుండేది.  ఆరోజుల్లో ప్రభలు వెలిగిపోతున్న సంజయ్ గాంధీ సాయంతో చెన్నారెడ్డి వ్యతిరేకులు  కొందరు రాష్ట్ర నాయకత్వ మార్పిడి విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి రాగలిగేట్టు చేయగలిగారు. అప్పట్లో సంజయ్ ఏది చెబితే అంత. ఆయన మాటకు ఎదురు వుండేది కాదు. తనని తొలగించే ప్రయత్నంలో సంజయ్ హస్తం వుందని భావించే వారేమో, ఆయనంటే  చెన్నారెడ్డి గారికి గుర్రుగా వుండేది. నేపధ్యంలో సంజయ్ గాంధీ   విమాన ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం తాత్కాలికంగా వాయిదాపడింది.
సంజయ్  అస్థికలను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు వచ్చిన  అస్థికల పాత్రను ప్రత్యేక బోగీలో వెంట తీసుకుని ముఖ్యమంత్రి రాజమండ్రి వెళ్లారు. ఒక బోటులో చెన్నారెడ్డి ఆయన పరివారం గోదావరి నదిలో కొంత దూరం వెళ్లారు. ఆకాశవాణి విలేకరిగా టేప్ రికార్డర్ తో నేనూ వెంట వెళ్లాను. నిమజ్జనం అయిన తరువాత అక్కడ విలేకరులతో మాట్లాడారు. చుట్టూ మూగిన జనాలతో అంతా గందరగోళంగా వుంది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి  రైలు ఎక్కిన తరువాత నాకు కబురు వచ్చింది. వెళ్లాను. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే ఒక ఎస్ అధికారి ' సీ ఎం మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసారా’ అని అడిగారు. ఔనన్నాను. వినిపించమన్నారు. కేసెట్ రివైండ్ చేసి వినిపించాను. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. అందులో చెన్నారెడ్డి మాటలు రికార్డు అయివున్నాయి. ‘సంజయ్ గాంధీ మరణం తనకు బాగా బాధ కలిగించింద’ని చెన్నారెడ్డి అందులో  చెప్పారు. కానీ వాక్యం ఇలా మొదలయింది. " యాం హ్యాపీ దట్ ...సంజయ్.....(సంజయ్ గాంధీ మరణించడం నాకు చాలా...సంతోషంగా....)

ముఖ్యమంత్రి పేషీలో పనిచేసేవారు యెంత అప్రమత్తంగా వుంటారో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.

1 కామెంట్‌:

vahini చెప్పారు...

మీ రాతలు బావుంటాయి ఆసాంతం చదివిస్తాయి.