28, జులై 2013, ఆదివారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


పోతే, ఇంగువ వారి పూర్వీకులకు ఆశ్రయం కల్పించింది కూడా మా రామయ్య గారే. ఈరోజుల్లో ఇండ్ల స్థలాలు, పొలాలు ఇప్పించడం అనేది మంత్రులు కూడా చేయలేని పని. మంత్రివర్గం మాత్రమే   చేయగలిగే ఈ పనులను ఆ రోజుల్లో గ్రామ కరణాలు సునాయాసంగా  చేయగలిగేవారు. అదీ నోటి మాటతో.
రామయ్య, లక్ష్మయ్యగార్ల హయాం లోనే వారికీ, వారి చిన తాత రామలింగయ్య (కోర్టు తీర్పులో  లింగయ్య అనే వుంది ) కుమారుడు చిన కామయ్య గారికీ దావా నడిచింది. బెజవాడ డిస్ట్రిక్ట్ మునసబు కోర్టులో నడిచిన ఈ దావాలో వాది  చిన కామయ్య కాగా ప్రతివాదులు రామయ్య, లక్ష్మయ్యలు.  దావా పర్యవసానం ఎలా వున్నా, దానికి సంబంధించిన కోర్టు తీర్పులో మాత్రం  భండారు వంశం వారి పూర్వీకుల పేర్లు వివరంగా పేర్కొనడం జరిగింది.

రామయ్య గారి భార్య శేషమ్మ గారు. ఆమె దాదాపు ఎనభై ఏళ్ళకు  పైగా బతికింది. నాకు కూడా గుర్తే. రామయ్య గారి దంపతులకు ముగ్గురు కుమారులు. పర్వతాలయ్య, లక్ష్మీ నారాయణ, వెంకట సుబ్బారావు. కుమార్తెల సంగతి స్పష్టంగా తెలియదు. కొడుకులలో పెద్దవాడయిన పర్వతాలయ్య గారిదే కరిణీకం. చాలా కాలం అన్నదమ్ములందరూ  కలిసే వున్నారు. అప్పుడు మా ఇల్లు ఉత్తర ముఖంగా వుండేది. ప్రస్తుతం సుబ్బయ్య తాతయ్య జాగాలోకి వున్న బేస్ మట్టం, మెట్లు అప్పుడు ఇంటికి సింహద్వారం వైపు ఉండేవి.  ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆహుతి కావడం వల్ల,  మా నాన్నగారు రాఘవరావు గారు ఇప్పుడున్న ఇంటిని నిర్మించారు.


(దాదాపు వందేళ్ళ క్రితం తిరిగి నిర్మించిన ఇప్పటి ఇల్లు) 

ప్రమాదంలో కొంత కాలిన దూలాలను కొన్నింటిని కొత్త ఇంటి నిర్మాణంలో వాడారు. అ ఇల్లు కట్టినప్పుడు మా తాతగారు పర్వతాలయ్య గారు బతికే వున్నారు. తరువాత  అన్నదమ్ములు ముగ్గురు వేర్లు పడ్డారు. లక్ష్మీనారాయణ గారు మా ఇంటికి దగ్గరలోనే  కొండారెడ్డి జాగా కొనుక్కుని వేరే ఇల్లు కట్టుకున్నారు. సుబ్బయ్య గారు మా ఇంటి పక్కనే ఒక పూరిల్లు వేసుకుని వుంటూ వుండేవారు. ఆ రోజుల్లో ఊళ్ళోకి తాసిల్దారు  రావడం అంటే ఎంతో  గొప్ప విషయం. వూరికి వచ్చిన తాసీల్దారు వూరికే కూర్చోకుండా   పొలాల వెంట తిరుగుతూ,  అడంగల్ లో రాసిన విధంగా పంటలు వాస్తవంగా వేసేరో  లేదో ప్రత్యక్షంగా తనిఖీ చేసేవాడట. అందుకోసం ఆయన దర్జాగా మేనాలో వెడుతుంటే  కరణం, మునసబులు ఆ మేనాకు చెరో వైపు,  వెంట పరిగెత్తుతూ పంటల వైనం,  సర్వే నెంబర్లు వివరించేవారట. అప్పుడు అందరికీ గుర్రాలు ఉండేవి. ప్రయాణాలు ఎక్కువభాగం కాలినడకనా, గుర్రాలమీదా సాగేవి. ఆడవాళ్ళు  మేనాలో గాని ఎద్దు బండ్ల పైగాని ప్రయాణం చేసేవారు.(నాటి మేనా ఒకటి ఇటీవలి కాలం వరకు మా ఇంట్లో వుండేది) మోతుబరులు, కరణాలు గుడిసె బండ్లలో వెడితే, సంసారులు(రైతులు) జల్ల బండ్లలో వెళ్ళేవాళ్ళు. బండ్ల ప్రయాణంలో ముందు జీతగాళ్ళు తాళ్ళు పట్టుకుని  నడుస్తుంటే వెనుక వెట్టివాళ్ళు (ఇప్పటికి వాళ్ళు గ్రామోద్యోగులయినా వెట్టివాళ్ళనే  పేరు పోలేదు. ఒకప్పుడు వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ బతికేవాళ్ళు. మోతాదు, వెట్టివాడు అని పిలిచేవాళ్ళు.  మా నాన్నగారి వద్ద  అలాటివాళ్ళు ముగ్గురు వుండేవాళ్ళు). ప్రయాణంలో వొడ్డేరకాలు (ఎత్తుపల్లాలు) వచ్చినప్పుడు బండి పడిపోకుండా ఛట్రం పట్టుకుని  బరువానేవాళ్ళు.  వానాకాలం ఒక్కొక్క బండికి రెండేసి జతల ఎడ్లను తాగాడిగాళ్లు కట్టేవాళ్ళు. అసలా రోజుల్లో కరణాలు తప్ప ఎవరూ  బండ్లు కట్టి ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. వ్యవసాయప్పని చెడుతుందని కొంతా, ఎడ్లు దెబ్బతింటాయని కొంతా, వారి  భయం.  (మరో భాగం మరో సారి)       

కామెంట్‌లు లేవు: