(2025 జులై 19 వ తేదీన అమెరికా నుంచి దోహా మీదుగా ఖతార్ ఎయిర్ లైన్స్ లో హైదరాబాద్ కు ఆకాశంలో 32 వేల అడుగుల ఎత్తున, రాత్రో పగలో తెలియని అయోమయావస్థలో ప్రయాణిస్తూ...)
“ఎప్పుడు డిగ్రీ పూర్తి చేశారు”
ఆలిండియా సర్వీసు ఇంటర్వ్యూ లో నిజానికి ఇది ఎంత సింపుల్ ప్రశ్న!
మీ పేరేమిటి అని అడిగితే చప్పున జవాబు చెప్పగలంత సులభమైన ప్రశ్న.
కానీ చెప్పలేకపోయాను.
కారణం చెప్పాకదా! చదువుల్లో నా ట్రాక్ రికార్డు. క్లాస్ మేట్స్ సీనియర్లు అయ్యారు. జూనియర్లు క్లాస్ మేట్స్ అయ్యారు. ఇక తేదీలు, సంవత్సరాలు ఎక్కడ గుర్తుంటాయి?
ఈ పరీక్షకు ఎం ఎస్ ఎం బండి లేదు. అదే ఫైనల్. ఆ ఫైనల్స్ లో సింపుల్ గా తప్పాను. నన్ను దాటుకుని నా వెనక వున్న నలుగురైదుగురు ముందుకు వెళ్ళారు. ఉద్యోగ విధులు ఒకటే అయినా, హోదాల్లో తేడా వచ్చింది. రిటైర్ మెంటు నాటికి పెన్షన్ లో ఇంకా పెద్ద తేడా వచ్చింది.
నేను 1975లో ఆలిండియా రేడియోలో చేరినప్పుడు ఏడాది తిరగకుండానే పే కమిషన్ సిఫారసులు అమలు చేశారు. ఆ చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగి నాకు రావాల్సిన గ్రేడు రాలేదు. ఉద్యోగంలో చేరినప్పుడు నా బేసిక్ 350. ఒక గుమాస్తా చేసిన చిన్న పొరబాటు వల్ల అది 325 అని పడింది. పాతిక రూపాయలకోసం మొదట్లోనే పేచీ ఎందుకు అని నేను పట్టించుకోలేదు. ప్రభుత్వ సర్వీసుకు కొత్త. బేసిక్ మీద ఆధార పడి ఇతర అలవెన్సులు పెరుగుతాయి అని తెలియదు. ఏడాది లోపలే పే కమిషన్ సిఫారసులు అమలుచేశారు. తేడా పాతిక నుంచి వందకు పెరిగింది. అలవెన్సుల్లో వ్యత్యాసం అదే దామాషాలో పెరిగి, జీత భత్యాల్లో తేడా వచ్చింది.
కొన్నేళ్ళ తర్వాత న్యూస్ ఎడిటర్ గా వచ్చిన ఆకిరి రామకృష్ణారావు
నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని సర్వీసు వ్యవహారాల్లో దిట్ట అయిన ఒక ప్లీడరు గారి దగ్గరకు తీసుకువెళ్లాడు.
విషయం మొత్తం తెలుసుకుని ఆ వకీలు గారు చెప్పిన మాట ఇది.
అంతే కాదు కొన్ని పాయింట్ల రూపంలో గీతా బోధ కూడా చేశారు.
“మీ ప్రొబేషన్ పూర్తి కాలేదు. అంచేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తె కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రభుత్వం ఒక కాంక్రీటు గోడ లాంటిది. దాన్ని డీకొడితే గోడ పగలడం కంటే డీ కొట్టిన తల పగిలే అవకాశాలే ఎక్కువ. మనం ఒక కోర్టులో గెలిస్తే వాళ్ళు పై కోర్టుకు వెడతారు. అలా మనం ఎక్కలేనన్ని మెట్లు వాళ్ళు సులువుగా ఎక్కేస్తారు. మనమూ ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ శక్తి ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఇటువంటి పొరబాటే ఓ వందా రెండు వందల మందికి జరిగి వుంటే తలా కాస్త ఖర్చు పెట్టుకుని పోరాడవచ్చు. కానీ ఇది ఇండివిడ్యువల్ కేసు. పొరబాటు జరిగినా అది అంగీకరించరు. అంచేత వాళ్ళు లిటిగేషన్ కొనసాగిస్తారు. అంత ఆర్ధిక స్థోమత మీకు వుందని అనుకోను. ప్రొబేషన్ పూర్తి కాలేదు కాబట్టి కేసు తేలే వరకు మీకు పే కమిషన్ ప్రయోజనాలు నిలిపేసినా ఆశ్చర్యం లేదు. కేసు తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టవచ్చు. అప్పటిదాకా తట్టుకోగల శక్తి మీకు వుందని నేను అనుకోవడం లేదు.”
వచ్చిన క్లయింట్లని ఇలా నిరుత్సాహ
పరిచే లాయర్లు ఉంటారని నాకు తెలియదు. ఆయన నా మీద సానుభూతితో చెప్పాడా లేక ఈ జర్నలిస్టులు అడిగిన ఫీజు ఇవ్వరు అనే అనుమానంతో చెప్పాడా అదీ తెలియదు. తెలిసినదల్లా అతడిలో సందేహించడానికి ఏమీ లేదనే. ఓ నమస్కారం పెట్టి వచ్చేసాము.
తర్వాత అనేక పే కమిషన్లు వచ్చాయి. నా సర్వీసు చివరాఖర్లో వచ్చిన పే కమిషన్ సిఫారసులతో కేంద్ర సిబ్బంది వేతనాలు ముందెన్నడూ లేని విధంగా పెరిగాయి. ఉద్యోగం మొదట్లో పాతిక రూపాయలు అనుకున్న తేడా చివరాఖరుకల్లా వేలల్లోకి పెరిగింది. దీనికి తోడు, ఉద్యోగపర్వంలో మరో కుదుపు. 2005 డిసెంబరు 31 సాయంత్రం నేను రిటైర్ అయ్యాను. మర్నాడు అంటే 2006 జనవరి ఒకటి నుంచి ఆ సిఫారసులు అమల్లోకి వచ్చాయి. అంటే ఒక్క రోజు తేడాతో పెన్షన్ లో పెద్ద వ్యత్యాసం వచ్చింది. చాలా పెద్ద మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.
కానీ నేను ఆకాశవాణిలో గడించిన అనుభవాలు, మాస్కో జీవితం, పిల్లలు ఎదిగిరావడం ఇవన్నీ ఇచ్చిన తృప్తిని ఎన్ని పే కమిషన్లు ఇవ్వగలుగుతాయి? ఆనాడు ఆ లాయరు నన్ను ఆ కేసు తీసుకుని గెలిపించి వుంటే నాకీ అవకాశాలు లభించి ఉండేవి కావేమో! ఒకటి తీసుకోవడం అంటే మరోటి ఇవ్వడం అనే లెక్క ఆ పైవాడిది.
“గోదావరిలో ఎన్ని నీళ్లున్నా మనం చెంబు తీసుకువెడితే చెంబెడు, బిందె తీసుకువెడితే బిందెడు. ఏదైనా ప్రాప్తాన్నిబట్టే” అనే మా అన్నయ్య భండారు పర్వతాలరావు గారి మాటలు నాకు ఊరట. ఆయన ఇంకో మాట అనేవారు.
‘కోర్టు గుమ్మం ఎక్కకుండా, జైలు గడప తొక్కకుండా వెళ్లదీయగలిగితే దాన్ని మించిన ప్రశాంత జీవితం మరోటి వుండదు”
అదృష్టవశాత్తు ఈ రెండూ నా అనుభవంలోకి రాలేదు.
తోక టపా: చివరాఖరుకు నేను దూరదర్సన్ లో న్యూస్ ఎడిటర్ గా రిటైర్ అయింది ఆ ఆలిండియా సర్వీసు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (ఐ.ఐ.ఎస్.) అధికారిగానే.
(ఇంకావుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి