1, మే 2022, ఆదివారం

పుచ్చలపల్లి సుందరయ్యకు తప్పిపోయిన ముఖ్యమంత్రి పదవి – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి. వామపక్ష పక్షపాతి, ప్రముఖ పాత్రికేయులు శ్రీ వీ.హనుమంతరావు (జర్నలిస్ట్ డైరీ ఫేం సతీష్ బాబు తండ్రి) తన అనుభవాల సమాహారంలో పుచ్చలపల్లి వారి గురించిన ప్రస్తావన వుంది. అదే ఇది:

“1955 మధ్యంతర ఎన్నికలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నడుమ అతి భీకరంగా జరిగాయి. కమ్యూనిష్టులు అధికారంలోకి వచ్చేస్తున్నారు, పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్యమంత్రి, రాజేశ్వర రావు హోం మంత్రి అనే వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. కాని, చివరకు కమ్యూనిష్టులు ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీ పత్రిక విశాలాంధ్ర తప్ప మిగతా పత్రికలన్నీ కాంగ్రెస్ కొమ్ము కాశాయి. ప్రముఖ సంపాదకుడు నార్ల వేంకటేశ్వర రావు సంపాదకత్వంలో ఆంధ్రప్రభ ముందు వరసలో నిలబడి కమ్యూనిష్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. విశాలాంధ్ర, ఆంధ్రప్రభల మధ్య కార్టూన్ల యుద్ధం హోరాహోరీగా నడిచింది. ప్రతి కార్టూనుకు జవాబుగా మరో కార్టూన్ ప్రభలో వచ్చేది. అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్రంలో పత్రికల సత్య నిష్ఠ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్ర ప్రభ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుకూలంగా రాస్తే, దాని తమిళ్ ఎడిషన్ దానికి వ్యతిరేకంగా రాసేది. ఇదంతా పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే.”

 

ఇక్కడ పనిలో పనిగా శ్రీ హనుమంతరావు గురించిన ఓ పాత వృత్తాంతం చెప్పుకోవాలి.

ఆయనది కలిగిన కుటుంబం కాదు. వారాలు చేసి చదువుకున్నారని చెబుతారు. చిన్నతనంలోనే టైపూ, షార్ట్ హాండు నేర్చుకుని వైజాగ్ పోర్టులో (అప్పుడు దాని పేరు వేరేగా వుండేది) ఓ చిన్న ఉద్యోగంలో చేరారు. సహజంగా వామపక్ష పాతి అయిన శ్రీ హనుమంత రావు, కమ్యూనిస్టు నాయకుడు అయిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య దృష్టిలో పడ్డారు. ఆయన కోరికపై చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి శ్రీ సుందరయ్య దగ్గర చేరిపోయారు. ఆయన డిక్టేటర్ చేస్తుంటే ఈయన పక్కన కూర్చుని షార్ట్ హాండ్ లో రాసుకుని, తరువాత టైప్ చేసేవారు. ఆవిధంగా వెలువడిందే శ్రీ సుందరయ్య రాసిన విశాలాంధ్రలో ప్రజారాజ్యం.

 

1980 ప్రాంతాల్లో శ్రీ హనుమంతరావు డేటా న్యూస్ ఫీచర్స్ సంస్థ ఆధ్వర్యంలో నేటి రాజకీయం అనే పక్ష పత్రిక వచ్చేది. దీనికి ఆయన గౌరవ సంపాదకులు కాగా, ఆయన కుమారుడు  జర్నలిష్ట్ డైరీ ఫేం సతీష్ ఎడిటర్.

ఆ కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఓ సాహసం చేశారు. కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువు అయిన కమ్యూనిష్ట్ పార్టీ (సీపీఎం) నాయకుడు అయిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యను డ్రైనేజ్ బోర్డు చైర్మన్ గా నియమించారు. డ్రైనేజ్ అంటే నగరాల్లో భూగర్భ డ్రైనేజ్ కాదు. మురుగు నీటి సమస్యతో పంటలు నష్ట పోతున్న డెల్టా ప్రాంతంలోని డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి ఈ బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ నేపధ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ నరిసెట్టి ఇన్నయ్య( ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు) నేటి రాజకీయం పత్రికకు ఓ వ్యాసం పంపారు.

‘సైకిల్ మీద పార్లమెంటుకు వెళ్ళిన నిరాడంబర చరిత్ర కలిగిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, ముఖ్యమంత్రి పేషీకి  ఫైళ్ళు పట్టుకుపోవడం విడ్డూరమని దాని సారాంశం.

శ్రీ సుందరయ్య అంటే గౌరవ ప్రతిపత్తులు కలిగిన శ్రీ హనుమంతరావుకు ఈ వార్త రుచించలేదు. అయినా ప్రచురణ విషయంలో తుది నిర్ణయాన్ని పత్రిక ఎడిటర్ కే వదిలేశారు.



(01-05-2022)

కామెంట్‌లు లేవు: