20, మే 2022, శుక్రవారం

అంతులేని టీవీ చర్చలు భండారు శ్రీనివాసరావు

 (పొద్దున్నే టీవీ చర్చలు చూసిన నిర్వేదంలో)

పాలక పక్షం ఒక విధానం ప్రకటిస్తుంది. ప్రతిపక్షం అందులో వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా దాని వెనుక ఏదో పైకి కనిపించని రాజకీయ వ్యూహం వుందని ఆరోపిస్తుంది.

ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది. పాలక పక్షం అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా రాజకీయ కుట్ర అంటూ ఒక్క ముక్కలో కొట్టి పారేస్తుంది.

చెడిపోయిన గడియారం సయితం రోజులో రెండు మార్లు సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి వుంటాయి. కానీ ప్రతిపక్షాలు వాటిని గుర్తించవు. అభినందించవు.

ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ నూటికి నూరుశాతం ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా సహేతుకమైనవి కావచ్చు. కానీ అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు.

కారణం ఒక్కటే. 'రాజకీయం'.

ఇక్కడే ప్రజాసంఘాల పాత్ర వస్తుంది. రాజకీయ పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా చేయగలిగే సత్తావున్న ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా ఈ పాత్ర పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు పడి, వాటి విశ్లేషణలకు, అభిప్రాయాలకు, సూచనలకు, సలహాలకు ఒకనాడు వున్న గుర్తింపు మసకబారి పోతోంది.

ఈ దుస్తితి తప్పాలంటే సమస్యతో సంబంధం వున్న అందరూ ఒక మెట్టు దిగాలి. ముందు వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని విశ్లేషించుకోవాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు. మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం అలవరచుకోవాలి.

ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే సాధ్యం కాదు.

సాధ్యమే అని నిశ్చయించుకుంటే అసాధ్యం కాదు.

(20-05-20)

కామెంట్‌లు లేవు: