8, మే 2022, ఆదివారం

మా అమ్మకు శ్రీశ్రీ సాహిత్యం ఎలా తెలుసు? – భండారు శ్రీనివాసరావు

 1987 అక్టోబరు చివరి వారం.

అప్పటికి ఆమెకు ఎనభయ్ ఏళ్ళు నిండాయి. బడికి వెళ్లి చదువుకోకపోయినా రామాయణ, భారత, భాగవతాలు కంఠోపాఠం.

నేను మాస్కో రేడియోలో చేరడానికి తేదీ నిర్ణయం అయింది. కుటుంబాన్ని తీసుకుని  ముందు ఢిల్లీ రైల్లో వెళ్లి, సోవియట్ ఎంబసీలో వీసా స్టాంప్ వేయించుకుని సోవియట్ విమాన సంస్థ ఏరో ఫ్లోట్ లో మాస్కో వెళ్ళాలి.

ఢిల్లీ వెళ్ళడానికి సికిందరాబాదు స్టేషన్ కు వెళ్ళాము. బంధు మితృలు చాలా మంది వచ్చారు, వీడ్కోలు పలకడానికి. నేను మా అమ్మతో ప్లాటుఫారం మీద ఓ బెంచిపై కూర్చుని ఉన్నాను. ఆమె మొహంలో బాధ కనిపించడం లేదు కానీ, మనసులో మాత్రం బాధ పడుతోంది. రైలు ప్లాటు ఫారం మీదకు వస్తూ దూరంగా కనిపించింది. ఆమె నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని మెల్లగా  అంది.

“కూటికోసం, కూలి కోసం దేశాలు పోవాలా!’

ఏం చెప్పాలో తోచలేదు.

రైలు ఎక్కిన తర్వాత కూడా ఆమె మాటలే చెవిలో రింగుమంటున్నాయి.

రామాయణ, భారత, భాగవతాలు కంఠోపాఠం కానీ మా అమ్మకు శ్రీశ్రీ కవిత గురించి ఎలా తెలిసింది? టీవీలో ఆకలి రాజ్యం సినిమా చూసి ఉంటుందా! చూసినా ఇంతలా ఎలా గుర్తు పెట్టుకుంది?

ఆ సందేహం ఇప్పటికీ నివృత్తి కాలేదు.



(08-05-2022)  

   

కామెంట్‌లు లేవు: