13, మే 2022, శుక్రవారం

మనుషులు చేసే పనులేనా! – భండారు శ్రీనివాసరావు

 

బెజవాడలో డాక్టర్ కొమ్మూరి సాంబశివరావు (నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాల రావు గారి నాన్నగారు) గవర్నర్ పేట పోస్టాఫీసు దగ్గర క్లినిక్. ఆయన ఒక రోగితో చెబుతుంటే విన్నా. ‘ఈ మందులు సరిగా వాడకపోతే చచ్చిపోతావ్’ అని.
నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత కటువుగా చెప్పాలా అని. కానీ ఆయన అన్నారు ఇలా.
‘మనిషికి చావు భయాన్ని మించిన భయం వుండదు. ఈ రోగి నా దగ్గరకు రావడం ఇది పదో సారి. ఎప్పుడూ సరిగా మందులు వాడడు. ప్రాణం మీదకు వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తుంటాడు’
ఈ నేపధ్యం తలచుకోవడానికి కారణం వుంది.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజుల్లో యావత్ ప్రపంచం మృత్యువు ముంగిట్లో వుంది. లక్షల మంది కరోనా కోరల్లో చిక్కుకుని చనిపోయారు. దాదాపు ప్రతి కుటుంబం తన ఆత్మీయులలో ఒకరినో ఇద్దరినో పోగొట్టుకుంది. కొందరికి ఆ గాయాలు ఇంకా గుండెలో పచ్చిగా వున్నాయి. కరోనా భయం అనేది వున్నవారు లేనివారు అనే తేడా లేకుండా సమస్త సమాజాలను ఒకే తీరున వణికించింది. జీవితం అశాశ్వతం అనే నిర్వేదంలోకి మానవ జాతి వెళ్ళిన ఏకైక సందర్భం.
కానీ ఏం లాభం? ఏడాది తిరక్క మునుపే కింది వార్తలు చూడండి.
‘ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధురాలిపై అత్యాచారం’
‘నడి రోడ్డు మీద నరికి చంపిన హంతకులు’
‘వెంటాడి వేటాడాడు. చనిపోయాక కూడా రేప్’
‘భర్త ఆవేశం మరణ శాసనమై’
‘పెళ్ళికి ఒప్పుకోలేదని కాల్చి చంపేశాడు’
‘వివాహితపై అత్యాచారం’
‘ఫేస్ బుక్ ఫ్రెండ్ తో ప్రియుడిని చంపించిన మహిళ’
కుక్క తోక వంకర సామెత గుర్తుకు వస్తే తప్పు పట్టాలా!
(13-05-2022)

కామెంట్‌లు లేవు: