7, మే 2022, శనివారం

ఆంధ్రపత్రిక కధ – భండారు శ్రీనివాసరావు

 జర్నలిస్ట్ మిత్రుడు పాశం యాదగిరి చెప్పిన ఓ మనసున్న మనిషి కధ

రాధాకృష్ణ అంటే గుర్తు పట్టడం కష్టం. అదే ఆంధ్రపత్రిక రాధాకృష్ణ అంటే తెలియనివాళ్ళు వుండరు.

ఆ శివలెంక రాధాకృష్ణ గురించే యాదగిరి చెప్పింది.

కాశీనాధుని నాగేశ్వర రావు గారు స్థాపించిన ఆంద్ర పత్రిక దినపత్రిక తొలిరోజుల్లో బొంబాయి నుంచి ఆ తరువాత మద్రాసు నుంచి మొదలయి తదుపరి విజయవాడ నుంచి, హైదరాబాదు నుంచి ప్రచురణ సాగించింది. నాగేశ్వరరావు పంతులు గారి అల్లుడు శివలెంక శంభుప్రసాద్ ఆధ్వర్యంలో ఒక వెలుగు వెలిగిన ఆంధ్రపత్రిక చివరకు ఆయన కుమారుడు శివలెంక రాధాకృష్ణ చేతిలో కొన్నేళ్ళు నడిచి ఆగిపోయింది. హైదరాబాదులో బషీర్ బాగ్ లో ఒక పెద్ద భవనంలో ఆంధ్రపత్రిక కార్యాలయం వుండేది. ముక్కు శర్మ గారు, పాపయ్య శాస్త్రి గారు,  సుందరం, యాదగిరి, వేణుగోపాల్, విద్యారణ్య, వెంకట రత్నం  మొదలయిన వాళ్ళు బ్యూరోలో పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక ఈవెనింగ్ ఎడిషన్ కు మంచి గిరాకీ వుండేది. పత్రికారంగంలో ఎదురయిన పోటీ తట్టుకోలేక అది మూతపడే సందర్భం వచ్చింది.

విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అంజయ్య గారు పత్రికకు ఏదో సాయం చేయాలని సంకల్పించుకుని నామ మాత్రపు ధరకు ఆ భవనాన్ని వాళ్ళకే విక్రయించేలా ఏర్పాటు చేయమని తన కార్యదర్శి రాఘవేంద్ర రావు గారిని కోరారు. విషయం దాదాపు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో రాధాకృష్ణ గారు ఇలా (బహుశా యాదగిరితో కాబోలు) అన్నారు.

చిన్న పిల్లలకు మిఠాయిలు చూడగానే వాటినన్నిటినీ తినాలని అనుకుంటారు. అన్నీ తెచ్చుకుని ప్లేట్లో పెట్టుకుంటారు. ఒకటి రెండు తినగానే నిద్ర వస్తుంది. ప్లేట్లో మిఠాయిలు అలాగే వుంటాయి. మనుషులమూ అంతే. ఎన్నెన్నో ఆస్తులు కూడబెట్టి అనుభవించాలని అనుకుంటాం. నానా అవస్థలు పడి ఆస్తులు పోగేస్తాం. ఏం లాభం! అనుభవించే వ్యవధానం లేక శాశ్వత నిద్రలోకి జారుకుంటాం’

ఇలాంటి వేదాంతంతో ఆనాడు ఎంతో విలువైన ఆస్తిని ఆయన తృణప్రాయంగా వదులుకున్నారు. అదే వుంటే ఆంధ్రపత్రిక బతికేదేమో! కానీ ఆ పత్రిక ఏ విలువలకోసం పెట్టారో అవి కాలగర్భంలో కలిసేవేమో!

కామెంట్‌లు లేవు: