29, ఆగస్టు 2015, శనివారం

గుంటూరు ఆసుపత్రిలో సర్పమూషిక న్యాయం


సాధారణంగా న్యాయస్థానాలు భావోద్వేగాలకు అతీతంగా తామరాకుమీది నీటి బొట్టు మాదిరిగా వ్యవహరిస్తాయి. అయితే మానవ హక్కుల కమిషన్ ఒక కేసు విషయంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యక్తపరచిన విధానం ఆ కేసులోని తీవ్రతను తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పసికందును ఎలుకలు కొరికి చంపిన దారుణ  సంఘటనను  చాలా  తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కమిషన్ జారీ చేసిన ఆదేశాల్లో ఉపయోగించిన పదజాలం తెలుపుతోంది.   మామూలుగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కమిషన్ స్పందించి, సంబంధిత అధికారులకు జారీ చేసే ఆదేశాలు, ఇంగ్లీష్ భాషలో, ఒక నిర్దిష్ట పద్దతిలో, ఒక రకంగా చెప్పాలంటే పడికట్టు పదాలతో,  ఒకే మూసలో వున్నట్టు కానవస్తాయి. కానీ గుంటూరు సంఘటన విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించిన తీరు, ఈ సాంప్రదాయక  విధానానికి భిన్నంగా వుంది. ఈ సారి కమిషన్ ఆదేశాలు సరళమైన తెలుగులో, ఉద్వేగ పూరిత భావజాలంతో,  అదీ చేతిరాతతో వెలువడ్డాయి.
‘నిర్లక్ష్యం కమ్ముకున్న ఈ వ్యవస్థలో ..ఆ తల్లికి  బిడ్డను తెచ్చి ఇవ్వగలమా? దీనికి బాధ్యులు ఎవ్వరు ?’ అని  కమి షన్ ప్రశ్నించింది. వైద్యులను ప్రాణదాతలుగా కొలిచే సమాజంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని చీవాట్లు వేసింది. అంతేకాదు, పసికందును ఎలుకలు పీక్కు తిన్నాయని తెలిసినప్పుడు నిర్ఘాంతపోయిన యావత్  సభ్య సమాజం మాదిరిగానే మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందన్న విషయం ఆదేశాల్లో పొందుపరచిన అతిలోతయిన భావాలు చదివితే అర్ధం అవుతుంది.
‘అమ్మా! నేను ప్రపంచంలోకి వస్తున్నా! నాకు భావి పౌరుడిగా ఎదగాలని వుంది. ఎందుకమ్మా నన్ను  ఈ ఆసుపత్రికి తీసుకువచ్చావ్?’ అని ఎలుకలు తన మీద దాడి  చేస్తున్నప్పుడు ఆ శిశువు యెంత మూగవేదన అనుభవించి వుంటుందో’ అంటూ కమిషన్ అచ్చ  తెలుగులో వ్యక్తపరచిన భావాలు సమస్య తీవ్రత పట్ల ఎంతగా కమిషన్ స్పందించి వుంటుందో అనే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
‘మనిషిని మనిషి కాటేసే సంఘంలో తామేమీ తీసిపోమని చాటిచెప్పేలా గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఆ పసి కందుపై దాడిచేశాయి. అవి కొరుకుతుంటే ఆ పసి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయిందో. ఈ ఘటన మన భాషకు, భావాలకు అందనంత హృదయ విదారకమైనది’ అంటూ కమిషన్  తన ఆదేశాల్లో పేర్కొన్నది.
‘దవాఖనాలు దెయ్యాల ఖానాల మాదిరిగా మారిపోయి పసివాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలు పసికందుల్ని పీక్కుతిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుతాం ?’ అన్నది కమిషన్ సంధించిన ప్రశ్న.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందును ఎలుకలు అత్యంత పాశవికంగా కొరుక్కు తినడం వల్ల ఆ శిశువు మరణించిన వార్తపై విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్  తనకు తానుగా సంకల్పించి సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.  
కమిషన్  స్వయంగా పేర్కొన్నట్టు ఆ పసికందు ప్రాణాలు తిరిగి తేవడం అసాధ్యం. కానీ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సింది ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.  
సరే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సంఘటనకు బాధ్యులయిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొందరు మంత్రులు, పాలక పక్షానికి చెందిన కొందరు  ఎంపీలు, ఎమ్మెల్యేలు హుటాహుటిన వెళ్లి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని  నలుమూలలా తనిఖీ చేసి, అక్కడి పరిస్తితులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే వాటిని చక్కదిద్దాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం  తమదయిన పద్దతిలో, షరా మామూలుగా కొన్ని చర్యలు తీసుకుంది. ప్రాధమిక దర్యాప్తు జరిపి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను, శిశువులకు చికిత్స చేసే ఒక వైద్య నిపుణుడిని బదిలీ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ  మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా చనిపోయిన శిశువు తాలూకు వారితో దురుసుగా ప్రవర్తించిన ఒక హెడ్ నర్సును, మరో స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.
ఆసుపత్రిలో ఎలుకలు రేపిన కలకలంతో కంగారు పడిన అధికారులు ఎలుకలు పట్టే ఓ వ్యక్తిని వెతికి పట్టుకుని ఎలుకలను పట్టించారు. రెండు రోజుల్లోనే 87 ఎలుకలు దొరికాయని సమాచారం. దొరికినవే ఇన్ని వుంటే దొరక్కుండా కలుగుల్లో ఇంకా ఎన్ని దాగున్నాయో అన్నది జవాబు దొరకని ప్రశ్న.
ఈ ఎలుకలను పట్టడానికి ఓ మనిషి దొరికాడు. కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో  అమాయకులయిన పేద  రోగుల్ని, అక్కడి ఖరీదయిన వైద్య పరికరాల్ని, మందుల్నీ ఎవరి కన్ను పడకుండా కరకరా నమిలి మింగుతూ, ‘వాతాపి జీర్ణం జీర్ణం’ అనుకుంటూ, చట్టానికి దొరక్కుండా కూడగట్టుకున్న అక్రమ సంపాదనలతో పెంచుకున్న బొజ్జల్ని హాయిగా నిమురు కుంటున్న ‘అసలు ఎలకల్ని’ ఎవరు పట్టుకోవాలి? ఎవరు పట్టిస్తారు? పట్టించినా ఏదో ఒక రకంగా తప్పించుకోగల ‘వారి’ తెలివితేటలకి  ఎవరు అడ్డుకట్ట వేస్తారు?


ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఎందుకంటె సమాజాన్ని దోచుకునే సంఘ విద్రోహ, ఆరాచక శక్తుల్లో ఎక్కడా కానరాని  సమైక్యత వుంటుంది. ఒకరినొకరు కాపాడుకోవడం, ఆపదలో పడ్డప్పుడు ‘సర్ప మూషిక న్యాయాన్ని’ పాటించడం వాటికి వెన్నతో పెట్టిన విద్య.
ఒక పాము, ఒక ఎలుక సమయం కలిసిరాక ఒకే బుట్టలో ఇరుక్కుపోయాయి. పాముకు ఎలక ఆహారం. తినేస్తే ఒక పనయిపోతుంది. కానీ బుట్ట నుంచి బయట పడక పొతే అంతే సంగతులు. అంచేత ఆ పాము యుక్తిగా ఎలకకు ఓ సలహా చెబుతుంది. తన పొడ గమనించి  ప్రాణభయంతో గడగడలాడిపోతున్న ఎలకతో చెబుతుంది. ‘నావల్ల నీకు ఎలాటి ప్రమాదం వుండదు. ముందు నీ దంతాలతో ఈ బుట్టకు ఓ రంధ్రం చెయ్యి. ఇద్దరం తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందాం’ 
ఎలక బతుకు జీవుడా అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. వెంటనే పాము ఆ ఎలకని ఎంచక్కా నమిలిమింగేసి, తరువాత ఎలక చేసిన  ఆ రంధ్రం ద్వారా బయట పడుతుంది.
ఈ సర్ప మూషిక న్యాయం ప్రకారం పరస్పర ఆధారిత స్వార్ధపర శక్తులు ఒకమేరకు తమలో తాము సహకరించుకుంటాయి. ఒక స్థాయికి చేరిన తరువాత తమ స్వార్ధానికి, తమ ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. సామాన్యులు మాత్రం ఇందులో శలభాలుగా మారతారు.
గుంటూరు ఆసుపత్రి సంఘటనపై విచారణ జరుగుతుంది. దోషులకు శిక్ష పడుతుంది. వ్యవస్థలోని లొసుగులను అడ్డం పెట్టుకుని వాళ్ళు కొన్నాళ్ళ తరువాత బయటపడతారు. అప్పటికి జనం ఈ విషయం మరచిపోతారు.  ఎలకలు కొరుక్కు తిన్న ఆ పసిపాప చిట్ట చివరి దైన్యపు చూపు నేతల జ్ఞాపకాల్లో రూపుమాసిపోతుంది. కడుపుకోతతో విలవిలల్లాడే  ఆ మాతృమూర్తి  వేదన అరణ్య రోదనే అవుతుంది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కావంటూ నాయకులు చెప్పే హామీలు మాత్రం పునరావృతం అవుతూనే వుంటాయి. ఇదొక విష చక్ర భ్రమణం. (29-08-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595         
NOTE : Courtesy Image Owner                    

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఒకప్పుడు వార్డులోంచి పసికందుల్ని కుక్కలు లాక్కుపోవడం, ఆ పసివాళ్ళు చనిపోవడం జరిగిన ఘనచరిత్ర కలిగినది గుంటూరు జనరల్ హాస్పిటల్. ఇక ఇప్పుడు వార్డుల్లో ఎలుకలు కూడా! అంతకంతకీ వేగం పుంజుకుంటూ అధోగతికి దిగజారుతున్న సమాజం. ఈ పతనానికి క్రిందివైపు అంచు కూడా లేదేమో!

ఆ పసివాడు చనిఫోవడం ఎలుకలు కొరకడం వల్ల జరగలేదని ఆ హాస్పిటల్ వైద్యులు / అధికార్లు / కమిటీ వారు అంటున్నారట. అయ్యుండచ్చు, అయ్యుండకపోవచ్చు; కానీ ఇటువంటి సంఘటనలు వారి నిర్లక్ష్యమే కాదు, insensitivity కి అద్దం పడుతున్నాయి. ఈ నిర్లక్ష్యధోరణి, మొద్దుబారినతనం వైద్యులతో పాటు నర్సులు, తతిమ్మా సిబ్బంది, అధికార్లు అందరిలోనూ ముదిరిపోయింది. దీనికి ప్రభుత్వ, ప్రైవేట్ / "కార్పొరేట్" అనే తేడానూ లేదు.
సస్పెన్షన్లు, బదిలీలతో సరిపెట్టడం కాక ఇటువంటి నిర్లక్ష్యాన్ని కూడా తీవ్రనేరంగా పరిగణించి, నేరస్ధులకి డిగ్రీ, లైసెన్సు రద్దుచేసి యావజ్జీవ కారాగార శిక్షకి తక్కువ కాకుండా జైలుశిక్ష కూడా వెయ్యాలి.