8, ఏప్రిల్ 2015, బుధవారం

పేలుతున్న తుపాకులు - పోతున్న ప్రాణాలు

(Published by 'SURYA' telugu daily in it's edit page on 09-04-2015, THURSDAY)

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో తుపాకులు టపటపా పేలుతున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసి  పోతున్నాయి. సిమి ఉగ్రవాదులు జరిపిన కాల్పులు  నలుగురు  పోలీసు అధికారులను  బలితీసుకోగా,  ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు  కాల్పుల్లో నేలకొరిగారు. ఈ సంఘటనలో పోలీసులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు బహుధా ప్రసంశనీయం. శిక్షణ పొందిన కరడుగట్టిన ఉగ్రవాదులతో వారు తలపడ్డ విధానం  అపూర్వం. వారి బలిదానాలను  ప్రజలు కలకాలం గుర్తుపెట్టుకుంటారు.  ఈ సంఘటనలతో రేకెత్తిన  సంచలనం సద్దుమణక్క ముందే వరంగల్ జిల్లా కేంద్ర కారాగారం నుంచి  విచారణ నిమిత్తం హైదరాబాదు తరలిస్తున్న ఆరుగురు ఉగ్రవాద నేరస్తులు  పోలీసులమీద దాడి జరిపి  తప్పించుకునేందుకు విఫల ప్రయత్నం చేసి  పోలీసులుల చేతుల్లోనే  కన్నుమూసారు. ఈ అంశంపై మీడియాలో చర్చలు సాగుతుండగానే మరో కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం చెట్లు నరికి అక్రమంగా తరలిస్తున్న రెండు ముఠాలపై  పోలీసులు కాల్పులు జరపడంతో ఏకంగా ఇరవై మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు.
దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన ఈ సంఘటనలు కొన్ని ప్రశ్నల్ని, మరికొన్ని అనుమానాలని జనం ముందు వుంచుతున్నాయి.

సాధారణంగా ఇటువంటి సంఘటనలను  'ఎన్ కౌంటర్లు' అని పిలుస్తుంటారు. ఈ పదానికి దగ్గరి  అనువాదం 'ఎదురు కాల్పులు'. అంటే ఏమిటి? ఎవరయినా కాల్పులు జరిపితే ప్రతిగా ఎదురు కాల్పులు జరపడం అన్నమాట. సూర్యాపేట, జానకీపురం సంఘటనలను  ఎన్ కౌంటర్లుగా భావించడానికి ఆస్కారం వుంది. మిగిలిన రెండు సంఘటనలు జరిగిన తీరు వేరే విధంగా వుంది. ఇరవై ఆరుమంది ప్రాణాలు కోల్పోయిన ఈ రెండు సందర్భాలలోనూ రక్షక సిబ్బంది 'ఆత్మరక్షణ' కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇస్తున్నారు. ఎన్ కౌంటర్ అనే పదం వీటికి వర్తించదు. ఎందుకంటె కాల్పులే తప్ప ప్రతికాల్పులు లేవు. ఉభయ పక్షాల్లో ఆయుధాలు వున్నది పోలీసుల దగ్గరే. అందువల్లే 'ఆత్మరక్షణ' పల్లవి ఎత్తుకున్నారు. ఇది మరీ విడ్డూరంగా వుంది. వరంగల్ జిల్లా ఆలేరు  సంఘటనలో మరణించిన ఆరుగురు ఉగ్రవాదుల చేతులకు బేడీలు తప్ప వారి చేతుల్లో ఆయుధాలు లేవు. తమ మీద దాడిచేసి, తమ ఆయుధాలను లాక్కుని తమపైనే ప్రయోగించాలని చూసారనీ, అంచేతే 'ఆత్మ రక్షణ'కోసం కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. ఈ కారణం యెంత మాత్రం హేతుబద్ధంగా లేదు. పైగా తమ అసమర్ధతని తామే బయట పెట్టుకుంటున్నట్టుగా వుంది. ఏదో ఒక హేతువు చూపాలి కాబట్టి ఒక కారణం చెప్పినట్టు వుంది. అంతేకాని సందర్భానికి అతికే విధంగా ఎంతమాత్రం లేదు. అలాగే శేషాచలం అడవుల్లో జరిగిన సంఘటనలు. ఈ సందర్భంగా కూడా పోలీసులు మళ్ళీ 'ఆత్మరక్షణ' సాకునే ఎంచుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లర చేత నియోగించబడిన 'కూలీలు' తమపై రాళ్ళతో దాడి జరిపారని, ప్రాణాలు కాపాడుకునేందుకు కాల్పులు జరిపామని షరా మామూలు వివరణే ఇచ్చారు. అయితే మీడియాలో కానవచ్చిన దృశ్యాలు ఈ వాదనకు యెంత మాత్రం బలం ఇచ్చేవిగా కనబడడం లేదు.


ఉగ్రవాదులను మట్టుబెట్టడం, స్మగ్లర్ల ఆట కట్టించడం తప్పని ఎవ్వరూ అనరు. కానీ అందుకు ఎంచుకున్న విధానమే ప్రశ్నార్ధకమవుతోంది. ప్రతి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే పోలీసు యంత్రాంగం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సమర్ధించుకోవడానికి ఇచ్చే ఈ విధమైన వివరణలే వారి చర్యల  విశ్వసనీయత పట్ల సందేహాలను పెంచుతున్నాయి. ఉదాహరణకు వరంగల్ సంఘటన తీసుకుంటే, కాలకృత్యం నెపంతో  సెక్యూరిటీ వాహనం దిగిన ఉగ్రవాదులు పారిపోవడానికి ప్రయత్నించారని, దాన్ని నిరోధించే క్రమంలో కాల్పులు జరిపామని చెప్పివుంటే మరో విధంగా వుండేదేమో. అలాగే శేషాచలం సంఘటన. ఆయుధాలు వున్నది పోలీసుల దగ్గర. కూలీలు దాడి చేసింది రాళ్ళతో. వాస్తవంగా ఆలోచిస్తే 'ఆత్మ రక్షణ' లో పడింది కూలీలా లేక పోలీసులా? ఇదంతా ఏదో హక్కుల సంఘాలు చెప్పినట్టు చెప్పడం కాదు. పోలీసులు చెప్పే వివరణ వాస్తవ ప్రాతిపదికపై వుండాలని మాత్రమే. పోలీసుల నిర్వాకంపై  హక్కుల సంఘాలకు ఎలాగూ అపనమ్మకమే. వారి వ్యవహారంపై  పోలీసుల విశ్వాసమూ అంతంత మాత్రమే. అయితే వీరిద్దరే కాదు. మధ్యలో జనం కూడా వున్నారు. హక్కుల పేరుతొ ఒకరూ, అధికారం పేరుతొ మరొకరూ వాదవివాదాలు పెంచుకుంటూ పోతుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేది మధ్యలో సంఘ విద్రోహశక్తులే అనే విషయం మరవకూడదు.
వరంగల్ సంఘటనలో చనిపోయిన ప్రధాన ముద్దాయి వికారుద్దీన్ కు ఉగ్రవాద సంస్థలతో అనుబంధం మాట అటుంచి నేర ప్రవృత్తి కూడా వుంది. జానకీపురం సంఘటనలో మరణించిన ఉగ్రవాదులు శిక్షణ పొందినవారు. వారు తాము నమ్మిన సిద్ధాంతం -  అది మంచిదా, కాదా అనేదానితో నిమిత్తం లేకుండా ముందుకు  సాగుతున్నవారు. వికారుద్దీన్ వ్యవహారం కొంత భిన్నమైనది. ఉగ్రవాదం ముసుగులో దందాలు చేసి పబ్బంగడుపుకోవాలని చూడడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతోంది. ఇటువంటివారివల్ల ప్రయోజనం పొందేవారు కూడా అధికంగానే వుంటారు. అందుకే వికారుద్దేన్ ఎన్ కౌంటర్ (?) రాజకీయ రంగు పులుముకుంటోంది.
ఉగ్రవాద భూతం యావత్ ప్రపంచాన్ని వొణికిస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి ఒంటరి ప్రయత్నాలు సరిపోవు. సంఘటిత కృషి అవసరం.
ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ సంగతి. కూలీల మరణం రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత రాష్ట్రం రాజకీయాలే కాదు, పొరుగు రాష్ట్రం రాజకీయాలు సయితం ఇందులో  జొరబడ్డాయి. ఇక అది ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.
కాకపోతే, సందర్భం ఎలాగు తటస్థ పడింది కాబట్టి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని మరో కోణంలో చూడాలి. స్మగ్లర్లు, వారి సంపాదనలు, వారి రాజకీయాలు పక్కనబెట్టి, ఒక్క ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే హక్కుభుక్తంగా వున్న ఎర్ర చందనం సంపదను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న దిశగా ఆలోచించాలి. అక్రమ రవాణాను నిరోధించడానికి వృధా ప్రయత్నాలు చేసే బదులు ఆ సంపదను సక్రమ మార్గంలో ఎగుమతి చేయగలిగితే ఉభయతారకంగా వుంటుంది. ఎర్ర చందనం అక్రమ తరలింపుల వల్ల అనేకమంది కోట్లకు పడగలెత్తివుండవచ్చు. అలాటి వారిలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు లేరంటే నమ్మశక్యంగా వుండదు. కొందరు అధికారులు, నాయకుల ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయల ఎర్ర చందనం దేశపు  ఎల్లలు దాటిపోవాలంటే, పోతున్నదంటే అది జేబులో పెట్టుకుని తీసుకువెళ్ళే బంగారం బిస్కెట్టు కాదు. ఎర్ర చందనం దుంగల్ని శేషాచలం అడవులనుంచి బయటి దేశాలకు తరలించాలంటే మధ్యలో అవరోధాలు, అవాంతరాల సంగతి అటుంచి ఎంతో మంది కూలీలు, మేస్త్రీలు, ఎన్నో వాహనాలు అవసరమవుతాయి. వీటన్నిటినీ మించి వాటిని అక్రమంగా తరలించేది పొరుగు ప్రదేశాలకు కాదు, ఓడల్లో విదేశాలకి. ఇన్ని దాటుకుని ఎర్ర చందనం జపాన్, చైనా వంటి దేశాలకు అలవోకగా చేరిపోతున్నదంటే, ఎన్ని చేతులు కలిస్తే ఇది సాధ్యం అవుతున్నదో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాలి. చెట్లను నరికే కూలీలకు కూడా ఈ నేరంలో భాగస్వామ్యం వుంటుంది. నిజమే. కానీ, వారిని మట్టుబెట్టి భయపెట్టడం ఒక్కటే పరిష్కారం కాబోదు. స్మగ్లర్లు  చేస్తున్న వ్యాపారాన్ని ప్రభుత్వమే తన చేతుల్లోకి తీసుకోవాలి. అప్పుడే అన్ని ఆగడాలకు, అరాచకాలకు కళ్ళెం పడుతుంది.
ఎర్ర చందనం సమస్యకు కావాల్సింది తాత్కాలిక ఉపశమనం కాదు. శాశ్విత పరిష్కారం. (08-04-2015)

(రచయిత మొబైల్: 98491 30595 ఈ మయిల్:  bhandarusr@gmail.com)          

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వీరప్పన్ ని వెంటాడి పట్టుకోవడానికి కొన్ని వేల మందిని నియమించి చంపేసింది , స్మగ్లర్ అని .
అదే ప్రభుత్వం , ఈ స్మగ్లర్ల కి ఒక్కొక్కరికి మూడు లక్షలు ఇస్తుంది . ఇంక రేపటి నుండి బయలుదేరతారు , చస్తే బడా బాబు లు ఇచ్చే దాంతో పాటు ప్రభుత్వం కూడా ఇస్తుంది కదా . అసహ్యం వేసే రాజకీయాలు ఏంటంటే , స్మగ్లర్ లు చనిపోతే కులం పేరు ఎందుకు వస్తుందో అర్ధం కావడం లేదు . రఘురామిరెడ్డి కి పిచ్చెక్కింది . ఎవరైనా మొహం మీద ఉమ్మేసి చెప్పాలి . సాక్షి అయితే , జగన్ నే చంపేసినట్టు అయిదు నిమషాలకి ఒకసారి ఖండిస్తుంది .
ఫేస్బుక్ లో కొంతమంది పని లేని పెద్ద పేరున్న తలకాయలు అయితే కారంచేడు కన్నా దారుణం అని రాసేస్తున్నారు .

ఇంత లా ఏడ్చే ఈ జనం ఇంతకు ముందు పోలీస్ లుని చంపేటప్పుడు ఏం చేస్తున్నారు , ఆ కూలి లని అడ్డువాలని ఏ రోజు ఎవడు చెప్పలేదేందుకో . చనిపోవడం బాధాకరం, కాని దాని చుట్టూ అల్లుకుంటున్న రాజకీయాలు ఇంకా ఘోరం .


శరత్ కాలమ్ చెప్పారు...

అబద్దం ఆడినా అతికినట్లు చెప్పమంటారు!

వజ్రం చెప్పారు...

ఇంతకుముందు దాడుల్లో చనిపోయిన పోలీసులసంగతీ ఈ దాడిలో గాయపడ్డ 11 మంది పోలీసుల సంగతీ కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది.ఎన్ కౌంటర్ అంటే దాడికి ప్రతి దాడి, అది కాల్పులే కానవసరం లేదు.