10, ఏప్రిల్ 2015, శుక్రవారం

కూర్చో! ఇప్పుడే వస్తా....!


తిరుపతయ్య గ్రామ రెవెన్యూ  అధికారి దగ్గరికి వెళ్ళాడు చిన్న పని మీద.
'ఇదిగో ఇప్పుడే వస్తా! ఎమ్మార్వో గారు వెంటనే రమ్మనమని ఫోను. గంటలో తిరిగొస్తా, ఇక్కడే కూర్చో' అంటూ వీఆర్వో  మోటారు సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు.  
వీఆర్వో ఆఘమేఘాల మీద వెళ్లేసరికి ఎమ్మార్వో  అతడికోసమే ఎదురుచూస్తున్నట్టు మొహం పెట్టి, వచ్చావా! మొన్న చెప్పాను చూడు...' అంటూ ఉండగానే ఆయన చేతిలో సెల్లు ఘల్లున మోగింది. కంగారుగా వింటూనే  అంతకంటే కంగారుగా 'ఇదిగో ఇప్పుడే  జేసీ గారు వున్నాఫలాన రమ్మంటున్నారు, మాట్లాడి ఇప్పుడే వస్తా కూచో' అంటూ అంతకంటే  కంగారుగా వెళ్ళిపోయాడు ఎమ్మార్వో జీపెక్కి.  జేసే గారి ఆఫీసుకు చేరి కనుక్కుంటే ఆయన పియ్యే చావు కబురు చల్లగా చెప్పాడు, 'మిమ్మల్ని రమ్మనమని ఫోను చేసారా, అలా రమ్మనమని కలెక్టరు దొరగారి ఫోను. పని చూసుకుని వస్తారు కూర్చోండి అన్నాడు జేసీ గారి పియ్యే తాపీగా.
అక్కడ జేసీ గారికి కలెక్టర్ ఆఫీసులో ఇదే సీను. 'మంత్రి గారు కబురు పెడితే వెళ్ళారు, వస్తారు కూర్చోండి అంటూ క్యాంప్ క్లర్కు మర్యాద.
కలెక్టర్ గారి  కారు మంత్రి గారి బంగ్లాలో ప్రవేశిస్తూ ఉండగానే గేటు దగ్గరే ఎదురొచ్చింది మంత్రి గారి వాహనం. 'ఇదేమిటి  రమ్మనమనిచెప్పి  ఎటూ వెడుతున్నట్టు' అని  అనుకుంటూ ఉండగానే సెల్లు మోగింది. అవతల మంత్రి గారు. 'చూడండి కలెక్టర్ గారు అర్జెంటు పనిమీద రమ్మన్నాను. కానీ ఈలోగా సీఎం గారి నుంచి కబురు వెంటనే రమ్మనమని. వెళ్లి వస్తా  కాసేపు వెయిట్ చేయండి, ఏమనుకోవద్దు'
మంత్రిగారు సీఎమ్ ఇంటికి వెళ్లేసరికి ఆయన ఢిల్లీ ఫోనులో వున్నారు. అది తెమిలేసరికి రాత్రి ఎనిమిదయింది. మంత్రిగారిని చూస్తూనే ఆయన అన్నారు 'అయ్యో ఇంతసేపు వెయిట్ చేస్తున్నారా. ఏదో చిన్న విషయం మాట్లాడదామనుకున్నాను. మళ్ళీ చూద్దాం లెండి' అన్నారు 'మళ్ళీ రండి' అన్న భావం కళ్ళల్లో ప్రదర్శిస్తూ.
అక్కడ వూళ్ళో వీఆర్వో గారింట్లో తిరుపతయ్య, ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్వో, జేసీ కార్యాలయంలో ఎమ్మార్వో, కలెక్టర్  క్యాంప్ ఆఫీసులో జేసీ, మంత్రిగారింట్లో కలెక్టర్, ముఖ్యమంత్రి నివాసంలో మంత్రిగారు - అందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా గడ్డాలు, మీసాలు పెంచుకుంటూ ఎదురుచూపులు.


ఏదో బట్టల సబ్బు ప్రకటనలో మాదిరిగా ఇది 'ఆఖరిసారి' కాదు, మళ్ళీ మళ్ళీ జరిగే తంతే!

NOTE: Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు: