10, డిసెంబర్ 2014, బుధవారం

రక్తం తాగుతున్న రోడ్లు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 11-12-2014, THURSDAY)

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని వేలమంది మరణిస్తున్నారని ప్రభుత్వాలు గణాంకాలు విడుదల చేస్తుంటాయి. కానీ ఆ ప్రమాదాల్లో అర్ధాంతరంగా కన్నుమూసిన వారి కుటుంబాల వ్యధ గురించి ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోరు. అటువంటి వారి అకాల మరణం ఒక తీరని వెత అయితే, అందువల్ల వారి వారి కుటుంబాల్లో ఏర్పడే పరిణామాలు, పర్యవసానాలు చాలా తీవ్రంగా వుంటాయి. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి  ఒక కుటుంబానికి ఏకైక ఆధారం కావచ్చు. మంచిగా  చదువుకుంటూ భవిష్యత్తులో ఒక కుటుంబానికి చక్కని ఆసరా కాగలిగిన విద్యార్ధి కావచ్చు. అన్నింటికీ మించి ఆ పోయిన ప్రాణం, విలువ కట్టలేని అతి విలువైన ప్రాణం. అలాటివాటికి పరిహారం ప్రత్యామ్నాయం కానేరదు.
అనేక విలువైన ప్రాణాలను గాలిలో కలిపేస్తున్న రోడ్డు ప్రమాదాలకు అనేకానేక కారణాలు. అతివేగం వీటిల్లో ప్రధానమైనది. వేగంగా దూసుకుపోయే అధునాతన మోటారు వాహనాలు, వాటితో వాయువేగంతో ప్రయాణించగల అధ్బుతమైన రహదారులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని అన్న చందంగా  వాటిని నడిపే వారిలో అత్యధికులు పాత పద్దతుల్లోనే వాహనాలను నడపడానికి అలవాటు పడిన వారు. అధవా వాటిని నడిపే మెలకువల్లో ప్రవేశం వున్నా వేగంగా వాహనాలను నడపడంలో వారికి ఉత్సాహం వుంది కానీ ఎదురుకాగల ప్రమాదాల విషయంలోనే  ఎరుక లోపిస్తోంది. అందుకే మంచి రోడ్లు, మంచి వాహనాలు వున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే బెరుకు పుట్టిస్తున్నాయి. బాధితుల కుటుంబాల్లో గుబులు రేకిస్తున్నాయి. విలువైన మానవ వనరులను ఆవిరి చేస్తున్నాయి.
ప్రమాదాలకు పెద్దంతరం చిన్నంతరం లేదు, పేదా గొప్పా తారతమ్యం లేదు. చివుక్కుమనిపించే నిజం ఏమిటంటే, రోడ్డు ప్రమాదాల్లో కలవారు కన్నుమూస్తే, పత్రికల్లో పతాక శీర్షికలు, సామాన్యులు చనిపోతే సింగిల్ కాలాలు. అంతే  తేడా!     
హైదరాబాదు నగరం చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు చూసినప్పుడు మనమూ ఎవరికీ తీసిపోలేదని అనిపిస్తుంది. దానిమీద ప్రయాణిస్తున్నప్పుడు అద్భుతమైన అనుభూతి. ఎక్కడో విదేశాల్లో చూసే అవీ సినిమాల్లో చూసే అందమైన రహదారులు మన సొంతం అయ్యాయని అనిపిస్తుంది. ఈ మధ్య అమెరికా నుంచి వచ్చిన మితృడిని ఆ మార్గంలో తీసుకువెడితే అతడన్న మాట నన్ను నిరుత్తరుడిని చేసింది. ఇలాటి రోడ్డు  వేసిన వాళ్ళను ఆ దేశంలో జైలుకు పంపుతారని అతడి వ్యాఖ్యానం. వేగంగా వెళ్ళే వాహనాలు అంతే వేగంతో మలుపు తీసుకోవడానికి వీలైన విధంగా రోడ్డు నిర్మాణం లేదన్నది అతగాడి అభిప్రాయం. అంటే రోడ్డు నిర్మాణ దశలో ఎదురయిన వొత్తిళ్ళకు అనుగుణంగా రోడ్డు మలుపులు తిరుగుతూ వెళ్ళిందన్నది అతడి మాటల తాత్పర్యం. అందులో నిజానిజాల మాట తెలియదు కాని, ఆ రోజుల్లో  పనిచేసిన రాజకీయ వొత్తిళ్ళు ఎలాటివో తెలుసు కనుక కిమ్మనకుండా వుండిపోయాను. అలాగే సాధారణ వేగంతో సాధారణ రహదారులపై సాధారణ వాహనాలను నడపడానికి అలవాటుపడిన వాళ్ళు అసాధారణమైన వేగంతో వెడుతూ, లేన్లు మార్చుకుంటూ వాహనాలను నడిపే ప్రావీణ్యం సంపాదించుకోలేదన్న వాస్తవం ఆ రోడ్డుపై తిరిగే వాహనాలను కొద్దిసేపు పరికిస్తే ఇట్టే అర్ధం అవుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రహదారి సూచికలను ఓ పక్క గమనిస్తూ, మరో పక్క అలవాటులేని వేగంతో ప్రయాణిస్తూ, సరయిన బాటలో వేడుతున్నమా లేదా అనే సంశయంతో మధన పడుతూ, దారిపక్కన కనీసం టెయిల్ ల్యాంపులు కూడా లేకుండా ఆపివుంచిన వాహనాలను చూస్తూ బండి నడపడం అన్నది ఇంకా చాలామందికి అలవడినట్టు లేదు.
ఇక హైదరాబాదు నుంచి విజయవాడ వైపు అలాగే రెండు రాష్ట్రాలలో అనేక ప్రదేశాలను కలుపుతూ కొత్తగా  నిర్మించిన నాలుగు లేన్ల రహదారుల పరిస్తితి కూడా ఏమంత భిన్నంగా లేదు. విశాలమైన రహదారులను విదేశాలకు దీటుగా నిర్మించుకోగలిగాం అని గొప్పలు చెప్పుకోవడం కూడా 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామెతను మరిపించేదిగా వుంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ హైవేస్ (జాతీయ రహదారులు) ని ఫ్రీ వేస్ అంటారు. అవి నగరాలను కలుపుతాయి కాని వాటి మధ్యగా పోవు. దారి నడుమ నగరాలను కలుపుతూ మళ్ళీ అనుసంధాన మార్గాలు వుంటాయి. అదే మన దగ్గర హైదరాబాదు - విజయవాడ అరవై అయిదో నెంబరు జాతీయ రహదారి విషయం చూడండి. ఆ రోడ్డు కొన్ని చోట్ల వూళ్ళ మీదుగా పోతుంది. మరికొన్ని చోట్ల వూళ్ళ నడుమ నిర్మించిన  ఫ్లయ్ వోవర్ల మీదుగా వెడుతుంది. ఇంకొన్ని చోట్ల ఊళ్లకు దూరంగా వెడుతుంది. అంటే ప్రతిచోటా రాజకీయ వొత్తిళ్ళకో లేక మరో మరో కారణం చేతనో  రోడ్డు 'రూటు' మారిపోయిందని అనుకోవాలి.  అంటే అర్ధం ఏమిటి? రోడ్డు నిర్మాణంలో ఆత్రుత  తప్పితే భద్రతా ప్రమాణాల విషయంలో శ్రద్ధ పెట్టలేదనుకోవాలి. ఈ దారిలో ఒక్క నల్గొండ జిల్లాలోనే ఏటా వెయ్యిమంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు  కోల్పోతున్నారని లెక్కలు తెలుపుతున్నాయంటే భద్రత పట్ల పెట్టాల్సిన శ్రద్ధలో శ్రద్ధ తగ్గిందని కూడా అనుకోవాలి. ఆ విషయం అలా వుంచండి.  అధికారులు నిర్ణయించిన వేగ  పరిమితుల్లోనే వాహనాలు నడుపుతున్న డ్రైవర్ కు హఠాత్తుగా రోడ్డు మధ్యలో ఆవులూ, గేదెలు  ఇతర జంతువులు  కనిపిస్తే, రాంగు రూటులో ఎదురుగా దూసుకువస్తున్న మరో వాహనం ఎదురయితే,  'యాక్సిడెంటు' సంగతి దేవుడెరుగు ముందు గుండె ఆగినంత పనవుతుంది. మరి వీటికి ఎవరు కారణం? పాలకులా, అధికారులా, వాహనదారులా?  

       
ఒక ప్రమాదం జరిగినప్పుడు మరీ ప్రత్యేకించి అందులో ఎవరయినా ముఖ్యుడు మరణించినప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి. మీడియాలో చర్చలు జరుగుతాయి. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే దానిపై నిపుణులు సలహాలు ఇస్తారు.
అంతే! మరో ప్రమాదం జరిగి మరో ముఖ్యుడు మరణించేవరకు నిశ్శబ్దం.
కటువుగా అనిపించవచ్చు కాని నిజానికది  'స్మశాన నిశ్శబ్దం'
(10-12-2014)

NOTE: Courtesy Image Owner 

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

The most common reasons:
1) Stopping vehicles on road without parking signals
2) In 4 line road, to save oil on a long 'U' turn, people taking wrong direction, that to in line nearer to median(brain less fellows)
3) The break lights are not working for most of the vehicles
4) Turning left/right without indicator lamps
5) Not being aware of right-of-way rule by many
6) No checks on vehicle conditions by RTO
7) Lenient driver license issue
8) Lack of strict laws of collecting fines from who caused license and compensating the whom loss occurred; making RTO/R&B Officials responsible if they are responsible

--Bhaskar

అజ్ఞాత చెప్పారు...

Few years ago I was travellin in India on taxi with two families - women and children included. The driver was driving in the wrong lane where the lorry was coming opposite but this guy said it is OK since it is day light and driving in the opposite direction is ALLOWED! Lucky we lived.