13, డిసెంబర్ 2014, శనివారం

వండనలయదు వేవురు వచ్చిరేని..


ఎనభయ్యవ దశకం చివర్లో మేము మాస్కోలో వున్న ఆ రోజుల్లో,  ఆవిడను చూసినప్పుడల్లా 'వండనలయదు వేవురు వచ్చిరేని...అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి...' అని మనుచరిత్రలో ప్రవరాఖ్యుడి భార్య గురించి చదువుకున్న పద్యం గుర్తుకు వచ్చేది.
ఆవిడ ఇవ్వాళ లేరు. నిన్ననే అన్నీ ముగిసిపోయాయని ఆమె కుమారుడు రాహుల్ పొద్దున్నే ఇచ్చిన  ఎస్ ఎం ఎస్.
ఆవిడ సుందరమ్మ గారు.  ఆ రోజుల్లో మాస్కోలో చదువుకునే చాలామంది తెలుగు పిల్లలకు మాస్టరు గారి భార్య. ఆ మాస్టారు సామాన్యుడు కాదు. రాదుగ  ప్రచురణ విచాగంలో పనిచేసి ఈ మధ్యనే కన్నుమూసిన ప్రసిద్ధ రచయిత, గ్రంధ విమర్శకుడు రాళ్ళభండి వెంకటేశ్వర రావు గారు. (ఆర్వీయార్ గా  ప్రాచుర్యం పొందిన ఆయన సుప్రసిద్ధ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ మీది అభిమానంతో తన ఏకైక పుతృడికి  ఆ పేరే పెట్టుకున్నారు) మాస్కోలో ఆయన ఇల్లు అన్నపూర్ణ నిలయం. రోజూ ఎంతమందో అక్కడ సుందరమ్మ గారి  చేతివంట రుచి చూసి  వెళ్ళేవారు. ఆర్వీయార్ గారి ముచ్చట్లు, సుందరమ్మగారి చేతి వంటలు వినీ, తినీ భుక్తాయాసంతో వెనక్కిమళ్లడం నాకింకా గుర్తు.

(మాస్కోలో శ్రీ ఆర్వీయార్ గారి ఇంట్లో అప్పటి కేంద్ర మంత్రి శ్రీ శంకరానంద్ తో - గులాబీ రంగు చీరెతో వున్నది సుందరమ్మ గారు) 


ఎంతోమందికి పట్టెడన్నం పెట్టిన ఆ పుణ్యాత్మురాలికి సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను. (13-12-2014)

కామెంట్‌లు లేవు: