14, సెప్టెంబర్ 2013, శనివారం

మౌన వేదన


ఐ నో సీఎం. ఐ నో పీఎంఅనుకునే  జర్నలిస్టుల జీవితాలు పైకి కనిపించేంత గొప్ప కరెన్సీ కాగితాలేమీ కావు.  వారికి వృత్తి రీత్యా  సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో  పరిచయాలకు ఆస్కారం చాలా తక్కువ. అందుకే, కొందరు సాటి జర్నలిస్టులు  చనిపోయినప్పుడు  విషయం  తెలిసికూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్లి పరామర్శించలేకపోవడానికి ఇదే కారణం. చనిపోయిన వ్యక్తి  తప్ప వేరే ఎవ్వరూ  తెలవదు. తెలిసిన ఒక్కరికి మనం  వచ్చిన విషయం తెలియదు. ఇది పైకి చెప్పుకోలేని ఓ  పెను విషాదం.
ఇలాటి  సందర్భాలు రాకూడదని కోరుకుంటాము. కానీ కోరినదే జరిగినచో దైవం ఎందులకు.


(మిత్రుడు వి. చంద్రశేఖర ఆజాద్) 

ఈ సాయంత్రం వి. .చంద్రశేఖర ఆజాద్ కన్నుమూసాడు. ఆజాద్ గా నలుగురికీ తెలిసిన అతడు  ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో సుదీర్ఘ కాలం పనిచేశాడు. నాకంటే పెద్దవాడు. డెబ్బయ్ వుంటాయేమో. నేను 1971లో బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరిన కొన్నాళ్ళకు ఆజాద్ కూడా సబ్ ఎడిటర్ గా వచ్చాడు. దాదాపు మూడున్నర  ఏళ్ళు కల్సి ఒకే ఆఫీసులో పనిచేశాము. భేషజాలు లేని మనిషి. మనసులో ఏదీ దాచుకోని తత్వం.  నేను రేడియోలో చేరిన తరువాత మళ్ళీ  చాలా ఏళ్ళ తరువాత హైదరాబాదులో కలిశాము. ఈనాడు హైదరాబాదు ఎడిషన్ లో చేరాడు.
కొన్నాళ్ళుగా కేన్సర్ తో బాధ పడుతున్నాడు. చికిత్సకు లొంగని ఆ పాడురోగం శారీరకంగా దెబ్బతీసింది కాని, మానసికంగా లొంగదీసుకోలేక  పోయింది. అతడి  ధైర్యం చూసి ఇతగాడు ఆ జబ్బును జయిస్తాడని కూడా అనిపించింది. అయితే చివరకు ఆ జబ్బే జయించింది. ఈ సాయంత్రం తుది శ్వాస విడిచాడు.
జాతస్య మరణం ధృవం అనే మాటలో నిజం వున్నా తెలిసిన వాళ్లు పోయినప్పుడు ఇది గుర్తుకురాదు. ఇదో నిజం.

(14-09-2013)

కామెంట్‌లు లేవు: