24, మార్చి 2022, గురువారం

అసెంబ్లీ నాడు నేడు – భండారు శ్రీనివాసరావు

 

ఈ అంశం మీద మాట్లాడమని భారత్ టు డే టీవీ వాళ్ళు అడిగితే చెప్పిన నాలుగు మాటలు ఇవి:

“శాసన సభలు అప్పుడు ఎలా పనిచేసేవి  ఇప్పుడెలా పనిచేస్తున్నాయి అన్నది కదా  మీ ప్రశ్న.

1975లో నేను రేడియో విలేకరిగా  మొదటిసారి శాసన సభ ప్రెస్ గ్యాలరీలో అడుగుపెట్టాను. అప్పటినుంచి 2005లో దూరదర్సన్ లో రిటైర్ అయ్యేవరకు అసెంబ్లీ ఇంచుమించు నా రెండోఆఫీసు అయింది. దాని ఎదురుగానే నేను పనిచేసే ఆకాశవాణి వుండడం వల్ల  అనుబంధం పెరిగింది. అన్ని  పార్టీల సభ్యులతో సాన్నిహిత్యం కూడా పెరిగింది.  కాలక్రమంలో వీరిలో అనేకులు మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కానీ వారితో పరిచయం చెక్కుచెదరలేదు.

“అప్పుడు అసెంబ్లీ పాత భవనంలో వుండేది.  ప్రెస్ గేలరీ మొదటి అంతస్తులో వుండేది. పైకి వెళ్ళడానికి రాజభవనంలో మాదిరిగా తివాచీ పరచిన  చెక్క మెట్లు ఉండేవి.  కింద శాసన సభ ప్రధాన మందిరం. స్పీకర్ స్థానం నుంచి  సభ్యుల సీట్ల వరుసలు కొంచెం కొంచెం  ఎత్తు పెరుగుతూ, సినిమా థియేటర్లలో సీట్ల వరుసలు మాదిరిగా,  అంచెలంచెలుగా  పైకి వచ్చేవి. సభ్యుల పై వరుసకు, ప్రెస్ గెలరీలోని విలేకరుల కింది వరుసకు నడుమ కొయ్యతో చేసిన గోడ మాత్రమే అడ్డం. మాట్లాడుకోవడానికి కూడా వీలుండేది.  అప్పుడప్పుడు ఆఖరి  వరుసలోని సభ్యులు తల వెనక్కు తిప్పి విలేకరులతో గుసగుసలాడేవారు. స్పీకర్ చూస్తున్నారు అనే అనుమానం కలగగానే తల ముందుకు తిప్పేవారు. సభలో క్రమశిక్షణ ఎలా ఉండేదో తెలియచెప్పడానికే ఇది చెప్పాల్సి వస్తోంది.

“ఇక్కడ ఒక మాట చెప్పాలి.

“సరిగా వినకుండా రాంగ్ రిపోర్ట్ చేస్తే సభాహక్కుల తీర్మానం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భయం విలేకరులకు వుండేది. అలాగే, సభలో వున్న సభ్యులు కూడా భయపడేవారు. ఏదైనా  ఎక్కువ తక్కువ మాట్లాడితే స్పీకర్ తమ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తే చిన్నతనంగా ఉంటుందని గుంజాటన పడేవారు.

“యాభయ్ ఏళ్ళ ముందు శాసన సభ నడిచిన  తీరు అది. యాభయ్ ఏళ్ళ తరువాత ఎలా నడుస్తున్నాయో ప్రత్యక్ష ప్రసారాల్లో జనం చూస్తూనే వున్నారు కదా!  

“ఏం రాసినా చెల్లుతుందని వీళ్ళూ, ఏం మాట్లాడినా ఏమీ కాదని వాళ్ళూ.

“స్థూలంగా చెప్పాలి అంటే అప్పటికీ ఇప్పటికీ నాకు కనబడుతున్న తేడాఇదే”



24-03-2022

 

   

  

కామెంట్‌లు లేవు: