25, డిసెంబర్ 2021, శనివారం

వాజ్ పాయ్ జ్ఞాపకాలు – భండారు శ్రీనివాసరావు

 

అరవై అయిదేళ్ళ పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ఇప్పుడు బీజేపీ. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో, ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, మునిసిపల్ స్కూలు ఆవరణలో సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్.
భాష అర్ధం కాని వారిని సయితం తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు చివరి రోజుల్లో మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.
చనిపోయి ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ ప్రజల మనస్సులో జీవించేవున్న వాజ్ పాయ్ జయంతి ఈరోజు.

కామెంట్‌లు లేవు: