15, డిసెంబర్ 2021, బుధవారం

నాన్నకు నివాళి – యాజి

 


జంధ్యాల వెంకటేశ్వర్లు గారు మరణించి నలభయ్ ఏళ్ళు దాటిపోయాయి. ఆయన తన జీవిత కాలంలో రాసుకున్న అనేక రచనలు కొన్ని వెలుగు చూసాయి. మరికొన్ని వ్రాత ప్రతులుగానే మిగిలిపోయాయి. వారి కుమారుడు జే.వి.పి.ఎస్. సోమయాజులు (యాజి) గారు వాటిని క్రోడీకరించి ‘నాన్నకు నివాళి’ పేరుతొ  ప్రచురించారు.

ఈ పుస్తకం ఈరోజు నా చేతికి అందినప్పుడు యాదాలాపంగా కొన్ని పేజీలు  తిరగేశాను. విషయ సూచికలో చంద్రమౌళీశ్వర శతకం, చంద్రమౌళీశ్వరి శతకం అని కనపడ్డాయి. ఇందులో రెండోది కొంత విచిత్రంగా అనిపించింది. చంద్రమౌళీశ్వరి అని అమ్మవారి పేరు మీద వుండడం దానికి కారణం.

సరే! అది పక్కనబెట్టి ఈ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాసిన విశ్వనాధ వారి పలుకుల్లో ఆయన శైలి ప్రస్పుటంగా  ఉన్నప్పటికీ వాటిలో రాసిన విషయాలు పుస్తకం మీద ఆసక్తి కలిగించేవిగా వున్నాయి.

కవిసామ్రాట్ కధనం ఇలా సాగింది.

“పంచశీలను గురించి, చీనా దురాక్రమణ గురించి కూడా వీరు (వెంకటేశ్వర్లు గారు) వ్రాసిరి. ఒక దృష్టితో చూచినచో వారు వ్రాసినదంతయు సమంజసముగా కన్పించును. సామంజస్యమనగా నేమి? పాఠకుని ఇష్టప్రకారముండుట. వానికి కొన్ని యభిప్రాయములుండును. ఆ అభిప్రాయములు తాను చదివిన గ్రంధములో నున్నచో వాడు గొప్ప కవి.  లేనిచో కాదు. సర్వ విధములైన భావములను చదివి వానియందున్న గుణములను చూడగలవాడే పాఠకుడు”   

ఈ అభిప్రాయం 1967 నాటిది. ఇది చదివిన తర్వాత విశ్వనాధ వారి దూరదృష్టి బోధపడింది. తర్వాత ఎప్పుడో దశాబ్దాల తర్వాత వచ్చిన ఫేస్ బుక్ పాఠకుల మనస్తత్వాన్ని ఆయన అంత ముందుగా ఎలా పసికట్ట కలిగారా అని అనిపించింది.

పొతే రచయిత పేరు చూసినా, విషయ పట్టిక చూసినా ఇందులో ఆధ్యాత్మిక భావాలు తప్ప వేరేమీ ఉండకపోవచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ఈ రచయిత రాసిన పద్యాలు చదివితే, గ్రాంథికభాషలో రాసిన శ్రీశ్రీ కవితల విప్లవతత్వం గోచరిస్తుంది.

అంటరానితనాన్ని ఏవగించుకుంటూ  జంధ్యాల వారు అల్లిన పద్యం మచ్చుకు ఒకటి:

“వేయి పల్కులేల వీధులందున సూక

రములు గార్దభములు గ్రామసింహ

ములు నిరంతరంబు మెలగవచ్చును గాని

అడుగునిడలేడు హరిజనుండు”

 

“నీచముగ నిట్లు మిమ్ముల జూచువారి

పొలము పనులకు మీరలు పోవనేల?

వారి వీధుల నడుగిడి ఘోరమైన

శాపముల బొందనేల నిష్కారణముగ!”

అలాగే రెండు శతకములలో కూడా మకుటంగా చంద్రమౌళీశ్వరా! చంద్రమౌళీశ్వరీ! అనే శివ పార్వతుల సంబోధనలు ఉన్నప్పటికీ ఆ పద్యాలలోని సారాంశం అంతా సామాజికమే కావడం ఓ విశేషం. మరో విశేషం ఏమిటంటే రచయిత కీర్తిశేషులు జంధ్యాల వెంకటేశ్వర్లు గారు విశ్వనాధ వారికి గొప్ప అభిమాని, శిష్యుడు, మిత్రుడు కూడా. విశ్వనాధ వారు తాము రచించిన ప్రద్యుమ్నోదయం ప్రబంధ కావ్యాన్ని తమ స్నేహానికి గుర్తుగా వెంకటేశ్వర్లు గారెకి అంకితం ఇచ్చారు.



తొంభయ్ పేజీల ఈ పుస్తకం ప్రచురణకర్త శ్రీమతి జంధ్యాల కల్పకం. ప్రతులకు (మూల్యం ఇవ్వలేదు) శ్రీ JVPS SOMAYAJULU, Mobile: 98490 80949        

కామెంట్‌లు లేవు: