14, డిసెంబర్ 2021, మంగళవారం

గీతాజయంతి

 కంచి పరమాచార్య వద్దకు ఒక పండితుడు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. భగవద్గీత ప్రవచనంలో తనకు అద్భుతమైన అనుభవం వుందనీ, పది రోజులపాటు గీతను బోధించడానికి ఏదైనా స్థానిక దేవాలయంలో వసతి కల్పిస్తే తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తానని చెప్పాడు. స్వామి అలాగే అన్నారు.

మొదటి రోజు సుమారు యాభై మంది దాకా ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చారు. మరునాడు సగం తగ్గిపోయారు. మూడోనాడు వచ్చిన జనం వేళ్ళమీద లెక్కబెట్టే విధంగా అతితక్కువగా వున్నారు. ఆ పండితుడు పరమాచార్యను కలిసి చెప్పాడు. “ఏమి కాంచీపురం అండీ ఇది. ఇంతకష్టపడి భగవద్గీతను చెబుదామని వస్తే మొదటి రోజు పట్టుమని యాభై మంది కూడా రాలేదు. మర్నాడు ఇంకా పలచపడ్డారు. వరస చూస్తుంటే రేపు ముగ్గురు కూడా వచ్చేట్టు లేరు.”

స్వామి మందహాసం చేసి ఇలా అన్నారు.

“నువ్వు అదృష్టవంతుడవే! కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించినప్పుడు వినడానికి వున్నది ఒకే ఒక్కడు. అందుకు సంతోషించు”

 

(మా అన్నయ్య భండారు పర్వతాలరావు గారు రాసిన పరమాచార్యుల పావనగాధలు పుస్తకం నుంచి)

 

 

కామెంట్‌లు లేవు: