11, మే 2019, శనివారం

‘టైమ్’ బాంబ్



(Published in SURYA telugu daily on 12-05-2019, SUNDAY)

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న దశలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన టైమ్ మేగజైన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఒక ముఖపత్రచిత్ర (కవర్ పేజి) కధనాన్ని ప్రచురించింది.
అనేక దేశాల అధినాయకులు, ప్రత్యేకించి వర్ధమాన దేశాల నాయకులు ఈ పత్రికలో తమ గురించి కధనాలు రావాలని ఉవ్విళ్ళూరుతుంటారు. అందులోను కవర్ పేజి కధనం అంటే మాటలా! దాని తీరే వేరు.
టైమ్ పత్రిక ప్రచురించిన ఈ కధనంతో కూడిన సంచిక మరో ఏడెనిమిది రోజుల్లో చదువరుల చేతుల్లోకి వస్తుంది. అయితే, ఈలోగానే  ఈ కధనం గురించిన అనేక సంచలన కధనాలు భారతీయ భాషల్లో వెలువడే అనేక దినపత్రికల్లో ఇప్పటికే వచ్చేశాయి.    
ఒక కధనానికి పత్రికలు లేదా మీడియా పెట్టే శీర్షికలు ఒక్కోసారి దానికి సంచలనతత్వాన్ని అద్దుతుంటాయి. అలాంటిదే టైమ్ పత్రిక  పెట్టిన ఒక శీర్షిక ‘ ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’. అంటే ‘భారత దేశపు విభజన సారధి’ అని అర్ధం చెప్పుకోవచ్చు.
ప్రముఖ జర్నలిస్ట్ ఆతిష్ తసీర్ మోడీ గురించి ఈ వ్యాసం రాసారు. ప్రధాని మోడీని, అయన విధానాలను తూర్పారబట్టే రీతిలో ఈ కధనం సాగింది.
2014 లో సగటు భారతీయ ఓటర్లకు ఉజ్వల భవిష్యత్తుపై అంతులేని ఆశలు రేకెత్తిస్తూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఇప్పుడు ఒక సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారన్నది ఆ వ్యాస సారాంశం. ఒకప్పటి ఆశావహ దృక్పధం మోడీలోఇప్పుడు కొరవడిందన్నది ఆ వ్యాస రచయిత అభిప్రాయం.
‘సమాజంలోని విబేధాలు నాడు అంటే 2014 లో మోడీ విజయానికి దోహదం చేశాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ మోడీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికలలో కూడా అవే పరిస్తితులను భరిస్తూ తనకు ఓటేయాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. గతంలో మోడీ చెప్పిన విషయాలు ఇవే. హిందూ పూర్వ వైభవం, దక్షిణ కొరియా మోడల్ అభివృద్ధి ఈ  రెండింటితో ఉజ్వల భవిష్యత్ నినాదం అప్పుడు కలిసివచ్చింది. కానీ అయిదేళ్ళ కాలం గడిచిపోయిన తర్వాత ఆయనిప్పుడు ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని సగటు రాజకీయ నాయకుడిగా మిగిలిపోయారు’ అని తసీర్ వ్యాఖ్యానించారు.
మోడీపై తసీర్ అక్షర దాడి ఇంకా ఇలా  కొనసాగింది.
‘ప్రధానమంత్రిగా మోడీ తీసుకున్న చర్యలు దేశంలో విద్వేషపూరిత మతపరమైన జాతీయ వాదాన్ని పెంచి పోషించడానికి తోడ్పడ్డాయి. మోడీ అయిదేళ్ళ పాలనలో దేశంలోని నిమ్న కులాలవారు, ముస్లిములు, క్రైస్తవులు వంటి అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు ఉదారవాదుల నుంచి దాడులు ఎదుర్కుంటున్నారని ఆయన ఆరోపించారు.
‘గత ఎన్నికల సందర్భంగా మోడీ ప్రవచించిన ఆర్ధిక విధానాలు అద్భుతాలు సృష్టించడం మాట అలా వుంచి అందులో ఏవీ వాస్తవ రూపం ధరించలేదు. అందరికీ అభివృద్ధి అనే ఆనాడు ఇచ్చిన నినాదం ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయింది. పైగా, ప్రజల నడుమ  తీవ్ర విబేధాలు నెలకొన్న పరిస్తితిని ఆయనే తెచ్చారు’ అన్నారు తసీర్.
అంతేకాదు, ఆ వ్యాసకర్త  తసీర్ ప్రధాని  మోడీపై తన విమర్శల పరంపర కొనసాగిస్తూ, ‘భారత్ మరో అయిదేళ్ళ పాటు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా’ అనే సందేహంతో కూడిన ప్రశ్నను సంధించారు.
ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే అయినప్పటికీ మోడీ అభిమానులకు ఊరట కలిగించే విషయం ఒకటుంది. అదేమిటంటే మరో అయిదేళ్ళు నరేంద్ర మోడీ పరిపాలన దేశానికి తప్పదనే నిగూడార్ధం ఇందులో దాగుంది.
కేవలం మోడీని విమర్శించడానికి, దుమ్మెత్తి పోయడానికి మాత్రమే ఉద్దేశించలేదని అనుకోవాలనో లేదా సమతుల్యం చేయాలనో తెలియదు కానీ రచయిత మోడీకి సంబంధించి కొన్ని ఉపశమన వాక్యాలను కూడా జొప్పించారు.
బలహీన ప్రతిపక్షం వుండడం మోడీ అదృష్టం, మోడీని  ఓడించడం తప్ప వీరికి మరో అజెండా లేదని ఆయన తేల్చేశారు. వారసత్వ సిద్ధాంతాలు మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు కొత్తగా ఇచ్చేది ఏమీ లేదని అన్నారు. ప్రతిపక్ష కూటమిని సిద్ధాంత సారూప్యత లోపించిన బలహీన కూటమిగా అభివర్ణించారు.
కాకపోతే, ఇదే సంచికలో మోడీని శ్లాఘిస్తూ, ఆకాశానికి ఎత్తేస్తూ మరో వ్యాసం ప్రచురించారు. బహుశా సమన్యాయం  చేయడానికి టైమ్ పత్రిక సంపాదక వర్గం ఈ విధానాన్ని ఎంచుకుని ఉండవచ్చు.
ఈరెండో వ్యాసాన్ని యూరేసియా గ్రూపు అధ్యక్షుడు ఇయాన్ బ్రెమర్ రాసారు.
భారత దేశంలో ఆర్ధిక సంస్కరణలు కొనసాగాలంటే అందుకు మోడీనే సరైన వ్యక్తి అని ఆయన అభివర్ణించారు.
‘భారత్ లో ఆర్ధిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం వుంది. దేశంలోని ఇతర రాజకీయ పార్టీల నేతలతో పోలిస్తే సమర్ధవంతంగా ఈ సంస్కరణలను అమలు చేసే సామర్ధ్యం మోడీకి మాత్రమే  వుంది. అయన హయాం లోనే భారత దేశానికి చైనా, అమెరికా, జపాన్ వంటి దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పడ్డాయి. దేశంలో కోట్లాదిమంది ప్రజల జీవితాలు మెరుగుపడడానికి మోడీ విధానాలే కారణం. ఆధార్ వంటి వ్యవస్థల విస్తరణపై మోడీ ప్రభుత్వం దృష్టి సారించిన ఫలితంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి అడ్డకట్ట పడింది’ అని బ్రెమర్ మోడీని కొనియాడారు.
‘ప్రత్యర్ధిపై ఆధిపత్యం చెలాయించే తత్వం మోడీది’ అని అయన కుండ బద్దలు కొట్టారు. అయితే, అదే సమయంలో దేశంలో అవసరమైన సంస్కరణలు చేపట్టే విషయంలో మోడీకి మంచి పేరు వుంది. దీటైన ప్రత్యామ్నాయం లేకపోవడం  ఆయన పాలిట వరంలా మారింది’ అని బ్రెమర్ అభిప్రాయపడ్డారు.
సహజంగానే టైమ్ పత్రిక కధనాలు దేశంలో ముఖ్యంగా మీడియాలో పలు చర్చలకు ముడి సరుకుగా మారింది. అందులో ఎన్నికల వేళాయే! మోడీ అనుకూలురు, ప్రతికూలురు ఈ కధనాలను తమకు అనువైన రీతిలో భాష్యం చెప్పుకుని విశ్లేషణలను వండి వార్చారు.
‘టైమ్ పత్రిక విశ్లేషణ అక్షర సత్యం, మోడీ ప్రభలు మసకబారుతున్నాయి’ అంటున్నారు మోడీ వ్యతిరేకులు.
‘టైమ్ పత్రికా మజాకా! ఈ దేశానికి మోడీ తప్ప వేరు గత్యంతరం లేదని ఆ పత్రిక రాసిందంటే ఇక దానికి తిరుగులేదు’ అంటున్నారు మోడీ అనుకూలురు.
మాయాబజార్ సినిమాలో ప్రియదర్శిని పేటిక సన్నివేశం గుర్తుంది కదా! ఎవరి మనసులో బొమ్మ వారికి కనిపిస్తుంది.
నిన్ననో మొన్ననో ఓ టీవీ చర్చలో తెలుగుదేశం ప్రతినిధి, బీజేపీ ప్రతినిధుల నడుమ సాగిన సంభాషణను  ఈ సందర్భంలో పేర్కొనడం సముచితంగా వుంటుంది.
‘తెలుగు మీడియా కళ్ళతో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్తితులు ఒకరకంగా కానవస్తాయి’  బీజేపీ ప్రతినిధి వ్యాఖ్య.
‘జాతీయ మీడియా కళ్ళతో చూడండి, దేశంలో స్తితిగతులు మరో రకంగా కనిపిస్తాయి’ అనేది టీడీపీ ప్రతినిధి ప్రతి వ్యాఖ్య.        
పార్టీల విధానాల వద్దకు వచ్చేసరికి పరస్పరం విబెధించుకునే ఈ రెండు పార్టీల ప్రతినిధులు మీడియా విషయంలో ఈ రకమైన అభిప్రాయాలతో వుండడం ఒక రకంగా మంచి పరిణామం కాదు. రాజకీయ పార్టీలు మీడియాను ఎక్కడికక్కడ  తమకు అనుకూలంగా మార్చుకుని వ్యవహరిస్తున్నాయి అనే అభిప్రాయం విస్తరించడం స్వతంత్ర మీడియాకు అంత క్షేమకరం కాదు. (EOM)

6 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

"తెలుగు మీడియా కళ్ళతో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్తితులు ఒకరకంగా కానవస్తాయి"

"అను*కుల* పచ్చ తొత్తు తెలుగు మీడియా కళ్ళతో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్తితులు ఒకరకంగా కానవస్తాయి" అని సవరించాలి.

అజ్ఞాత చెప్పారు...

పచ్చ పైశాచికం టీవీ 9 నుంచి మోజో లోకి దూకింది. ఈ కులపిచ్చి దరిద్రుల బారి నుండి తెలంగాణా బయటపడి బాగుపడుతుంది. కానీ ఈ పచ్చ పిశాచులు బొద్దింకల్లాగా అంత సులభంగా అంతరించవు. అవకాశం దొరికితే కేసీఆర్ ను దెబ్బకొట్టే దాకా ఊరుకోవు.

అజ్ఞాత చెప్పారు...

ఈ పుచ్చకాయల ఫ్రంట్ దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తుంది. లోక్ సభలో ప్రాంతీయ పార్టీలు మంచిది కాదు. ఇద్దరు చంద్రుళ్లు తగుదునమ్మా అంటూ బెంగాల్ కేరళ తమిళనాడు ఒరిస్సా.. పిలవని పేరంటం గా పరుగులు తీయడమేమిటి. అక్కణ్ణుంచి ఒక్కరైనా తెలుగు రాష్ట్రాలకు వచ్చారా. తమను తాము ఎక్కువగా ఊహించుకుని అతి చేస్తే ఇద్దరూ బొక్క బోర్లా పడటం ఖాయం. ఈ చిల్లర పార్టీలు కాంగెస్ లేదా బీజేపీ కి అనుకూలంగా ఉండాలి అంతే.

అజ్ఞాత చెప్పారు...

The TIME magazine is not better than our yellow media.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala: తెలుగు మీడియా వ్యాఖ్య నాది కాదు, ఎవరో అన్నదాన్ని నేను కోట్ చేసాను. అంతే

అజ్ఞాత చెప్పారు...

టైం లో వచ్చిన కధనం రాసింది పాకిస్థాన్ ముస్లిం మూలాలు ఉన్న రిపోర్టర్।సో అటువంటి వెర్రి కథనాలను తెలివైన చదువరులు పరిగణలోకి తీసుకోరు।కానీ ఒక మీడియా అధినేత అయిఉంది కూడా ఈ చిన్న లాజిక్కు ను పెట్టుకోలేని రాధా కృష్ణ అదే టైం కాదనపు చిత్రాన్ని తన కొత్త పలుకు వీడియో ప్రమోషన్ కోసం వాడటం చూస్తుంటే నవ్వాలో-ఏడవాలో తెలియడం లేదు మరి।