22, జులై 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (199) : భండారు శ్రీనివాసరావు

 

(2025 జులై 19 వ తేదీన అమెరికా నుంచి దోహా మీదుగా ఖతార్ ఎయిర్ లైన్స్ లో హైదరాబాద్ కు ఆకాశంలో 32 వేల అడుగుల ఎత్తున, రాత్రో పగలో తెలియని అయోమయావస్థలో ప్రయాణిస్తూ...)

“ఎప్పుడు డిగ్రీ పూర్తి చేశారు”
ఆలిండియా సర్వీసు ఇంటర్వ్యూ లో నిజానికి ఇది ఎంత సింపుల్ ప్రశ్న!
మీ పేరేమిటి అని అడిగితే చప్పున జవాబు చెప్పగలంత సులభమైన ప్రశ్న.
కానీ చెప్పలేకపోయాను.
కారణం చెప్పాకదా! చదువుల్లో నా ట్రాక్ రికార్డు. క్లాస్ మేట్స్ సీనియర్లు అయ్యారు. జూనియర్లు క్లాస్ మేట్స్ అయ్యారు. ఇక తేదీలు, సంవత్సరాలు ఎక్కడ గుర్తుంటాయి?
ఈ పరీక్షకు ఎం ఎస్ ఎం బండి లేదు. అదే ఫైనల్. ఆ ఫైనల్స్ లో సింపుల్ గా తప్పాను. నన్ను దాటుకుని నా వెనక వున్న నలుగురైదుగురు ముందుకు వెళ్ళారు. ఉద్యోగ విధులు ఒకటే అయినా, హోదాల్లో తేడా వచ్చింది. రిటైర్ మెంటు నాటికి పెన్షన్ లో ఇంకా పెద్ద తేడా వచ్చింది.
నేను 1975లో ఆలిండియా రేడియోలో చేరినప్పుడు ఏడాది తిరగకుండానే పే కమిషన్ సిఫారసులు అమలు చేశారు. ఆ చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగి నాకు రావాల్సిన గ్రేడు రాలేదు. ఉద్యోగంలో చేరినప్పుడు నా బేసిక్ 350. ఒక గుమాస్తా చేసిన చిన్న పొరబాటు వల్ల అది 325 అని పడింది. పాతిక రూపాయలకోసం మొదట్లోనే పేచీ ఎందుకు అని నేను పట్టించుకోలేదు. ప్రభుత్వ సర్వీసుకు కొత్త. బేసిక్ మీద ఆధార పడి ఇతర అలవెన్సులు పెరుగుతాయి అని తెలియదు. ఏడాది లోపలే పే కమిషన్ సిఫారసులు అమలుచేశారు. తేడా పాతిక నుంచి వందకు పెరిగింది. అలవెన్సుల్లో వ్యత్యాసం అదే దామాషాలో పెరిగి, జీత భత్యాల్లో తేడా వచ్చింది.
కొన్నేళ్ళ తర్వాత న్యూస్ ఎడిటర్ గా వచ్చిన ఆకిరి రామకృష్ణారావు
నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని సర్వీసు వ్యవహారాల్లో దిట్ట అయిన ఒక ప్లీడరు గారి దగ్గరకు తీసుకువెళ్లాడు.
విషయం మొత్తం తెలుసుకుని ఆ వకీలు గారు చెప్పిన మాట ఇది.
అంతే కాదు కొన్ని పాయింట్ల రూపంలో గీతా బోధ కూడా చేశారు.
“మీ ప్రొబేషన్ పూర్తి కాలేదు. అంచేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తె కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రభుత్వం ఒక కాంక్రీటు గోడ లాంటిది. దాన్ని డీకొడితే గోడ పగలడం కంటే డీ కొట్టిన తల పగిలే అవకాశాలే ఎక్కువ. మనం ఒక కోర్టులో గెలిస్తే వాళ్ళు పై కోర్టుకు వెడతారు. అలా మనం ఎక్కలేనన్ని మెట్లు వాళ్ళు సులువుగా ఎక్కేస్తారు. మనమూ ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ శక్తి ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఇటువంటి పొరబాటే ఓ వందా రెండు వందల మందికి జరిగి వుంటే తలా కాస్త ఖర్చు పెట్టుకుని పోరాడవచ్చు. కానీ ఇది ఇండివిడ్యువల్ కేసు. పొరబాటు జరిగినా అది అంగీకరించరు. అంచేత వాళ్ళు లిటిగేషన్ కొనసాగిస్తారు. అంత ఆర్ధిక స్థోమత మీకు వుందని అనుకోను. ప్రొబేషన్ పూర్తి కాలేదు కాబట్టి కేసు తేలే వరకు మీకు పే కమిషన్ ప్రయోజనాలు నిలిపేసినా ఆశ్చర్యం లేదు. కేసు తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టవచ్చు. అప్పటిదాకా తట్టుకోగల శక్తి మీకు వుందని నేను అనుకోవడం లేదు.”
వచ్చిన క్లయింట్లని ఇలా నిరుత్సాహ
పరిచే లాయర్లు ఉంటారని నాకు తెలియదు. ఆయన నా మీద సానుభూతితో చెప్పాడా లేక ఈ జర్నలిస్టులు అడిగిన ఫీజు ఇవ్వరు అనే అనుమానంతో చెప్పాడా అదీ తెలియదు. తెలిసినదల్లా అతడిలో సందేహించడానికి ఏమీ లేదనే. ఓ నమస్కారం పెట్టి వచ్చేసాము.
తర్వాత అనేక పే కమిషన్లు వచ్చాయి. నా సర్వీసు చివరాఖర్లో వచ్చిన పే కమిషన్ సిఫారసులతో కేంద్ర సిబ్బంది వేతనాలు ముందెన్నడూ లేని విధంగా పెరిగాయి. ఉద్యోగం మొదట్లో పాతిక రూపాయలు అనుకున్న తేడా చివరాఖరుకల్లా వేలల్లోకి పెరిగింది. దీనికి తోడు, ఉద్యోగపర్వంలో మరో కుదుపు. 2005 డిసెంబరు 31 సాయంత్రం నేను రిటైర్ అయ్యాను. మర్నాడు అంటే 2006 జనవరి ఒకటి నుంచి ఆ సిఫారసులు అమల్లోకి వచ్చాయి. అంటే ఒక్క రోజు తేడాతో పెన్షన్ లో పెద్ద వ్యత్యాసం వచ్చింది. చాలా పెద్ద మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.
కానీ నేను ఆకాశవాణిలో గడించిన అనుభవాలు, మాస్కో జీవితం, పిల్లలు ఎదిగిరావడం ఇవన్నీ ఇచ్చిన తృప్తిని ఎన్ని పే కమిషన్లు ఇవ్వగలుగుతాయి? ఆనాడు ఆ లాయరు నన్ను ఆ కేసు తీసుకుని గెలిపించి వుంటే నాకీ అవకాశాలు లభించి ఉండేవి కావేమో! ఒకటి తీసుకోవడం అంటే మరోటి ఇవ్వడం అనే లెక్క ఆ పైవాడిది.
“గోదావరిలో ఎన్ని నీళ్లున్నా మనం చెంబు తీసుకువెడితే చెంబెడు, బిందె తీసుకువెడితే బిందెడు. ఏదైనా ప్రాప్తాన్నిబట్టే” అనే మా అన్నయ్య భండారు పర్వతాలరావు గారి మాటలు నాకు ఊరట. ఆయన ఇంకో మాట అనేవారు.
‘కోర్టు గుమ్మం ఎక్కకుండా, జైలు గడప తొక్కకుండా వెళ్లదీయగలిగితే దాన్ని మించిన ప్రశాంత జీవితం మరోటి వుండదు”
అదృష్టవశాత్తు ఈ రెండూ నా అనుభవంలోకి రాలేదు.
తోక టపా: చివరాఖరుకు నేను దూరదర్సన్ లో న్యూస్ ఎడిటర్ గా రిటైర్ అయింది ఆ ఆలిండియా సర్వీసు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (ఐ.ఐ.ఎస్.) అధికారిగానే.



(ఇంకావుంది)

19, జులై 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (198) : భండారు శ్రీనివాసరావు

 “మళ్ళీ తప్పాట్ట”

 

ఏటా పరీక్ష ఫలితాలు రాగానే మా చుట్టపక్కాలు అందరూ నా గురించి చెప్పుకునే మాట ఇదొక్కటే. పదో తరగతి నుంచి మొదలుపెట్టి డిగ్రీ వరకూ ఏ పరీక్ష కూడా ఎం ఎస్ ఎం (మార్చ్- సెప్టెంబర్-మార్చ్) బండి  ఎక్కకుండా, ఒకే తడవ  పాసయింది లేదు.

అదీ నా ట్రాక్ రికార్డ్.

బీ కాం ఫైనల్స్ లో మర్కంటైల్ లా అనే ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది. అది గట్టెక్కడానికి రెండేళ్లు పట్టింది. ఒకసారి పరీక్షకు వెళ్ళే సమయంలోనే అలంకార్ ధియేటర్ లో ఏదో కొత్త పిక్చర్ ప్రీ వ్యూ. పరీక్ష పక్కనబెట్టి సినిమాకు వెళ్లాను. మరోసారి పరీక్ష రాయడానికి కాలేజీకి వెడితే అక్కడ ప్రిన్సిపాల్ గారికి, నేను జ్యోతి విలేకరిగా పరిచయం కనుక ఏమిటి ఇలా వచ్చారు అని తన రూముకు తీసుకు వెళ్ళారు. ఆయన తెప్పించిన కాఫీ తాగి ఏవో ముచ్చట్లు, చెప్పీ, వినీ పరీక్ష హాల్లోకి పోకుండానే ఇంటికి వెళ్లాను. నా నిర్వాకం తెలిసిన మనిషే కనుక మా ఆవిడ నిర్వేదంగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది.

మరోసారి పరీక్ష సమయానికి నా మేనల్లుళ్లు తుర్లపాటి సాంబశివరావు, కొలిపాక రాజేంద్ర ప్రసాద్ బెజవాడ వచ్చారు. వాళ్ళు  పట్టుబట్టి నన్ను వెంట బెట్టుకుని సిటీ బస్సులో కాలేజీకి తీసుకు వెళ్ళారు. అందులోనే భగవద్గీత చెప్పారు. 35 మార్కులు తెచ్చుకుంటే  చాలు.  రెండు మూడు ప్రశ్నలకు సరిగా జవాబు రాస్తే పాసవుతావు, అంటూ  కొన్ని గెస్  ప్రశ్నలకు నాచేత జవాబులు చెప్పించారు. ఇవే ప్రశ్నలు వస్తే రాయి, లేకపోతే మరో మారు చూద్దాం అన్నారు. అదృష్టం! అవే వచ్చాయి. ఇంట్లో కాకుండా బస్సులో చెప్పబట్టి జవాబులు మెదడులో పచ్చిగానే వున్నాయి కనుక చకచకా రాసేశాను. నేను బయటకు వచ్చేదాకా వాళ్ళు బయటే వున్నారు. పేరయ్య హోటల్లో గడ్డ పెరుగుతో భోజనం చేసి, విజయా టాకీసులో సినిమా చూశాము.

చిత్రం! 35 అంటే 35 మార్కులతో పాసయి, డిగ్రీ అర్హత సాధించాను.

ఈ నేపధ్యంలో మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు  పత్రికలో పడిన చిన్న ప్రకటన కాపీ నా చేతికి ఇచ్చారు. ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రంలో   అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగం. డిగ్రీతోపాటు  ఏదైనా పత్రికలో అనుభవం. తెలుగు భాషపై పట్టు. తెల్ల కాగితం మీద ధరకాస్తు నెలాఖరులోగా  పంపాలి. అంటే ఇంకా వారం రోజులే వ్యవధి.

మళ్ళీ అంతర్మధనం. బెజవాడతో పోలిస్తే హైదరాబాదులో జీవన వ్యయం ఎక్కువ. పెరిగే జీతానికి దానికి సరిపోతుంది. ధరకాస్తు రాశాకాని పోస్టులో వేయలేదు. ఇంకా రెండు రోజులే గడువు.

మా అన్నయ్య అడిగాడు. పంపాను అని బొంకాను. దాన్ని నిజం చేయడానికి గవర్నర్ పేట పోస్ట్ ఆఫీసుకు వెళ్లి జేబులోనే వున్నఅప్లికేషన్ ను ఓ కవరు కొని పోస్ట్ చేశాను. ఒక రోజులో అది చేరుతుంది అనే నమ్మకం నాకు లేదు.

కొన్ని నెలల తర్వాత ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది.

వెళ్లాను.

విశ్వనాధ రామాయణ కల్పవృక్షం గురించి, రంగనాయకమ్మ విషవృక్షం గురించీ అడిగారు. తెలుగులో జవాబు చెప్పమన్నారు. నేను రెచ్చిపోయి ఇరవై నిమిషాలు నాకు నోటికి వచ్చింది, అప్పటికి తోచింది గడగడా చెప్పేశాను. సరి, ఇక వెళ్ళు అన్నారు మరో ప్రశ్న అడగకుండా. ఇదేమి ఇంటర్వ్యూ అనుకుంటూ బస్సెక్కి బెజవాడ వచ్చి మళ్ళీ ఆంధ్రజ్యోతిలో నా విధుల్లో పడిపోయాను. నెలలు గడుస్తున్నా రేడియో నుంచి ఏ కబురూ   లేదు. కనుక్కుని చెప్పే మనుషులు లేరు.

కొన్ని నెలల నిరీక్షణ తర్వాత ‘నిన్ను సెలక్ట్ చేసుకున్నాం, వచ్చి చేరు’ అనే వర్తమానం వచ్చింది.

ఎప్పుడు వెళ్ళాలి అనేది అందులోనే వుంది. ఎలా వెళ్ళాలి అనే ప్రశ్నకే జవాబు లేదు. కానీ మా ఆవిడ వద్ద రెడీగా వుంది, బంగారు గాజుల రూపంలో. అవి బయటకు వెళ్ళిపోయాయి. మేము హైదరాబాదు చేరుకున్నాము.

కింది ఫోటో:




హైదరాబాదు వచ్చిన కొత్తలో ఇందిరాపార్కులో

(Photo Courtesy Shri G.S. Radhakrishna, Then Hyderabad Correspondent for WEEK Magazine)

(ఇంకా వుంది)

18, జులై 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో ( 197) : భండారు శ్రీనివాసరావు

 

ఫ్రం సమ్ వేర్ ఇన్ అమెరికా
ఆ మధ్య దేవినేని మధుసూదన రావు గారు ఫోన్ చేశారు. ఆయనా, వారి భార్య జయశ్రీ గారు ఇద్దరూ అమెరికాలోనే వున్నారు. ఎక్కడా అని అడగడం మానేశాను.
పెద్ద దేశం. ఒకచోట సూర్యోదయం అవుతుంటే అదే సమయంలో మరో చోట చంద్రోదయం. నేను ఈ దేశానికి అనేక సార్లు వచ్చాను. వచ్చినప్పుడల్లా నెలల తరబడి వున్నాను. ఇప్పటికీ ఈ టైం జోన్స్ సంగతి వంటబట్టలేదు.
మనం ఉదయం అనుకుని ఫోన్ చేయబోతే అవతల వాళ్ళు గాఢ నిద్రలో వున్నప్పుడు ఫోన్ మోగుతుంది. మీకంటే మేము మూడు గంటలు ముందు, నాలుగు గంటలు వెనుక అని చెబుతుంటారు. కానీ ప్రతిసారీ లెక్కలు వేసుకుని ఫోన్ చేయాలి అంటే ఇబ్బంది. మరీ ముఖ్యంగా నాలాంటి మతిమరపు వాళ్లకి.
‘మీదంతా కన్వీనియంట్ మతిమరపు. పిల్లల పుట్టిన రోజు గుర్తుండదు కాదు నిన్న పొద్దున్న ఎప్పుడో మీ ఫ్రెండ్ ఈ సాయంత్రం ప్రెస్ క్లబ్ లో కలుద్దామన్న సంగతి మాత్రం బాగా గుర్తుంటుంది’ అని ఎద్దేవా చేసేది. మతిమరపు వేరు, గుర్తుకు తెచ్చుకోవడం వేరు అని చెప్పాలని అనుకుని ఎందుకులే అని మానేసేవాడిని.
'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో రిటైర్ కావడానికి ముందే రాశాను. నాకు తెలిసి, ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి, వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు మాత్రమే ఈ పని చేసి చూపించారు.
హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ, పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారని విన్నా.
చదువులకోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.
ఎప్పుడో నేను బ్లాగులో రాసిన మాస్కో విశేషాలు చదివి, నన్ను, మా ఆవిడను చూడడానికి ఎల్లారెడ్డి గూడాలో మేము ఉంటున్న ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు.
కొందరు జంతువుల్ని ప్రేమిస్తారు. మరికొందరు మొక్కల్ని ప్రేమిస్తారు. నాకు తెలిసి పుస్తకాల్ని ప్రేమించే వ్యక్తి ఈ దేవినేని మధుసూదన రావు గారు. పుస్తకాలను అందరూ చదువుతారు. మంచి పుస్తకాలను కొందరే ఎంపిక చేసుకుని చదువుతారు. పుస్తక ప్రేమికుడయిన ఈ వ్యక్తి తను పుస్తకాన్ని ‘కొని’ చదవడమే కాదు పుస్తకాల్ని ప్రేమించే గుణం వున్న మరికొందరికి, ఆ పుస్తకాల్ని కొని, పోస్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ పంపి చదివిస్తారు. ఏదయినా పుస్తకం బాగా నచ్చితే వందల సంఖ్యలో వాటిని కొని బంధుమిత్రుల ప్రత్యేక వేడుకలకు హాజరయ్యే అతిధులకు పెళ్లి కానుకగా పంచుతారు.
ఈ పుస్తక దాన కర్ణుడు భార్యను వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చిన రోజు, నేనూ, మా ఆవిడా ఎంతో సంతోష పడ్డాము. అలాగే ఇప్పుడు అమెరికాలో వున్నప్పుడు వారి నుంచి ఫోన్ రావడం ఆనందం కలిగించింది. మేము మళ్ళీ కలిసిన దాఖాలా గుర్తురావడం లేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత కూడా నేను అమెరికా వచ్చిన సంగతి తెలుసుకుని ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు.
పుస్తకాలు అంటుంటే అమెరికాలోనే వుంటున్న సీనియర్ పాత్రికేయ మిత్రుడు నరిసెట్టి ఇన్నయ్య గారు రాసిన మిసిమి వ్యాసాల సంకలనం గుర్తుకువచ్చింది.
కొన్నేళ్ళ క్రితం, 2012 లో అనుకుంటా, హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఈ వ్యాసాల సంకలన గ్రంధాన్ని అప్పటి హెచ్.ఎం.టీ.వీ. సీ.యీ.వో., కే. రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. ఒక చక్కటి ఆశయంతో, ‘మిసిమి’ పత్రికను ప్రారంభించినప్పటి నుంచి ఇన్నయ్య తనదయిన శైలిలో ఈ వ్యాసాలను రాస్తూ వచ్చారు. ఎన్నుకున్న అంశాల పరిధి అతి విస్తృతం. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయితల రచనలతో పాటు, వారి వ్యక్తిత్వాలను పరిచయంచేసే సరికొత్త ప్రక్రియను నెత్తికెత్తుకోవడం ఒక్క మిసిమి వంటి పత్రికకే సాధ్యం.
ఇన్నయ్య కేవలం రచయిత మాత్రమే అయితే ఈ రచనల తరహా మరో రకంగా సాగివుండేది. ఆయన గొప్ప మానవతావాది. పైగా కరుడుగట్టిన హేతువాది. తను నమ్మిన సిద్ధాంతాలను తాను మొండిగా నమ్మడమే కాదు ఇతరులను కూడా నమ్మించాలని శక్తివంచన లేకుండా శ్రమిస్తుండడం ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణం. ఈ స్వభావం ఆయనకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. దానితో పాటు అభిమానులను అదే సంఖ్యలో విమర్శకులను సంపాదించిపెట్టింది.
ఇన్నయ్య దేవుడిని నమ్మరు. నమ్మని వాళ్లు చాలామంది వుంటారు. కానీ ఇన్నయ్య అంతటితో దేవుడిని వదలరు. వెంటబడి మరీ దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు. అది అంత అవసరమా అని అడిగే మిత్రులం కొంతమందిమి, ఆ దేవుడి దయవల్ల ఇప్పటివరకూ ఆయనతో స్నేహాన్ని కొనసాగించగలుగుతున్నాము. (‘నీవు దేముడితో మాట్లాడితే ప్రార్ధన అంటారు. దేవుడు నీతో మాట్లాడాడంటే పిచ్చి అంటారు’ అనే థామస్ సాజ్ ధర్మసూక్ష్మాన్ని ఆయన ఈ పుస్తకంలో పేర్కొన్నారు.)
చక్కటి రచనలు అతి చక్కగా అచ్చు వేసిన ఖ్యాతి ప్రచురణకర్తలది. కాకపొతే, అక్కడక్కడా ముద్రారాక్షసాలు పంటికింద రాయిలా పుస్తక పఠనానికి అడ్డుతగులుతుంటాయి. (పేజీ 33 – ఒకయాన –ఒకాయన) ఇలాగే మరికొన్ని. కాకపొతే ఇంతటి బృహత్తర ప్రయత్నం ముందు అవి ఎన్నదగ్గవి కాదు.
ఈరోజు జులై 17.
నిన్న16, రేపు 18. అయితే ఏమిటి అనకండి. నాకు ఇది సెంటిమెంటు రోజు.
మధ్య తరగతి వాళ్ళు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒక పగటి కల కంటూ వుంటారు. ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని.(చిన్నిల్లు, పెద్దిల్లు అనే పాడు అపార్థాలు చేసుకోవద్దు ప్లీజ్).
అలా నేనూ మా ఆవిడా, విడివిడిగా, కలివిడిగా కలలు కనే రోజుల్లో ఒకనాటి తన కలలో మేము కట్టుకోబోయే ఆ కొత్త ఇంటికి పూజ గది మాత్రం విడిగా వుండాలని కోరుకున్నది తను . 1975 నుంచి అనేక అద్దె ఇళ్ళు మారుస్తూ హైదరాబాదును ఏళ్ళ తరబడి చుట్టబెడుతున్న తరుణంలో ప్రత్యేకంగా పూజ గది వుండే అద్దె ఇల్లు దొరకడం అసాధ్యం అని తేలిపోయింది.
అంచేత చిక్కడపల్లి దాకా వెళ్లి రాజా ఫర్నిచర్ షో రూమ్ లో గోడకు అమర్చేచిన్న పూజ అల్మరా ఒకటి కొనుక్కొచ్చుకుంది. అందులో దేవుళ్ల విగ్రహాలు, ఫోటోల సంచితాన్ని భద్రపరచుకుంది. నేనెప్పుడూ లెక్కపెట్టలేదు కాని ముక్కోటి దేవతలు అందులో కొలువు తీరారు అనిపించేది.
ఈరోజు జులై 17.
అంచేతే కాబోలు ఓ జ్ఞాపకం మనసుని తట్టిలేపింది.
కొన్నేళ్ళ క్రితం అంటే 2019 జులైలో ఇదే రోజు పొద్దున్నే, ఏదో ఓ ఛానల్ డిబేట్ కి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి మా ఆవిడ పూజ అల్మరాలోని దేవుళ్ళు అందరూ కట్టగట్టుకుని మాయం అయిపోయారు. ఏమిటీ విష్ణు మాయ అనుకుని ఆశ్చర్య పోతూ ఉండగానే, శుభ్రంగా తోమిన దేవుడి విగ్రహాలను మరింత మెరిసేలా తుడుస్తూ మా ఆవిడ ప్రత్యక్షం అయింది.
“ అమ్మయ్య! దేవుళ్ళు అందరూ తలంట్లు పోసుకుని గూటికి చేరుతున్నారు “ అని ఓ జోకు జోకాను.
ఈ జోకు మా ఆవిడ విన్నదో లేదో కాని ఆమె చేతిలో ఉన్న దేవుళ్ళు విన్నారు, విని కోపగించుకున్నారు అన్న సంగతి నెల తర్వాత తెలిసి వచ్చింది.
సరిగ్గా నెలలోపే ఆగస్టు 18న, ఇంట్లో దేవుళ్ళు, దేవతలు అందరూ అలాగే వున్నారు. వాళ్లకు నిత్య పూజలు చేసే దేవతే లేకుండా వెళ్లి పోయింది.
దేవుళ్లా! మజాకా! వాళ్ళపై జోకులు కూడదు.
కింది ఫోటోలు:
మా ఇంటి ఇలవేల్పుల నివాస ప్రాంగణం
మిసిమి వ్యాస సంకలనం ఆవిష్కరణ
వేదిక మీద ఇన్నయ్య గారు లేరేమిటి అని అడగకండి. ఆయన అమెరికాలో వుండి హైదరాబాద్ లో కధ నడిపించగల సమర్థులు.








(17-07-2025)
(ఇంకావుంది)

16, జులై 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (196) : భండారు శ్రీనివాసరావు

 నిద్ర పట్టని రాత్రి

‘నా టార్గెటెడ్ రీడర్స్ ఆడవాళ్ళు కాదు, మగవాళ్లు, అదీ పెళ్ళయిన వాళ్ళు’ అని చాలా కాలం క్రితం ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాను, నా భార్య విషయంలో నేను చేసిన తప్పులు, పొరబాట్లు వాళ్ళు చేయకుండా వుంటారు అనే ఉద్దేశ్యంతో. ఇలా పోస్టులు చదివి మనుషులు మారతారనే నమ్మకం నాకు లేదు. మారక పోయినా కొంత ఆలోచన మొదలవుతుంది అనే నమ్మకం మాత్రం వుంది.
‘డొమెస్టిక్ వయొలెన్స్ మాత్రమే హింస కాదు. ఉనికిని గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం అంతకంటే హింస’ అని సుజాత వేల్పూరి Sujatha Velpuri రాశారు ఒక పోస్టులో. ఇది చదివినప్పుడు నన్ను దృష్టిలో వుంచుకునే రాశారా ఏమిటి అనే సందేహం కలిగింది. ఎందుకంటే నా భుజాల మీద గుమ్మడికాయ గుర్తులు అలాగే వున్నాయి.
‘సమయానికి టిఫిను బట్టలు, భోజనం అమరుతుంటే నేను ఇంట్లో లేననే సంగతి కూడా గుర్తించడు మీ మామయ్య’ అదేమిటో చిత్రం, సుజాత అత్తయ్యగారు చెప్పిన ఈ మామయ్య పాత్రలో కూడా నాకు నేనే కనపడ్డాను.
‘అత్తయ్య అన్న ఆ మాటలో పెయిన్ తర్వాతెప్పుడో పెద్దయ్యాక కానీ, అర్ధం కాలేదని కూడా సుజాత రాసారు.
అచ్చు నాదీ ఇదే పరిస్థితి. మా ఆవిడ చనిపోయిన తర్వాత కానీ ఆమె అనుభవించిన బాధ నాకు అర్ధం కాలేదు. అర్ధం అయిన తర్వాత కొన్నాళ్ళపాటు ఆమె పడ్డ బాధలు గురించి తలచుకుంటూ అలా అలా రాస్తూ పోయాను. గతజల సేతు బంధనం వంటి నా పోస్టులు చదివి చాలామంది, ముఖ్యంగా మగవాళ్లు నా పట్ల సానుభూతి చూపుతూ ఓదార్పు మాటలు పలికారు. కొందరయితే, భార్యల పట్ల తమ వైఖరి మార్చుకుంటున్నామని కూడా రాసారు. అసలు ఆ ఆలోచన కలగడమే మారినంత ఫలం.
కరిగిన కాలాన్ని మళ్ళీ పట్టుకోలేము. మా ఆవిడ వున్నంతవరకు కాలం లేడిలా పరుగులు తీసింది. చుట్టూ వున్న ప్రపంచమే సర్వస్వం అయింది.
నేను రేపటి మనిషిని, నా ఆలోచనలు అభిప్రాయాలు వర్తమానం కంటే చాలా ముందుంటాయి’ అనేది నా గురించి నేను చాలా కాలంగా పెట్టుకున్న నమ్మకం.
అయితే వయసు దెబ్బయి తొమ్మిది దాటి, రేపోమాపో ఎనభయ్యవ పడిలో పడే సమయంలో కానీ, ఇందులోని డొల్లతనం నాకు తెలిసి రాలేదు.
నేను రేపటి మనిషిని కాకపోగా, ఎప్పటిదో పాతరాతి యుగం మనిషిని అనే వాస్తవం తెలిసి వచ్చింది. నిద్ర పట్టని రాత్రులు పెరిగాయి. కలత నిద్రల్లో పీడ కలలు పెరిగాయి. జ్ఞాపకాల ముసురుల్లో నిలువునా తడవడమే మిగిలింది.
గరుడ పురాణంలో పాపులకు వేసే శిక్షలు జ్ఞాపకం ఉన్నాయా!
అయితే ఒక ప్రేమ కధ చెబుతా వినండి. నాకు ఎలాగో నిద్రలేదు. మీరు మాత్రం ఎందుకు హాయిగా నిద్రపోవాలి?
అనగనగా ఓ అమ్మాయి. బుద్ధి తక్కువై ఓ అబ్బాయిని ప్రేమించింది. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకుంది. దాంతో మొదలయ్యాయి ఆ అమ్మాయికి అంతులేని కష్టాలు.
అలాగని అతడు పెళ్ళాన్ని రాచిరంపాన పెట్టే బాపతు కాదు. ఆ అమ్మాయి అతడ్ని ప్రేమించినంత గాఢంగా, ఘాటుగా కాకపోయినా భార్యపై ఓ మోస్తరు ప్రేమకి తక్కువేమీలేదు.
మరిక కష్టాలు ఏమిటంటారా!
అతడికి దేవుడు అంటే నమ్మకమే. కానీ మూఢ భక్తి కాదు. గ్రహణాల పేరుతొ చూలింతలను చీకటి గదిలో పగలంతా పడుకోబెట్టడం వగయిరాలు నచ్చవు. భార్య తొలిచూలుతో వున్నప్పుడు సూర్య గ్రహణం వచ్చింది. చుట్టపక్కాల మాటల్ని, సలహాల్ని ఖాతరు చేయకుండా గర్భిణి అయిన భార్య చేత గోధుమ పిండి తడిపించాడు. ముద్దలు చేసి, చపాతీలు చేయించాడు. ఉల్లిపాయలు కోయించాడు. రోజువారీ పనులన్నీ పట్టుబట్టి అవసరం లేకపోయినా చేయించాడు. మూర్ఖంగా ఇవన్నీ చేయించాడే కానీ మనసు మూలల్లో ఏదో కలవరం. గ్రహణ కారణంగా పుట్టబోయే శిశువు అవకరంగా పుడితే... ఆ భయం అతడికి ఏ కొద్దోగొప్పో వుండివుండవచ్చేమో కానీ ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె ప్రేమలో ఏమాత్రం స్వార్ధం లేదు. అతడిపై పెంచుకున్న నమ్మకంలో అణుమాత్రం అపనమ్మకం లేదు. ఆమెది నిఖార్సయిన ప్రేమ. అందుకే అతడు చెప్పినవన్నీ నిశ్చింతగా చేసేసింది. తన భర్తపై ఆమెకు ఉన్న నమ్మకమే మూఢనమ్మకాలను జయించేలా చేసింది. మూఢాచారాలపై తన భర్త పెంచుకున్న అపనమ్మకాలకు ఒక విలువ దక్కేలా చూసింది. ఈ క్రమంలో అంత చిన్న వయస్సులోనే అంతులేని ధైర్య సాహసాలను ప్రదర్శించింది.
ఇప్పుడు చెప్పండి. గరుడ పురాణం నిజమే అయితే, భార్యను మానసికంగా ఇన్ని చిత్ర హింసలు పెట్టిన నాకు ఆ శిక్షలు పడాలంటారా లేదా!
అందుకే నా తోటి వారికి చెబుతున్నాను.
మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని అభిమానించేది...
మనం ఒకరిని ప్రేమించేది....
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికేనా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికేనా?
పొద్దస్తమానం ఆగర్భ శత్రువుల్లా పోట్లాడుకోవడానికేనా?
ఎక్కడైతే, హక్కుల ప్రస్తావన రాకుండా వుంటుందో
ఎక్కడైతే, చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా వుంటుందో
ఎక్కడైతే, అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా వుంటుందో
ఎక్కడైతే, బలహీనతలను చూసీ చూడకుండా వుండడానికి వీలుంటుందో
ఎక్కడైతే, పొరపాట్లను మన్నించే మనస్సు వుంటుందో
ఎక్కడైతే, తన మాటే నెగ్గాలనే పంతాలు, పట్టింపులు వుండవో
ఎక్కడైతే, అవసరానికి కాకుండా ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో
ఎక్కడైతే, చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
పొరబాట్లే చేయని సీతలు, శ్రీరామచంద్రులే కావాలంటే అలాటివాళ్ళు, గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
తప్పులు చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు, సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.
ఆలోచించండి!
ప్రేమను పంచండి, ప్రేమను పొందండి.
సంసారం వన్ వే కాదు.
ఇది నా అనుభవంతో చెబుతున్న మాట.





(ఇంకావుంది)






(ఇంకా వుంది)

15, జులై 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో ( 195) : భండారు శ్రీనివాసరావు

భళిరా!
ఇది కదా గవర్నర్ ఎంపిక అంటే!
రాజభవనాల్లో పుట్టి పెరిగిన ఈ రాజు గారు గోవా రాజ్ భవన్ లో అడుగుపెట్టబోతున్నారు.
అశోక్ గజపతిరాజు రాజవంశం వాడయినా రాచరికపు లక్షణాలను వంటబట్టించుకోలేదు. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ రాజకీయ కాలుష్యానికి దూరంగానే ఉంటూ వచ్చారు. ఆయన సచ్చీలత, నిరాడంబరత లోకవిదితం.
కొన్ని దశాబ్దాలుగా ఆయన తన పార్టీలో శిఖర సమానులు. అధికారాలు, హోదాలు ఆయనకు పుట్టుకతో అబ్బినవే కనుక వాటిని అడ్డం పెట్టుకుని విర్రవీగాల్సిన అవసరం లేని ఏకైక రాజకీయ నాయకుడు ఆయన. అందుకే, ముఖ్యమంత్రి తరువాత రెండో స్థానంగా అందరూ పరిగణించే ఆర్ధిక శాఖ, రెవెన్యూ మంత్రిత్వ శాఖలు రెండూ నిర్వహించిన సమయంలో కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు. హైదరాబాదులో వుంటే మాత్రం ఠంచనుగా సచివాలయానికి వచ్చి కూర్చునేవారు.
ఎప్పుడన్నా సెక్రెటేరియేట్ బీట్లో తిరుగుతూ అటు తొంగి చూస్తే ఆయన ఛాంబర్ ఖాళీగా కనిపించేది. చిన్న చిన్న శాఖలు చూసే మంత్రుల పేషీలు కూడా కూడా వచ్చిపోయే సందర్శకులతో కిటకిటలాడుతుండేవి. రూలు ప్రకారం తప్ప పైరవీలు చెల్లవు అనే పేరు పడడం వల్లనేమో, రాజుగారి ఆఫీసులో జన సందోహం చాలా తక్కువ. ఆయన ప్రైవేట్ సెక్రెటరీ కమ్ ఓ.యస్.డీ., బీ ఎన్ కుమార్ గారు నన్ను చూడగానే, చిరునవ్వుతో, 'లోపలకు వెళ్ళండి పరవాలేదు' అనేవారు. తలుపులు తీసేవాళ్ళు, చీటీలు పట్టుకుని ఇచ్చేవాళ్ళు లేని వ్యవహారం కనుక, తలుపు తోసుకుని లోపలకు వెళ్ళేవాడిని. విశాలమైన మేజాబల్ల వెనుక కుర్చీలో కూర్చుని, సిగరెట్ తాగుతూ, ఇంగ్లీష్ పుస్తకం ఏదో ఒకటి చదువుతూ, రాజుగారు దర్శనం ఇచ్చేవారు.
రేడియో విలేకరిని కాబట్టి, సంచలన వార్తల అవసరం ఏమాత్రం లేనివాడ్ని కాబట్టి ఆయన నన్ను చూడగానే, హాయిగా ఇంగ్లీష్ లో పలకరిస్తూ, కూర్చోబెట్టి రకరకాల విషయాలు చర్చించేవారు. రాజకీయాలను మినహాయిస్తే మిగిలిన విషయాల్లో ఆయన పరిజ్ఞానం అమోఘం. కాసేపు అవీ ఇవీ మాట్లాడి సెలవు తీసుకుని వచ్చేసేవాడిని. వార్త దొరకలేదన్న చింత లేని మనిషిని కదా!
నా జర్నలిష్టు మిత్రుడు ఎం.యస్. శంకర్ ఆ రోజుల్లో బీబీసీ తెలుగు వార్తలకు తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసాడు. అతడు రికార్డు చేసి బీబీసీకి పంపాల్సిన స్టూడియో రాజభవన్ రోడ్డులో వుండేది. రాజుగారి ఇంటర్వ్యూ అడిగితే ఆయన ఔనడం, మేము ఆర్చుకుని తీర్చుకుని మినిస్టర్స్ కాలనీలోని (ఇప్పటి సీ ఎం క్యాంప్ కార్యాలయం వున్నచోటుకు కూతవేటు దూరంలో) వున్న ఆయన ఇంటికి శంకర్ స్కూటర్ పై వెళ్ళాము. ఆయన్ని తీసుకుని స్టూడియోకి వెళ్ళాలనేది మా ప్లాను. కానీ, మంత్రిగారు సాయంత్రం ఇంటికి రాగానే డ్రైవర్ ని ఉంచుకోకుండా పంపించేస్తారు అన్న సంగతి మాకు తెలవదు. ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తుండగానే రాజుగారు బయటకు వచ్చి కారు తీసి మమ్మల్ని ఎక్కమని చెప్పి 'ఎక్కడకు వెళ్ళాలి' అని అడిగేసరికి మాకు మతిపోయినంత పనయింది. ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్ళడం, రికార్డింగు పని పూర్తిచేసుకోవడం అన్నీ సక్రమంగా జరిగిపోయాయి.
ఆ రోజుల్లో మా ముగ్గురినీ కలిపి వుంచిన బంధం ఒకటి వుంది. అందరం ఒకే బ్రాండ్ సిగరెట్ తాగేవాళ్ళం. తరువాత నేను మానేసాను. శంకర్ మానేసినట్టు చెబుతున్నాడు. రాజు గారిని కలవక దశాబ్దంన్నర దాటింది. ఆయన సంగతి తెలవదు. మానేస్తారన్న నమ్మకం నాకయితే లేదు. ఎన్టీ రామారావు గారంతటి వారు కూడా ఈ విషయంలో రాజుగారికి కొంత మినహాయింపు ఇచ్చారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు.
నరేంద్ర మోడీ మొదటి సారి ప్రధాన మంత్రి అయినప్పుడు దేశంలోని ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసే ఒక పధకం ప్రకటించారు. అప్పుడు ఒకే ఒక ఎంపీ ప్రధాని ప్రశంసకు నోచుకున్నారు. ఆయన ఎవ్వరో కాదు, ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. పార్లమెంటులోని మిగిలిన సభ్యులలో చాలామంది ఈ పధకాన్ని పట్టించుకున్న దాఖలా లేదు.
సాధారణంగా ఐ ఏ ఎస్ అధికారులు రాజకీయ నాయకుల వ్యవహార శైలి పట్ల సుముఖంగా వుండరు. మరీ ముఖ్యంగా రూలు బుక్కు పరకారం ముక్కుసూటిగా పోయే అధికారులు, అడ్డదిడ్డంగా పనులు చేయమని ఆదేశాలు ఇచ్చే మంత్రులు, ముఖ్యమంత్రుల విషయంలో వారికి సదభిప్రాయం వుండదు.
అయితే అశోక్ గజపతి రాజు గారు సుదీర్ఘ కాలం క్యాబినెట్ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినా కూడా ఆయన కింద పనిచేసిన ఏ ఒక్క అధికారీ రాజు గారి గురించి పల్లెత్తు మాట అనేవారు కాదు.
‘నియోజక వర్గంలో పార్టీ కార్యకర్తలు అడిగితే ఎలా కాదంటాము, మళ్ళీ ఎన్నికలు వస్తే వాళ్ళ దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెడతాము చెప్పండి’ అంటారు రాజకీయులు. అదే నిజమనుకుంటే, రాజు గారు తమ యావత్తు క్రియాశీలక రాజకీయ జీవితంలో అన్ని పర్యాయాలు ఎన్నికల్లో ఎలా నెగ్గగలిగారు? పైగా ఆయన నిర్వహించిన శాఖలు ఆషామాషీవి కాదు. రెవెన్యూ, ఫైనాన్స్, ఎక్సైజ్ అన్నీ కీలక శాఖలే. అన్నీ బంగారు గుడ్లు పెట్టే బాతులే. అయినా, ఒక్క చిన్న మచ్చ పడకుండా రాజకీయం నడిపారు. మచ్చలేని మారాజు అశోక గజపతి రాజు.
కీర్తిశేషులు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అయిన శ్రీ పీవీ ఆర్కే ప్రసాద్ గారి అనుభవాలే ఇందుకు రుజువు. అదేమిటో చూద్దాం.
“సర్! ఈ సారా, లిక్కర్ అమ్మటం నా అలవాట్లకు విరుద్ధం. దయచేసి ఈ పోస్టులో మరెవరినైనా వేయండి” అని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని వేడుకున్నారు ప్రసాద్ గారు.
“బ్రదర్, లిక్కర్ మా అలవాట్లకు కూడా భిన్నమే. కానీ రెవెన్యూ తెచ్చే వారుణి వాహిని పధకం పకడ్బందీగా అమలు జరగాలంటే మీ వంటి వాళ్ళు వుండాలి. ఇది ఉద్యోగ ధర్మం. ఆబ్కారీ వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి. లేకపోతే కిలో రెండు రూపాయల పధకానికి వందలాది కోట్లు ఎక్కడనుంచి తెస్తాం? ” అన్నారు ముఖ్యమంత్రి రామారావు గారు.
‘అసలేం జరిగిందంటే ..’ అనే పేరుతొ ప్రసాద్ గారు రాసిన పుస్తకంలో ఇలాంటి కొన్ని విషయాలు ఆయన మాటల్లోనే.
“(ఈ కొత్త ఉద్యోగంలో) నాకు ఎదురైన మొదటి సవాల్ సారా పాటల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం ఎలా అని.
“ప్యాకింగు లేని సారాని కల్తీ చేయకుండా నిరోధించడానికి నాటు సారాని కూడా బ్రాందీ, విస్కీల మాదిరిగా సీలు వేసిన సీసాల్లో సరఫరా చేస్తే... ఈ ఆలోచన అమలు చేయడానికి ప్రభుత్వమే ఒక సంస్థని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ అనే సంస్ట కి నేను చైర్మన్ ని. సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన దువ్వూరి సుబ్బారావు మేనేజింగ్ డైరెక్టర్. ఈ పోస్టులో వేయగానే నా దగ్గరకు వచ్చి తలపట్టుకుని కూర్చున్నాడు. ‘నాకు ఆ సారా వాసనే పడదు. నన్నీ పోస్టులో ఇరికించారేమిటి?” అన్నాడు.
“రైట్ కొస్చెన్ టు రాంగ్ పర్సన్ (Right question to wrong person) సుబ్బారావ్. ఏం చేద్దాం. తప్పో రైటో ముందుకు వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు”
“అంతే! ఇద్దరం పనిలో దిగిపోయాం. ఊబిలో దిగిపోతున్నాం అనే సంగతి అప్పటికి తెలియదు.
“బాట్లింగ్ ప్లాంట్ల కోసం జిల్లాల్లో స్థలాలు సేకరించాం. బాట్లింగ్ యంత్రాలు కొన్నాం. సీసాలు కొన్నాం. వాటిని సరఫరా చేయడానికి క్రేట్లు కొన్నాం. చాలా బాగా చేశావయ్యా సుబ్బారావ్ అని అభినందించాను. సుబ్బారావు విచిత్రమైన నవ్వు నవ్వాడు. అతడి కవి హృదయం అర్ధం అయింది.
“కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
“సరఫరా చేసిన సీసాలన్నీ బాట్లింగ్ ప్లాంట్లకు తిరిగి రావాలి. దుమ్ముకొట్టుకు పోయిన వాటిని శుభ్రం చేయాలి. ఏమాత్రం అశ్రద్ధ జరిగినా ప్రజల ఆరోగ్యానికే ప్రమాదం. (ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యాన్ని తాగేవారి క్షేమం గురించి ఆలోచించడం చిత్రంగా లేదూ)
“ఈ ఆలోచనల నుంచి పుట్టుకు వచ్చిందే పాలిథిన్ సంచుల్లో సారా సరఫరా. ఈ ఆలోచనని ముఖ్యమంత్రి ముందు వుంచాం. రామారావు గారికి బాగా నచ్చింది. ‘అద్భుతం. అలాగే చేయండి’ అన్నారు.
“ఈ పధకానికి ఓ మంచి పేరుకోసం ఒకరిద్దరు పండితుల్ని పిలవమన్నారు. చివరికి మన పురాణాల్లో మద్యానికి అభిమాన దేవత, ఆదిశేషుని భార్య వారుణి పేరు బాగుందన్నారు. ఆ వారుణిని ఇప్పుడు ప్రజల్లోకి ఏరుల్లాగా ప్రవహింప చేయాలి కాబట్టి వారుణి వాహిని అని నామకరణం చేశారు.
“ఇలా రకరకాలుగా పన్నిన వ్యూహాలు ఫలించి వేలం పాటల్లో ఆబ్కారీ ఆదాయం ఒక్కసారిగా 180 కోట్ల రూపాయలకు అదనంగా పెరిగింది.
“రామారావు గారి ఆనందానికి అవధులు లేవు. మా అదృష్టం బాగుండి నిజాయితీపరుడు అయిన అశోక్ గజపతి రాజు గారు ఎక్సైజ్ మంత్రి కావడంతో ఆ ఏడాది అందరికీ కల్తీ సారా శక్తుల నుంచి రక్షణ కల్పించగలిగాము. మా ఎక్సైజ్ సిబ్బంది పీక్కు తినకుండా అడ్డుపడగలిగాం.”
అత్యంత సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన పీవీ ఆర్కే ప్రసాద్, తమ శాఖ మంత్రి గురించి అంత చక్కని కితాబు ఇచ్చారంటే అశోక్ గజపతి రాజు గారు ఎంతటి నిఖార్సయిన రాజకీయ నాయకుడన్నది అర్ధం చేసుకోవచ్చు.
విజయనగర సంస్థానానికి మహారాజు ఆయన, డబ్బులకు కక్కుర్తి పడే అవసరం ఏముంది అనవచ్చు. లంచాలు మేస్తున్నవారు, ప్రజాధనాన్ని దోచుకుంటున్న వాళ్ళు, పూట గడవకనే ఆ పనులు చేస్తున్నారా!
ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు కదా అంటే ఏమనగలము?
కింది ఫోటో:
ఎక్కాల్సిన రైలు కొందరికి జీవిత కాలం లేటు కావచ్చు.
అర్హత వుండాలే కానీ ప్రత్యేక విమానాలు ఎగురుకుంటూ వస్తాయి.
దీనికి సాక్ష్యం ఇదిగో వీరే, రైల్వే స్టేషన్ ప్లాటుఫారంపై సాదా సీదా ప్రయాణీకుడి మాదిరిగా కూర్చున్న మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారు!



(ఇంకావుంది)
15-07-2025

14, జులై 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (194 ) : భండారు శ్రీనివాసరావు

 

అమెరికాలో నారదుడు
వాషింగ్టన్ స్టేట్ లో సియాటిల్ కు దగ్గరలో వున్న మౌంట్ రేనియర్ అనే అగ్ని పర్వతం చూడడానికి వెళ్లాం. నగరంలో అనేక ప్రాంతాల నుంచి ఈ అగ్నిపర్వతం కనిపిస్తూనే వుంటుంది.
మధ్య దారిలో, కొండ సానువుల్లో ‘నారద జలపాతాన్ని’ మా కుమారుడు చూపించాడు. ‘నారద ఫాల్స్’ అని రాసి వున్న ఆ ప్రాంతంలో ఒక కొండపై నుంచి ఈ జలపాతం ధారలుగా దుముకుతోంది. 180 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ వున్నాయి. వెస్ట్రన్ వాహింగ్టన్ థియోసాఫికల్ సొసైటీ వారు ఈ జలపాతానికి హిందువుల దేవగురువైన నారదుడి పేరు పెట్టారని అంటారు. నారద మహర్షి త్రిలోక సంచారి. కాబట్టి అమెరికాలో కూడా అడుగుపెట్టాడేమో తెలియదు.
నారదుడు అంటే చాలా ఏళ్ళ క్రితం జరిగిన సంగతి గుర్తుకువచ్చింది. హైదరాబాదులోని సమాచార భారతి సంస్థవారు ఒక ఏడాది నారద జయంతిని పత్రికాదినోత్సవంగా పాటించి కొందరు పాత్రికేయులను సత్కరించాలని సంకల్పించారు.
తగవులమారి అనే పేరు పడ్డప్పటికీ నిజానికి నారదుడు శాంతి కాముకుడు. ఆ మహర్షి ఎవరి నడుమ తంపులు పెట్టినా అది లోక కళ్యాణం కోసమే అని పురాణాలు చెబుతున్నాయి. నారడుడి మాదిరిగానే
విలేకరులు కూడా నిత్య సంచారులే. కాబట్టి జర్నలిష్టులను సన్మానించాలనే ఆలోచన ఆ సంస్థ వారు చేసి ఉండవచ్చు.
ఆనాటి పురస్కార గ్రహీతల్లో ఒకనాటి నా రేడియో సహోద్యోగి సుప్రశాంతి కూడా వుండడం వల్ల నేనూ ఆ కార్యక్రమానికి వెళ్లాను. నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, బీజేపీ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు కూడా వచ్చారు. పూర్వాశ్రమంలో నా మిత్ర బృందంలోని విలేకరులు అనేకమంది అక్కడ కలిసారు. హాయిగా ఒక పూట గడిచిపోయింది.
పొతే, సుప్రశాంతి గురించి ఒక మాట.
సర్కారు ఉద్యోగం, అందులో సెంట్రల్ గవర్నమెంట్, అందులోను ఆలిండియా రేడియో రిపోర్టర్, వీటిని మించి సొంత ప్రాంతంలో పోస్టింగు, ఇన్ని కలిసివస్తే, నాలాగా కాలర్ తో పాటు తల కూడా ఎగరేస్తూ వుండాలి. అదేం చిత్రమో తలవంచుకుని పనిచేయడం తప్ప పాపం ఆ అమ్మాయికి వేరే పని తెలియదు.
బహుశా, వృత్తి పట్ల సుప్రశాంతికి వున్న ఈ అంకితభావమే ఆమెను ఉత్తమ జర్నలిష్టు అవార్డుకు ఎంపిక చేయడంలో దోహదపడి వుంటుంది. ప్రభుత్వం కూడా గుర్తించి ప్రమోషన్ తో మీద హైదరాబాదు దూరదర్సన్ కు బదిలీ చేసింది. అక్కడా సుప్రశాంతి పనితీరులో మార్పు లేదు. నేను పనిచేసే రోజుల్లో చుట్టూ హడావిడి. ఆమె పనిచేసే చోట ఆమె పేరుకు తగ్గట్టే ప్రశాంత వాతావరణం.
డిసెప్షన్ ఫాల్స్
సియాటిల్ కు తిరిగివస్తున్నప్పుడు త్రోవలో దట్టమయిన అడవుల నడుమ ‘డిసెప్షన్ ఫాల్స్’ అనే ఒక జలపాతం చూసాము. చూడడానికి చిన్నదే కానీ ఆ జలపాతం నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ఉరవడి మాత్రం చాలాఎక్కువ. బలిష్టమయిన ఏనుగులు కూడా ఆ వేగాన్ని తట్టుకుని నిలబడలేవని చెబుతారు. రోడ్డుపక్కన తాటిప్రమాణం చెట్ల నడుమ నుంచి కిందికి దిగి వెడితే ఇది కనిపిస్తుంది. అంతటి కారడవిలో కూడా టూరిస్టులకు అవసరమయ్యే సదుపాయాలూ కల్పించిన తీరు అమోఘం. ప్రసంశనీయం.
కింది ఫోటోలు :
అమెరికాలో నారద జలపాతం
నేను ఒకప్పుడు పనిచేసిన హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగం సహచర బృందం. ఈ గ్రూపులో కుడి నుండి మూడో ఆవిడే ఉత్తమ మహిళా జర్నలిష్టు సుప్రశాంతి. ప్రముఖ కధా రచయిత, న్యూస్ రీడర్, కీర్తిశేషులు డి.వెంకట్రామయ్య గారు కూడా నా పక్కన వున్నారు.
డిసెప్షన్ ఫాల్స్.

















(ఇంకా వుంది )

కోట జీవితానికి తెర పడింది - భండారు శ్రీనివాస రావు

 

మొన్న జులై పది ఆయన పుట్టినరోజు. మూడో రోజునే ఈ దుర్వార్త, కోట శ్రీనివాస రావు గారు ఇక లేరని.
“రేడియో నుంచి చాలా నేర్చుకున్నాను. ఉచ్చారణ ఎలా వుండాలి? ఏ వాక్యాన్ని ఎక్కడ ఎలా విరవాలి? ఏ పదాన్ని ఎక్కడ ఎంత నొక్కి చెప్పాలి? ఇవన్నీ రేడియో నాటకాల్లో నటిస్తూ నేర్చుకున్నాను”
తన డెబ్బయి నాలుగో పుట్టినరోజున ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఇవి.
ఒకప్పుడు రేడియోలో పనిచేసిన మనిషిగా ఈ మాటలు విని నేనూ సంతోషపడ్డాను.
“బ్యాంకులో ఉద్యోగం. సాయంత్రాలు నాటకాలు రిహార్సల్స్. మధ్యమధ్య రేడియో నాటకాలు. రవీంద్ర భారతిలోనే నూట యాభయ్ కి పైగా నాటకాలు వేసిన అనుభవం. ఎవరో అన్నారు, సినిమాల్లో కూడా ప్రయత్నించరాదా అని. నాది నల్లటి ఛాయ. ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకున్నావా అంటారేమో అని బెరుకు”
అలాంటి మనిషి ఒకటీ అరా కాదు, లెక్కకు మించిన సినిమాల్లో వేశారు. అవీ చిన్నాచితకా వేషాలు కావు. నటనా వైదుష్యానికి గుర్తుగా ఎనిమిది నందులు ఆయన సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ ఆకాశంలో ఓ వెలుగు వెలిగారు.
నేను రేడియోలో చేరిన కొత్తల్లో కోట శ్రీనివాసరావు గారు నారాయణ గూడా (దీపక్ మహల్ పక్కన) స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. అప్పుడప్పుడు తోటి నాటకాల నటులతో కలిసి రేడియో ఆవరణలో కనిపించేవారు.
ఒకరోజు అయన అన్నమాటలు నాకు బాగా జ్ఞాపకం.
“మా బ్యాంకు వాళ్లకు ఆటలు ఆడేవాళ్ళు తప్ప మా బోటి నటులు పనికిరారు. (ఆ రోజుల్లోనే క్రికెట్ క్రీడాకారుడిగా స్టేట్ బ్యాంకు ఉద్యోగి మహమ్మద్ అజహరుద్దీన్ నిలదొక్కుకుంటున్నారు. చిన్నతనంలో విఠల్ వాడీలో గల్లీ క్రికెట్ ఆడేవారని చెప్పుకునేవారు) వాళ్లకు అడగడమే ఆలస్యం సెలవు దొరుకుతుంది. నాకేమో రాకరాక ఓ సినిమా వేషం వచ్చింది. వారం రోజులు సెలవు కావాలంటే దొరకడం గగనం. సరే మేము సినిమాల్లో వేసి డబ్బులు తీసుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళు మాత్రం క్రికెట్ ఊరికే ఆడుతున్నారా! ఎందుకీ వివక్ష?” అనేది ఆయన ఆవేదన.
సినిమాలు పెరిగాక ఆయన ఆ ఉద్యోగం వదిలేశారు, అది వేరే విషయం.
స్టేట్ బ్యాంకులో మధుర బాబుగారని ఓ అధికారి వుండేవారు. (చనిపోయి చాలా సంవత్సరాలు అవుతోంది) హైదరాబాదు మెయిన్ బ్రాంచికి మేనేజర్. సమర్ధుడైన ఆఫీసర్ అని పేరు. ఆ రోజుల్లో ఆయన హవా బాగా వుండేది. ఈ రోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అనిపించుకుంటున్న వారిలో అనేకమంది ఆయనకోసం ఆఫీసు బయట వెయిట్ చేస్తుంటే నేను ఆరోజుల్లో చూశాను. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారూ మధురబాబు గారు మంచి స్నేహితులు. మా అన్నయ్య విశాఖ గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా, మధురబాబుగారు నాగార్జున గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా పనిచేశారు. తదనంతర కాలంలో మా అన్నయ్య చెన్నై, పుదుచ్చేరి, కేరళరాష్ట్రాల స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా, మధురబాబు గారు జనరల్ మేనేజర్ గా పనిచేశారు. ప్రపంచ ప్రసిద్ధ కేన్సర్ నిపుణులు నోరి దత్తాత్రేయుడు మధురబాబు గారికి స్వయానా తమ్ముడు.
వేరే విషయం అంటూ వేరే వేరే విషయాల్లోకి పోతున్నానని అనుకుంటున్నారా. లేదు. కోట శ్రీనివాసరావు గారికీ బ్యాంకుకూ సంబంధం ఉన్నట్టే, ఒకప్పుడు ఏ బ్యాంకులో అయితే రెండు రోజులు సెలవు కోసం ఇబ్బందులు పడ్డారో అదే స్టేట్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేసిన ఈ మధురబాబు గారికీ సంబంధం వుంది. అది కూడా అలాంటిలాంటి సంబంధం కాదు. తదనంతర కాలంలో ఈ ఇద్దరూ స్వయానా వియ్యంకులు అయ్యారు.



13, జులై 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (193) : భండారు శ్రీనివాసరావు

 

చేతిలో చెయ్యేసి చెప్పు రాధ!

పుగెట్ సౌండ్. (Puget sound)

ఇది వంద మైళ్ళ పొడవున విస్తరించిన అపారమైన జలరాశి. జలసంధి కంటే పెద్దది. సముద్రం కంటే చిన్నది. పీటర్ పుగెట్ అనే వ్యక్తి పేరిట పుగెట్ అనే పేరు పెట్టారు. ఇక సౌండ్ అంటే మధ్యలో అనేక దీవులు, లంక భూములు, సముద్రంలో కలిసే నీటిపాయలు కలిగిన సముద్ర ముఖద్వారం లాంటిది. సముద్రంలోని ఉప్పు నీరు, నదులలోని తాగు నీరు కలిసివుండడం కారణంగా జల జీవ రాశులు, పక్షుల మనుగడకు తోడ్పడే వాతావరణ సమతుల్యానికి దోహదపడుతుంది. భారీ నౌకలు ప్రయాణించడానికి వీలైన లోతు, వెడల్పు కలిగిన ఈ జలాశయం ఒడ్డున వున్న నెలకొన్న అతి పెద్ద నగరం సియాటిల్.
పుగెట్ సౌండ్ తీరం పొడుగునా మైళ్ళ దూరం అతి చక్కటి కాలిబాటలు వేశారు. వాటికి, జలరాశికి నడుమ ఇనుప కంచె వుంది. ఆ ఇనుప తీగెల కంచెకు వందల సంఖ్యలో తాళాలు. కొంచెం వింతగా అనిపించే దృశ్యం. ఈ ఒక్క చోటనే కాదు యూరోపులో కూడా ఈ సాంప్రదాయం వుంది.
మన దేశంలో ప్రేయసీ ప్రియులు తమ ప్రేమ వ్యక్తీకరణ కోసం చెట్ల బెరడుల మీద, పాడుపడిన కోట గోడల మీద తమ పేర్లు చెక్కుకుని సంతోషపడినట్టే, ఇక్కడ అమెరికాలో కూడా ఇలా ఇనుప కంచెలకి తాళాలు వేసి, తాళం చెవులు ఎక్కడో పారేసి, గుండెల్లో దాచుకున్న తమ ప్రేమ పదిలం అనుకుంటూ సంతుష్టిపడుతుంటారు (ట).
ఇలా వేసిన తాళాల్లో తుప్పుపట్టిపోయినవి, తాజాగా వేసినవి కూడా కనిపించాయి.
తమ ప్రేమ బంధాన్ని తాళపు గుత్తులలో బంధించిన ఈ ప్రేమికుల్లో ఎందరి ప్రేమ ఫలించి పెళ్ళికి దారితీసిందో, ఎందరి ప్రేమ వికటించి దేవదాసులు అయ్యారో, ఎందరి ప్రేమ పెళ్ళిళ్ళు పుష్పించి పిల్లాపాపలతో కాపురాలు చేస్తున్నారో, తాళం చేసిన చేత్తోనే ప్రేమకు గుడ్ బై చెప్పి వేరే తాళాలు వేసిన వారెందరో ఆ లెక్కలు మనకు తెలవ్వు.
ఇంటికి వచ్చి గూగుల్ ని అడిగితే అమెరికాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య 42 శాతం అని చెప్పింది.
ఈ ప్రేమ తీరం వున్న అల్కి అవెన్యూ లోనే రెండు జంట గృహాలు వున్నాయి. వాటి ప్రత్యేకత ఏమిటంటే వాటిని పూలతో అలంకరించడం. వీలుంటే పూలతో ఇంట్లో ఒక గదిని అలంకరించుకుంటాం, ఇంకా వీలుంటే ఇంటికి ముందూ వెనుకా పూల పొదలు పెంచుకుంటాం. అంతే కానీ మొత్తం ఇంటినే పూలతో నింపేయం!
కానీ ఈ రెండు ఇల్లు పూర్తిగా పూలగృహాలే! అడుగడుగు, అంగుళం అంగుళం అన్నీరంగురంగుల పూలే! ఎరుపు, తెలుపు, పచ్చ, ఊదా, గులాబీ ఇలా ఆ సృష్టికర్త ఎన్ని రంగులు ఇచ్చాడో అన్ని రంగాల పుష్పాలు అక్కడ చూడవచ్చు. కళ్ళారా చూస్తేనే కాని అభివర్ణించలేని గొప్ప దృశ్యం. వీటిని లో నిర్మించారు. తరువాత వెలిసిన అధునాతన గృహ సముదాయం నడుమ ఈ రెండు ఇళ్లు తమ ప్రత్యేకతను చాటుకుంటూ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అదేదో తెలుగు సినిమాలో ఒక పాత్ర చేత చెప్పించినట్టు ఈ అమెరికా వాళ్లకు అన్నీ విచిత్రాలే.

మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో...

సీనియర్ ఎన్టీఆర్ పాత పాతాళ భైరవి చిత్రంలో పింగళి నాగేంద్రరావు గారు రాసిన కలవరమాయే మదిలో అనే పాటలో ‘మోసులు వేసి’ అనే పాద ప్రయోగం చేశారు. ఈ మోసులు ఏమిటి అని అప్పుడు నా చిన్న బుర్రలో సందేహం. నెమ్మదిగా తెలిసింది ఏమిటి అంటే మోసులు అంటే మొలకలు అని.
సరే ఈ మొలకలు ప్రతి మనిషి జీవితంలో వుంటాయి. మోహం, మోజు, తమకం, ప్రేమ, కోరిక, ఇష్టం ఈ పదాలకు అర్ధాలు అన్నీ వయసును బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతుంటాయి.
చిన్నప్పుడు నాకు నూగాయ, నువ్వుపొడితో పెట్టిన ఆవకాయ కారం అంటే చచ్చేంత ఇష్టం. వేళ్ళ సందుల నుంచి కారిపోయేదాకా నెయ్యి వేసుకుని అన్నం తినడం మహా మోజు. పెనుగంచిప్రోలులో, నలుగురితో పాటు భోజనం చేస్తున్నప్పుడు, మా అన్నపూర్ణక్కయ్య ఎవరికీ కనపడకుండా కొంగు చాటున తెచ్చి నా కంచంలో మాత్రమే వేసే వెన్నపూస అంటే మహా ఇష్టం. వరంగల్ జిల్లా, మానుకోట దగ్గర ఈదులపూసపల్లిలో మా ప్రేమక్కయ్య ఉల్లిపాయ ముక్కలతో చేసే పచ్చి పులుసు, శ్రావణ మాసం రోజుల్లో అమ్మవారి మహా నైవేద్యం మీద పడకుండా, పిల్లలకోసం మా సరస్వతి అక్కయ్య చేసే చిరుతిండ్లు, ఎంత రుచిగా వుండేవంటే ఎవరికంటా కనబడకుండా దొంగతనంగా తినాలి అనిపించేంతగా గొప్పగా వుండేవి.
అంతేనా! మా పెద్దన్నయ్య గారింట్లో కొత్త సంవత్సరం అని ఓ కేలండర్ ఇచ్చారు. మూడు తెల్లటి పిల్లులు. అబ్బా వాటి అందం చూస్తుంటే కడుపు నిండిపోయేది. ఎవరో చుట్టం వచ్చి ఆ కేలండర్ కావాలంటే ఇచ్చేసారు. నాకు కడుపు రగిలిపోయింది. ఆ పిల్లుల కోసం ప్రాణం కొట్టుకుపోయింది. చంపడం అనే పదం తెలియని రోజులు. లేకపోతె అంతపనీ చేయాలన్నంత కోపం వచ్చింది అన్నమాట.
అలాగే కాలేజి అమ్మాయిలతో ప్రేమలు. వారిని మెప్పించడానికి కవితలు. రాసి పోస్టు చేయని ప్రేమ లేఖలు. ఈ టైపు ప్రేమలు, దోమలు ఆనాటి ఆడపిల్లలకు పట్టవని తెలిసేసరికి జుట్టు నెరిసింది.
పాతికేళ్ళ క్రితం మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు ప్రతిదీ వింతే! కనబడ్డవన్నీ కొనేసి ఇండియాలో కనబడ్డ వాళ్లకు పంచేయాలన్నంత ఆతృత. ఇప్పుడు ఉభయ పక్షాలకు ఈ గోల లేదు. అన్నీ అక్కడే దొరుకుతున్నాయి, ఇక్కడి నుంచి మోసుకుపోవడం దేనికనే తలంపు. ఆ కాలంలో ఊరికొకడు అమెరికాలో. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు ముగ్గురు.
జీవన గమనంలో ఒక చోట ఆగి సేద తీరుతుంటే ఇవన్నీ వ్యామోహాలా! మోజులా! తమకాలా! కోరికలా! ఇష్టాలా! అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇవన్నీ మనసు ఆడే ఆటలు అని అర్ధం కావడానికి ఇన్నేళ్ళు పట్టింది.
మనసు చాలా తెలివైనది. వయసుకు తగ్గట్టుగానే ఆడుతుంది.

కింది ఫోటోలు:

సియాటిల్ పుగెట్ సౌండ్ తీరంలో ఇనుప కంచెకు వేసిన ప్రేమ తాళాలు, ఫ్లవర్ హౌసేస్.

















(ఇంకావుంది)
13-07-2025