1, మార్చి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో ( 99 ) : భండారు శ్రీనివాసరావు

 ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాడపాటి సత్యవతి

మూడు దశాబ్దాల క్రితం దాదాపు ప్రతి సాయంత్రం ఆరుగంటల పదిహేను నిమిషాలకల్లా తెలుగునాట లోగిళ్ళలో ఈ మధుర స్వరం వినబడేది. మెల్లగా, సౌకుమార్యంగా వినవచ్చే ఆ  కంఠస్వరం చాలామందికి సుపరిచితం.

ఒకప్పుడు ఇంట్లో కూర్చుని ఆవిడ చదివే వార్తలు విన్న నేను,  ఆ తర్వాత ఆవిడతో కలిసి రేడియోలో ఒకే విభాగంలో  దశాబ్దాల పాటు కలిసి  పనిచేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం.

‘శ్రీనివాసరావు గారు ఎలావున్నారు బాగున్నారా!’

పాతికేళ్ళ సుదీర్ఘ పరిచయ కాలంలో ఆవిడ  నోటి నుంచి  నేను విన్న అతి  పెద్ద వాక్యం ఇదే.

మాడపాటి సత్యవతి గారు ఎంతో  క్లుప్తంగా మాట్లాడుతారు. మాటలు తూచినట్టే వచ్చేవి ఆవిడ గారి నోటినుంచి. అంతటి మితభాషి. మరి  పది నిమిషాలు విడవకుండా ఏకబిగిన వార్తలు యెలా చదివేవారో అనిపించేది. కానీ ఆవిడ  స్వరం భగవంతుడు కేవలం రేడియో కోసమే తయారుచేసాడేమో అనిపిస్తుంది.  ఒక రకమైన మార్ధవంతో, సంగీతం వినిపిస్తున్నట్టుగా మాడపాటి సత్యవతిగారు వార్తలు చదువుతుంటే మరీ మరీ వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు బోలెడుమంది. ఒకరు అనువాదం చేసిన వార్తలు చదవడం కన్నా తాను సొంతంగా అనువదించి చదవడానికి ఆవిడ ఇష్టపడేవారు. నిజానికి ఆవిడ న్యూస్ రీడర్ కాదు. న్యూస్ ఎడిటర్. కానీ వారంలో కొన్ని రోజులు విధిగా వార్తలు చదివేవారు. వీటికి తోడు వారానికి ఒకమారో రెండు సార్లో వీలునుబట్టి ‘వార్తావాహిని’ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పించేవారు.

వార్తావిభాగం పనితీరు గురించి ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి. హిందీలో చెప్పాలంటే (నిజానికి నాకూ ఆ భాషకు చుక్కెదురు) అక్కడ వాతావరణం ‘బహుత్  బహుత్ గంభీర్.’  నేను అడుగుపెట్టేంత వరకు పరిస్తితి అదే. పని అయిపోయేంతవరకు అందరూ ముక్తసరిగా మాట్లాడుకునేవారు. అంతా రొటీన్ గా  ‘స్క్రీన్ ప్లే’  పుస్తకంలో రాసివున్నట్టు జరిగిపోయేది. వార్తల్లో ఎలాటి తభావతు  రాకుండా  బులెటిన్ల తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక వార్త ఇవ్వాలా వద్దా  ఇస్తే ఎన్ని వాక్యాలు ఇవ్వాలి  యెంత ప్రాధాన్యం ఇవ్వాలి ఒకటి రెండు సార్లు ఆలోచించే వాళ్లు. మరీ  ముఖ్యంగా సత్యవతిగారికీ, వెంకట్రామయ్య గారికీ ఈ విషయంలో పట్టింపులు మెండు. అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకునే నా తత్వం వారికి అంతగా రుచించకపోయినా ఇంట్లో చిన్నవాడిని ముద్దు చేసినట్టు నన్ను చూసీ చూడనట్టు వొదిలేసేవారు. ఎడిటర్లు అంతే!  దానితో నాది ఆడింది ఆట పాడింది పాట. అంతకు ముందు దినపత్రికలో పనిచేసిరావడం వల్ల, వార్తలు ఇవ్వడంలో కొంత స్వేచ్చను ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడిని. బహుశా నాతో పడ్డన్ని తలనొప్పులు వాళ్లు ఎవరితోనూ పడి వుండరేమో కూడా.

నేను చేరిన కొత్తల్లో అనుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జట్ గురించి వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన ప్రత్యేక వార్తావాహిని తయారు చేస్తున్నారు. అభిప్రాయాలు రికార్డ్ చేసుకొచ్చే బాధ్యత నా మీద పడింది. అన్నీ తీసుకొచ్చి, ఆ టేపులన్నీ సత్యవతిగారికి వొప్పచేప్పేసి చక్కాపోయాను.  రాత్రి ఏడుగంటల నలభై అయిదు నిమిషాలకు  ప్రసారం. లోపల డబ్బింగు స్టూడియోలో సత్యవతి గారు నానా అవస్థ పడుతున్నారు. గొంతులు వినబడుతున్నాయి.  ఎవరి గొంతు ఎవరిదో తెలియచెప్పే ‘క్యూ షీట్’ సత్యవతి గారికి ఇవ్వడం మరచిపోయాను. ఓపక్క  టైం దగ్గర పడుతోంది. ఆవిడకి నరాలు తెగిపోయే టెన్షన్. నేనెక్కడో ఎవరితోనో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఇప్పట్లా  సెల్ ఫోనులు లేని రోజులాయె.   ఆవిడ అనుభవమే ఆవిడకు  అక్కరకు వచ్చింది. కాని ఆరోజు,  డబ్బింగు పని  పూర్తిచేసి టేపు స్టూడియోలో వొప్పగించేసరికి ఆవిడ తల ప్రాణం తోకకు వచ్చివుంటుంది.

మరునాడు ఆఫీసుకు వెళ్ళిన తరువాత కాని నాకు విషయం తెలియలేదు. కనబడగానే బాగా కోప్పడాలి. కోపడ్డారు కూడా.  యెలా అనుకున్నారు? నోరు తెరిచి ‘ఇదేంటి శ్రీనివాసరావు గారూ’ అన్నారు. అంతే!  

రేడియోలో పనిచేసేవారికి ముందుగా ఓ నీతి పాఠం బోధిస్తారు.  యెంత క్లుప్తంగా (వార్త) చెబితే  భావం అంత ఖచ్చితంగా అర్ధం అవుతుంది అని. (Brevity is sole of expression).

సత్యవతి గారి భావం నాకు చాలా బాగా అర్ధం అయింది.  తీరు పూర్తిగా మార్చుకోకపోయినా  కొంత గాడిలో పడ్డాను. (అని అనుకున్నాను)

అలా,  మధ్యలో నేను మాస్కో రేడియోలో పనిచేసిన అయిదేళ్ళు మినహాయిస్తే ఆవిడ రిటైర్ అయ్యేవరకు కలిసే పనిచేశాం. 

వయసులో పెద్దావిడ కనుక మా అందరికంటే ముందుగానే రిటైర్ అయ్యారు. అప్పుడు ఆవిడ వయసు యాభయ్  ఎనిమిది.

ఇప్పుడు ఎనభయ్ ఎనిమిది. ఈ మూడు దశాబ్దాల కాలంలో అడపాదడపా కలుస్తూనే వున్నాం. అప్పుడప్పుడూ  ఫోన్ చేసి మాట్లాడేవారు.  

2019 డిసెంబరు చివర్లో  ఒకసారి నేనే ఫోన్ చేశాను. సత్యవతి గారూ. ఈ సాయంత్రం వెంకట్రామయ్య గారిని తీసుకునే నేనే మీ ఇంటికి వస్తాను”.
అంతకంటేనా! తప్పకుండా రండిఅన్నారావిడ ఎంతో సంబరంగా. మొహం కనిపించకపోయినా ఆ స్వరంలోనే తెలుస్తోంది ఆ ఆనందం.
అనుకున్న సమయానికి కారులో వివేకానంద నగర్, ఈనాడు కాలనీకి వెళ్లాను. అక్కడ ఉంటున్న డి.వెంకట్రామయ్య గారిని ఎక్కించుకుని సికింద్రాబాదు బయలుదేరాము.
దారిలో వెంకట్రామయ్య గారన్నారు. ఖార్ఖానాలో చంద్ర ఉంటాడుచూసి వెడదామని.
మదర్ తెరిస్సా వృద్ధాశ్రమంలో ఉంటున్న చంద్రను చూసాము. తన వేలికొనలతో కుంచె పట్టుకుని వేలాది అందమైన చిత్రాలను గీసిన ప్రసిద్ధ చిత్రకారుడాయన. ఎప్పుడో దశాబ్దాల క్రితం హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయచలన చిత్రోత్సవంలో ప్రతిరోజూ కలుసుకునే వాళ్ళం. వృద్ధాప్యం కారణంగా  ఆకారంలో వచ్చిన తేడా తప్ప మనిషిలో మార్పు లేదు. పొతే, వెంకట్రామయ్య గారూ చంద్రా ఏనాటి నుంచో ప్రాణ స్నేహితులు. నన్నాయన గుర్తుపట్టి పలకరించడమే నాకు వింత అనిపించింది. ఆయన మొహంలో ఆనందం చూస్తుంటే కోరుకున్న బొమ్మ చేతికి ఇస్తే ఓ చిన్న పిల్లాడు ఎలా కేరింతలు కొడతాడో ఆ దృశ్యం గుర్తుకువచ్చింది. కాసేపు కూర్చుని వచ్చేసాము. తరువాత సత్యవతి గారింటికి వెళ్ళాము.
మా ఇద్దర్నీ చూడగానే ఆవిడ మొహం వెలిగి పోయింది. మళ్ళీ ఏమి గుర్తుకువచ్చిందో ఏమిటో వదనంలో విచారం తొంగి చూసింది.
మనం లోగడ వెంకట్రామయ్య గారింట్లో కలిసాము. అప్పుడు మీ వెంట నిర్మల వచ్చారుఅన్నారు. తర్వాత ఏమీ మాట్లాడలేకపోయారు. నా సంగతి సరే.
వెంకట్రామయ్యగారు కల్పించుకుని సంభాషణ మార్చారు. పాత రేడియో రోజులు నెమరేసుకున్నాం.
చాలా సేపు కూర్చున్నాం. చాలా విషయాలు మాట్లాడారు.

 వారి చిన్నతనంలో సంగతులు చెప్పారు. మాడపాటి హనుమంతరావు గారు హైదరాబాదు నగర మొదటి మేయరు. వారి సోదరుడి కుమారుడు మాడపాటి రామచంద్రరావు. వారి కుమార్తెలలో ఒకరు మాడపాటి సత్యవతి. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు హనుమంతరావు స్త్రీ విద్య ఉద్యమాన్ని ప్రారంభించి అందులో భాగంగా నిజాం సంస్థానంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను హైదరాబాదులోని ఇసామియా బజారులో ఓ చిన్న గదిలో ఏర్పాటుచేశారు. ఆడపిల్లలను చదువులకోసం బడులకు పంపడం ఆ రోజుల్లో అంత తేలికకాదు. ఎంతగానో శ్రమిస్తే నలుగురు ఆడపిల్లలు చేరారు. అందులో ఒకరు మాణిక్యాంబ గారు. ఆవిడ హనుమంతరావు భార్య. ఇప్పుడా పాఠశాల హైదరాబాదు నగరంలో చాలా ప్రాముఖ్యం కలిగిన మహిళా విద్యాలయంగా రూపుదిద్దుకున్నది. హనుమంతరావు చనిపోయిన తర్వాత దానికి వారి పేరు పెట్టారని మాడపాటి సత్యవతి చెప్పారు.

 మాటలో అదే నెమ్మదితనం. ఎనభయ్ ఎనిమిదేళ్ళ వృద్ధాప్యపు ఛాయలు శరీరంలో కానవస్తున్నా ఆవిడ కంఠం మాత్రం అలాగే మునుపటి మాదిరిగానే శ్రావ్యంగా వుంది.

మార్దవస్వరమాలతి  మాడపాటి సత్యవతి అంటారు అందుకే కాబోలు.

తర్వాత నాలుగు మాసాలకే  ఆ శ్రావ్యమైన రేడియో స్వరం శాశ్వతంగా మూగపోయింది.

కింది ఫోటో:

మాడపాటి సత్యవతి గారితో డి. వెంకట్రామయ్య గారు,  నేను


 

(ఇంకా వుంది)

 

కామెంట్‌లు లేవు: