ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి. వెంకట్రామయ్య
నా
జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో
కనిపించే పేరు డి. వెంకట్రామయ్య.
ప్రముఖ
పాత్రికేయులు , కలం కూలీ జీ. కృష్ణగారు అన్నారు ఒకసారి, వెంకట్రామయ్య వార్తలు
చదువుతుంటే చదువుతున్నట్టుగా వుండదు, వార్తలు మనకు చెబుతున్నంత సహజంగా వుండేవని. ఆయన అలా అన్నారు అంటే అది ఆస్కార్ అవార్డుతో
సమానం.
అయితే, ఆయన
రేడియోలో ఉద్యోగం చేయడం వల్ల రేడియోకు లాభం చేకూరిన మాట నిజమే కానీ, వెంకట్రామయ్య
గారు రేడియోలో చేరి కధలు రాయడం మానేసినందువల్ల తెలుగు పాఠకలోకం ఒక మంచి రచయితను
కోల్పోయిందని నా నమ్మకం.
'డి వెంకట్రామయ్య' కధలపై నేను
మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే ఆయన రాయడం బాగా తగ్గించారు. తగ్గించారు
అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో!
వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి, ఆ బాపతు వాటిని 'చదవడం
మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై
కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి, 'రాయడం మానేస్తే పోలా' అనిపించి
రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం.
1975 నవంబర్లో అనుకుంటాను, తొలిసారి
వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా
కలుసుకున్నాను. ప్రాచుర్యం పొందిన రచయితతో ఏ అభిమానికయినా సాన్నిహిత్యం
ఉండవచ్చుకానీ పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం అరుదు. వృత్తిరీత్యా
కలసి పనిచేస్తున్నప్పటికీ, ప్రవృత్తిరీత్యా ఆయనకూ, నాకూ నడుమ
శతసహస్ర వైరుధ్యాలు.
ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని
అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని కోరుకునేవారు. ఇందుకు
నేను పూర్తిగా విరుద్ధం. నలుగురితో బాతాఖానీ వేస్తూ, గలగలా
నవ్వుతూ, నవ్విస్తూ పని చేస్తూ పోవడం నా పధ్ధతి.
టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు.
చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా, నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ
వుండడం నా ప్రత్యేకత.
ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే, అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో
మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాదాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు
వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని
మొహమ్మీదే చెప్పేసేవారు. అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం అనిపించేది కానీ ఆయన
మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనూ, పరిచయస్తులనూ,
మొహమాటపడి వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య
కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని
ఆబ్లి గేషన్స్ ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు.
దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం
తప్ప ఏమీ చేయలేని పరిస్తితి మాది.
పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన
తయారుచేసారంటే దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన
అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి
కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ,
సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో, వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా
తక్కువమందిని చూస్తాం! ఆ కొద్దిమందిలో వెంకట్రామయ్యగారు మొదటివరుసలో వుంటారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు
రాయడం తగ్గించారు. పత్రికల్లో, మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత
రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది. నిజమేనేమో!
అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో
పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ
ఉపయోగించుకుని, వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా
బద్ధకం వొదిల్చుకుని చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది
శ్రీనివాసరావు పుణ్యమే' అని, పాపపుణ్యాల
పైనా, దేవుళ్ళూ దెయ్యాల పైనా ఏమాత్రం నమ్మకం లేని
వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి
వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన పేరుపెట్టు
కోకుండానో, 'గళం'పేరుతోనో, రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో
పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు
రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. 'ఎన్ని'
రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి
పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ,
ఒక ఏడాది ఆ పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించడం ముదావహం.
పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి
ఇదో మంచి ఉదాహరణ.
సాధారణంగా పొగడ్తలకు, పొడిగించుకోవడానికి ఇష్టపడని వెంకట్రామయ్య
గారు, రచన మాస పత్రికలో
రాసిన తన రేడియో రోజుల సీరియల్ లో నా
గురించి కొన్ని మంచి మాటలు రాయడం నాకొక కితాబు. ఆయన రాతల్లోనే ఆ మాటలు:
“హైదరాబాదు
ఆకాశ వాణి వార్తావిభాగంలో మిగతా అందరికంటే నాతొ ఎక్కువ కాలం పనిచేసిన సహోద్యోగి,
మిగతా అందరి
కంటే నాకు అత్యంత ఆప్తుడు భండారు శ్రీనివాసరావు. 1975 లో ఆయన
చేరినప్పటినుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు నలభయ్ ఏళ్ళు మా స్నేహం చెక్కుచెదరకుండా
వుంది. ...ఎన్నో విషయాల్లో ఏ మాత్రం పోలికా పొంతనా లేని మేమిద్దరం స్నేహితులుగా
అన్నేళ్ళు అంత దగ్గరగా వుండడమే విచిత్రం.
“ఎప్పుడు
నవ్వుతు, తుళ్ళుతూ
గలగలా మాట్లాడుతూ వుండడం, తన
వాక్చాతుర్యంతో,చమత్కారాలతో,
చలోక్తులతో,
వ్యంగోక్తులతో
చుట్టూ వున్నవాళ్లనందరినీ కవ్విస్తూ నవ్విస్తూ వుండడం ఆయన సహజ లక్షణాలు. అసలీ
మనిషి జీవితంలో ఎన్నడయినా విచారం, విషాదంలాంటివేమైనా వుంటాయా, ఎప్పుడయినా ఏ సందర్భంలో నయినా ఈయన
సీరియస్ గా వుంటాడా అనిపిస్తుంది ఆయన్ని చూసిన వాళ్ళందరికీ. (వెంకట్రామయ్య గారికి
నా గురించి ఈ ఆలోచన వచ్చినప్పుడు, ఆయన
నమ్మని తథాస్తు దేవతలు ‘తధాస్తు’ అని
వుంటారు. అందుకే నా జీవిత చరమాంకంలో పెను విషాదాలు, విచారాలు నన్ను చుట్టుముట్టాయి)
“
న్యూస్ రూమ్ అంటేనే వాతావరణం ఎప్పుడు ఎంతో కొంత ఉద్విగ్నంగా వుంటుంది. కాని
శ్రీనివాసరావు అక్కడ వుంటే చాలు వేడి తగ్గిపోయేది. ఆయన మాటలతో, చలోక్తులతో అందరూ కాసేపు హాయిగా
నవ్వుకునే వారు. కాస్త విశ్రాంతి దొరికినట్టుగా, వూరట లభించినట్టుగా అనిపించేది
పనిచేసేవాళ్లకి.
“సరే!
కొత్తగా వచ్చి చేరిన ఈ శ్రీనివాసరావు అనే ఆయన అసలు స్వరూపం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన పనితీరు యెలా వుంటుంది అని మొదట్లో
అన్నీ సందేహాలే. ఇలాటివన్నీ తెలుసుకోవడానికీ, ఆయన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికీ
అధమ పక్షం ఆరు మాసాలు పట్టింది. (పూర్తిగా అన్నమాట వాడకూడదేమో. ఎందుకంటే అప్పుడే
కాదు.. ఇన్నేళ్ళ తరువాత కూడా నా మిత్రుడు భండారు శ్రీనివాసరావు లీలలూ, మాటలూ నాకు పూర్తిగా అర్ధం కావు)
“
నాకిప్పటికీ బాగా గుర్తుంది. సందర్భం ఏమిటో జ్ఞాపకం లేదు. ఒకనాటి సాయంత్రం డ్యూటీ
ముగించుకుని నేనూ భండారు శ్రీనివాసరావు గారూ (ఇకనుంచి ఈ గౌరవ వాచకం తీసివేసి
రాస్తాను) న్యూస్ రూమ్ నుంచి బయటకు నడుస్తుండగా ఆయనో మాట అన్నారు.
“మీరు
కుండలు బద్దలు కొట్టండి. కాని కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొడతానంటే
యెలా “ అని. అంతకుముందు ఆఫీసులో ఏదో జరిగింది. ఎవరితోనో నేను ఘర్షణకు దిగడమో,
తీవ్రస్థాయిలో
వాదించడమో జరిగింది. అలాటి సందర్భాలలో అవసరానికి మించి ఆవేశపడడం, అవతలి వ్యక్తి ఎవరయినా సరే, ఏమాత్రం సంకోచించకుండా వున్న మాట
మొహాన అనేయడంవంటి నా సహజ స్వభావం గురించి , శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య ఇది.
‘కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొట్టడం’ అన్న ఆయన చమత్కారానికి నేనూ
నవ్వుకున్నాను. ఆ చమత్కారపు మాటల వెనక నా బోటివారు ఆలోచించవలసిన, చేతనయితే అనుసరించవలసిన మంచి సలహా
వున్నట్టు నాకనిపించింది.
“ అప్పుడే
కాదు, అంతకి
ముందు ఆ తరువాతా కూడా ఎన్నో సందర్భాలలో, తన చమత్కారాలు, చతురోక్తులు
జోడించి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నాకెన్నో సలహాలు అందించేవారాయన. కాని నేను వింటేగా.
రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు నా మొండితనం నాదే. ఎన్నిమార్లు, ఎన్ని
విధాలుగా ప్రయత్నించినా ఆయన నన్నెంత మాత్రం మార్చలేకపోయారు, ముఖ్యంగా ఆఫీసు విషయాల్లో.
శ్రీనివాసరావులాటి మిత్రుల సుదీర్ఘ సహవాసంవల్ల ఆఫీసునుంచి బయటకు వచ్చిన
తరువాతైనా కాస్త నవ్వడం నేర్చుకున్నాను. నలుగురిలో మసలడం నేర్చుకున్నాను.
నాలుగు మాటలు నేర్చుకున్నాను”
“నా
ఉద్యోగం న్యూస్ రీడర్ అయినప్పటికీ ఓసారి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు గారు
నన్ను పిలిచి, ‘మాస్టారూ ఎన్నాళ్ళని ఇక్కడ
కూర్చుని న్యూస్ బులెటిన్లతో కుస్తీ పడతారు. మధ్యమధ్య రిపోర్టింగ్ కు వెళ్ళి
వస్తుండండి. రేపు ఉదయం అసెంబ్లీకి వెళ్ళండి’ అన్నారు. అవి శాసన సభ బడ్జెట్
సమావేశాలు జరుగుతున్నరోజులు. నేను ఉదయం వెళ్ళే సరికే అసెంబ్లీలో ‘QUESTION
HOUR’ నడుస్తోంది.
అప్పట్నించి భోజన విరామానికి సభ వాయిదా పడేవరకు మూడు నాలుగు గంటలపాటు అక్కడే
కూర్చున్నాను. ఛాతీలో కాస్త నొప్పిగా వున్నట్టు అనిపించింది కాని పట్టించుకోలేదు.
ఆఫీసుకు వచ్చి రిపోర్ట్ రాస్తుండగా నొప్పి మరికాస్త పెరిగింది. ఛాతీ ఎడమ వైపు
నుంచి భుజానికి ఏదో సర్రున పాకినట్టనిపించింది. వొళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. శ్వాస
పీల్చుకోవడానికి ఇబ్బందిగా వుంది. ఇక నా వల్ల కాదని అర్ధమై పోయింది. ‘వొంట్లో
బాగాలేదు. ఇంటికి పోతున్నాన’ని రామారావు గారికి చెప్పేసి వెళ్ళిపోయాను. ఆ వేళలో
అంత త్వరగా వచ్చిన నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యపోయింది. ‘ఏమిటిలా వచ్చారు.
ఏమైంది మీకు వొంట్లో ఎలావుంది’ అని కంగారు పడడం మొదలు పెట్టింది. విషయం చెబితే
డాక్టరు దగ్గరకు వెడదామని హడావిడి చేస్తుందని పొడి పొడిగా నాలుగుముక్కలు చెప్పి
‘ఏమీ వద్ద’ని కసరి అలాగే పడుకున్నాను.
“ఎన్నడూ
లేనిది ఆవిధంగా పని మధ్యలో వొదిలేసి వెళ్ళిపోయానని తెలిసి శ్రీనివాసరావు, జ్వాలా నరసింహారావూ (వీరిద్దరినీ జంట
కవులనేవారు. నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ కలిసేవుండేవారు) ఆ సాయంత్రం మా ఇంటికి
విషయం కనుక్కుందామని వచ్చారు. నేను చెప్పేది వినిపించుకోకుండా డాక్టర్
మనోహరరావు (శ్రీనివాసరావు
మేనల్లుడు) దగ్గరకు తీసుకువెళ్ళారు. తరువాత డాక్టర్ గారిని కూడా వెంటబెట్టుకుని
గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అందులో చేర్పించారు. ‘ANGINA PECTORIS’ అనే హృదయ సంబంధమైన రుగ్మత వల్ల నాకలా
అయిందని నిర్ధారించిన వైద్యులు రెండు రోజులపాటు ఐ సీ యూ లోనే వుంచి ఆ తరువాత
ఇంటికి పంపారు. మరునాడు కాబోలు జ్వాలా నరసింహారావూ. శ్రీనివాసరావు సతీ సమేతంగా మా
ఇంటికి వచ్చారు.
మాటల
మధ్య మా ఆవిడ శ్రీనివాసరావుతో, ‘ ఆరోజు
మీరు దేవుడల్లే వచ్చి ఆసుపత్రిలో చేర్పించార’ని ఏదో చెప్పబోతుంటే,
శ్రీనివాసరావు తన మామూలు తరహాలోనే ‘ఈ ఇంట్లో దేవుడు అనే మాట వినడం విచిత్రంగా
వుంది’ అన్నారు చిరునవ్వుతో.
నా
నాస్తికత్వం మీద ఆయన విసిరిన వ్యంగ బాణం అది.
ఇలా
అన్ని సందర్భాలలో నవ్వుతూ నవ్విస్తూ వుండే ఈ మనిషి ఎప్పుడయినా కంట నీరు
పెట్టుకుంటాడా అనిపించేది. అదీ చూశాను. నేను రిటైర్ అయినప్పుడు జరిగిన వీడ్కోలు
సభలో నా గురించి మాట్లాడబోయి, మాటలు
పెగలక కంట తడిపెట్టారు.”
వెంకట్రామయ్య
గారికి పుస్తకాలన్నా, సినిమాలన్నా
ప్రాణం. కొంచెం ఖాళీ దొరికితే చాలు మంచి సినిమాహాలు చూసుకుని ఏదో ఒక సినిమా
చూసేవారు. మొదట్లో నన్నూ వెంట తీసుకు వెళ్ళేవాళ్ళు. మూడు గంటలు కాలు కదపకుండా ఒక
చోట కూర్చోవడం అలవాటు లేని నేను నెమ్మదిగా ఏదో కారణం చెప్పి తప్పించుకునేవాడిని. ఆరోజు ఉదయం ఇంట్లో వెంకట్రామయ్య గారు పడుకున్నవాడల్లా లేచి, మనమడ్ని వెంట తీసుకుని వరసగా రెండు సినిమాలు,
సరిలేరు
నీకెవ్వరూ, అలవైకుంఠపురం
చూడాలని కూకట్పల్లి పీవీఆర్ ఫోరం మాల్ కి
వెళ్ళారు. ఒక ఆట చూసి రెండో సినిమాకు వెడుతూ మధ్యలోనే కుప్పకూలిపోయారు. మనుమడు పక్కన వుండడం వుండడం
వల్ల, దగ్గరలోని
ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఫలితం లేకపోయింది.
హాయిగా
సినిమాకని వెళ్ళిన మనిషి విగతజీవుడిగా ఇంటికి రావడం వెంకట్రామయ్య గారు నమ్మని విధి
విచిత్రం కాకపోతే మరేమిటి?
కింది
ఫోటో:
రేడియో న్యూస్ రీడర్ గా వెంకట్రామయ్య గారు రిటైర్ అయినప్పుడు సహోద్యోగి షుజాత్ ఆలీ సూఫీ Shujath Ali Sufi ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో వెంకట్రామయ్య గారు, నేనూ.
(ఇంకావుంది)
2 కామెంట్లు:
వెంకట్రామయ్య లాంటి ముక్కుసూటి స్వభావం కల వారు అక్కడక్కడ తారసపడుతుంటారు
పోస్టు చదువుతుంటే
విజాతి ధృవాలు ఆకర్షించుకొనును. అనే సూత్రం గుర్తుకు వచ్చింది.
అతి సిన్సియర్ గా ఉండే వారి గురించి:
వారి మంచితనం వల్ల జరిగే మేలు కన్నా మూర్ఖత్వం వల్ల జరిగే కీడు ఎక్కువ. అనిపిస్తుంది.
వారి గురించి మంచి విషయాలు చెప్పారు 🙏
కామెంట్ను పోస్ట్ చేయండి