24, మార్చి 2020, మంగళవారం

ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరా?


ప్రభుత్వ ఉద్యోగులు సరిగా పనిచేయరనే అపోహ చాలామందిలో వుంది.  అది అపోహ మాత్రమే, వాస్తవం కాదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రాత్రీ  పగలు అనకుండా, కుటుంబాలకు దూరంగా ఉంటూ, అహరహం పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగులలోనే కనబడతారు. సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ బి. దానం, ఉమ్మడి రాష్ట్రంలో  ఉత్తరాంధ్రలో పనిచేసే సమయంలో అక్కడే శ్రీకాకుళంలో శ్రీ విశాఖ గ్రామీణ బాంక్ చైర్మన్ గా ఉన్న మా రెండో అన్నగారు రామచంద్రరావుతో అనేవారట.
‘ఎవరెన్నయినా అననివ్వండి, గవర్నమెంటు వాళ్ళు పనిచేసే పద్దతే వేరు. తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు చూడండి,  సరైన రోడ్లు లేకపోయినా దెబ్బతిన్న ప్రతి గ్రామానికి వెడతారు. బియ్యం మూటలు తీసుకువెళ్ళి బాధితులకు పంచిపెడతారు. ఎన్నికలు వస్తే పార్వతీపురం వంటి ప్రాంతాలలోని  సుదూర గ్రామీణ ప్రాంతాలకు బ్యాలెట్ పెట్టెలు మోసుకుని వెడతారు. ఆవూళ్ళల్లో వారికి సరైన భోజనం దొరకదు, వసతి వుండదు. అయినా పై అధికారులు చెప్పిన టైముకు అక్కడ హాజరు అవుతారు. కొన్ని ఊళ్లల్లో కక్షలు కార్పణ్యాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు. అయినా వాళ్ళు అన్నిటికీ సిద్ధపడి విధులు నిర్వహిస్తారు. మరి అలాంటప్పుడు, ‘ఏమీ పనిచేయరు, జీతాలు తీసుకోవడం తప్ప’ అని వాళ్ళని నిందించడం సబబేనా?’ దానం గారి ప్రశ్న.     

కామెంట్‌లు లేవు: