24, మార్చి 2020, మంగళవారం

దినపత్రికల లాక్ డౌన్ ???


కర్ఫ్యూ నుంచి మీడియాకు మినహాయింపు ఇచ్చారు కానీ కొన్ని మీడియా సంస్థలు (పత్రికలు) ఈ వెసులుబాటు ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంలో లేనట్టు కానవస్తోంది. హైదరాబాదు నుంచి వెలువడుతున్న కొన్ని ప్రధాన పత్రికలు ఈ నెలాఖరువరకు ముద్రణ నిలిపివేసే ఆలోచనలో వున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పత్రికలను ఇళ్ళకు చేరవేసే వ్యవస్థ (వెండర్లు, పేపర్ బాయిస్) లో కరోనా కారణంగా కొన్ని అడ్డంకులు తలెత్తడం, రవాణా వ్యవస్థలో ఏర్పడ్డ అవరోధాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన న్యూస్ ప్రింట్ సకాలానికి రాకపోవడం, రోజులో చాలాభాగం సిబ్బంది పనిచేసే అవసరం ఉన్న కారణం వల్ల ఉద్యోగులకు కలిగే ఇబ్బందిని తగ్గించాలనే నిర్ణయం ఇలా అనేక కారణాలతో పత్రికాముద్రణ నిలిచి పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల ఆన్ లైన్ లో పత్రికలను పాఠకులకు అందించే వెసులుబాటును అందిపుచ్చుకునే ఉద్దేశ్యం కూడా మరో కారణం. ఏతావాతా తెలుగు పత్రికలలో చాలావరకు ముద్రణకు స్వస్తి చెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ దిశలో డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి చొరవ తీసుకుంటున్నాయని, ఈ గ్రూపు తమ రెండు పత్రికల ముద్రణకు నేడో రేపో స్వస్తి చెప్పబోతోందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. మరికొన్ని అదేబాటలో వున్నాయని, అయితే ఉగాది పండుగ రోజున ప్రకటనల రూపంలో వచ్చే అదనపు రాబడి విషయం గురించి మీనమేషాలు లెక్కబెడుతున్నట్టు తెలుస్తోంది.       

కామెంట్‌లు లేవు: