22, అక్టోబర్ 2015, గురువారం

....డు వాన విదిచ

సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు చదువుతారంటారు.
కానీ ఇది ‘రాంగున్నర రాంగు’ అభిప్రాయమన్నది మా సుబ్బారావు నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అనేది కూడా మా వాడి థియరీనే! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్‌' చేయడానికి వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు.
కాకపోతే, ఈ రకమైన సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు, చిన్నప్పుడు మా వూళ్ళో పార్ట్ టైమ్‌ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొస్తుంటారు. వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి, వాటిలోని విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని , ఆపైన, వాటిని జాగ్రత్తగా అతికించి, తాపీగా ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం అన్నది వూరి పోస్ట్ మాస్టరుగా తనకున్న కాపీరైట్‌ అని భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా సాగిస్తూ వుండేవాడు. అంతటితో ఆగితే ఏ చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ' ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?' అంటూ ఆరాలు తీసేవాడు. ఇలా చాన్నాళ్లు అతగాడి సెన్సార్‌షిప్‌ని మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని రాసి వూరుకుంది. అంటే ‘చదివినవాడు గాడిద’ అన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం. కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే వెధవ అలవాటున్న ఆ పెద్ద వెధవ - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.


తాజాతోక
చివర్లో `తాజాకలం' బదులు `తాజాతోక' అనే పదం వాడడం వల్లా ఈ రెండూ ఎక్కడో విన్నట్టుగా వుందే అనే ఫీలింగ్‌ పాఠకులకు కలిగితే దానికి రచయిత పూచీ ఎంతమాత్రం లేదనన్నీ, ఆ పదాలపై అన్ని స్వామ్యములు, ఈప్రజాస్వామ్యదేశంలో, ఏ కొందరివో కాక అందరివనన్నీ సమస్త ప్రజానీకానికీ ఇందుమూలంగా తెలియచేయడమైనది. – రాయని రచయిత

NOTE: Cartoon Courtesy : www.shutterstock.com

కామెంట్‌లు లేవు: