25, మార్చి 2020, బుధవారం

కనపడని శత్రువుతో ఎడతెగని యుద్ధం – భండారు శ్రీనివాసరావు


(Published in ‘నమస్తే తెలంగాణ’ on 25-03-2020)
ప్రస్తుతం  సమస్త మానవాళినీ కలవరపరుస్తున్నది కరోనా అనే మూడక్షరాల పదం. సాధారణంగా, ఈగలు, దోమలు, లేదా ఇతర క్రిమికీటకాల ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఈ కరోనా అనే మాయరోగం మాత్రం మనుషుల నుంచి మనుషులకు పాకుతుంది. ఈ విలక్షణ తత్వమే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపట్ల ప్రజల భయాందోళనలు ఒక స్థాయికి మించి ప్రబలడానికి కారణమయింది.
‘పనిచేసే ప్రభుత్వం కావాలని అందరం కోరుకుంటాం. అయితే ప్రభుత్వం నిశ్శబ్దంగా పనిచేస్తోంద’ని ఎవరైనా అంటే ఓ పట్టాన నమ్మం. ఇది మానవ మనస్తత్వం.
‘ఈ వ్యాధి మహమ్మారిలా చుట్టుముడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది’ అనేది ఇలాంటి సందర్భాలలో సాధారణంగా వినబడే మాట.
ఈ మాటలు అనేవాళ్ళు ముందు అర్ధం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎవరూ ఈ వ్యాధి రావాలని కోరుకోలేదు. ఎక్కడో చైనాలో పుట్టి చుట్టుపక్కల దేశాలకు పాకి, రోజుల వ్యవధిలోనే  ప్రపంచమంతటా విస్తరించింది. ప్రభుత్వాల అలసత్వం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో ఈ కరోనా వ్యాధి మనదేశంలో పురుడు పోసుకోలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ వ్యాధి మన దేశంలో కాలుమోపింది.
ఈ కరోనా అనేది సరికొత్త అంటు వ్యాధి. దీనిని గురించి ఎవరికీ తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. ఎలా పోతుందో తెలవదు. విరుగుడు ఏమిటో అసలే  తెలియదు.  కలరా మొదలైన అంటు వ్యాధులకు రోగ నిరోధక టీకాలు వున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ  కరోనా వ్యాధిని అరికట్టడానికి ఆ అవకాశమూ లేదు.
ఇతరేతర వ్యాధులు ప్రబలినప్పుడు ఆ వ్యాధి పీడితులకు బాసటగా వారి బంధుమిత్రులు వుంటారు. చికిత్సచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అనేకం అందుబాటులో  వుంటాయి. ఇవ్వడానికి వాక్సిన్లు, వాడడానికి  మందులు వుంటాయి. కానీ కరోనా విషయం పూర్తిగా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా సోకినట్టు అనుమానం ఉన్న రోగిని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా, కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోనివ్వకుండా వారిని   ఐసొలేషన్ గదుల్లో ఉంచాలి. చికిత్స పెద్ద ఖరీదైనది కాకపోవచ్చుకానీ ఇన్ని రకాల  ఏర్పాట్లు చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. మొదటి రెండు దశల్లో వ్యాధిని  గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణ హానికి ఆస్కారం వుండదు. కానీ మూడో దశకు చేరుకుంటే ఇక ఆ రోగిని కాపాడడం కష్టం అంటున్నారు వైద్యులు.
మిగిలిన వ్యాధులు వ్యాపించినప్పుడు బాహ్య ప్రపంచం అంతా మామూలుగానే వుంటుంది. ఆఫీసులు  పనిచేస్తాయి. దుకాణాలు, మార్కెట్లు తెరుస్తారు. రైళ్ళు, బస్సులు, కార్లు  విమానాలతో సహా అన్నీ మామూలుగా రాకపోకలు సాగిస్తాయి. ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం అతి స్వల్పంగా వుంటుంది. అదే కరోనా విషయం తీసుకుంటే పరిస్తితి వేరు. మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి  సోకే ప్రమాదం కారణంగా ఈ వైరస్ అతి త్వరితంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అంచేత ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే స్వచ్చంద స్వీయ గృహ నిర్బంధం మినహా మరో దారి లేదు.
అందుకే, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే పెను ముప్పు ఓ పక్క  పొంచి ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు సాహసం చేసి లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. ప్రజలు గుంపులుగా తిరుగుతూ, వారికి తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధిని  సంక్రమింప చేసే ప్రమాదం ఉన్నందున, కర్ఫ్యూ వంటి తీవ్రమైన చర్యలను అమలు చేయాల్సిన పరిస్తితి దాపురించింది. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోగం శరీరంలో ప్రవేశించిన రెండు వారాల వరకు ఆ విషయం గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి వ్యాపిస్తోందని తెలుస్తోంది. విదేశాల్లో బయలు దేరినప్పుడు వ్యాధి సోకినా ఆ విషయం వారికి తెలియదు. స్వదేశం చేరిన తర్వాత అలాంటివాళ్ళు ఎంతో మందిని కలిసి వుంటారు. అలాంటివారినందరినీ ఇప్పుడు వెతికి పట్టుకుని పరీక్షలు చేయాల్సిన బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ భుజస్కంధాలపై పడింది. ఇది సాధారణ విషయం కాదు. సముద్రపు ఒడ్డున ఇసుకలో పడిపోయిన సూదిని వెతకడం వంటిది. అయినా ప్రభుత్వం వెనుకాడడం లేదు.
శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు శ్రీ వరప్రసాదరెడ్డి ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు. వారి అమ్మాయి ఆ మధ్య కేరళ రాష్ట్రము నుంచి హైదరాబాదు వచ్చారు. ఇటీవల ఒక వైద్య బృందం వారి ఇంటికి వెళ్లి ఆవిడ ఆరోగ్యం గురించి విచారించి తగిన పరీక్షలు చేసి, కరోనా వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకు వెళ్లిందట. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు చూసి ఆయన ఆశ్చర్యపోయారట.  అలాగే హైదరాబాదు నగరంలోని హఫీజ్ పేటలో వున్న ఒక కాలనీకి అధికారుల బృందం వెళ్ళింది. పలానా పేరు కలిగిన వ్యక్తులు పలానా రోజున పలానా దేశం నుంచి వచ్చి మీ కాలనీలో వుంటున్నారు, వారికి తక్షణం పరీక్షలు చేయాలని కాలనీ అధ్యక్ష, కార్యదర్శులను అడిగితే వాళ్ళు నివ్వెర పోయారట. విదేశాలనుంచి ఎవరు వచ్చారో అప్పటిదాకా వారికే తెలియదు. వెళ్లి చూస్తే అది నిజమని తేలింది. వెంటనే ఆ వ్యక్తులకు పరీక్షలు చేసి వారిని స్వీయ గృహనిర్బంధంలో వుండాలని చెప్పారట. అప్పటి నుంచి ప్రతిరోజూ ఫోనులో వారిని సంప్రదించి వారి ఆరోగ్య పరిస్తితి గురించి వాకబు చేస్తున్నారట. ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతిరోజూ అలా కనుక్కుంటూ వుండడం  చూసి విదేశాలనుంచి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట.
గత పదిహేను రోజుల్లో వివిధ దేశాలనుంచి వేలమంది హైదరాబాదు వచ్చి వుంటారు. అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం వుండడం ఒక కారణం కావచ్చు. అలా వచ్చిన వాళ్ళు కార్లలోనో, బస్సుల్లోనో, రైళ్ళలోనో తమ గమ్యస్థానాలకు వెళ్లి వుంటారు. ఈ క్రమంలో వారిలో ఎవరికయినా ఈ వ్యాధి సోకి వుంటే అది ఇతరులకు అంటుకునే ప్రమాదం వుంది. కానీ ఆ ‘ఇతరులు’ ఎవరని గాలింఛి కనిపెట్టడం  సామాన్యమైన విషయం కాదు. నగరాలూ, పట్టణాలు, గ్రామాలు ఇలా అన్నిచోట్లా ప్రభుత్వ యంత్రాంగం అలా వచ్చిన వారికోసం జల్లెడ పట్టి గాలిస్తోంది.
కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తోంది అని మెటికలు విరిచేవాళ్ళు ఈ విషయాలను గమనంలో వుంచుకోవాలి. ఈ వ్యాధిని అరికట్టడం అన్నది ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో లేదు. సమస్త ప్రజానీకం సహకరించినప్పుడే సాధ్యం అవుతుంది. అదే ఆయన చెబుతున్నారు. అదే ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అనవసరంగా రోడ్లమీద తిరగ వద్దంటున్నారు. ఇంటిపట్టునే వుండమంటున్నారు. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తామంటున్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే పరిస్తితి సర్దుకుంటుందని చెబుతున్నారు.
వినడం మనందరి ధర్మం! ఎందుకంటే ఈ మహమ్మారిని అరికట్టగలిగిన సులువు మన చేతుల్లోనే వుంది. మన చేతల్లోనే వుంది.   (EOM)          

24, మార్చి 2020, మంగళవారం

కేటీఆర్ ది గ్రేట్ – భండారు శ్రీనివాసరావు


ఈ సాయంత్రం ఒక బ్లాగు మిత్రులు శ్యామల రావు గారు ఫోన్ చేసారు. వారి శ్రీమతికి వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయించాలి. భార్యాభర్తలు ఇరువురూ వృద్ధులు. ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి  మధ్యలో కొరానా కర్ఫ్యూ. ఆయనకి కాళ్ళూ చేతులు ఆడక నాకు ఫోన్ చేశారు. నేను మాత్రం ఏం చేయగలను? ఆలిండియా రేడియో నుంచి రిటైర్ అయి ఇప్పటికి పుష్కరం గడిచింది. నా మాట ఎవరు వింటారు. అంచేత ఓ సలహా ఇచ్చాను. కేటీఆర్ గారికి ట్వీట్/ వాట్సప్ చేయండని. ఆయన అలాగే చేశారు. నిమిషం గడవక ముందే ‘Will take care’ అని జవాబు వచ్చింది. మరి కాసేపటిలో కానుగుల శ్రీనివాస్ గారు అనే ఆయన వారికి ఫోన్ చేసి చిరునామా నోట్ చేసుకున్నారట. ఆ ముసలి దంపతుల ఆనందం ఇంతా అంతా కాదు.
“ముందు మీ సలహా విని తప్పించుకోవడానికి అలా చెప్పారని అనుకున్నా. కానీ ఫోన్ వచ్చేసరికి నా చెవులను నేనే నమ్మలేకపోతున్నా. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ప్రభుత్వ స్పందన అద్భుతం” ఫోనులో చెబుతున్నారాయన, కానీ ఆయన కంటి వెంట కారుతున్న ఆనంద భాష్పాలు ఆ మాటల్లో  నాకు కనబడుతూనే వున్నాయి.
సామాన్యులు కృతజ్ఞత తెలిపే విధానం ఇలాగే వుంటుంది.
‘నేనున్నాను’ అని భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని వారెప్పుడు మరచిపోరు.  

ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరా?


ప్రభుత్వ ఉద్యోగులు సరిగా పనిచేయరనే అపోహ చాలామందిలో వుంది.  అది అపోహ మాత్రమే, వాస్తవం కాదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రాత్రీ  పగలు అనకుండా, కుటుంబాలకు దూరంగా ఉంటూ, అహరహం పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగులలోనే కనబడతారు. సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ బి. దానం, ఉమ్మడి రాష్ట్రంలో  ఉత్తరాంధ్రలో పనిచేసే సమయంలో అక్కడే శ్రీకాకుళంలో శ్రీ విశాఖ గ్రామీణ బాంక్ చైర్మన్ గా ఉన్న మా రెండో అన్నగారు రామచంద్రరావుతో అనేవారట.
‘ఎవరెన్నయినా అననివ్వండి, గవర్నమెంటు వాళ్ళు పనిచేసే పద్దతే వేరు. తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు చూడండి,  సరైన రోడ్లు లేకపోయినా దెబ్బతిన్న ప్రతి గ్రామానికి వెడతారు. బియ్యం మూటలు తీసుకువెళ్ళి బాధితులకు పంచిపెడతారు. ఎన్నికలు వస్తే పార్వతీపురం వంటి ప్రాంతాలలోని  సుదూర గ్రామీణ ప్రాంతాలకు బ్యాలెట్ పెట్టెలు మోసుకుని వెడతారు. ఆవూళ్ళల్లో వారికి సరైన భోజనం దొరకదు, వసతి వుండదు. అయినా పై అధికారులు చెప్పిన టైముకు అక్కడ హాజరు అవుతారు. కొన్ని ఊళ్లల్లో కక్షలు కార్పణ్యాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు. అయినా వాళ్ళు అన్నిటికీ సిద్ధపడి విధులు నిర్వహిస్తారు. మరి అలాంటప్పుడు, ‘ఏమీ పనిచేయరు, జీతాలు తీసుకోవడం తప్ప’ అని వాళ్ళని నిందించడం సబబేనా?’ దానం గారి ప్రశ్న.     

దినపత్రికల లాక్ డౌన్ ???


కర్ఫ్యూ నుంచి మీడియాకు మినహాయింపు ఇచ్చారు కానీ కొన్ని మీడియా సంస్థలు (పత్రికలు) ఈ వెసులుబాటు ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంలో లేనట్టు కానవస్తోంది. హైదరాబాదు నుంచి వెలువడుతున్న కొన్ని ప్రధాన పత్రికలు ఈ నెలాఖరువరకు ముద్రణ నిలిపివేసే ఆలోచనలో వున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పత్రికలను ఇళ్ళకు చేరవేసే వ్యవస్థ (వెండర్లు, పేపర్ బాయిస్) లో కరోనా కారణంగా కొన్ని అడ్డంకులు తలెత్తడం, రవాణా వ్యవస్థలో ఏర్పడ్డ అవరోధాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన న్యూస్ ప్రింట్ సకాలానికి రాకపోవడం, రోజులో చాలాభాగం సిబ్బంది పనిచేసే అవసరం ఉన్న కారణం వల్ల ఉద్యోగులకు కలిగే ఇబ్బందిని తగ్గించాలనే నిర్ణయం ఇలా అనేక కారణాలతో పత్రికాముద్రణ నిలిచి పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల ఆన్ లైన్ లో పత్రికలను పాఠకులకు అందించే వెసులుబాటును అందిపుచ్చుకునే ఉద్దేశ్యం కూడా మరో కారణం. ఏతావాతా తెలుగు పత్రికలలో చాలావరకు ముద్రణకు స్వస్తి చెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ దిశలో డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి చొరవ తీసుకుంటున్నాయని, ఈ గ్రూపు తమ రెండు పత్రికల ముద్రణకు నేడో రేపో స్వస్తి చెప్పబోతోందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. మరికొన్ని అదేబాటలో వున్నాయని, అయితే ఉగాది పండుగ రోజున ప్రకటనల రూపంలో వచ్చే అదనపు రాబడి విషయం గురించి మీనమేషాలు లెక్కబెడుతున్నట్టు తెలుస్తోంది.       

19, మార్చి 2020, గురువారం

జగమే మాయ – భండారు శ్రీనివాసరావు


“కింది వరుసలో అక్షరాలు చదవండి”
 “ఏ ఓ సి ఓ”
“లాభం లేదు ఓ సి లాగా, సి ఓ లాగా కనిపిస్తోంది అంటే అద్దాల పవర్ మార్చాల్సిందే”
అలా అన్నాడంటే అతడు కంటి డాక్టరు.
“ఇవి ఎన్ని వేళ్ళు?”అడిగాడు కంటి ముందు తన రెండు వేళ్ళు ఆడిస్తూ.
“మూడు”
“కాదు సరిగా చూడు మళ్ళీ”
“నిజమే రెండే”
“మళ్ళీ పొరపడ్డారు, ఇప్పుడు చూడండి నాలుగు వేళ్ళు, అవునా!”
అలా మాయ చేసేవాడు  మెజీషియన్.
“పలానా మంత్రి రాజీనామా చేసాడు”
“చేయలేదు”
“కాదు చేశాడు ఇదిగో రాజీనామా లేఖ”
“అలాగా”
‘ఆ లేఖ నాది కాదు, గిట్టని వాళ్ళ సృష్టి, అని అంటున్న పలానా మంత్రి”
అలా కనపడ్డా, వినపడ్డా అది టీవీ