4, నవంబర్ 2018, ఆదివారం

విగ్రహాలు, వివాదాలు – భండారు శ్రీనివాసరావు

(Published in the Edit Page 'SURYA' dated 04-11-18, SUNDAY)
వివాదాల మాట ఎలా వున్నా భారత కీర్తి పతాకను దిగంతాల స్థాయికి చేరుస్తూ
ప్రపంచంలోనే అతి పెద్ద భారీ విగ్రహ ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోడీ
ఆధ్వర్యంలో జరిగింది.
స్వతంత్రం వచ్చిన కొత్తల్లో దేశానికి మొదటి సమస్య స్వదేశీ సంస్థానాల
రూపంలో ఎదురయింది. అప్పటి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్,
దేశ వాప్తంగా ఉన్న దాదాపు ఆరువందల యాభయ్ పైచిలుకు సంస్థానాలను ఇండియన్
యూనియన్ లో విలీనం చేస్తూ తీసుకున్న దృఢ నిర్ణయం ఆ గుజరాత్ నాయకుడిని
ప్రజల దృష్టిలో ఉక్కు మనిషిగా మార్చింది. దేశ సమగ్రతను కాపాడడానికి ఆనాడు
పటేల్ తీసుకున్న చర్యకు గుర్తింపుగా ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన
జయంతిని సమైక్యతా దినంగా ప్రకటించడమే కాకుండా ఆయన స్పూర్తిని జగజ్జేయమానం
చేస్తూ యావత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వల్లభాయ్ పటేల్ భారీ
విగ్రహాన్ని గత అక్టోబరు ముప్పయి ఒకటో తేదీన ఆయన జయంతి రోజునే
ఆవిష్కరించి పటేల్ స్మృతికి ఘనమైన నివాళి అర్పించింది. ఇందుకోసం
ఇంచుమించు మూడువేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్టు వార్తలు
తెలుపుతున్నాయి. గుజరాత్ లోని నర్మదా నదిపై గతంలో నిర్మించిన సర్దార్
సరోవర్ డ్యామ్ దగ్గర ప్రతిష్టించిన ఈ విగ్రహం అద్యతన భావిలో ప్రముఖ
పర్యాటక ప్రాంతంగా విలసిల్లగలదని, విదేశీ యాత్రీకులకు ప్రధాన ఆకర్షణగా
మారగలదని భావిస్తున్నారు.
ఈ భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా విగ్రహ స్థాయికి తగ్గట్టుగానే,
ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని చక్కగా వాడుకుంటూ చాలా పెద్దఎత్తున కనుల
పండుగగా జరగడాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతీయులు టీవీ ప్రసారాల్లో
తిలకించారు. నాలుగున్నర సంవత్సరాల పాలనాకాలంలో నరేంద్ర మోడీ జాతికి
సమర్పించిన ఈ సమైక్యతా శిల్పం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో
సందేహం లేదు. సర్దార్ పటేల్ వంటి ఒక గొప్ప నాయకుడికి మోడీ ప్రభుత్వం ఈ
స్థాయిలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయడాన్ని ప్రతి భారతీయుడు
ఆహ్వానిస్తాడు. గర్వపడతాడు కూడా. అయితే అదే రోజు జరగాల్సిన ఇందిరాగాంధి
వర్ధంతి కార్యక్రమాలు ఈ వేడుకలో మసకకమ్మి పోయాయి. దేశాన్ని సమైక్యంగా
ఉంచడంలో, విదేశీ శక్తులనుంచి పరిరక్షించడంలో ఆవిడ చేసిన సేవలు కూడా
తక్కువేమీ కావు. భారతీయ జనతా పార్టీ నాయకులే గతంలో ఈ విషయంలో ఇందిరను అపర
కాళీ మాతగా కీర్తించిన రోజులు గుర్తున్నవారికి ఇది ఒకింత బాధ కలిగించే
విషయమే.
సరే! ఇదొక ఘట్టం.
ముందే చెప్పినట్టు విగ్రహ ప్రతిష్టాపనతోపాటుగా వివాదాలు, విమర్శలు కూడా
అదే స్థాయిలో చెలరేగాయి. విగ్రహం ప్రతిష్టించిన ప్రాంతంలోని అనేక గిరిజన
గ్రామాల ప్రజలు తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు దొరకని స్తితిలో అల్లాడి
పోతుంటే ఒక విగ్రహం కోసం ఇంతటి భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం సమంజసమా అనే
ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గుజరాత్ కు చెందిన ఒకనాటి కాంగ్రెస్ నాయకుడి
విగ్రహం ఈ స్థాయిలో ఏర్పాటు చేయడానికి అదే గుజరాత్ కు చెందిన ఒక ప్రధాని,
అందులో కాంగ్రెస్ పార్టీని నరనరాన వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీకి
చెందిన ప్రధాని మోడీ ఇంతటి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించాల్సి
వచ్చిందన్నది ఆ ప్రశ్నల్లో మరోటి. కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలితరం
నాయకుడు, స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహరలాల్
నెహ్రూ స్మృతిని ప్రజల మనస్సుల్లో నుంచి రూపుమాపడానికి చేసిన కుటిల
ప్రయత్నం అనే స్థాయి వరకు ఇవి సాగాయి.
సందట్లో సడేమియా అన్నట్టు తెలుగు సోషల్ మీడియాలో మరో వివాదం సుళ్ళు
తిరుగుతోంది. యావత్ భారత సమైక్యతను కోరిన ఒక ప్రజానాయకుడి విగ్రహ
ప్రతిష్టాపన ఫలకంలో కావాలనే దక్షిణాది భాషలను, మరీ ముఖ్యంగా తెలుగు భాషను
చిన్నచూపు చూస్తూ అగౌరవ పరిచారనేది బీజేపీకి కొత్తగా శత్రు పక్షంలో చేరిన
టీడీపీ శ్రేణుల అభియోగం. దీనికి ప్రతిగా ఆ పార్టీ వ్యతిరేక వర్గాలు
ఉవ్వెత్తున లేచి, నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని, తెలుగు ప్రజల కలల నగరం
అమరావతి శంకుస్థాపన ఫలకంలో తెలుగును పూర్తిగా విస్మరించి, ఆంగ్లానికి
పెద్ద పీటవేసిన అలనాటి ఛాయాచిత్రాలను సోషల్ మీడియాలో శరపరంపరగా
గుప్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దగ్గర నుంచి గమనించేవారికి ఈ
ఖండనముండన పర్వాలు కొత్తేమీ కాదు కనుక, వీటిల్లోని సహేతుకతలను గురించి
ఆలోచించడం అనవసరం. అంచేత అదిక్కడ వదిలేసి అసలు ఈ విగ్రహాల కధాకమామిషు
ఓసారి సింహావలోకనం చేసుకుందాం.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకుల విగ్రహాలు ఉభయ తెలుగు
రాష్ట్రాలలో ఏమూలకు పోయినా కానవస్తాయి. ఎవరి మీది అభిమానంతో ఈ విగ్రహాలు
ప్రతిష్టిస్తున్నారో వారి కనీస పోలికలు వాటిల్లో మచ్చుకు కూడా కానరావు.
కొన్నింటిని ప్రతిష్టించి ఆవిష్కరించాల్సిన ముఖ్య అతిధికి తీరుబడి
దొరకలేదనే కారణంతో వాటికి ముసుగుకప్పి నడిబజారులో వొదిలేస్తారు. వారి
భక్తి తాత్పర్యాలు విగ్రహం తాలూకు నాయకుడి మీదో, సమయం దొరకని ప్రస్తుత
నాయకుడి మీదో తెలియక దారినపోయే జనం తలలు పట్టుకుంటూవుంటారు. ఆ విగ్రహాల
కారణంగా ఆదారిన పోయే బాటసారులకు, సాధారణ జనజీవనానికి ఏమైనా అసౌకర్యం
కలుగుతోందా అన్న విషయం కూడా వారికి పట్టకపోవడం మరో దౌర్భాగ్యం.
'విగ్రహారాధన కూడదు' అని ప్రబోధించిన గౌతమ బుద్దుడు జన్మించిన పుణ్య
భూమి మనది. అయినా విగ్రహాలకు మాత్రం ఏమాత్రం కొరత లేదు. విగ్రహాలు
వద్దన్న బుద్దుడి విగ్రహాలే భారీ సైజుల్లో దేశం నలుమూలల్లో కానవస్తాయి.
ఇక ప్రసిద్ధ హిందూ ఆలయాల్లో కొలువై వున్న దేవతా విగ్రహాలు చాలావరకు
స్వయంభూ విగ్రహాలుగా అవతరించాయని చెబుతారు. ఇవి కూడా జన సంచారానికి
దూరంగా అధిక భాగం కొండలు, కోనల్లో వెలిశాయి. కాలక్రమేణా ప్రసిద్ధ
ఆలయాలుగా ప్రాచుర్యం పొందాయి. లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేసిన స్వతంత్ర
భారతంలో ఆయా మత విశ్వాసాలకు తగిన ఆలయాలు అనేకం వున్నాయి. దైవానికి ఒక
రూపం అంటూ లేదని నమ్మే మతాలవారు కూడా విగ్రహాలు లేని ప్రార్ధనా మందిరాలు
అనేకం ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఆలయాలను సందర్శించే యాత్రీకుల సంఖ్య సయితం
నానాటికీ బాగా పెరుగుతూ వస్తోంది. రాజకీయాల పుణ్యమా అని గతంలో ఎన్నడూ
లేని విధంగా కుల మతాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తమ అవసరాలకోసం రాజకీయ
పార్టీలు కూడా ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. మతం అనేది ఒక జీవన
విధానంగా రూపుదిద్దుకున్న దేశంలో, ఈనాడు మతం దేశాన్ని ముక్కలుచేసే ప్రతీప
శక్తిగా మారుతూ వస్తోంది. రాజకీయాల రణగొణ ధ్వనుల్లో ఈ సంకేతాల సవ్వడులు
వినరాకుండా పోతున్నాయి.
మత ప్రాతిపదికగా దేవాలయాల్లో వుండే ఈ విగ్రహాలవల్ల జనాలకు కలిగే ఇబ్బంది
ఏమీ లేదు. కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు అనేవే ఇటీవలి కాలంలో
వివాదగ్రస్తం అవుతున్నాయి. ఒకప్పుడు మూడుపూలు ఆరుకాయలుగా ప్రాభవం పొంది
మహనీయులుగా, మానవీయులుగా వెలుగొందిన వ్యక్తుల విగ్రహాలు తదనంతర కాలంలో
వారు నడిపిన రాజకీయాలకు కాలం చెల్లగానే, ఆ విగ్రహాలు కూడా చెల్లని
కాసుల్లా తయారవుతున్నాయి. మన దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో
ఇటువంటి పరిణామాలు పలుచోట్ల చోటు చేసుకున్న సందర్భాలు వున్నాయి. మునుపటి
సోవియట్ యూనియన్ లో, స్టాలిన్ శకంలో ఊరూరా వెలిసిన అయన విగ్రహాలకు
తదనంతర కాలంలో పట్టిన దుస్తితి చరిత్ర రికార్డుల్లో నమోదయివుంది. ఆఖరికి
లెనిన్ మసోలియంలో అయన భొతిక కాయం సరసనే భద్రపరచిన స్టాలిన్ శరీరాన్ని
వెలికి తీసి వేరే చోట ఖననం చేయడం కూడా జరిగింది. కేవలం అధికారాన్ని
అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా రాజకీయాలు చేసిన వాళ్ళకు వర్తమానం మినహా
భవిష్యత్తు ఉండదని చరిత్రచెప్పే పాఠాలు తలకెక్కించుకునే విజ్ఞత
లోపిస్తోంది. కొందరు మరణించిన తరువాత కూడా జీవిస్తారు. కొందర్ని జీవించి
ఉండగానే జ్ఞాపకాల్లో వారి ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. రాజకీయానికి జాలీ
దయా వుండవంటారు అందుకే కాబోలు.
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 'విగ్రహారాధన' అంబరాన్ని
తాకింది. నాటి గౌతమ బుద్దుని నుంచి మొదలుకుని బడుగు బలహీన వర్గాల
నాయకులు రవిదాస్, నారాయణ గురు, జ్యోతీరావు పూలే, షాహూజీ మహారాజ్,
పెరియార్ రామస్వామి, బాబా సాహెబ్ అంబేద్కర్, బీ.ఎస్.పీ. సంస్థాపకుడు
కాంషీరామ్ విగ్రహాలను కూడా మాయావతి ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రంలోని అనేక
ప్రాంతాలలో నెలకొల్పారు. మరీ విచిత్రం ఏమిటంటే తన విగ్రహాల ఏర్పాటు
పట్లకూడా మాయావతి మక్కువ ప్రదర్శించడం.
ఇక మీరట్ లో అఖిల భారత హిందూ మహాసభ, ఓం శివ మహాకాల్ సేవా సమితి కలిసి
ఏకంగా నాధూరాం గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటు చేసాయి. జాతిపిత మహాత్మా
గాంధీని హత్య చేసిన గాడ్సే విగ్రహం దేశంలోనే మొట్టమొదటిది
తెలంగాణా రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
కు కూడా రాజధాని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు
ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయనకు ఒక భారీ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు
చేయాలనే సంకల్పం కలిగింది. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో జిబ్రాల్టర్
రాక్ అనే పేరు కలిగిన ఒక రాతి గుట్ట మీద ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాలని
సంకల్పించారు. ఇందుకోసం జిబ్రాల్టర్ రాక్ పై పదిహేను అడుగుల ఎత్తులో ఒక
వేదికను నిర్మించారు. భారీ విగ్రహానికి కావాల్సిన ఏకశిలను నల్గొండ
జిల్లాలో భువనగిరి సమీపంలోని రాయ్ గిరి గుట్టలలో స్థపతులు ఎంపికచేసి
విగ్రహ నిర్మాణం మొదలు పెట్టారు. వందలాదిమంది పనివారలు,తోటి శిల్పుల
సాయంతో అయిదేళ్లపాటు శ్రమించి స్థపతి గణపతి ఆ రాతిని తొలిచి యాభై ఎనిమిది
అడుగులు ఎత్తయిన భారీ బుద్ధ విగ్రహాన్ని చెక్కారు. అనేక వ్యయప్రయాసల
అనంతరం మూడువందల యాభై టన్నుల బరువున్న ఆ విగ్రహం సుమారు నలభై మైళ్ళు
ప్రయాణించి హైదరాబాదు చేరుకుంది. విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైన భారీ
క్రేన్లు స్థానికంగా లభ్యం కాకపోవడంతో వాటిని ముంబై నుంచి తెప్పించారు.
ఈలోగా సంభవించిన రాజకీయ పరిణామాల ఫలితంగా విగ్రహ వ్యూహకర్త ఎన్టీ
రామారావు పదవి నుంచి దిగిపోయారు. కొత్త ప్రభుత్వం దీనిపట్ల పెద్ద ఆసక్తి
చూపలేదు. విగ్రహ ప్రతిష్టాపన కాంట్రాక్ట్ తీసుకున్న ఏబీసీ కంపెనీ ఈ పని
పూర్తిచేసే పనికి పూనుకుంది. 1990, మార్చి పదో తేదీన విగ్రహాన్ని
హుస్సేన్ సాగర్ జలాలమీదుగా తరలిస్తుండగా వంద గజాల దూరం దాటకుండానే
ప్రమాదవశాత్తు విగ్రహం నీటిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో పదిమంది
మరణించారు. దానితో బుద్దవిగ్రహ ప్రతిష్టాపన వాయిదా పడింది. కల్మషం ఎరుగని
బుద్ధ భగవానుడు ఆ కల్మష జలాలలో దాదాపు రెండేళ్ళు ఉండిపోయాడు. చిట్టచివరకు
1992 డిసెంబరు ఒకటో తేదీన తధాగతుడు జలసమాధి నుంచి బయటపడి తనకోసం
సిద్ధంగా వుంచిన విశాలమైన వేదికమీద నిటారుగా నిలబడగలిగాడు. 2006 లో
బౌద్ధ గురువు దలై లామా బుద్ధుడి విగ్రహానికి సంప్రోక్షణ నిర్వహించారు.
హైదరాబాదు టాంక్ బండ్ మీద ఎన్టీయార్ హయాములోనే తెలుగువెలుగుల విగ్రహాలు
వెలిశాయి. మొత్తం ముప్పై మూడు విగ్రహాలను ఒకే వరుసలో రాకపోకలకు అంతరాయం
కలగని రీతిలో ఏర్పాటు చేసిన విధానం హర్షణీయం. అనుసరణీయం. అయితే ఆ
విగ్రహాల ఎంపిక వివాద గ్రస్తం అయింది. ఒక ప్రాంతానికి చెందిన గొప్ప
వ్యక్తులను పట్టించుకోలేదన్న విమర్శలు తారాస్థాయికి చేరాయి.
అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో రోడ్ల కూడళ్ళలో కాకుండా రహదారికి ఒక
పక్కగా విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయాలు
లేకపోవడమే కాకుండా చూపరులకు కంటికి విందు గొలుపుతాయి. అద్భుతమైన శిల్ప
సౌందర్యం ఉట్టిపడే విగ్రహాలు ప్రపంచంలో వివిధనగరాలకు ప్రధాన పర్యాటక
ఆకర్షణలుగా విలసిల్లుతున్నాయి.
విగ్రహాలకు సుదీర్ఘ చరిత్ర వుంది. పాత రాతి యుగం నుంచి విగ్రహారాధన ఏదో
ఒక రూపంలో సాగుతూనే వస్తోంది. అతి పురాతన విగ్రహం ముప్పయి వేల సంవత్సరాల
నాటిదని చరిత్ర కారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో ఎత్తయిన
విగ్రహం, అదీ గౌతమ బుద్దుడి విగ్రహం చైనాలో వుంది. పటేల్ విగ్రహ
ప్రతిష్టాపన దరిమిలా అది రెండో స్థానానికి దిగిపోయింది.
న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పర్యాటక ఆకర్షణకు మరో మచ్చు తునక.
లండన్ లో వున్న మైనపు విగ్రహాల మ్యూజియం సంగతి చెప్పక్కరలేదు. అందులో తమ
బొమ్మ చూసుకోవడానికి ఎందరెందరో సెలబ్రిటీలు ఎంతో ముచ్చటపడుతుండడం కద్దు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహావిష్కరణ అనంతరం సోషల్ మీడియాలో అనేక
చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చోటుచేసుకున్నాయి. ఈనాటి రాజకీయ నాయకులు
అలనాటి పటేల్ వంటి ఉద్దండ నాయకుల కాలిగోటికి కూడా సమానం కారంటూ,
బ్రహ్మాండమయిన పటేల్ విగ్రహం కాలిగోరు చెంత కొందరు నాయకులు లిల్లీపుట్స్
(మరుగుజ్జులు) మాదిరిగా కనిపిస్తున్నారని ఒక కార్టూనిస్ట్ గీసిన చిత్రం
విస్తృత ప్రచారానికి నోచుకుంటోంది.
స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సమైక్యతా విగ్రహం) పేరుతొ సర్దార్ పటేల్ విగ్రహ
ప్రతిష్టాపన జరిగిన మరునాటి నుంచే మోడీ వ్యతిరేక రాజకీయ శక్తులు సమైక్య
నినాదాన్ని అందుకోవడం ఒక కొసమెరుపు.

కామెంట్‌లు లేవు: