18, మార్చి 2021, గురువారం

చేట భారతం

 

సుదీర్ఘసుత్తికి 'చేట భారతం' అని పేరు. అది  ఇదే  అని మీకు  అనిపించినా  అభ్యంతరం లేదు.

 

తాతల తండ్రుల చంపుకొనుటకా ఈ భండనంబు కృష్ణా!

 

కురుక్షేత్ర రణక్షేత్రంలో  మహా భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తెల్లగుర్రముల రధమును తోలే నల్లనయ్యను అప్పటికి అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు అడుగుతాడీ ప్రశ్న. తదుపరి కృష్ణుడు గీతార్ధ సారం ఎరిగించిన తరువాత ఎరుకన బడిన సవ్యసాచి అన్నదమ్ములతో కలసి సాగించిన ఆ మహా సంగ్రామం అనంతరం కూడా నివృత్తి కాని సందేహం  ఇదే.

ఎందుకంటె పద్దెనిమిది రోజులపాటు జరిగిన మహా యుద్ధంలో విజయం సాధించిన  యుధిష్టురు

డికి మిగిలిందేమిటి? గుట్టలకొద్ది సైనికుల శవాలు. ఆనవాలు పట్టలేని ఆత్మీయుల కళేబరాలు.

కౌరవ పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్నఅనేక  అక్షౌహిణుల  సైన్యం నిహతమయింది.  శవాల గుట్టల నడుమ గెలిచిన పక్షాన  బతికిబట్టగలిగింది ధర్మజ,భీమ,అర్జున,నకుల,సహదేవులు, కృష్ణుడితో కలిపి మరో ఇద్దరు మాత్రమే. ఈ ఇద్దరిలో సాత్యకిని మినహాయిస్తే  యుయుత్సుడి విషయం మళ్ళీ అనుమానమే అంటారు చరిత్రకారులు.అంటే విజయలక్ష్మి వరించిన ధర్మజుని  పక్షంలో మిగిలింది  కేవలం ఏడుగురు మాత్రమే. అటు కౌరవ పక్షంలో ప్రాణాలతో బయటపడింది  నలుగురే నలుగురు.  అశ్వథామ, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడి కుమారుడయిన  విశ్వకేతు/ వృషకేతు.  ఎవరి కారణంగా ఈ మహారణం చెలరేగిందో ఆ కురు సార్వభౌముడు   దుర్యోధనుడితో పాటు దుశ్శాసనాది అతడి సోదరులందరూ  ఈ మహా యుద్ధంలో అసువులు బాశారు.

పదిహేను లక్షల  యాభయ్ మూడు వేల తొమ్మిది వందల సైనికులతో కూడిన  ఏడు అక్షౌహిణుల పాండవ దండుకు   సైన్యాధ్యక్షుడు  పాంచాల రాజు ద్రుష్టద్యుమ్నుడు కాగా,  ఇరవై నాలుగు లక్షల అయిదు వేల ఏడు వందల సైన్యం కలిగిన పదకొండు అక్షౌహిణుల కౌరవసేనకు తొలుదొల్త నాయకత్వం వహించింది భీష్మ పితామహుడు. యుద్ధ పరిసమాప్తి నాటికి ఇరువైపులా మొత్తం సైనికులందరూ తుడిచిపెట్టుకుపోయారు.

       

ఈ నాడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన చారిత్రాత్మక మహా సంగ్రామాలలో దేనిలో కూడా ఈ స్తాయిలో మానవ హననం జరిగిన దాఖలాలు లేవు. అయినా కానీ, వీటి  జాబితాలో మహాభారత యుద్ధానికి చోటు దొరకకపోవడానికి కారణం ఏమిటి ? ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషించే  క్రమంలో రూపుదిద్దుకున్నదే ఈ వ్యాసం.

 

ప్రధమ ప్రపంచ సంగ్రామం , ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి. కానీ మహాభారత యుద్ధం అలా కాదు. కురుక్షేత్రం రణక్షేత్రంగా భారత యుద్ధం  ఒక్కచోటనే  ఏకధాటిగా పద్దెనిమిది దినాలు సాగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న ఏ ఒక్క రాజు కూడా తిరిగి తన దేశాన్ని చేరలేదు. ఏ ఒక్క సైనికుడు కూడా మళ్ళీ  ఇంటికి వెళ్ళలేదు. రణరంగంలో మరణించిన వారందరి కర్మకాండలు యుద్ధభూమిలోనే జరిపిన దాఖలాలు వున్నాయి. భర్తలు వీర మరణం పొందిన కారణంగా వైధవ్యం పొందిన రాణులందరికి హస్తినాపురంలోనే ఆశ్రయం కల్పించారు. అంటే ఏ ఒక్కరు తమ దేశం చేరుకోలేదని అర్ధం.  యుద్ధానికి సంబంధించి కానీ, దాని ఫలితానికి సంబంధించి కానీ ఏ ఒక్క ఖచ్చితమయిన  కబురు ఆయా దేశాలకు చేరలేదని స్పష్టమవుతుంది.

సాధారణంగా చక్రవర్తులు  ఇలాటి మహాయుద్ధాలు తలపెట్టినప్పుడు తమకు కప్పం కట్టే సామంత రాజులను, ఇతర మిత్ర దేశాల అధినేతలను సాయం అర్ధించడం పరిపాటి. ఆ సందర్భాలలో సామంతరాజులు, మిత్రదేశాల మహారాజులు చక్రవర్తి కోరికమేరకు అతడు సాగించ బోయే యుద్ధంలో పాల్గొనడానికి తమ  యావత్తు సైన్యాన్ని  వెంటతీసుకుని యుద్ధం జరిగే దూర ప్రాంతాలకు వెడతారు. తమ చక్రవర్తి  విజయం సాధిస్తే సరేసరి. లేకపోతే తమ రాజ్యాలకు తిరిగి రావడమన్న పరిస్తితి సాధారణంగా తలెత్తదు.

ఆ పరిస్థితుల్లో ఆయా సామంత రాజుల రాజ్యాల్లో ఏమి జరుగుతుంది ? ఎన్నాళ్ళు గడిచినా  యుద్ధానికి వెళ్ళిన రాజు ఆచూకీ లేదు. అతడి సైన్యం జాడ లేదు. ఎన్నేళ్ళు గడిచినా వారిని గురించిన సమాచారం లేదు.   తిరిగి వస్తారో రారో తెలియదు.

కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధాన్నే తీసుకుందాము. కౌరవ పాండవ పక్షాల తరపున అనేకమంది సామంత రాజులు, మిత్ర దేశాల వారు, వారి సమస్త సైన్యాలు పద్దెనిమిది రోజులపాటు జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. అరివీర భయంకరంగా సాగిన ఈ మహా సంగ్రామంలో లక్షలాది సైనికులు ప్రాణాలు అర్పించారు. ఇంత పెద్ద సంఖ్యలో రాజులు, సైనికులు  పాల్గొన్న ఈ యుద్ధం పరిసమాప్తి అయ్యేనాటికి బతికి బట్ట కట్టిన వారి సంఖ్య ఇరువైపులా కలిపి అక్షరాలా పన్నెండుమంది అంటే  ఓ పట్టాన నమ్మడం కష్టమే. కానీ జరిగిందదే.

 

అనేక దేశాల రాజుల్ని, సైనికులను మూకుమ్మడిగా బలిగొన్న ఈ యుద్ధం ముగిసిన తరువాత ఆ యా దేశాలలో పరిస్థితులు ఏవిధంగా మారి వుంటాయి ? రాజులు  లేని ఆ రాజ్యాలలో స్తితిగతులు ఏవిధంగా తయారయివుంటాయి ? ఈ ప్రశ్నలకు జవాబులు వూహించడం కష్టమేమీ కాదు.

రాజు యుద్ధానికి వెళ్లాడు. తిరిగి రాలేదు. అతడి వెంట వెళ్ళిన సైన్యం అతీగతీ లేకుండా అదృశ్యం అయిపొయింది. పన్నులు వసూలు చేసే వాళ్లు లేరు. అథవా చేసినా  ఆ మొత్తంలోనుంచి కప్పం సొమ్మును చక్రవర్తి ఖజానాకు  దఖలు పరిచే యంత్రాంగం లేదు. పైగా  కప్పం కట్టమని చక్రవర్తి తరపున  వొత్తిడి చేసేవారూ లేరు. అసలు చక్రవర్తే లేడు. లేడన్న విషయం కూడా  చాలాకాలం వరకు జనాలకు తెలియనే తెలియదు. అది వేరే విషయం.

దాంతో  హఠాత్తుగా ఈ చిన్న రాజ్యాలకు వూహించని రీతిలో స్వేచ్చ లభిస్తుంది. తాము ఎవ్వరికీ బానిసలం కామన్న ఎరుక వారికి కలుగుతుంది.

ఈ పరిణామాల ఫలితంగా ఆ చిన్ని చిన్ని  రాజ్యాల్లో పెను మార్పులు అనూహ్యంగా చోటుచేసుకుంటాయి. యుద్ధానికి వెళ్లి తిరిగి రాని రాజు స్తానంలో  రాజ్యాధికారం స్వీకరించిన కొత్త  రాజుకు కొత్త ఆలోచనలు ముప్పిరిగొనడం కూడా సహజం. రోజులు గడిచేకొద్దీ  తాను సర్వ స్వతంత్రుడిని అన్న భావన ఆ రాజులో  ప్రబలమవుతుంది. తరాలు గడిచేకొద్దీ నూతన తరం రాజుల  ఆలోచనలు మరింత మారుతాయి. తాతల కాలంలో తాము ఒక చక్రవర్తికి  సామంతులం అని గుర్తు చేసుకోవడం  కూడా వారికి  ఇష్టం వుండదు. పైపెచ్చు, అటువంటి చారిత్రిక  ఆధారాలు కనబడితే వాటిని ధ్వంసం చేయడానికి కూడా  వెనుకాడరు. పాత చరిత్రను సమాధి చేసి కొత్త సంస్కృతికి స్వీకారం చుడతారు. ఈ విధంగా చరిత్ర లోని వాస్తవాలు కాలగర్భంలో కలిసిపోతాయి.

మామూలుగా ఏదయినా యుద్ధం జరిగి అది ముగిసినప్పుడు రెండు రకాల పరిణామాలు చోటుచేసుకోవడానికి వీలుంది. కొన్ని సందర్భాలలో చాలాకాలం వరకు స్తబ్ధత నెలకొంటుంది. జరిగిన పరిణామాలను చూస్తూ ఏర్పడ్డ విభ్రమ  నుంచి తేరుకోవడానికి ఎంతో వ్యవధి అవసరమవుతుంది. మరికొన్ని సందర్భాలలో మార్పులు వూహాతీతంగా ప్రచండ వేగంతో చోటుచేసుకుంటాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత జరిగింది ఇదే.

కౌరవ పాండవ మిత్రదేశాలలో ముందు స్తబ్ధత నెలకొంది. సమాచారం అందక పోవడం వల్ల అలా జరిగివుంటుంది. రాజు లేడు. అతడి సైన్యం లేదు. జనాలకు ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్తితి.

అయితే, కొద్ది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ముందు చెప్పినట్టు పాత తరం స్తానంలో కొత్త తరం రంగ ప్రవేశం చేస్తుంది. ఆ తరం క్రమంగా మునుపెప్పుడో మహా భారత యుద్ధంలో పాల్గొన్న తమ  పూర్వీకుల జ్ఞాపకాలను తుడిచిపెట్టే పనిలో పడుతుంది. ఒకానొక  కాలంలో తాము వేరెవ్వరికో కట్టుబానిసలుగా బతికామన్న  చేదు నిజాన్ని నిలువులోతున పూడ్చిపెడుతుంది. ఈ  క్రమంలో అసలు చరిత్ర మరుగున పడుతుంది. పాత  చరిత్రకు కొత్త భాష్యం ఆవిష్కృతమవుతుంది.

 

యుద్ధాలు జరిగినప్పుడు భౌతిక నష్టాలు మాత్రమే ప్రస్పుటంగా కానవస్తాయి. ఏ యుద్ధం గురించి చెప్పాల్సి వచ్చినా ముందు దానివల్ల వాటిల్లిన ధన, ప్రాణ నష్టాలు గురించే పేర్కొనడం కద్దు. కాని కొన్ని యుద్ధాలవల్ల కలిగే కష్టనష్టాలను రానున్న తరాలు కూడా అనుభవిస్తాయి. హిరోషిమా, నాగసాకీ  ఉదంతాలే ఇందుకు సాక్ష్యం. ఆనాటి ఆటంబాంబు పేలుడు కలిగించిన   అణు ధార్మిక ప్రభావం దుష్పరిణామాలను ఆ తరువాత అనేక తరాలు చవిచూడవలసి వచ్చింది. నిజానికి అప్పుడు వాడిన అణుబాంబులు ఇప్పటివాటితో పోలిస్తే నాసిరకమైనవనే చెప్పాలి. అల్పమయిన ఆ అణుబాంబులు మానవాళికి  కలిగించిన నష్టం మాత్రం అనల్పం.

ఈ ప్రస్తావన ఎందుకంటె -

మహాభారత యుద్ధంలో ఇరు పక్షాల  యోధులు అనేక మహిమాన్విత  అస్త్ర శస్త్రాలను ప్రయోగించారు. అవి విడుదలచేసిన అపారమైన శక్తి ప్రభావం  మానవాళిపై పడిందనుకోవాలి. బహుశా ఆ కారణంగానే మనుషులకు మాత్రమే వరంగా లభించిన మానసిక సున్నితత్వం  వారిలో అడుగంటి పోయిందని అనుకోవాలి. నాటి  అస్త్ర శస్త్రాల ప్రయోగ ఫలితంగా ఆవిర్భ వించిన మహానలం  తాలూకు  అగోచర శక్తి యావత్ భూమండలాన్ని చుట్టుముట్టి  మనుషుల మనసులను  కలుషితం చేసివుండాలి.  కలియుగంలో తలెత్త నున్న   వైపరీత్యాలకు, వైకల్యాలకు అప్పుడే బీజం పడి వుండాలి.

 

మహాభారత యుద్దానంతరం  కొన్నిలక్షల  సంవత్సరాల వరకు తీవ్రమయిన స్తబ్ధత చోటుచేసుకుంది. దీన్ని చీకటి కాలంగా భావించారని  అనుకోవడానికి  కొన్ని ఆధారాలు వున్నాయి.  దీనిని గురించిన ప్రసక్తి  కధాచరిత సాగరంలో కూడా వుంది. ప్రాచీన తమిళ సాహిత్యంలో సైతం ఈ చీకటి ఘట్టం గురించిన ప్రస్తావన వుంది. ఆ భాషలో ఈ కాలాన్ని కలపిరార్ కాలంఅంటారు. చరిత్రకు అందని రాజులు పాలించిన కాలం అని అర్ధం. దాదాపు యాభయ్ రెండు లక్షల ఏళ్లకు  పైగా ఈ చీకటి యుగం  సాగిందని చెబుతారు.  

మహాభారత యుద్ధంలో  చోళులు, పాండ్యులు పాల్గొన్నట్టు కొన్ని ప్రాచీన గ్రంధాలలో వుంది. చోళ రాజుల్లో ఒకరు మహా  భారత యుద్ధ  సమయంలో పాండవుల కోసం ఏర్పాటుచేసిన వంటశాల నిర్వహణ బాధ్యతలు చూసేవాడని ప్రతీతి. యుద్ధసమయంలో పాకశాలను నిర్వహించడం అంటే కేవలం వంటచేసే వాళ్లని అర్ధం కాదు. నిజానికి చోళ రాజు తన సైన్యంతో కురుక్షేత్రానికి వెళ్ళింది యుద్ధంలో పాండవులకు సాయపడానికి. అయితే యుద్ధ వ్యూహంలో భాగంగా కర్తవ్య విభజన చేసే సమయంలో చోళ రాజుకు వంట శాలను ఆజమాయిషీ చేసే  బాధ్యత మీద పడింది.

యుద్ధానంతరం ఏర్పడ్డ చీకటి యుగం ముగిసిన తరువాత ఆయా రాజ్యాలలో ప్రబలమయిన శక్తులుగా ఎదిగిన వారందరూ నిజానికి ఆ రాజ్యాలకు సాధికారిక, వంశానుగత  ప్రభువులు కాదు.  వారిలో చాలామంది దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. పూర్వ చరిత్రను పూడ్చిపెట్టే  క్రమంలో వారు అనుసరించిన విధానాల ఫలితంగానే  మహాభారత యుద్ధ ప్రసక్తి  ప్రపంచ చరిత్రల్లో నమోదు కాకపోవడానికి  కారణమయివుంటుంది. కాకపొతే అనేక దేశాల చరిత్రల్లో ఒక గొప్ప యుద్ధం జరిగినట్టు మాత్రం పేర్కొన్నారు కానీ ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.

ఈ  సమరంలో  కౌరవ పాండవ సేనలతో పాటు వారి తరపున అనేకమంది రాజులు, సామంత రాజులు వీరోచితంగా పోరాడి వీరస్వర్గం అలంకరించారు. వారితో పాటు వారి సైన్యాలు కూడా ఈ యుద్ధంలో తమ   శాయ శక్తులా పోరాడాయి. ఆ రోజుల్లో సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొనే సైనికులను అనుదినం  ఉల్లాస పరచడానికి నాట్య, నటీనట బృందాలను,  విదూషకులను ఆయా  రాజులు తమ తమ దేశాలనుంచి  వెంటబెట్టుకు వెళ్ళేవాళ్ళు. వందిమాగధులు సరే సరి. వీరికి యుద్ధంలో కత్తి పుచ్చుకుని పోరాటం చేయాల్సిన అవసరం వుండదు. వారి పనల్లా, ఏరోజుకారోజు సూర్యాస్తమయం తరువాత యుద్ధరంగం నుంచి అలసి సొలసి శిబిరాలకు  తిరిగొచ్చే   సైనిక దళాలను తమ  కళాకృతులతో ఉత్సాహ పరచడమే. యుద్ధంలో పాల్గొనే అవసరం లేనందువల్ల ఈ కళాకారుల ప్రాణాలకొచ్చే ముప్పేమీ వుండదు. కానీ యుద్ధానంతరం వీరి పరిస్తితి దయనీయం. తమను తీసుకొచ్చిన రాజులు, వారి సైన్యాలలో ఏ ఒక్కరూ మిగలక పోవడంతో దిక్కులేనివాళ్లు గా మిగిలిపోతారు.  వీరికి తమ దేశం దరి చేరడానికి దారీ తెన్నూ తెలియదు. ఆ నాటి యుద్ధనియమాల ప్రకారం ఇలాటివారందరూ గెలిచిన రాజుకు వశమవుతారు. పరాజిత సైన్యానికి చెందిన వారందరూ  ఆయుధాలతో సహా  విజేత పరమవుతారు.  అయితే ఈ విషయంలో  అస్త్ర శస్త్రాలలో అస్త్రాలకు మినహాయింపు వుంది. ఎందుకంటె  అస్త్రాలనేవి మునులను, దేవతలను మెప్పించి వీరులు  సంపాదించుకునేవి.  వాటిని పొందిన వారు యుద్ధంలో మరణించిన తరువాత  ఆ అస్త్రాలన్నీ తిరిగి స్వస్తానాలకు చేరుకుంటాయి.

యుద్ధం ముగిసిన తరువాత ఒంటరిగా మిగిలిన కళా కారుల బృందాలు ఆదరించే నాధుడు లేకపోతే   తిరిగి ఇంటి మొగం పట్టకతప్పదు.కానీ  స్వదేశం చేరగలమనే  నమ్మకం లేని ప్రయాణం. తమను వెంట తీసుకుని యద్ధానికి వచ్చిన తమ రాజే  శాత్రవుల చేతిలో మరణించాడు. గమ్యం అగమ్యం. అందుకే తిరుగు ప్రయాణంలో  మార్గ మధ్యంలో ఏదయినా వసతి దొరకిన చోట ఆగిపోతారు. అక్కడి స్తానికులు ముక్కూ మొగం తెలియని వాళ్లు. అలాటిచోట  ఆశ్రయం సంపాదించాలంటే  వారికి తెలిసిన విద్య ఒక్కటే. తాము దూరప్రాంతంలో  చూసిన దానికి  తమ  కళారూపాలతో ఒక రూపం కల్పించి, దానిని రసవత్తరంగా  ప్రదర్శించి ప్రజల మెప్పు, తద్వారా వారి నుంచి తమకు కావాల్సిన  సాయాన్ని పొందడమే వారికి కనిపించిన దారి. అందులోను  తాము ప్రత్యక్ష సాక్షులుగా వున్నది ఏదో సాదా సీదా వ్యవహారానికి కాదాయె. అరివీర భయంకరంగా సాగిన మహాభారత యుద్ధాన్ని దాపున వుండి గమనించే అవకాశం దక్కిన వాళ్ళాయె.  ఈ ప్రదర్సనల వల్ల  లోక ప్రసిద్దులయిన  కురు వంశపు రాజులు  పరస్పరం తలపడ్డ  మహా సంగ్రామ  విశేషాలను నలుగురికీ తెలియచెప్పి తృణమో పణమో సంపాదించు కున్నట్టూ  వుంటుంది. అలాగే,  తమనీ, తమ  కుటుంబాలనీ  బహుకాలం పోషించిన ప్రభువుల రుణం తీర్చుకున్నట్టూ  వుంటుంది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆ బృందాలలోని

నాట్యకత్తెలు గజ్జె కట్టారు. కవులు, పండితులు  పాటలు  కట్టారు. విదూషకులు తమదయిన  ధోరణిలో చూసినదానికి హాస్యాన్ని జత కట్టారు.  సహజంగా కళాకారులు కాబట్టి తాము చూసిన దానిని వర్ణించే క్రమంలో కొంత నాటకీయత చోటుచేసుకోవడం సహజం.

నిజానికి  వీరిలో కొందరికి మహాభారత యుద్ధం ఎలా ముగిసిందో  తెలవదు. ఎవరు గెలిచారో తెలియదు. యుద్ధంలో తమ రాజు మరణించగానే , ఇక అక్కడ వుండి చేసేదేమీ లేదు కాబట్టి వారు యుద్ధభూమిని వొదిలి పెట్టి  ఇంటి మొగం పట్టిన వాళ్లు వీళ్ళు.

మార్గమధ్యంలో తమని ఆదరించి ఆశ్రయం ఇచ్చేవారు తటస్తపడగానే - మహా భారత యుద్ధం జరిగింది మీకు తెలుసా ?’ అని సంభాషణ మొదలు పెట్టేవాళ్ళు. కానీ, అప్పటికి యుద్ధం ఇంకా  కొనసాగుతూనే    వున్న సంగతి వారికి తెలియదు. తమను వెంట తీసుకువచ్చిన రాజు యుద్ధంలో చనిపోయాడని మాత్రమే వారికి తెలుసు.  ఉదర పోషణ కోసం ఒక గొప్ప యుద్ధం ఎలా జరిగిందో వర్ణించి చెప్పేవారు. యుద్ధాలు, పోరాటాలు  మొదలయిన విషయాలు గురించి  తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో వుంటుంది. అదే నిరాశ్రయులయిన కళాకారులకు  భుక్తికి మార్గమయింది. జనాలను మరింతగా  ఆకర్షించడం కోసం తమకు తెలిసిన విషయాలకు రంగులు అద్దేవారు. ఆ విధంగా (ఆ నాటి భరత ఖండపు) దేశ దేశాల్లో మహాభారత యుద్ధానికి సంబంధించిన రకరకాల కధలు విభిన్న రూపాల్లో ప్రచారం లోకి వచ్చాయి. ఒక గొప్ప యుద్ధానికి సంబంధించిన సమాచారం రకరకాల రూపాల్లో  అన్ని ప్రాంతాలకు చేరిపోయింది. ప్రజలకు ఒక గొప్ప  సంగ్రామం జరిగిందని తెలుసు. అయితే, అది మహా భారత యుద్ధం అన్న వాస్తవం ఇతర దేశాలవారికి తెలవదు.

యుద్ధానంతరం ఏర్పడ్డ చీకటి యుగం -  యుద్ధం గురించి జానపద కళాకారులు ప్రాచుర్యంలోకి తెచ్చిన విభిన్న కధా రూపాలు -  ఆ యా దేశాల్లో అధికారంలోకి వచ్చిన నూతన తరం రాజులు తమ గతం గురించి అనుసరించిన నిరాసక్త విధానాలు -  ఇవన్నీ కలసి  వెరసి మహాభారత యుద్ధానికి చరిత్రలో సముచిత స్తానం లభించకపోవడానికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు.

 

సుమేరియన్ సంస్కృతిలో వెల్లడయిన మరో విశేషాన్ని మహా భారత యుద్ధం కవుల కల్పన కాదనడానికి  ఆధారంగా కొన్ని వెబ్  సైట్లు  పేర్కొంటున్నాయి.

ప్రాచీన  సుమేరియన్ సంస్కృతిలో చాలా భాగం ఏడుపులు, రోదనల ప్రాతిపదికగా ఏర్పడిందని చెబుతారు. ఒక మహా యుద్ధంలో సైనికులయిన  భర్తలను కోల్పోయిన వీర పత్నులు  కన్నీటితో విలపించిన సన్నివేశాలే వారి ప్రాచీన రచనల్లో కానవస్తాయి.

వారి పురాతన  చరిత్రలో కూడా మహా భారతాన్ని పోలిన కధ వుంది.

ఒక నగరాన్ని నిర్మిస్తారు. జూదం జరుగుతుంది. మరో నగరాన్ని తగలబెడతారు. ఒక మహిళ అవమానానికి గురవుతుంది.   మహాభారతంలో  మాదిరిగా ఈ సన్నివేశాలన్నీ అదే  క్రమంలో జరగవు. కానీ అంశాలన్నీ ఏదోఒక విధంగా భారత కధను గుర్తుకు తెచ్చేవిగా వుంటాయి.

యుద్ధం ముగిసిన తరువాత భర్తలను కోల్పోయిన ఆడవారందరూ కలసి విలపించే అంశంతో సుమేరియన్ ప్రాచీన సాహిత్యం రూపుదిద్దుకుంది.

భారత యుద్ధంలో  రాజుల మరణానంతరం రాణులు విలపించే ఘట్టాన్ని గురించిన ప్రసక్తి మహాభారతంలో కూడా  వుంది. (వేదాలు వేద విజ్ఞానం గురించిన ఒక ఇంగ్లీష్ వెబ్  సైట్ లో ఇచ్చిన వివరాలు ఈ వ్యాసానికి ఆధారం – Originally published in Tatwa Prakasha News Letter in English - రచయిత )  

(25-10-2011)

 

 

సోషల్ మీడియా

 

"సోషల్ మీడియాలో కొన్ని వాస్తవాలు
ఇంకొన్ని ఊహాగానాలు
మరికొన్ని అభూతకల్పనలు"
చివరిదానిపై తొందరపడి కామెంట్ చేయడం మంచిది కాదు.
ఇలా రాయడానికి ఓ నేపధ్యం వుంది. మొన్నీ మధ్య సుప్రీం కోర్టుకు సంబంధించి ఇద్దరు జర్నలిస్టులు వేర్వేరుగా పోస్టులు పెట్టారు.
పోటీ చేసిన అభ్యర్ధులు అందరికంటే నోటాకు ఎక్కువ వస్తే మళ్ళీ ఎన్నిక జరపాలని ఎలక్షన్ కమిషన్ ని ఆదేశించాలని కోరుతూ ఒకాయన కోర్టులు వెడితే, సుప్రీం కోర్టు సంబంధిత శాఖలకు నోటీసులు ఇచ్చింది. ఇదీ వార్త. కానీ ఆ ఇద్దరు సుప్రీం కోర్టు తీర్పుగానే పోస్టు పెట్టారు. ఒక జర్నలిస్టుకు, తెలిసిన వాడు కాబట్టి చెబితే సరిదిద్దుకున్నాడు. రెండో అతను తన పేరుకే జర్నలిస్టు అని ట్యాగ్ తగిలించుకున్నవాడు. చెప్పినా లాభం లేదని మానేశాను.
ఇన్ని రోజులైనా ఆయన తన పొరబాటు ఒప్పుకోలేదు సరికదా, సరిదిద్దుకోలేదు కూడా.
నాకు బాగా గుర్తు. గతంలో ‘కలం’ తిరిగిన పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు కూడా ఆర్టికిల్ లేదా వార్త రాస్తూ ఏదైనా అనుమానం కలిగితే ఏమాత్రం భేషజం లేకుండా తమ దగ్గర పనిచేసే జూనియర్లను, లేదా ఫోను చేసి తోటి జర్నలిస్టులను అడిగి సందేహ నివృత్తి చేసుకునే వారు. తాము రాసిన దాంట్లో ఎలాటి పొరబాటు దొర్లకూడదు అనే నిబద్ధతే వారినలా చేయిస్తోంది అనుకునేవాడిని.
ఇప్పుడు సోషల్ మీడియా అలాంటి విషయాల్లో బాగా అక్కరకు వస్తోంది, సరిగా ఉపయోగించుకోవాలనే సదుద్దేశం ఉన్న పాత్రికేయులకు.నా రాతల్లో చిన్న పొరబాటు దొర్లినా వెంటనే ఎత్తి చూపుతున్నారు. ఇందుకు నేను చిన్నబుచ్చుకోవడం లేదు. పైగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దొర్లిన పొరబాట్లను సవరించుకోగల వెసులుబాటు వున్న మీడియం ఇది.
నాకు అర్ధం అయిందేమిటంటే ప్రస్తుతం సమాజంలో చైతన్యం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. చూసినవీ, విన్నవీ, చదివినవీ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటున్నారు. చక్రాంకితాలు వేసుకున్న కొందరు రాజకీయ పార్టీల అభిమానులని మినహాయిస్తే చాలామంది, చాలా వరకు చక్కని, విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అయితే కాస్తంత ఓపిక కావాలి, రాళ్ళల్లో నుంచి బియ్యం ఏరడానికి.
(18-03-2021)

బ్రాహ్మణ సదస్సు – భండారు శ్రీనివాసరావు

 ఒక పాత ముచ్చట

ఇది నలభయ్ ఏళ్ళ నాటి మాట.

ఆ రోజుల్లో చిక్కడపల్లిలో ABCD OTGANISATION (All Brahmin Community Organisation) అనే ఒక సంస్థ వుండేది. ఆ సంస్థ కార్యదర్శి, సమాజంలో వివిధ వర్గాలతో సన్నిహిత పరిచయాలు కలిగిన ఒక జర్నలిష్టుని కలిసి తమ సంస్థ కార్యకలాపాలలో సహకారం అర్ధించాడు. అయన వెంటనే లేచి నిలబడి, కులాల పేరుతొ సంస్థలు, సంఘాలు నిర్వహించడం తనకు సుతరామూ ఇష్టం లేదని మొహం మీదే అనేసి వెళ్లి రండంటూ పంపేశాడు.

మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అదే జర్నలిష్టు ఇటీవల హైదరాబాదులో బ్రాహ్మణ సదస్సు జరిగితే హాజరయి బ్రాహ్మణ సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందంటూ చేసిన తీర్మానానికి తన మద్దతు ప్రకటించారు. కాలం తెచ్చిన మార్పు అనుకోవాలి.

ఇప్పుడు ఒక నిజం చెబుతాను, అతగాడెవ్వరో కాదు, నేనే!

 

చాలా  కాలం  తర్వాత  అంటే నాలుగేళ్ల కిందట, ఓ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా దాదాపు రెండేళ్ళు పనిచేసిన వెంకట్ చంగవల్లి గౌరవార్ధం జరిగిన సమావేశానికి వెళ్ళినప్పుడు నాకీ విషయం మరోమారు స్పురణకు వచ్చింది.

ఆ సమావేశానికి కార్పొరేషన్ చైర్మన్, మాజీ చీఫ్ సెక్రెటరీ ఐ.వై.ఆర్. కృష్ణారావు రావుగారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముక్తసరిగా మాట్లాడడం ఆయన తత్వం. కానీ ఆనాటి  కృష్ణారావుగారి ప్రసంగం ఉద్విగ్నంగా సాగింది. ఆయనలో దాగున్న అద్భుతమైన వక్త వెలికి వచ్చారు. ప్రభుత్వ సర్వీసులో వున్నప్పుడు ఆయన్ని ఎన్నోసార్లు కలిశాను. ప్రత్యేకించి ఒక కులానికి ప్రయోజనం కలిగించే ధోరణిని ఎన్నడూ కనబరచలేదు. కానీ కార్పొరేషన్ బాధ్యతలు తీసుకున్న తరువాత బ్రాహ్మణ సంక్షేమానికి ఎన్ని రకాల ఆలోచనలు చేస్తున్నదీ తేటతెల్లం అయింది. నిజానికి ఈ కార్పొరేషన్ పదవి ఆయన గతంలో చేసిన ఉద్యోగాలతో పోలిస్తే చాలా చాలా చిన్నది. చీఫ్ సెక్రెటరీగా వున్నప్పుడు డజన్ల సంఖ్యలో ఇలాంటి సంస్థలు ఆయన కనుసన్నల్లో పనిచేసేవి. వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లు ఆయన ఆధ్వర్యంలో రూపు దిద్దుకునేవి. అంత పెద్ద హోదాలో పనిచేసిన పెద్ద మనిషి ఇంత చిన్న పోస్ట్ ఎందుకు ఒప్పుకున్నారో అప్పుడు నా బోంట్లకు అర్ధం కాలేదు కూడా. ఇప్పుడు తెలిసివచ్చింది, ఒక చిన్న సంస్థను కూడా పెద్ద ఎత్తున విస్తరించాలంటే ఇలాంటి వ్యక్తులే అవసరమని.

కార్పొరేషన్ అనుబంధ విభాగం బ్రాహ్మణ సహకార పరపతి సంస్థకు ఈ కొద్దికాలంలోనే ఆయన తన పలుకుబడితో అనేక హంగులు కల్పించారు. పలు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులకు సాఫ్ట్ వేర్ అందిస్తున్న ఒక సంస్థ నుంచి అదే రకమైన సాఫ్ట్ వేర్ ను, కాణీ ఖర్చులేకుండా ఉచితంగా పొందగలిగారు. దాని విలువ రూపాయల్లో చెప్పాలంటే అక్షరాలా ఇరవై కోట్లు. అంటే కార్పొరేషన్ కు ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సమానం అన్నమాట.

ఇక ఆ సాయంత్రం ప్రధాన అతిధి వెంకట్ చంగవల్లి తన సతీమణి పద్మగారితో కలిసి వచ్చారు. మామూలుగానే ఆయన సీరియస్ సమావేశాలు, సదస్సుల్లో కూడా నవ్వులు పూయిస్తారు. ఆ అలవాటుతో ఆయన తన ప్రసంగాన్ని ఒక పిట్ట కధతో మొదలు పెట్టి అసలు అంశానికి జోడిస్తూ కొనసాగించారు.

ఒకావిడకు పుట్ట చెముడు. డాక్టరుకు చూపెట్టుకుంది. రకరకాల వినికిడి సాధనాలు చూపెట్టారు. ఒకటి చాలా ఖరీదు, ఒకటి చాలా చాలా  చౌక. ఖరీదుది పెట్టుకుంటే బాగా వినబడుతుంది. చౌకది తగిలించుకుంటే ఏమీ వినబడదు. కాకపోతే చెవిటి మిషన్ కనబడగానే ఆవిడ చెవిటిది అన్న విషయం బోధపడి ఎదుటి వాళ్ళే ఓపిక చేసుకుని బిగ్గరగా మాట్లాడతారు. అల్లాగే, వెంకట్ చంగవల్లి గతంలో ఈఎం ఆర్ ఐ (108 అంబులెన్స్) వంటి అనేక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా ఆయన ఎవరన్నది ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా తనని నియమించగానే చెవిటి మిషన్ కధలోని అవ్వలాగా తానెవరన్నది అందరికీ తెలిసిపోయిందని చెప్పారు.

తెలంగాణ బ్రాహ్మణ పరిషద్ వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ భవాని శంకర్, ఇంకా అనేకమంది బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొని వెంకట్ చంగవల్లికి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

ఒక కొసమెరుపు:

లక్ష్మణ్ అనే ఒక పెద్దమనిషి ఒక చిన్న జ్ఞాపకాన్ని  సదస్యుల మీదికి వదిలారు. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో పనిచేసే లక్ష్మణ్ అనే ఓ పెద్దమనిషిని ఒక సదస్సుకి పిలిచారు. అధ్యక్షులవారు Now Mr. Lakshman will give his valuable  address in brief’ అంటూ వేదిక మీదకు ఆహ్వానించారుట. లక్ష్మణ్ గారు నేరుగా మైకు తీసుకుని, ‘లక్ష్మణ్, కామర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్, ఎస్సారార్ కాలేజ్, మాచవరం, విజయవాడ’ అనేసి స్టేజ్ దిగి వచ్చేసారుట.

నేను చదివింది, అదే ఎస్సారార్ కాలేజీలో. అందుకే ఇది గుర్తు పెట్టుకున్నాను. (18-03-2017)

 

 

 

 

17, మార్చి 2021, బుధవారం

కాశీపట్నం చూడర బాబూ! – భండారు శ్రీనివాసరావు

(తమిళనాడు ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోలు చూస్తుంటే)


మా చిన్నప్పుడు వూళ్ళల్లోకి చుక్కాణీ పెట్టెవాడు వచ్చేవాడు. అతడు కనబడగానే చిన్నపిల్లలం అందరం అతడి చుట్టూ మూగేవాళ్ళం. ఓ అర్ధణా ఇస్తే ఆ పెట్టెకు ఉన్న కంతలో నుంచి కదిలే బొమ్మలు కనబడేవి. ఇదిగో కాశీ, అదిగో ప్రయాగ అని చూపిస్తుండేవాడు. నిజంగా కాశీ చూసినట్టే మేము మురిసిపోయేవాళ్ళం.
ఇప్పుడు ఈ చుక్కాణీ పెట్టె రూపం మార్చుకుని ఎన్నికల ముందు మేనిఫెస్టోల రూపంలో జనాలను ఆకట్టుకుంటోంది. ఆ విష్ణుమాయలో పడిన వాళ్లకి ఏది నిజమో ఏది కాదో తెలియని అయోమయం ఆవరిస్తోంది.
“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు”
ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక, మండు వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. వణికించే చలికాలంలో వెచ్చటి దుప్పట్ల వాగ్దానాలతో మరిపిస్తుంది. కలర్ టీవీలు, లాప్ టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్ ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు మాది తరహా హామీలు, ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపించే ఎన్నికల ప్రణాళికలు, అంతులేని వాగ్దానాలు. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులకు చెక్ చెప్పడం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు.
వాగ్దానకర్ణుల మాదిరిగా ఎడాపెడా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు.

మరి వీటికి ముకుతాడు వేయడం ఎలా! ఇలా:
ఆకాశమే హద్దుగా ఎన్ని వాగ్దానాలు అయినా చేయండి. అభ్యంతరం లేదు. కాకపొతే అధికారానికి వచ్చిన తర్వాత ఒకటి రెండేళ్ళు మీ పార్టీల సొంత నిధులతో వాటిని అమలుచేయండి. అంతేకానీ ప్రజలు పన్నులు కట్టి నింపిన ప్రభుత్వ ఖజానా నుంచి కాదు. అప్పుడు కానీ మీ చిత్తశుద్ధి ఏమిటన్నది రుజువవుతుంది.

తోకటపా: ‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం చంపుకుంటారు.’ – విల్ రోగర్స్

16, మార్చి 2021, మంగళవారం

కాపీ రైట్ అంటే కాపీ కొట్టే రైటా!

 

కాపీ రైట్ అంటే కాపీ కొట్టే రైట్ అనుకునే ‘కె.ఎన్. బాబు’ (‘బెజవాడ వాసి’)   'బెజవాడ నాని' వంటి  వాళ్ళకోసం ఈ పోస్టు:

ఈ పోస్టుని షేర్ చేసిన మితృలు దీన్ని మళ్ళీ ఆ బాబుగారి/ నానిగారి  దృష్టికి వచ్చేలా చేయండి అనే వినతితో:

ఈ కాపీ రాయుళ్ళ భరతం పట్టాలనే ఉద్దేశ్యంతో ఒకచోట కావాలనే దండమూడి రాజగోపాల రావు గారికి బదులు దండమూడి రామ్మోహన రావు అని రాశాను. మన కాపీ మిత్రుడు కాపీ కొట్టే తొందరలో అలాగే రామమోహనరావు పేరు మార్చకుండా వాట్సాప్  గ్రూపుల్లో తిప్పుతున్నాడు. కావాలంటే మరోసారి పరిశీలించండి.

https://m.facebook.com/story.php?story_fbid=2694431930869130&id=100009070493506

15, మార్చి 2021, సోమవారం

పెళ్ళికి పూర్వం తర్వాత – నేనూ మా ఆవిడ

 పెళ్లి కాక ముందు నేను వీర దైవభక్తుడిని కాకపోయినా చిన్నతనం నుంచి దేవుడంటే భయం భక్తీ పుష్కలంగా ఉండేవి. పొద్దున్నే లేచి రాముడు మంచి బాలుడి మాదిరిగా స్నానం వగయిరా ముగించుకుని నుదుటి మీద విభూతి పట్టీ వేసుకుని అలా నడుచుకుంటూ గవర్నర్ పేట చెట్ల బజారులోని శివాలయానికి వెళ్లి ముమ్మారు ప్రదక్షిణలు చేసి, శివలింగం ఎదుట సాష్టాంగనమస్కారం చేసి దైవ దర్శనం అనంతరం కాసేపు గుడి ప్రాంగణంలోనే బాసింపట్టు వేసుకు కూర్చుని తెలిసిన స్త్రోత్రాలను బిగ్గరగా చదివిన తరువాతగానీ మరో పని చేసేవాడిని కాను.

పెళ్ళికి ముందే మా ఆవిడ నాకు తెలుసు. తలితండ్రులకి ఏకైక సంతానం కావడం వల్లనో ఏమో ఆమె పెరిగిన తీరే వేరు. ఆడింది ఆటా పాడింది పాటా. అంచేత ఈ భక్తి కాలమ్ ఆమెలో పూర్తిగా సున్నా.

అలాటిది పెళ్ళయిన తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. అన్నీ కనిపెట్టి చూసే భార్య దొరికిందని, ఇక దేవుడి అవసరం ఏముందని ఆయనపై నేను శీతకన్ను వేశాను. ఇలాటి మొగుడ్ని కట్టుకున్న తర్వాత ఆ దేవుడే దిక్కనుకుందో ఏమో ఆవిడ భక్తి మార్గం పట్టింది.

ముప్పూటా ఆవిడ పూజలూ, వ్రతాలూ. నేను నా పద్దతిలో మిత్రులతో కలిసి సాయంకాలక్షేపాలు.



ఎవరి గోల వారిదిగా సాగిన మా సంసారం ఇప్పుడు ఏ గోలా లేకుండా సద్దుమణిగింది.

 

ఏపీ ప్రజాతీర్పు – భండారు శ్రీనివాసరావు

 “ఏకగ్రీవాలని మించిన ప్రజాతీర్పు అన్నారు మహా న్యూస్ ఎండీ శ్రీ వంశీ, రాత్రి తన విశ్లేషణ కార్యక్రమంలో. బహుశా పురపోరులో వైసీపీ  సాధించిన అద్భుత విజయం గురించి ఇంత  సూటిగా, అర్థవంతంగా వినబడిన వ్యాఖ్య ఇదే అనుకుంటాను.

“విజేత  తనకు దక్కిన విజయాన్ని మొట్ట మొదటిది అనుకోవాలి, అప్పుడే తదుపరి విజయ సాధనకు నిరంతరం శ్రమిస్తాడు. పరాజితుడు తన పరాజయాన్ని చిట్ట చివరిదిగా భావించాలి. అప్పుడే మరోసారి విజయం సాధించడం కోసం పరిశ్రమిస్తాడు”

2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల  అనంతరం ఒక టీవీ చర్చలో నేను చెప్పిన మాట ఇది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా చేసే  ప్రకటనలు, వ్యాఖ్యలు తాత్కాలిక స్పందనలే. వాటిల్లో నిజం పాలు తక్కువ.

సవివరమైన విశ్లేషణకు మరిన్ని వివరాలు అందాల్సివుంది.

పొతే ఒక హిత వచనం:

విజయం వినయాన్ని పెంచాలి. అపజయం అసహనాన్ని తుంచాలి.

(15-03-2021)